
నేత్రపర్వంగా వైష్ణవ కృష్ణాష్టమి
● ఉపమాకలో ఘనంగా ప్రారంభం
● యశోదగా గోదాదేవి అమ్మవారు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు, బాలభోగ నివేదలు, నిత్య హోమాలు, తీర్థగోష్టి నిర్వహించారు. తర్వాత గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తికి యశోదాదేవి అలంకరణ చేశారు. యశోద అలంకరణలో ఉన్న అమ్మవారు కృష్ణ పరమాత్మకు ఉగ్గుపాలు పడుతూ ఉండే విశేష ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. సాయంత్రం ఆలయంలో విశేష అలంకరణలో ఉన్న యశోదాదేవి అమ్మవారికి, శ్రీదేవి భూదేవి సమేత కల్కి వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు, ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి విశేష పూజలు చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉదయం గరుడాద్రి పర్వతంపై కొలువైన మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్టి నిర్వహించారు. కొండ దిగువన ఉన్న ఉత్సవమూర్తులకు నిత్య పూజలు, రాజభోగం, నిత్య సేవా కాలం, సాయయంకాలారాధనలు పూర్తి చేశారు. స్వామివారికి పలు రకాల ప్రసాదాలను తయారు చేసి నివేదించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
● కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఆస్థాన మండపంలో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారి ఉత్సవమూర్తులను, బుల్లి కృష్ణుడిని, స్వామి వారి పీఠంపై అధిష్టింపజేయనున్నారు. వెన్నతో కూడిన ఉట్టికి ప్రత్యేక ఆరాధనలు, అనంతరం ఏకాంతంగా ఉట్టికొట్టే సంబరాన్ని నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, రాజగోపాలాచార్యులు, శేషాచార్యులు, సాయి ఆచార్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా వైష్ణవ కృష్ణాష్టమి