సీతానగరం: ఆయన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఏజెన్సీలోని ఓ గ్రామంలో దాదాపు 17 ఏళ్ల క్రితం పనిచేశారు. ఆ సమయంలో అక్కడి పిల్లలకు చదువు చెప్పడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం మైదాన ప్రాంతానికి బదిలీపై వచ్చేశారు. ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు నేడు వివిధ రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడిని గుర్తించుకుని ఆయనను తమ గ్రామానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం వెదుళ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూలో శతపతి శ్రీనివాస్, రమాదేవి దంపతులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారిలో శ్రీనివాస్ 1998 నుంచి 2009 వరకు అడ్డతీగల మండలం పులిగోగులపాడు పంచాయతీ పరిధిలోని మాలయపాకలు గ్రామంలో ఉపాధ్యాయుడి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గ్రామానికి రోడ్డు లేకపోతే గ్రామస్తులు అందరిని ఏకతాటిపై నడిపించి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించారు. చదువు మానేసిన పిల్లలను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలలో చేర్పించారు. వారికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అనంతరం అక్కడి నుంచి బదిలీపై వేరే ప్రాంతానికి వచ్చేశారు. ఆనాడు శ్రీనివాస్ దగ్గర చదువుకున్న పిల్లల్లో కొందరు డాక్టర్, పోలీస్ ఉద్యోగాల్లో, వైద్య, ఆరోగ్యశాఖల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో వారందరూ శ్రీనివాస్ దంపతులను ఆదివారం తమ గ్రామానికి ఆహ్వానించారు. కోలాటంతో ఆహ్వానం పలికి, తమ ఉపాధ్యాయుడిని భుజాలపై మోసుకుంటూ సన్మాన సభ వద్దకు తీసుకువెళ్లారు. సర్పంచ్ ప్రసాద్, గ్రామ పెద్దలు మంగరాజు, నూకాలమ్మ, చంద్రావతి లక్ష్మి తదితరులు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం శ్రీనివాస్, రమాదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. కాగా.. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి శ్రీనివాసరూ.5 వేల విరాళం అందజేశారు.
ఫ పూర్వ విద్యార్థుల అభిమానం
ఫ దాదాపు 17ఏళ్ల క్రితం తమకు చదువు
చెప్పిన ఉపాధ్యాయుడికి సన్మానం
ఫ అడ్డతీగల మండలంలో ఘటన


