breaking news
Vietnam tour
-
Vietnam: భర్త కళ్లముందే భార్య జయశ్రీ మృతి
మచిలీపట్నంటౌన్: వియత్నాం దేశంలోని ఫు క్వాక్ సముద్ర తీరంలో శనివారం ఉదయం జరిగిన ఘోర పర్యాటక బోటు ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య మరణించింది. కిషోర్ ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆయనకు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మచిలీపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లావా సెల్ కంపెనీ తమ వ్యాపార భాగస్వాములు, డీలర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనలో భాగంగా గెల్లి దంపతులు వియత్నాం టూర్కు వెళ్లారు.మూడు రోజుల క్రితం ఈ టూర్కు వెళ్లారు. వీరు శనివారం వియత్నాంలోని ఫు క్వాక్ ప్రాంతంలో ఆన్ థోయ్ ద్వీప సమూహం సమీపంలోని హోన్ మే రుట్ వద్ద పర్యాటకులతో కలసి స్పీడ్బోట్లో విహారయాత్రకు బయలుదేరారు. సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో బలమైన గాలులు, ఎత్తైన కెరటాల ధాటికి బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న పలువురు నీటిలో చిక్కుకోగా, సహాయక బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన యాత్రికులు సహా మొత్తం 32 మంది మృతి చెందినట్లు వియత్నాం ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.మృతుల్లో మచిలీపట్నానికి చెందిన గెల్లి జయశ్రీ ఉన్నారు. స్ధానిక సర్కిల్పేటలోని కంచి కామాక్షమ్మ ఆలయ సమీపంలో సాయిబాబా గుడి పక్కన నివాసముండే గెల్లి కిషోర్ భార్య జయశ్రీ మృతితో గెల్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే స్థానిక వ్యాపార వర్గాలు దిగ్భ్రాంతి చెందాయి. గెల్లి కిషోర్ మచిలీపట్నంలో కిళ్లీ సామగ్రి దుకాణంతో పాటు లావా, టాటా ఇండికాం, టాటా సెల్యులర్ డీలర్గా గత 30 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ను సంప్రదించిన కిషోర్ కుమారుడు ఆకాష్ వియత్నాంలో పడవ ప్రమాదంలో మృతి చెందిన తన తల్లి జయశ్రీ మృతదేహంతో పాటు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ తండ్రి కిషోర్ను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆకాష్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కూడా కలెక్టర్కు విజ్ఞప్తి చేయటంతో స్పందించిన కలెక్టర్ ఎంబసీ అధికారులతో మాట్లాడి జయశ్రీ మృతదేహం త్వరితగతిన మచిలీపట్నంకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనపై మచిలీపట్నంలోని ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. -
మాక్రాన్కు చెంపదెబ్బ?
పారిస్: వియత్నాం పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఉదంతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. అధికారిక పర్యటన నిమిత్తం భార్య బ్రిగెట్తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హనోయ్ చేరుకున్నారు. తలుపు తెరుచుకుని, విమానం దిగేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బ్రిగెట్ ఒక్కసారిగా మాక్రాన్ ముఖంపై కొడుతున్నట్టుగా కన్పించారు. ఆమె చేతులు మాక్రాన్ ముఖంపై విసురుగా పడుతూ కన్పించాయి. ఆ ధాటికి మాక్రాన్ ఉన్నట్టుండి వెనక్కు ఒంగిపోయారు. దాంతో ఆయన ఒక్కసారిగా కంగుతిన్నా, కెమెరాలన్నీ తనపైనే ఉండటం గమనించి వెంటనే సర్దుకున్నారు. చిరునవ్వుల నడుమ అభివాదసూచకంగా చేతి ఊపుతూ విమానం నిచ్చెనపైకి చేరుకున్నారు. ఆ వెనకే బ్రిగేట్ కూడా వచ్చి మాక్రాన్ పక్కన నుంచున్నారు. కానీ ఆయన చెయ్యందివ్వబోగా పట్టించుకోలేదు. ఇద్దరూ కలి‘విడి’గానే నిచ్చెన దిగి వచ్చారు. మీడియా కెమెరాలకు చిక్కిన ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడమే గాక తీవ్ర దుమారం కూడా రేపింది. పైగా, ఆ వీడియో నకిలీది కావచ్చన్న ఫ్రెంచి ప్రభుత్వ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. దాంతో ఇక లాభం లేదని అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగారు. అదో సరదా ఘటన తప్ప ఇంకేమీ కాదంటూ మీడియా సాక్షిగా వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నేను, మా ఆవిడ జోక్ చేసుకుంటున్న క్రమంలో జరిగిన ఉదంతమది. ఏమీ లేనిదాన్ని అనవసరంగా పెద్దది చేసి చూస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. దానిపై ఎవరికి తోచించి వాళ్లు ప్రచారం చేస్తూ అనవసరంగా కుట్ర సిద్ధాంతాలకు తెర తీస్తున్నారంటూ ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో