breaking news
Vote To crore
-
నామాకు ప్రేమతో..!
- పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు - రూ. 4,800 కోట్ల ప్రాజెక్టు నామాకు అప్పగింతకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆ కోట్లు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నామా నాగేశ్వరరావుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా పేరొందిన ఆ మాజీ ఎంపీకి 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఒక్కొక్కటీ 80 మెగావాట్లతో మొత్తం 12 ప్లాంట్లను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్కు రూ. 5 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారుల అంచనా వేశారు. దాదాపు రూ. 4,800 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును సీఎం సన్నిహితుడు నామా నాగేశ్వరరావు అప్పగించేలా టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు మాత్రమే సరిపోయి, ఇతరులు పోటీకి రాకుండా మరికొన్ని నిబంధనలు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలో టెండర్లు.. పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఏపీజెన్కోకు అప్పగించారు. దీంతో టెండర్ ప్రక్రియ ప్రారంభించేందుకు జెన్కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచే వీలుంది. దీనికోసం ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల టెండర్లను పరిశీలించారు. కేంద్ర జల విద్యుత్ ఉత్పాదక సంస్థ అనుసరిస్తున్న నిబంధనలను కూడా అధ్యయనం చేశారు. అయితే ఆ నిబంధనలను మార్చాలని అధికారులు భావిస్తుండటంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే మార్పులు అనివార్యమని అధికారులు చెబుతున్నా, ప్రభుత్వం సూచించిన కాంట్రాక్టర్కు ఈ పనులు అప్పగించడం అసలు ఉద్దేశమని తెలుస్తోంది. జలవిద్యుత్ ఉత్పత్తి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు చేపట్టి ఉండాలనేది కేంద్రం, వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ప్రాథమిక నియమం. దీన్ని కాదని.. ఏదైనా జల విద్యుత్ కేంద్ర నిర్మాణం చేసి ఉంటే చాలనే నిబంధన పెట్టనున్నారు. ఆర్థికపరమైన అంశాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారు. గడచిన ఐదేళ్ల టర్నోవర్ను పరిశీలించాలనే నిబంధనకు బదులు, ఐదేళ్లలో ఏదైనా రెండేళ్ల టర్నోవర్ను పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందనే టెండర్ నిబంధన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. -
జాగ్రత్తగా బ్రీఫ్ చేయాలి...
‘ఓటుకు కోట్లు’ సంఘటనలో ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ లాంటి పదాలు తరహా లాంటివి కాకుండా, కేంద్రంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇంగ్లీషు పదప్రయోగం ఎలాంటి పొరపాట్లు లేకుండా కరెక్ట్గా ఉండాలని ఇటీవల తరచూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తి విభజన హామీలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న ఈ తరుణంలో అధికార యంత్రాంగం కేంద్రానికి పంపే ప్రతిపాదనల్లో సరైన పదాలు, పరిభాష సరిగా ఉండాలని బాస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయట. ఎప్పుడూ లేనిది ఇదేందబ్బా.. అని ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. ఇంగ్లీషు పదప్రయోగానికి సంబంధించి తాజాగా జారీ అయిన ఓ ఆదేశాన్ని ఉటంకిస్తున్నారు. అదేంటంటే.. రాజధానికి ఉద్యోగుల తరలింపు అంశంలో ‘స్థానికత’ కు కేంద్రం సవరణలు చేయాల్సి ఉంది. స్థానికతపై కేంద్రం సవరణలు చేస్తే ఒక్క ఉద్యోగులకు మాత్రమే స్థానికత వర్తించదు. ఉద్యోగులతో పాటు ఏపీకే చెందిన తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకి ఈ ఉత్తర్వు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా సవరణకు సంబంధించి సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్రానికి సిఫారసు చేసేందుకు ఎలాంటి తప్పులు లేకుండా, స్థానికత ఒక్క ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వర్తింపచేసే అవకాశం ఉంటుందా? అన్న కోణంలో సమగ్ర పరిశీలన జరిపి, సరైన ఇంగ్లీషు పదాలు వాడాలని బాస్ నుంచి ఉన్నతాధికారులకు సూచనలు అందాయట. ఈ సూచనలు ఆసాంతం విన్న ఉన్నతాధికారులకు అసలు విషయం అప్పుడు అర్ధమైందట. ఫోన్ సంభాషణల్లో బాస్ వాడిన ఇంగ్లీషు ప్రపంచానికి అర్ధమై బాగా పాపులారిటీ సంపాదించుకున్న దరిమిలా ఇప్పడాయన ఆదేశాలు సచివాలయంలోని ఉన్నతాధికారుల్లో పెద్ద చర్చకు దారితీసింది.