మహిళలకు ‘ఉచిత’ గౌరవం ఇదేనా?
ముంచంగిపుట్టు: ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వారికి అవమానాలు తప్పడం లేదు. ముఖ్యంగా అనకాపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై మహిళా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి నుంచి పాడేరు మీదుగా జోలాపుట్టు వెళ్లే ఆర్టీసీ బస్సులో శనివారం దారుణమైన పరిస్థితి నెలకొంది. బస్సులో సీట్లపై డ్రైవర్, కండక్టర్లు నీటి పైపులు, ఇనుప గొట్టాలను పేర్చారు. దీనివల్ల పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు గంటల తరబడి నిలబడే ప్రయాణించాల్సి వచ్చిందని మహిళలు వాపోయారు. తాము ఎక్కువగా ఉన్న బస్సు స్టాపులను చూసి, బస్సు ఆపకుండానే వెళ్లడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎక్కితే డబ్బులు రావు అనే వివక్షతో సిబ్బంది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సామగ్రి ఉంటే బస్సు పైభాగంలో ఉంచాలి కానీ, సీట్లపై వేసి తమను ఇబ్బంది పెట్టడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనకాపల్లి–జోలాపుట్టు బస్సులో సీట్లపై పైపులు, ఇనుప గొట్టాలు
ఆర్టీసీ సిబ్బంది తీరుపై మహిళా
ప్రయాణికుల ఆగ్రహం
ఉచిత ప్రయాణమని తమను
చులకనగా చూస్తున్నారని ఆవేదన
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్


