ఆదిలాబాద్టౌన్: ఐక్య పోరాటాలతోనే ఆదివాసీ హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ 1/70 చట్టాన్ని సవరించాలని కోరుతూ 750 మందికి పైగా గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 13న కేసు విచారణకు రానుందన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూ హక్కులను పరిరక్షించే చట్టాన్ని కాపాడేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గతంలో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ యువతకు వందశాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జీవో 3 విషయంలో కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆదివాసీ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. అదే దుస్థితి ఎదురు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం కిష్టన్న, కొట్నాక్ సకారాం, పెందూర్ గోవింద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు ఇషాంత్, తదితరులు పాల్గొన్నారు.


