
వైద్యులే లేరంటే.. బదిలీలా?
బోథ్: పేరుకే పెద్దాసుపత్రి.. ఇప్పటికే సరిపడా వైద్యులు లేరు. ఉన్న ముగ్గురిలో డిప్యూటేషన్పై ఉన్న సూపరింటెండెంట్ను ఇటీవల బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన సూపరింటెండెంట్ వెంటనే సెలవులో వెళ్లగా పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందని పరిస్థితి. బోథ్ సీహెచ్సీ సూపరింటెండెంట్గా డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న రవీంద్రప్రసాద్ను ఉట్నూర్లోని ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడిగా, అక్కడ స్పెషలిస్ట్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న కె.రవిని బోథ్ సూపరింటెండెంట్గా వైద్యారోగ్య శాఖ అధికారులు ఇటీవల బదిలీ చేశారు. కాగా, రవీంద్రప్రసాద్ ఉట్నూర్ ఏరియా ఆసుపత్రి నుంచి బోథ్ సీహెచ్సీలో సూపరింటెండెంట్గా డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలపై ఇద్దరు వైద్యులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురు ఈనెల 16న విధుల్లో చేరిన రోజునే దీర్ఘకాలిక సెలవు పెట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ బదిలీలు రెండు నియోజకవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం బోథ్ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు వర్షాకాలం షురూ కావడంతో వ్యాధుల సీజన్ మొదలైంది. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరగనుంది. ఈ క్రమంలో ఉన్న ఇద్దరితో వైద్యసేవలు అందించడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఈ విషయమై బోథ్ సూపరింటెండెంట్గా నియమితులైన కె.రవిని ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు రవీంద్రప్రసాద్ను ఇదే విషయమై సంప్రదించగా తనను రాజకీయ కోణంలో బదిలీ చేశారని పేర్కొన్నారు.
రాజీనామా యోచనలో రవీంద్రప్రసాద్..?
రవీంద్రప్రసాద్ డిప్యూటేషన్ రద్దుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన ఓ పార్టీ నాయకుడు తనను బదిలీ చేయించినట్లు సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది.
బోథ్, ఉట్నూర్ ఆసుపత్రి వైద్యుల స్థానచలనంపై అసంతృప్తి
విధుల్లో చేరిన రోజే ఇద్దరూ సెలవు పెట్టిన వైనం
ఆలస్యంగా వెలుగులోకి..
బోథ్ సీహెచ్సీలో ప్రస్తుతం విధుల్లో ఇద్దరే డాక్టర్లు..!