
తీర ప్రాంతాల్లో సండే సందడి
పరవాడ (అనకాపల్లి): ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీర ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. అనకాపల్లి, విశాఖ ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి సందర్శకులు తరలివచ్చారు. తీర ప్రాంతాలకు చేరుకున్న సందర్శకులు తిక్కవానిపాలెంలో సముద్ర తీరంలో నిర్మించిన ఎన్టీపీసీ జెట్టీదిగువన విడిదిచేసి తీరంలో సహజ సిద్ధంగా వెలసిన ఇసుక దిబ్బలు, పచ్చిక బయళ్లలో ఆట పాటలతో సరదాగా గడిపారు. వెంట తెచ్చుకున్న అల్పాహారాలు, బిరియానీలతో తీరంలోని జీడి తోటలు, విడిది గొడుగుల కింద సహపంక్తి భోజనాలు చేశారు. సాయం సంధ్య వరకు సముద్ర స్నానాలు చేసి, అలలతో సయ్యాటలాడారు. చీకటి పడ్డ వేళ ఆనందంగా తిరుగుముఖంపట్టారు.

తీర ప్రాంతాల్లో సండే సందడి