మేదరమెట్ల: సమాజంలో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వ్యక్తిగత రక్త పరీక్షలు చేయించుకోవడం అవసరమని లెప్రసీ క్షయ, ఎయిడ్స్ అధికారి డాక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మేదరమెట్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మేదరమెట్లలోని ఎస్టీ కాలనీ నేషనల్ హైవే ప్రాంతంలో ప్రజలకు స్వచ్ఛంద రక్త పరీక్షలు చేశారు. హెచ్ఐవీ ఎయిడ్స్ ఉందని తెలుసుకొన్న కొంతమంది మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని, అటువంటి వారికి మానసిక ధైర్యాన్ని కలిగిస్తూ వ్యాధిపై సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఎస్కే అమీన్ పేర్కొన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవీ సాగర్, కౌన్సిలర్ టి.విజయకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ దుర్గాబాయి, సంచార హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ బి.దుర్గా సురేంద్ర, ఏఎన్ఎం విజయలక్ష్మి, మేదరమెట్ల అవుట్ రిచ్ వర్కర్ ఆర్.కృష్ణవేణి, పీఈలు పాల్గొన్నారు.


