అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 33 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.1,96,59,883 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఈనెల 12 వరకు విద్యాసంస్ధలకు వేసవి సెలవులు వలన విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయం భక్తులతో కళకళలాడింది. భక్తులంతా సమర్పించిన కానుకలతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. ఈ కానుకల్లో నగదు రూ.1,84,99,620 కాగా, చిల్లర నాణేలు రూ.11,60,263 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వీటితో పాటు బంగారం 22.500 గ్రాములు, వెండి 567 గ్రాములు వచ్చినట్లు వారు తెలిపారు. సరాసరిన రోజుకి రూ.5,95,754 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు.
హుండీల ద్వారా విదేశీ కరెన్సీ
సత్యదేవుని హుండీల ద్వారా విదేశీ కరెన్సీ కూడా భారీగా లభించింది. 230 అమెరికా డాలర్లు, పది యూఏఈ దీనార్లు, పది కెనడా డాలర్లు, 119 సింగపూర్ డాలర్లు, ఒక మలేషియా రింగిట్, 55 యూరోలు, పది ఇంగ్లాండ్ పౌండ్లు, వంద డెన్మార్క్ క్రోనార్లు, వంద శ్రీలంక రూపాయలు, 200 సౌతాఫ్రికా ర్యాండ్స్ లభించాయని తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు పర్వత సురేష్, కామర్స్ చిరంజీవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ 33 రోజుల ఆదాయం రూ.1.96 కోట్లు
ఫ సరాసరిన రోజుకు
రూ.5.96 లక్షల ఆదాయం


