సామర్లకోట: పెద్దాపురంలో వేంచేసిన మరిడమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు సహకరించాలని పెద్దాపురం ఆర్డీఓ పి.కృష్ణమూర్తి అన్నారు. వచ్చే నెల 14 నుంచి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఆలయ మండపంలో నిర్వహించిన ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆలయ ఈఓ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గతంలో జరిగిన ఏర్పాట్లు, భక్తుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీని పురస్కరించుకొని ఆయా శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భక్తులు సహకరించాలన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మరిడమ్మ జాతర ఉత్సవాలు వచ్చే నెల 14 నుంచి ఆగస్టు 19 వరకు జరుగుతాయని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఈఓ) కె.విజయలక్ష్మి తెలిపారు. జాతరలో భాగంగా ఈనెల 29న ఉయాల తాళ్లోత్సవం, వచ్చే నెల 13న జాగరణ జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ మాట్లాడుతూ ఉత్సవాలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఐలు వైఆర్కే శ్రీనివాసు, ఎ.కృష్ణభగవాన్, అగ్నిమాపక శాఖ అధికారులు, ఆర్అండ్బీ, మున్సిపల్, ఎలక్ట్రికల్, మెడికల్ అండ్ హెల్త్, పాల్గొన్నారు.
ఫ పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి
ఫ జూలై 14 నుంచి మరిడమ్మ జాతర
ఫ 37 రోజుల పాటు నిర్వహణ


