సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి సంబంధించి సంతనూతలపాడు మండలంలోని బీఎల్ఓలకు ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాల చొప్పున కిట్లను స్థానిక తహసీల్దార్ నారాయణరెడ్డి సోమవారం పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని 60 మంది బీఎల్ఓలకు కిట్లు పంపిణీ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి బీఎల్ఓలు మండలంలోని గ్రామాల్లో వారి పరిధిలోని ఇళ్లకు తిరిగి ఓటర్లకు సంబంధించిన సమగ్ర సర్వే ప్రక్రియ చేపట్టాలని తహసీల్దార్ సూచించారు. ముఖ్యంగా ఫారం 6, 7, 8కు సంబంధించి చేర్పులు, తీసివేతలు, సవరణల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం కంప్యూటర్ ఆపరేటర్ అనీల్, బీఎల్ఓలు పాల్గొన్నారు.
మద్దిపాడు మండలంలో ప్రారంభమైన సర్...
మద్దిపాడు: మండల వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మండలంలోని 54 మంది బూత్ స్థాయి అధికారులు వారి బూత్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలిచ్చి నమోదు చేయాల్సిన వివరాల గురించి ఓటరుకు తెలియజేశారు. మండల కేంద్రమైన మద్దిపాడు గ్రామంలోని 163 బూత్లలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ ఆదిలక్ష్మి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలిచ్చి మాట్లాడారు. ఓటర్లకు అందజేసిన రెండు ఫారాల్లో పేరు, చిరునామా, గుర్తింపు కార్డు నంబర్, పాత ఫొటో ముద్రించి ఉంటాయన్నారు. వాటిలో వివరాలు పూర్తి చేయడానికి బీఎల్వోలు సహకరిస్తారని ఆమె తెలిపారు. జూలై 14వ తేదీ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ నెల రోజుల్లో ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడానికి, పూర్తి చేసిన వాటిని తీసుకోవడానికి పలుమార్లు బీఎల్ఓలు వస్తారని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్ఓ జాన్సన్బాబు, బీఎల్ఏ చైతన్యక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


