-
మోదీకి ప్రకాశం వాసుల ఝలక్..
సాక్షి, ప్రకాశం: తమ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వినూత్న మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తూ తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు అవశ్యకతను చాటిచెప్పుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ బరిలో నిలుస్తున్న వారాణాసి లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ శర్మలు శుక్రవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు పలువురు స్థానికులు కూడా వారణాసికి వెళ్లారు. ఈ సందర్భంగా కాళభైరవ ఆలయం వద్ద వెలిగొండ పోరాట సాధన సమితి సభ్యులు నిరసన తెలిపారు. కనిగిరి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కలగాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలన్నారు. ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. మరోవైపు మోదీపై పోటీ చేయడానికి సిద్దమైన నిజామాబాద్ పసుపు రైతులు కూడా గురువారం వారణాసి బయలుదేరి వెళ్లారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని నిజామాబాద్ రైతులు పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో రైతులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎంపీ కవిత బరిలో నిలిచిన నిజామాబాద్ స్థానం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అక్కడ ఎన్నిక నిర్వహించడం ఎన్నికల సంఘానికి ఇబ్బందికరంగా మారింది. -
నామినేషన్ వేసిన నరేంద్ర మోదీ
సాక్షి, వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కాలభైరవుడి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారణాసిలో నామినేషన్ వేసేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. కాలభైరవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా స్థానిక మహిళలతో మోదీ కరచాలనం చేశారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. నరేంద్ర మోదీ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నాయకులు వారణాసికి వరుస కట్టారు. నామినేషన్ వేయడానికి ముందు కలెక్టరేట్ ఆఫీస్లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అకాలీదళ్ నేత ప్రకాశ్సింగ్ బాదల్, ఎల్జేపీ అధ్యక్షుడు రామ్విలాస్ పాశ్వాన్, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం, అప్నాదళ్, నార్త్–ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ నేతలతో మోదీ భేటీ అయ్యారు. ప్రకాశ్సింగ్ బాదల్కు ఈ సందర్భంగా పాదాభివందనం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మోదీపై మళ్లీ ఆయన్నే బరిలో నిలిపిన కాంగ్రెస్..!
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారనే ప్రచారం సాగినప్పటికీ అవన్నీ తేలిపోయాయి. గత ఎన్నికల్లో మోదీని ఎదుర్కొన్న అజయ్ రాయ్నే కాంగ్రెస్ మళ్లీ బరిలో నిలిపింది. పార్టీ ఆదేశిస్తే పోటీకి దిగుతానని ప్రియాంక చెప్పడం.. సస్పెన్స్ కొనసాగించడం మంచిదే కదా అని రాహుల్ వ్యాఖ్యానించడంతో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అజయ్ రాయ్ స్థానికుడు కావడం, రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఆయనవైపే పార్టీ మొగ్గు చూపినట్టు తెలిసింది. (చదవండి : నాకెంతో ఇష్టమైన చోటుకు చేరుకున్నా : ప్రధాని) అయితే, కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న ప్రియాంకకు పరాజయం ఎదురైతే పార్టీకి మరింత నష్టమని భావించే అజయ్రాయ్ని మరోసారి పోటీకి దించారని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం అజయ్ నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీపై పోటీచేసిన అజయ్ 75 వేల ఓట్లు సాధించి మూడు స్థానంలో నిలిచారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రెండు లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడు లక్షల ఓట్ల మెజారిటీతో మోదీ రికార్డు విజయం సాధించారు. బీజేపీలోనే రాజకీయ పాఠాలు.. బీజేపీ విద్యార్థి విభాగంలో పనిచేసిన అజయ్ అక్కడే రాజకీయ ఓనమాలు దిద్దారు. తొలిసారి (1996) కలాస్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పటి వరకు తొమ్మిది సార్లు కలాస్లాలో పాగావేసిన సీపీఐ అభ్యర్థిని ఓడించడంతో ఆయన పేరు మారుమోగింది. 