● చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈ నెల 25 నుంచి 29 వరకూ ఐదు రోజులు పాటు జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఐదు రోజులు పాటు చింతపల్లి, పాడేరు,అరకు డివిజన్ల పరిధిలో వర్షపాతం 0.1 నుంచి 6.2 మిల్లీ మీటర్లు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీల నుంచి 35.9 డిగ్రీల మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుంచి 18.5 డిగ్రీలు మధ్య ఉండవచ్చునన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 73 నుంచి 81 శాతం మధ్యాహ్న సమయాల్లో 40 నుంచి 60 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు వేగంతో వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు .రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ తెలిపారు.


