రంపచోడవరం: స్థానిక ఏరియా ఆసుపత్రిలో గర్భిణి కోసు బాపనమ్మ, ఆమెకు పుట్టిన నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై మంగళవారం రంపచోడవరంలో ఉన్నత స్థాయి అధికారుల విచారణ జరిగింది. జాతీయ షెడ్యుల్ తెగల కమిషన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ, ఏలూరు జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ బేబీ కమల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విచారణాధికారి బాధితుల నుంచి వేర్వేరుగా సాక్షాలను, రికార్డులను సేకరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను, మృతురాలి భర్త కోటం రాజన్నదొర.. విచారణ అధికారులను వ్యక్తిగతంగా కలసి ఫొటోలు, సాక్షాలను అందజేశారు. తల్లీబిడ్డల మృతికి కారణమైన ఆసుపత్రి సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్లపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు.
వేగవంతంగా
ఎస్ఐఆర్ ప్రక్రియ
రంపచోడవరం: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రంపచోడవరం నియోజకవర్గంలోని 399 పోలింగ్ కేంద్రాల్లో వేగవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దినేష్కుమార్ తెలిపారు. ఈనెల 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. 2026 జూలై ఒకటి నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతీ యువకుల ఓటు నమోదు, ఓటర్ల వివరాల్లో తప్పుల సవరణ, ఫొటోల నాణ్యత మెరుగుదల చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 84 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు అందించామన్నారు.