వాపోయింది. మాక్రాన్ దంపతుల నడుమ విభేదాలు సాగుతున్నాయని, అవి తారస్థాయికి చేరాయనేందుకు ఈ ఉదంతమే తాజా నిదర్శనమని ఫ్రెంచి పత్రికలు ఎడాపెడా రాసేయడమే అందుకు కారణం. ఏక్ చోటీ సీ ప్రేమ్ కహానీ!: మాక్రాన్, బ్రిగేట్ బంధం తొలినుంచీ వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది. మాక్రాన్ కంటే ఆమె దాదాపు పాతికేళ్లు పెద్దది కావడం విశేషం! బ్రిగేట్ 1953 ఏప్రిల్ 13న పుట్టగా మాక్రాన్ జన్మదినం 1977 డిసెంబర్ 21. అంతేకాదు, హైసూ్కలు రోజుల్లో మాక్రాన్కు బ్రిగేట్ టీచర్ కూడా! ఆయనకు ఫ్రెంచ్, లాటిన్ బోధించేవారు. అలా లైసీ లా ప్రావిన్స్లో మాక్రాన్ టీనేజీ బాలునిగా చదువుకునే రోజుల్లోనే, అంటే 1993లో వారి ప్రేమ కథకు బీజం పడింది. అప్పటికి ఆయనకు కేవలం 15 ఏళ్లు. కాగా, బ్రిగేట్కు 39 ఏళ్లు. ఆంద్రె లూయిస్ అనే బ్యాంకర్తో ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. పైగా బ్రిగేట్ పెద్ద కూతురు లారెన్స్ మాక్రాన్కు స్వయానా క్లాస్మేట్ కూడా! అయినా ఇవేవీ వారి ప్రేమకు అడ్డంకి కాలేకపోయాయి. బ్రిగేట్ ఓ నాటక సంఘానికి పర్యవేక్షకురాలిగా కూడా వ్యవహరించేవారు. సాహితీ అభిమాని అయిన మాక్రాన్ అందులో సభ్యునిగా చేరారు. స్కూలు వేళలు అయిపోయాక ఇద్దరూ అక్కడ కలుసుకునేవారు. ఎంత గోప్యంగా ఉంచినా వారి వ్యవహారం మాక్రాన్ ఇంట్లో తెలిసిపోయింది. మాక్రాన్ ప్రేమలో పడ్డట్టు అప్పటికే వాళ్లకు అనుమానంగా ఉండేదట. అయితే, అది బ్రిగేట్ కూతురు కావచ్చని వాళ్లు భావించారట! మాక్రాన్ మహా మేధావి అంటూ ఆ అమ్మాయి వారితో నిత్యం ఎంతో గొప్పగా చెప్పడమే అందుకు కారణం. తీరా చూస్తే తమవాడు ప్రేమలో పడింది పిల్లతో కాదు, తల్లితోనని తెలిసి వారు కంగుతిన్నారు! ఈ అసాధారణ ప్రేమ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని పై చదువుల పేరిట మాక్రాన్ను ఉన్నపళంగా పారిస్ పంపించేశారు. అలా 17వ ఏట హైసూ్కల్ ఫైనలియర్ కోసం ఆయన పారిస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ దూరం కూడా వారి ప్రేమకు అడ్డం కాలేకపోయింది. పైగా మాక్రాన్ పారిస్ వెళ్లేముందు, ‘నువ్వేం చెప్పినా, ఏం చేసినా నేను మాత్రం ఎప్పటికైనా నిన్నే పెళ్లాడతా’ అని బ్రిగేట్కు కుండబద్దలు కొట్టి మరీ వీడ్కోలు తీసుకున్నారట. తర్వాత ఇద్దరూ తరచూ లేఖలు రాసుకుంటూ, వీలైనప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి ఆమె కూడా పారిస్ చేరుకున్నారు. అలా పుష్కర కాలం పాటు ప్రేమించుకున్నాక బ్రిగేట్ తన భర్తకు విడాకులిచ్చి 2007లో మాక్రాన్ను పెళ్లాడారు. తొలి వివాహం ద్వారా ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. -
Vietnam Open: భారత్కు నిరాశ.. సిక్కిరెడ్డి- రోహన్ కపూర్ జోడీకి తప్పని ఓటమి
Vietnam Open 2022- హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ బరిలో మిగిలిన ఏకైక జోడీ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) సెమీఫైనల్లో వెనుదిరిగింది. 37 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహాన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం 21–16, 21–14తో సిక్కి రెడ్డి–రోహన్ జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. సెమీస్లో ఓడిన భారత జంటకు 1,050 డాలర్ల (రూ. 85 వేలు) ప్రైజ్మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సహకారంతో మున్ముందుకు..!
వియత్నాం ప్రధాని, విదేశాంగ మంత్రితో సుష్మా స్వరాజ్ భేటీ హనోయ్: పరస్పర సహకారాన్ని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విసృ్తతం చేసుకోవాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2020 నాటికి 15 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్, వియత్నాంలు నిర్ణయించాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వియత్నాం పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, చమురు రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. సుష్మా సోమవారం ఇక్కడ వియత్నాం ప్రధానమంత్రి గుయెన్ టాన్ దంగ్, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్ మిన్లతో సమావేశమయ్యారు. వారితో దైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. తూర్పు దేశాలతో కేవలం ‘లుక్ ఈస్ట్’ విధానం సరిపోదని మెరుగైన కార్యాచరణతో ‘యాక్ట్ఈస్ట్’ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నామని సుష్మా అన్నారు.