2009లో వారణాసి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ అజయ్ పార్టీని వీడారు. సమాజ్వాదీ పార్టీ తరపున మురళీమనోహర్ జోషితో తలపడి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్లో చేరి నరేంద్ర మోదీపై వారణాసి నుంచి పోటీచేశారు. గంగా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం నిషేదాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టడంతో అజయ్ 2015లో అరెస్టయ్యారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అజయ్ మోదీని రెండోసారి ఢీకొట్టి ఏమేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి..! -
నాకెంతో ఇష్టమైన చోటుకు చేరుకున్నా : ప్రధాని
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో వారణాసి లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. చివరి దశ (ఏడో దశ)లో భాగంగా మే 19న ఇక్కడ ఎన్నిక జరగనుంది. మోదీ శుక్రవారం (రేపు) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం సాయంత్రం భారీ రోడ్షో నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కాషాయ కోలాహలంతో నిండిపోయింది. ‘దర్భంగా, బందాలో భారీ బహిరంగ సభల అనతరం తనకెంతో ఇష్టమైన కాశీకి చేరుకున్నా. లక్షలాది మంది నా సోదర, సోదరీమణులను కలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. హరహర మహదేవ్’ అంటూ ట్వీట్ చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన మదన్పురా, సోనార్పురాతో పాటు 150కి పైగా ప్రదేశాలగుండా ఈ ర్యాలీ సాగనుంది. కాశీలో గంగా హారతి అనంతరం మూడు వేల మంది ఇంటలెక్చువల్స్తో భేటీ అయి మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కాశీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్షో జరిగే ప్రాంతమంతా డ్రోన్లతో నిఘావేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, పీయూష్ గోయల్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, బిహార్ సీఎం నితీష్కుమార్, శిరోమణి అకాళీదళ్ చీఫ్ ప్రకాశ్ బాదల్, లోక్ జనశక్తి చీఫ్ రామ్విలాస్ పాశ్వాన్ తదితరులు పాల్గొననున్నారు. After bumper rallies in Darbhanga and Banda, I am heading to beloved Kashi. There are a series of programmes lined up, which would give me another excellent opportunity to interact with my sisters and brothers of Kashi. Har Har Mahadev! — Chowkidar Narendra Modi (@narendramodi) April 25, 2019 -
వారణాసిలో ఇదీ వరస
వారణాసి.. హరహర మహాదేవ్ నామస్మరణతో మారు మోగిపోయే పుణ్యక్షేత్రం. శివభక్తితో ఓలలాడే కాశీపురం. ఎన్నికల వేళ ‘హర్ హర్ మోదీ.. ఘర్ ఘర్ మోదీ’ నినాదాలతో హోరెత్తిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. అయితే అనూహ్యంగా చాలామంది ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలపడానికి కొందరు, తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని మరికొందరు, ప్రధానిపై పోటీ చేస్తే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఇంకొందరు, ఇలా చాలామంది ‘కాశీకి పోతాము రామాహరీ’ అంటూ క్యూ కడుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణలో నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఏకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ అభ్యర్థుల సంఖ్య 185కి చేరి.. ఎన్నికల సంఘానికే పరీక్షగా మారింది. ఇప్పుడు వారణాసిలోనూ అదే వరస కనిపించే సూచనలున్నాయి. ► కోల్కతా హైకోర్టుకి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి డీఎస్ కర్ణన్ వారణాసి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడి శిక్ష అనుభవించిన మొదటి న్యాయమూర్తి కర్ణన్. 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈయ న వారణాసిని ఎంచుకున్నారు. 63 ఏళ్ల కర్ణన్ 2018లో యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెన్నై లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ► బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కూడా తన నిరసన తెలపడానికి ఎన్నికలనే ఎంచుకున్నారు. జవాన్లకు నాసిరకమైన ఆహారాన్ని పెడుతున్నారంటూ గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. అది వైరల్గా మారడంతో తేజ్ బహదూర్పై కోర్టు విచారణ జరిగింది. ఆయన చేసిన ఆరోపణలన్నీ తప్పుడువని తేలడంతో కేంద్రం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ‘వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నది జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలియజెప్పడానికే. నేను ఈ ఎన్నికల్లో గెలవకపోవచ్చు. కానీ ఒక సందేశాన్నయితే పంపించగలను’ అని యాదవ్ అన్నారు. ► బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ)కి చెం దిన ప్రొఫెసర్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కూడా ఈసారి వారణాసి బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ఫ్లోరోసిస్ బాధితులూ.. 2017లో తమిళనాడుకి చెందిన వంద మందికి పైగా రైతు లు ఢిల్లీలో చేసిన నిరసన ప్రదర్శనలు గుర్తున్నాయి కదా.. ఎన్ని రోజులు పస్తులుంటూ నిరాహార దీక్ష చేసినా కేంద్రం వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కసితో వాళ్లంతా పి.అయ్యకన్ను నేతృత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఎన్ని కల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు చెందిన ఫ్లోరోసిస్ బాధితులు తమ దుర్భర జీవితాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి వారణాసి బరిని ఎంచుకున్నారు. వడ్డే శ్రీనివాస్, జలగం సుధీర్ తదితర సామాజిక కార్యకర్తల నేతృత్వంలో ఎన్నికల్లో మోదీతో పోటీకి సై అంటున్నారు. ఫ్లోరోసిస్పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న లక్ష్యం తోనే వీరు వారణాసిని ఎంచుకున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈసారి వారణాసిలో మోదీని ఎదుర్కొంటున్నారు. తన ఆవేశపూరిత ప్రసంగాలతో దళిత యువతను ఆకర్షిస్తున్నారు. ‘మోదీ ఓటమికి రోజులు దగ్గర పడ్డాయ్‘ అని ఆజాద్ తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమంటే గంగ ప్రక్షాళన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, క్లీన్ గంగ ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం మహంత్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కాంగ్రెస్ టికెట్పై వారణాసి నుంచి పోటీ చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రంగస్థలంలో మోదీ డూప్లికేట్ అభినందన్ పాఠక్ గుర్తున్నారా? అచ్చు గుద్దినట్టు మోదీ పోలికలతోనే ఉంటారు. ఆయన రూపురేఖలు, వేసుకునే దుస్తులు, నడక, నడత, పలుకు అన్నీ మోదీనే తలపిస్తాయి. తన ప్రసంగాలను కూడా మిత్రాన్ అనే మొదలు పెడతారు. ఒకప్పుడు మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ ఏడాది కిందటే రూటు మార్చి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన కూడా వారణాసిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న మోదీ వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. అదే రోజు ఈ డూప్లికేట్ మోదీ కూడా నామినేషన్ వేయడానికి సన్నాహా లు చేస్తున్నారు. ‘నేను డమ్మీ అభ్యర్థిని కాను. మోదీ పోలికలతో పుట్టడం నా శాపమేమో. చాలామంది నన్ను అడుగుతున్నారు. అచ్చేదిన్ ఎక్కడా అని. ప్రధాని తాను ఇచ్చి న హామీలు నెరవేర్చకపోతే నేనేం చేయాలి. అందుకే వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయదలచుకున్నా. ఆ కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల గెలిస్తే రాహుల్గాంధీ కే మద్దతు ఇస్తా’ అని అన్నారు. గతంలో యూపీలోని గోరఖ్పూర్ ఉప ఎన్నికల్లో ఈ అభినందన్ బీజేపీకి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం విశేషం. బరిలో ప్రొఫెసర్లు, సైనికులు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్నికల బరిలో ఢీకొనడానికి ఎంతోమంది కదనోత్సాహంతో వారణాసికి కదిలి వెళుతున్నారు. వీరిలో ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి, తమిళనాడుకి చెందిన కొందరు రైతులు, కేంద్రం ఉద్యోగం నుంచి తొలగించిన సరిహద్దు భద్రతా జవాను, ఫ్లోరోసిస్ బాధితులు.. ఇలా చాలామందే ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement