VAT government
-
పోపు డబ్బాపైనా వ్యాట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో పొదుపునకు పోపు డబ్బా చిహ్నం అంటూ ఉంటారు. కానీ, వ్యాట్ దెబ్బకు ఆ పోపు డబ్బా సత్తుపోతోంది. చెంచాలు మొదలుకుని కూరలు తరిగే కత్తి వరకూ వ్యాట్ దెబ్బకు మోతమోగిపోతున్నాయి. పైకి కనిపించకుండా బాదడాన్ని బాగా నేర్చుకున్న వాణిజ్య పన్నుల శాఖ... ఆఖరుకు వంటింటి సామగ్రినీ వదలడం లేదు. ఆధునిక వంటగదులను పన్ను పరిధిలో చేర్చడం వల్ల వాణిజ్య పన్నుల శాఖకు ఏటా రూ. 5 వేల కోట్లకు పైగానే ఆదాయం వస్తున్నట్లు అంచనా. అంటే వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు చేరుతున్న రూ. 42 వేల కోట్లలో ఇది పదిశాతానికి పైగానే కావడం గమనార్హం. అన్నం వండేందుకు ఉపయోగించే గరిట మొదలుకొని ప్రెషర్ కుక్కర్, పప్పులు, బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలు, నీళ్లు పట్టుకునే సీసాలు, కూరలు తరిగే కత్తులు వంటి సామగ్రి, ఇడ్లీ గిన్నెలు... ఇలా ఒకటేమిటి ఆఖరుకు చెంచాలు, పోపు గింజల డబ్బాలపైనా 14.5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఆధునిక వంట పరికరాల కొనుగోళ్లు పెరిగాయి. చిన్న ఇళ్లలో నివసించాల్సి రావడంతో.. తక్కువ స్థలం ఆక్రమించేలా వస్తువులు అమర్చుకోవడంపై మధ్య తరగతి వారు దృష్టి పెట్టారు. సులభ వాయిదాలపై చెల్లింపు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఫ్రిజ్లు, మైక్రోవేవ్లు, విద్యుత్ కుక్కర్ల కొనుగోళ్లు పెరిగాయి. గత నాలుగేళ్లుగా వంటగదిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగినట్టు అధికారుల అంచనా. దీంతో ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో భారీగా పన్నులు వస్తున్నాయి. వాస్తవానికి వీటిలో చాలా వరకూ రెండేళ్ల కింద వ్యాట్ మినహాయింపు పొంది వాటి జాబితాలో ఉండడం గమనార్హం. -
మద్యంపై వ్యాట్ ఆదాయం అదుర్స్
డిసెంబర్లో లక్ష్యం రూ.950 కోట్లు.. రాబడి రూ.1,260 కోట్లు మిగతా రంగాల్లో మాత్రం లక్ష్యాలను సాధించలేమంటూ వాణిజ్య పన్నుల అధికారుల మొర సాక్షి, హైదరాబాద్: మద్యం విక్రయాలపై వ్యాట్ సర్కారుకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వం నిర్ధారించిన లక్ష్యానికి మించి వ్యాట్ ఆదాయం వస్తోంది. డిసెంబర్ నెలనే తీసుకుంటే మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.950 కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా.. ఆదాయం రూ.1260 కోట్లు వచ్చింది. మిగతా రంగాలపై వ్యాట్ ఆదాయం మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా రావడం లేదు. ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ శనివారం దీనిపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నాటికి వ్యాట్ ద్వారా రూ. 40 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా రూ.36 వేల కోట్లు మాత్రమే వచ్చింది. దీనిపై టక్కర్ సర్కిల్స్ వారీగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులను నిలదీశారు. వ్యాట్ ఆదాయం తగ్గడానికి కారణాలేమిటో చెప్పాలని, ఉద్యోగులెవరైనా వ్యాట్ వసూళ్లను సరిగా చేయడం లేదంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. దీనిపై ఆ శాఖ అధికారులు స్పందిస్తూ గత ఆర్థిక సంవత్సరం వాస్తవంగా వచ్చిన ఆదాయం ఆధారంగా ఆర్థిక శాఖ లక్ష్యాన్ని నిర్ధారించకుండా.. గత లక్ష్యానికి పాతిక శాతం ఎక్కువ లక్ష్యాన్ని నిర్ధారిస్తోందని, దీని వల్ల లక్ష్యాలను సాధించలేకపోతున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ఆదాయం 53 వేల కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 50 వేల కోట్ల రూపాయలే సాధించగలమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పష్టం చేశారు.