నాకెంతో ఇష్టమైన చోటుకు చేరుకున్నా : ప్రధాని
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో వారణాసి లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. చివరి దశ (ఏడో దశ)లో భాగంగా మే 19న ఇక్కడ ఎన్నిక జరగనుంది. మోదీ శుక్రవారం (రేపు) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం సాయంత్రం భారీ రోడ్షో నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కాషాయ కోలాహలంతో నిండిపోయింది. ‘దర్భంగా, బందాలో భారీ బహిరంగ సభల అనతరం తనకెంతో ఇష్టమైన కాశీకి చేరుకున్నా. లక్షలాది మంది నా సోదర, సోదరీమణులను కలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. హరహర మహదేవ్’ అంటూ ట్వీట్ చేశారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన మదన్పురా, సోనార్పురాతో పాటు 150కి పైగా ప్రదేశాలగుండా ఈ ర్యాలీ సాగనుంది. కాశీలో గంగా హారతి అనంతరం మూడు వేల మంది ఇంటలెక్చువల్స్తో భేటీ అయి మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కాశీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్షో జరిగే ప్రాంతమంతా డ్రోన్లతో నిఘావేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, పీయూష్ గోయల్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, బిహార్ సీఎం నితీష్కుమార్, శిరోమణి అకాళీదళ్ చీఫ్ ప్రకాశ్ బాదల్, లోక్ జనశక్తి చీఫ్ రామ్విలాస్ పాశ్వాన్ తదితరులు పాల్గొననున్నారు.
After bumper rallies in Darbhanga and Banda, I am heading to beloved Kashi.
There are a series of programmes lined up, which would give me another excellent opportunity to interact with my sisters and brothers of Kashi.
Har Har Mahadev!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 25, 2019