
తల్లికి వందనంపై మాట తప్పిన సర్కారు
● రూ.15వేలు ఇస్తామని
రూ.13వేలు జమ సరికాదు
● ఎస్ఎఫ్ఐ విమర్శ
● ఐటీడీఏ వద్ద నిరసన
పాడేరు : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున జమ చేయాలని, రూ.2వేలు కోత విధించడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు కార్తిక్ శ్రీను విమర్శించారు. శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు ఐటీడీఏ గేటు ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీని ఏడాది తర్వాత అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.15 వేలు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. లేనిపోని నిబంధనల పేరుతో తల్లికి వందనం పథకంలో కోత విధించడం సరికాదన్నారు. గత ప్రభుత్వం షరతులు విధిస్తే ప్రశ్నించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గ్రామాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో రూ.3లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికి తల్లికి వందనం వర్తింపజేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పథకం అందజేయాలని ఆయన కోరారు. విద్యా విధానాన్ని దెబ్బతీసే చర్యలను కూటమి ప్రభుత్వం విరమించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పాంగి చిన్నారావు పాల్గొన్నారు.
చింతపల్లి: తల్లికి వందనం పథకాన్ని అర్హులైన అందరికి వర్తింపజేయాలని కోరుతూ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవన్ కృష్ణ శనివారం చింతపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే తల్లుల ఖాతాల్లో రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం సరికాదన్నారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలు నిలుపుకోవడం లేదన్నారు. చింతపల్లి మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు