
గల్లంతైన పర్యాటకుడి కోసం గాలింపు
రెండో రోజు లభ్యం కాని ఆచూకీ
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతంలో శనివారం గల్లంతైన పర్యాటకుడి ఆచూకీ రెండో రోజు ఆదివారం కూడా లభ్యం కాలేదు. డుడుమ సందర్శనకు వచ్చిన కోల్కతాకు చెందిన పర్యాటకుడు అనిమేస్దాస్ (27) శనివారం జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి గల్లంతవడం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి లంతాపుట్టుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, కొర్రాపుట్టుకు చెందిన ఓడీఆర్ఏఎఫ్ బృందం, మాచ్ఖండ్ ఎస్ఐ శుక్రమాడి ఆధ్వర్యంలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. జలపాతం దిగువ భాగంలో సోరంగాలు ఉండడం వల్ల గాలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పర్యాటకుడు లోపల ఇరుక్కుపోయి ఉండొచ్చునని మాచ్ఖండ్ ఎస్ఐ శుక్రమాడి అభిప్రాయపడ్డారు. అనిమేస్దాస్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.