Y.srinivas rao
-
మార్కెట్లో ‘సంక్షేమ’ డబ్బు
ఆర్థిక మాంద్యం భయపెడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి ‘సంక్షేమ’ డబ్బు వచ్చింది. పేద, మధ్య తరగతి వర్గాల చేతుల్లోకి చేరిన ప్రభుత్వ డబ్బు తిరిగి మార్కెట్లో తిరుగుతోంది. ప్రస్తుతం ఈ డబ్బే రాష్ట్ర మార్కెట్ను ఆదుకుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇది కళ్ళకు కనిపించే వాస్తవం. ఉపాధి పనులు కొరవడుతూ, ఉద్యోగ అవకాశాలు కనుమరుగవుతున్న కీలకమైన దశలో వైఎస్ జగన్ ప్రభుత్వం ‘సంక్షేమ’ పథకాల పేరుతో లబ్ధిదారులకు డబ్బులు అందజేసింది. ‘అమ్మఒడి’, ‘రైతుబంధు’, ‘వాహనమిత్ర’ తాజాగా ‘వసతి దీవెన’ వంటి పథకాల డబ్బు లబ్ధిదారుల చేతుల్లో నుంచి కుటుంబ అవసరాల రూపంలో మార్కెట్లోకి చేరుకుంది. ఈ డబ్బే మార్కెట్లో ఒకరి చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి మారుతుంది. ఈ డబ్బే లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగు తీసుకురావడమే కాక ప్రస్తుతం ఏపీ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించిందనేది అక్షర సత్యం. గత ఐదేళ్ళుగా అవి నీతి రూపంలో కొందరు అనకొండలనే వరించిన ‘లక్ష్మీదేవి’, వైఎస్ జగన్ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు పేద, మధ్య తరగతి వర్గాలను వరించింది. ఈ వర్గాల వద్దకు చేరుకున్న ‘సంక్షేమ డబ్బు’ వారి కుటుంబ అవసరాలు తీరుస్తూనే ఆర్థిక వ్యవస్థకూ జీవం పోయడం ఆరోగ్యకర పరిణామమనే చెప్పాలి. అమ్మఒడి పథకం ద్వారా రూ. 15 వేలు తల్లుల బ్యాంకు అకౌంట్లలో జమచేసింది ఏపీ ప్రభుత్వం. రైతు భరోసా పథకం ద్వారా రూ. 7,500 విడతల వారీగా అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ. 6 వేలు సహాయం అందించింది. ఇక వాహనమిత్ర పథకం ద్వారా ఆటోవాలాలకు రూ. 10 వేలు జమచేశారు. ఇంకా సామాజిక భద్రత కింద పింఛన్లు, జూనియర్ న్యాయవాదులకు రూ. 5 వేలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పలు పథకాలకు డబ్బులు లబ్ధిదారులు అందుకుంటున్నారు. ప్రతీ ఏటా 30 వేల కోట్ల రూపాయలు కేవలం ఒక్క సంక్షేమ పథకాలకే అవసరముంటుందని ప్రభుత్వ ఆర్థికశాఖ లెక్కల అంచనా. అంటే ఐదేళ్ళలో రూ. 1.50 లక్షల కోట్లు లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. అవినీతి అనకొండల వద్ద నల్లడబ్బుగా మూలిగేకన్నా ఇలా సంక్షేమ పథకాల డబ్బు మార్కెట్లోకి రావడం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే మొత్తం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవచ్చు. కానీ గత ఐదేళ్ళుగా వ్యాపారాలు నడవక, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైన నేపథ్యంలో సంక్షేమ పథకాల డబ్బు మార్కెట్కు ఊపిరిపోసింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర మార్కెట్కు పేద, మధ్య తరగతి వర్గాల డబ్బు ఉపయోగపడుతుండటం, రొటేషన్కు ఆసరాగా ఆదుకోవడం శుభపరిణామమే. వై. శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, విజయవాడ ‘ 87902 30395 -
భస్మీపటలం
అగ్గి దేవుడు భగ్గుమన్నాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో విరుచుకుపడ్డాడు. 89 ఇళ్లను భస్మీపటలం చేశాడు. నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేశాడు. దాదాపు 350మంది కట్టుబట్టలతో మిగిలారు. బూడిదగా మారిన ఇళ్లను చూసిన బోరున విలపించారు. గుంటూరు నగరానికి సమీపంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో శనివారం ఈ దుర్ఘటన సంభవించింది. గుంటూరు రూరల్ : విద్యుత్షార్ట్ సర్క్యూట్ కారణంగా 89 పూరిళ్లు అగ్నికి ఆహుతైన ఘటన శనివారం గుంటూరు నగర శివారు లాలుపురం పంచాయతీ పరిధిలోని లింగాయపాలెం అల్లూరి సీతారామరాజు కాలనీలో జరిగింది. కాలనీలోని ఓ ఇంట్లో ఉదయం 10 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అది చుట్టు పక్కల నివాస గృహాలకు అంటుకోవడంతో పెను ప్రమాదం సంభవించింది. గుంటూరు రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు కాలనీ జీరో లైన్కు చెందిన గోలి గురవమ్మ అనే మహిళ ఇంటి బయట వంట వండుకుంటోంది. ఇంటి వెనుక భాగం నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో గోలి గురవమ్మ కేకలు పెట్టింది. మరో వైపు ఎండ తీవ్రతతో పాటు ఈదురు గాలులు విపరీతంగా ఉండడంతో ఆ మంటలు కాస్తా చుట్టు పక్కల ఇళ్లకు అంటుకున్నాయి. చుట్టు పక్కల నివాసాలలో ఉన్న 8 సిలిండర్లు పేలడంతో మంటలు మరింతగా ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశారు. ఓ చేత్తో చిన్నపిల్లలను ఎత్తుకుని, మరో చేత్తో అందిన సామగ్రిని చేత పుచ్చుకుని ఆ ప్రాంతం నుంచి ఇవతలకు వచ్చారు. జీరో లై న్లో మొదలుకున్న మంటలు కాస్తా 5వ లైను వరకు పాకాయి. సమాచారం తెలుసుకున్న ఆర్డీవో బి.రామమూర్తి, తహాశీల్దార్ తాతా మోహన్రావు, అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ అధికారి రత్నబాబు, రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు ఆర్ఐ గోపికృష్ణ, ఎంపీడీవో పద్మశ్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనువాసు, మండల ఎంపీపీ తోట లక్ష్మీకుమారి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. రెవెన్యూ అధికారుల విచారణలో సుమారు 89 నివాస ప్రాంతాలు అగ్నికి ఆహుతి అయినట్టు గుర్తించారు. సుమారు రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశం మేరకు ప్రతి బాధిత కుటుంబానికి రూ.5 వేలు నగదు, 20 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, వంటసామగ్రి అందజేస్తామని ఆర్డీవో రామమూర్తి తెలిపారు. మధ్యాహ్నం భోజన వసతి కల్పించి, చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. బాధితులను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం కింద రూ.5వేల రూపాయలను అందజేశారు. సోమవారం కుమార్తె వివాహం జరగాల్సి, ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కృష్ణారావును ఆదుకుంటామని చెప్పారు.