● జిల్లాలో కానరాని భారీ వర్షాలు ● అంచనాకు చేరువైన పత్తి, కంది, సోయా సాగు విస్తీర్ణం ● పలుచోట్ల మొలకలు రాక రైతుల్లో హైరానా ● ఆకాశం వైపు అన్నదాత చూపు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో కానరాని భారీ వర్షాలు ● అంచనాకు చేరువైన పత్తి, కంది, సోయా సాగు విస్తీర్ణం ● పలుచోట్ల మొలకలు రాక రైతుల్లో హైరానా ● ఆకాశం వైపు అన్నదాత చూపు

Jun 22 2025 4:06 AM | Updated on Jun 22 2025 4:06 AM

● జిల్లాలో కానరాని భారీ వర్షాలు ● అంచనాకు చేరువైన పత్తి

● జిల్లాలో కానరాని భారీ వర్షాలు ● అంచనాకు చేరువైన పత్తి

సాక్షి, ఆదిలాబాద్‌: ఈ వానాకాలంలో ముందుస్తుగా ఊరించి ప్రస్తుతం వర్షాలు ఉసురుమనిపిస్తున్నాయి. మృగశిరకార్తె ప్రవేశం తర్వాత తొలకరితో రైతులు జోరుగా సాగు పనులు ప్రారంభించారు. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 4లక్షల 42వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పెద్ద మొత్తంలో పత్తి, ఆ తర్వాత కంది, సోయా సాగు చేస్తున్నారు. పత్తి సాగు విస్తీర్ణం ఇప్పటికే వ్యవసాయశాఖ అంచనాకు చేరువైంది. కంది, సోయా కూడా రైతులు వేశారు. అయితే వానాకాలం మొదలైన జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ నెల 21వరకు కేవలం ఏడు రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. అందులో ఈ నెల 10న 3.2 సెం.మీ, 11న 1.4 సెం.మీ. మేర మాత్రమే చెప్పుకోదగినదిగా నమోదైంది. మిగతా రోజుల్లో తేలికపాటిగా కురిశాయి. దీంతో విత్తనాలు విత్తిన రైతులు ప్రస్తుతం హైరానా చెందుతున్నారు. కొన్ని మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతో మొలకెత్తనేలేదు. మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు పడటంతో మొలకెత్తినప్పటికీ ప్రస్తుతం ఎదుగుదలకు అవసరమైన నీరందని పరిస్థితి ఉంది. దీంతో రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు.

మండలాల్లో పరిస్థితి

జిల్లాలో 21 మండలాలు ఉండగా కేవలం తొమ్మిది మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. 12 మండలాల్లో లోటు నమోదైంది. గాదిగూడ, నేరడిగొండ, సిరికొండ మండలాల్లో 50శాతం లోటుగా ఉంది. బోథ్‌, సాత్నాల, తలమడుగులో 40శాతం, బేల, ఇంద్రవెల్లి, తాంసి, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌, సొనాలలో 30శాతం లోటు వర్షపాతం కనిపిస్తుంది. మొత్తంగా జిల్లా అంతటా లోటు వర్షపాతం రైతును ఆందోళనకు గురి చేస్తుంది. విత్తన దశలోనే పంట నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. లోటు వర్షపాతమున్న మండలాల్లో రైతులు మళ్లీ వర్షాలుపడితే విత్తనాలు కొని నాటుతామని

చెబుతున్నారు.

పక్కపక్క మండలాల్లోనే పరిస్థితులు వేరు..

నార్నూర్‌, గాదిగూడ మండలాలు పక్కపక్కనే ఉంటాయి. నార్నూర్‌లో ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదు కాగా, గాదిగూడలో లోటు కనిపిస్తుంది. జైనథ్‌, బేల మండలాలు పక్కపక్కనే ఉంటాయి. జైనథ్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, బేలలో లోటు వర్షపాతం ఉంది. సిరికొండ, ఇచ్చోడ మండలాలు పక్కపక్కనే ఉంటాయి. సిరికొండలో లోటు వర్షపాతం ఉండగా, ఇచ్చోడలో సాధారణ వర్షపాతం నమోదైంది.

చించోలి గ్రామంలో రైతు శ్రీనివాస్‌ చేనులో మొలకెత్తని సోయా విత్తనాలు

సిర్సన్న గ్రామంలో రైతు రామన్న చేనులో మొలకెత్తని పత్తి గింజ

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

(జూన్‌ 1నుంచి 21వరకు )

సాధారణం: 128.6 మి.మీ

కురిసింది: 81.1 మి.మీ

లోటు : 37శాతం

జిల్లాలో సాగైన పంటల వివరాలు..

(ఎకరాల్లో)

పంట అంచనా సాగైంది

పత్తి 4,30,000 3,80,000

సోయా 50,000 21,000

కంది 60,000 29,000

మొక్కజొన్న 25,000 12,000

పత్తి విత్తనాల విక్రయాలు ..

అందుబాటులో ఉన్న ప్యాకెట్లు : 20,66,036

ఇప్పటి వరకు విక్రయించనవి : 10,48,061

మోస్తరు వానలు ఉన్నాయి

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అయితే జిల్లా అంతటా కాకుండా చెదురుమదురుగా నమోదయ్యే పరిస్థితి ఉంది. నీటి వసతి ఉన్న రైతులు విత్తనం మొలకెత్తెందుకు, మొలకెత్తిన వాటి ఎదుగుదలకు నీళ్లు అందించాలి.

– మోహన్‌దాస్‌, వ్యవసాయ శాస్త్రవేత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement