breaking news
	
		
	
  Union Budget -2017
- 
      
                   
                                 అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు
 తాజా రైల్వే బడ్జెట్లో కేటాయింపు
 
 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గం నిర్మాణానికి తాజా రైల్వే బడ్జెట్లో రూ.2,680 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు విజయవాడ–అమరావతి–గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. 2016–17 బడ్జెట్లో ఈ రైల్వే లైన్కు సర్వే మంజూరవగా.. ఇటీవలే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సర్వే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక అందించింది.
 
 ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో ఈ మార్గానికి నిధులు కేటాయించడంతో నాలుగేళ్లలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కానుంది. ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖతో ఇటీవలే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు నడికుడి–శ్రీకాళహస్తి, కడప–బెంగళూరు, కోటిపల్లి–నర్సాపురం, అమరావతికి రైల్వే కనెక్టివిటీ... ఈ నాలుగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.
- 
  
      ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు
- 
      
                   
                                 ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు
 న్యూఢిల్లీ :
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం పూర్తి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. గత బడ్జెట్లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు గత బడ్జెట్లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం.
 
 దక్షిణ మధ్య రైల్వేలో పలు ప్రాజెక్టులకు బడ్జెట్లో మంజూరైన నిధులు...
 
 -నడికుడి- శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైన్కు రూ.340కోట్లు
 
 -కడప-బెంగళూరు మధ్య రైల్వేలైన్కు రూ.240కోట్లు
 
 -కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వేలైన్కు రూ.150కోట్లు
 
 -గుంటూరు-గుంతకల్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు రూ.124కోట్లు
 
 -కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్కు రూ.430 కోట్లు
 
 -ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు రైల్వేలైన్కు రూ.100 కోట్లు
 
 -గుంటూరు-తెనాలి రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు రూ.50కోట్లు
 
 -తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7 కోట్లు
 
 -గూడూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.2.7 కోట్లు
 
 -విజయవాడ-గుడివాడ లైన్ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగింపునకు రూ.130 కోట్లు
 
 -తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు
 
 -కాజీపేట- విజయవాడ మూడో లైన్కు రూ.100 కోట్లు
 
 -కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి
 
 - కొండపల్లి-కిరండోల్ మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి
 
 - మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి
 
 - హిందూపురం- చిత్రదుర్గం మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి
 
 -మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి
 
 - ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్లకు రూ.19 కోట్లు
 
 -మునిరాబాద్- మహబూబ్ నగర్ రైల్వే లైన్కు రూ. 300 కోట్లు
 
 -మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్కు రూ.350 కోట్లు
 
 -అక్కన్న పేట-మెదక్ రైల్వే లైన్కు రూ. 196 కోట్లు
 
 -భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్కు రూ. 300 కోట్లు
 
 -కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్కు రూ.120 కోట్లు
- 
      
                   
                                 'ఆయన ఇప్పుడు పంక్చరైన టైరు'
 హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు గాలితో నిండిన టైర్లా ఉన్న ప్రధాన మంత్రి మోదీ, బడ్జెట్ తర్వాత పంక్చర్ అయిన టైర్ మాదిరిగా ఉన్నారని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ నిరర్ధకమైనది , ఏ దిశా లేనటువంటిదిగా ఉందన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో బడ్జెట్ పై ఉన్న ఆశలను కేంద్రం నీరు గార్చిందని, ప్రజలకు నిరాశ, నిస్పృహలనే మిగిల్చిందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల వల్ల కేంద్రానికి ఏటా రూ. లక్షకోట్లు ఆదా అయ్యాయి, అయినప్పటికీ బడ్జెట్ లో సామాన్యులకు ఊరట లభించలేదన్నారు.
 
 ఆర్ధిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉందన్నారు. 70 సంవత్సరాలలో ఏనాడు ఇలాంటి నిరాశాపూరిత బడ్జెట్ చూడలేదన్నారు. కొత్త రైల్వే లైన్ లు లేవు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలే వాటి సామర్ధ్యం మేరకు పనిచేయడం లేదన్నారు. నోట్లరద్దు వల్ల 6 నెలలు కష్టాలు, 3 నెలలు నష్టాలు వచ్చాయన్నారు. ఆలోచన లేని తొందరపాటుతో అహంభావి అయిన ప్రధాని తీసుకున్న వినాశక చర్యే నోట్లరద్దు అని అన్నారు.
 
 దానికి మద్దతిచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఎం లాభం జరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలిటికల్ ఫండింగ్లో సంస్కరణలు నామమాత్రమేనని, నల్లధనం పార్టీల ద్వారా ప్రవహించడం లేదని, రూ. 20 వేలకు బినామీలను వెతుక్కున్న పార్టీలు ఇప్పుడు రూ. 2 వేలకి కూడా వెతుక్కుంటాయని జోస్యం చెప్పారు.
- 
      
                   
                                 సబ్ కే సాత్ సబ్ క వికాస్లా బడ్జెట్
 హైదరాబాద్: మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు సానుకూలంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇది భారత రాజకీయ, ఆర్దిక సంస్కరణల బడ్జెట్ అని ప్రజలు దీన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సబ్ కే సాత్ సబ్ క వికాస్లా బడ్జెట్ ఉందని.. సానుకూల సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.
 
 దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందాలని.. 2018 లోపు ఏ గ్రామం కరెంట్ లేకుండా ఉండకూడదని సర్కార్ తీసుకున్న నిర్ణయం అద్భుతమని కొనియాడారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదని.. మోదీ నిర్ణయాలకు కాంగ్రెస్ సహకరించాలని రాజకీయ పార్టీలు తప్పు చేస్తే దేశానికే ముప్పన్నారు.
- 
  
      మొబైల్స్, సిగరెట్లు ప్రియం
- 
  
      బడ్జెట్లో రైల్వే హైలెట్స్..
- 
      
                   
                                 బడ్జెట్ బాత్...
 ఏం మాట్లాడుతున్నారు?
 పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన కష్టాలు తాత్కాలికమేనని, ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపలేదని అరుణ్ జైట్లీ అంటున్నారు. ఆయన ఏం చూసి ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బడ్జెట్పై నేను వెంటనే స్పందించలేను.
 – మన్మోహన్సింగ్
 
 దశ, దిశ లేదు..
 ఈ బడ్జెట్ తీవ్ర నిరా శకలిగించేలా ఉంది. దశ, దిశ లేదు. రైతులకు మేలు కలిగించే చర్యలేవీ లేవు. యువత కు ఉద్యోగ కల్పన విషయంలో భరోసా ఎక్కడా కనిపించలేదు. జైట్లీ కవితలు చదివి సరిపెట్టారు. ఏమాత్రం ముందు చూపులేని బడ్జెట్ ఇది. 
 – రాహుల్ గాంధీ
 
 అంతా డొల్ల
 బడ్జెట్ అంతా వట్టి డొల్ల. బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి మేలు జరగదు. రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనప్పుడు ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతారు? పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ, ట్రంప్ కవల పిల్లల్లా ఉన్నారు.
 – లాలూ ప్రసాద్ యాదవ్
 
 నిరాశ కలిగించింది
 బడ్జెట్ నిరాశకలిగించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎంతమొత్తంలో నల్లధనాన్ని రాబట్టారో వివరాలు ఇవ్వలేదు. నోట్ల రద్దును సమర్థించిన వారిని నిరాశకు గురిచేశారు. సాధారణ బడ్జెట్తో రైల్వే బడ్జెట్ను కలిపేసి కేంద్ర ప్రభుత్వం రైల్వేలను నాశనం చేసిందని అన్నారు.
 – నితీశ్ కుమార్
 
 అంతా గిమ్మిక్కే
 బడ్జెట్ అంతా గిమ్మిక్కే. ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించి నిర్ధిష్ట చర్యలు లేవు. పైగా ప్రభుత్వం ఆదా యం పెంచుకోవడానికి పరోక్ష పన్నులను పెంచడంతో ప్రజలపై భారం పెరుగుతుం ది. ప్రధాని బాటలో జైట్లీ పయనిస్తున్నారు. మాటల గారడీకే పరిమితమయ్యారు.
 – సీతారాం ఏచూరి
 
 పనికిమాలిన బడ్జెట్
 దారీ, తెన్నూ లేని పనికిమాలిన బడ్జెట్ ఇది. దేశాభివృద్ధికి దోహదపడే చర్యలు లేవు. అంతా డొల్ల. మోదీ ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. ప్రజలకు నోట్ల రద్దు కష్టాలు ఇంకా తీరలేదు. తక్షణం ఆంక్షలు అన్నీ ఎత్తివేయాలి.
 – మమతా బెనర్జీ
 
 మౌలికానికి 3.96 లక్షల కోట్లు
 న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల వృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రికార్డు స్థాయిలో మొత్తం రూ. 3,96,135 కోట్లు కేటాయించామని, కేంద్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రాధాన్యతా రంగమని చెప్పారు. రైల్వేలు, రోడ్లు, నదులు దేశానికి జీవనాడి వంటివని అన్నారు. మౌలిక సదుపాయాలకు 2016–17 బడ్జెట్ అంచనాలు రూ. 3,48,952 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ. 3,58,634 కోట్లు అని తెలిపారు. మౌలికసదుపాయాల రంగంలో భారీ కేటాయింపులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నాయని, దీనివల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
 
 ప్రాంతీయ విమానం.. పైపైకి
 న్యూఢిల్లీ: ప్రాంతీయంగా విమానయాన అనుసంధాన పథకానికి సర్వీస్ ట్యాక్స్ మినహాయించారు. ఈ మినహాయింపు ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ప్రయాణికులకు సదుపాయంగా తీర్చిదిద్దడం, నష్టాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానిస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వీజీఎఫ్పై విధించే 14శాతం సర్వీస్ ట్యాక్స్ను మినహాయిస్తున్నట్లు 2017–18 బడ్జెట్లో ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు.
 
 స్వచ్ఛ ఇంధనానికి దన్ను
 న్యూఢిల్లీ: స్వచ్ఛ, పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు జైట్లీ తాజా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. సోలార్ పార్క్ డెవలప్మెంట్ రెండో దశ కింద 20వేల మెగావాట్ల సౌరవిద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో వాడే పరికరాలపై పరోక్ష పన్నులను జైట్లీ భారీగా తగ్గించారు. సోలార్ సెల్స్ / ప్యానళ్లు / మ్యాడ్యూల్స్ తయారీకి వాడే సోలార్ టెంపర్డ్ గ్లాస్పై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న మూల కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ) పూర్తిగా రద్దు చేశారు. విద్యుత్ శాఖకు రూ. 13,881 కోట్లు, నూతన, పునర్వినియోగ మంత్రిత్వ శాఖకు రూ. 5,473 కోట్లు కేటాయించారు.
- 
      
                   
                                 ద.మ. రైల్వేకు 5,135 కోట్లు
 తెలంగాణకు రూ.1,729 కోట్లు.. ఏపీకి రూ.3,406 కోట్లు
 
 సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి భారీ నిధులే దక్కాయి. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. విడిగా రైల్వే బడ్జెట్లు ప్రవేశపెట్టిన సమయాల్లో ఎప్పుడూ దక్షిణ మధ్య రైల్వేకు ఇంతమొత్తం కేటాయించిన దాఖలా లేదు. అయితే ఈ నిధులను ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయించారనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. పద్దులను ఇంకా సభకు సమర్పించనందున ఆ వివరాలను వెల్లడించలేదు.
 
 శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం వాటిని బహిర్గతం చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కేటాయించిన మొత్తం నిధులను కొత్త ప్రాజెక్టులు, గత బడ్జెట్లలో ప్రకటించిన ప్రధాన లైన్ల నిర్మాణానికి కేటాయిస్తే మాత్రం ఈసారి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత బడ్జెట్లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు గత బడ్జెట్లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం.
 
 భద్రతకు ప్రాధాన్యం: జీఎం
 ప్రయాణికులకు పూర్తి భద్రతతో కూడి న రైల్వే సదుపాయం, సేవలు, నాణ్యమైన, మెరుగైన సదుపాయాలను కల్పించడమే లక్ష్యం గా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వేజీఎం వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వేల అభివృద్ధికి సముచితమైన నిధులను కేటాయించారని సంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో రైల్వే ప్రాధాన్యతలపై బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేల అభివృద్ధి కోసం కేటాయిం చిన బడ్జెట్లో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రైల్ సంరక్షణ ఫండ్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొ న్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 355 కాపలాలేని రైల్వే క్రాసింగ్లు ఉన్నాయని, దశలవారీగా 2020 నాటికి మొత్తం తొలగించ నున్నట్లు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వేలో 4,138 కోచ్లకు ఇప్పటి వరకు బయో టాయిలెట్ సదుపాయం ఉందని, మరో 3 వేల కోచ్లకు ఆ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
- 
      
                   
                                 హైవేలు రయ్.. రయ్..
 జాతీయ రహదారులకు రూ. 64,900 కోట్లు
 
 గత ఏడాదికన్నా 12శాతం అధికం
 
 పీఎంజీఎస్వైకి రూ.19,000 కోట్లు
 
 కొత్తగా 2 వేల కి.మీ.ల తీరప్రాంత కనెక్టివిటీ రోడ్లు
 
 న్యూఢిల్లీ: 2017–18లో నేషనల్ హైవేలకు కేటాయింపులను 12 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు. మొత్తం కేటాయింపులు రూ. 64,900 కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. హైవేల రంగానికి సంబంధించి 2016–17 బడ్జెట్ అంచనాలు రూ.57,976 కోట్లుగా ఉండగా.. సవరించిన అంచనాలు రూ. 52,447 కోట్లు అని ఆయన తెలిపారు. 2017–18 బడ్జెట్ అంచనాలను రూ. 64,900 కోట్లకు పెంచుతున్నాం.’’ అని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రైల్వేలు, రహదారులు, షిప్పింగ్ కలపి మొత్తం రవాణా రంగానికి సంబంధించి కేటాయింపులు రూ. 2.41 లక్షల కోట్లకు చేరుకున్నట్లు జైట్లీ తెలిపారు.
 
 2,000 కిలోమీటర్ల మేర తీరప్రాంతాలను కలిపే రహదారులను గుర్తించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని నిర్మించి అభివృద్ధి చేస్తామని జైట్లీ వెల్లడించారు. దీనివల్ల దూరప్రాంతాలలోని గ్రామాలకు నౌకాశ్రయాలున్న ప్రాంతాలకు మధ్య రహదారుల సదుపాయాలు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద నిర్మించిన రహదారులు సహా 2014–15 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 1,40,000 కి.మీ.లకు పైగా రహదారులను నిర్మించామని, అంతకుముందు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువని జైట్లీ పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో 100మందికి పైన ఉండే తండాలను కలుపుతూ రహదారులను నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ వివరించారు. 2017–18లో పీఎంజీఎస్వైకి రూ.19,000 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రాల వాటాతో కలిపి 2017–18లో ఈ పథకం కింద రూ.27,000 కోట్లను వెచ్చించనున్నామని వివరించారు.
 
 విమానాశ్రయాల నిర్వహణలో ‘ప్రైవేటు’
 ఎంపిక చేసిన ద్వితీయశ్రేణి నగరాలలోని విమానాశ్రయాలలో కార్యకలాపాల నిర్వహణ ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్నట్లు జైట్లీ వెల్లడించారు. భూముల రూపంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వీలు కల్పించేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించారు.
- 
      
                   
                                 ఇదీ రైల్వే బడ్జెట్
 
 ఐఆర్సీటీసీతో చేసే టికెట్ బుకింగ్లపై నో సర్వీస్ చార్జి
 
 దివ్యాంగులకు ఉపయుక్తంగా
 
 ఉండేలా 500 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
 
 2020 నాటికి కాపలాలేని లెవెల్క్రాసింగ్ల తొలగింపు
 
 న్యూఢిల్లీ: 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రణాళికను సాధారణ బడ్జెట్లో భాగంగా బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం కన్నా పదివేల కోట్ల రూపాయలు అధికంగా.. రూ. 1.31 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్ను జైట్లీ ప్రకటించారు. అందులో రూ. 55 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అందిస్తుంది. ఇటీవలి వరుస ప్రమాదాల నేపథ్యంలో ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో ప్రత్యేక జాతీయ రైలు భద్రత నిధి(నేషనల్ రైల్ సేఫ్టీ ఫండ్)ని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. ట్రాక్స్తో పాటు సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణ, కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల సంపూర్ణ తొలగింపు.. తదితర అవసరాలకు ఆ నిధిని వినియోగించనున్నారు.
 
 అలాగే, 2017–18 సంవత్సరంలో 3500 కిమీల మేర రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. గత సంవత్సరం అది 2800 కిమీలుగా ఉంది. రైల్వేలో ఇకపై ప్రధానంగా ప్రయాణికుల భద్రత, అభివృద్ధి పనులు, స్వచ్ఛత, ఆర్థిక, అకౌంటింగ్ సంస్కరణలపై దృష్టి పెట్టనున్నామని జైట్లీ చెప్పారు. కాగా, బడ్జెట్లోని రైల్వేలకు సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వాగతించారు. ప్రతిపాదిత భద్రత నిధి ప్రమాదాలను తగ్గించడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు ఉపకరిస్తుందన్నారు. రైల్వే బడ్జెట్ను విలీనం చేయడంపై స్పందిస్తూ.. ఇప్పుడు దాదాపు ప్రపంచమంతటా ఇదే విధానం అమలవుతోందన్నారు. రైలు, రోడ్డు, విమాన, జల మార్గాల అనుసంధానంతో నూతన విధానం దిశగా వెళ్తున్నామన్నారు. విలీనం వల్ల.. ఇకపై ఆర్థిక శాఖకు రైల్వే శాఖ డివిడెండ్లను చెల్లించాల్సిన అవసరం ఉండబోదని వెల్లడించారు.
 
 ఇతర ముఖ్యాంశాలు..
 ► ఈ టికెటింగ్ను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జి మినహాయింపు. ఇప్పటివరకు స్లీపర్ కోచ్లకు రూ. 20, ఏసీ క్లాస్లకు రూ. 40 సర్వీస్ చార్జీగా ఉంది. తాజా మినహాయింపుతో ఐఆర్సీటీసీ ఏటా రూ. 500 కోట్ల వరకు నష్టపోనుంది.
 ► స్టాక్ ఎక్సేంజ్ల్లో రైల్వేలకు చెందిన సంస్థలైన ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), ఐఆర్ఎఫ్సీ(ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్), ఇర్కాన్ల నమోదు.
 ► ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా త్వరలో నూతన మెట్రో రైలు విధానం. మెట్రో రైలు వ్యవస్థలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రస్తుత చట్టాలను మార్చి కొత్త చట్టం రూపకల్పన.
 ► 500 రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం లిఫ్ట్లు, ఎస్కలేటర్లు.. తదితర సౌకర్యాల ఏర్పాటు.
 ► రైలు సేవలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులు, సేవల కొరకు త్వరలో ‘క్లీన్ మిత్ర’ సింగిల్విండో.
 ► పర్యాటక, ఆధ్యాత్మిక పర్యటనల కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.
 ► న్యూఢిల్లీ, జైపూర్ రైల్వేస్టేషన్లలో బయోడీగ్రేడబుల్ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటు.
 ► ఎంపిక చేసిన సరుకులకు సంబంధించి పూర్తిస్థాయి రవాణాకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటు.
 
 2019 నాటికి అన్ని బోగీల్లో బయో టాయిలెట్ల ఏర్పాటు. ‘క్లీన్ మై కోచ్’ యాప్ ద్వారా స్వచ్ఛతకు సంబంధించిన సేవలు పొందే అవకాశం
 2020 నాటికి బ్రాడ్గేజ్ నెట్వర్క్లోని అన్ని కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల తొలగింపు
- 
      
                   
                                 ఆ ఇళ్లు ‘అందుబాటు’లోనే
 అఫర్డబుల్ హౌసింగ్కు ఇన్ఫ్రా పరిశ్రమ హోదా
 
 ఆ రంగానికి చౌకగా దక్కనున్న రుణాలు
 
 బిల్టప్ ఏరియాను కార్పెట్ ఏరియాగా మార్చిన జైట్లీ
 
 దీంతో ఇంకాస్త పెద్ద ఇళ్లు కూడా అందుబాటు పరిధిలోకి
 
 పీఎంవైఏకు రూ.23 వేల కోట్లు కేటాయింపు
 
 సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు బడ్జెట్ మార్గం సుగమం చేసిందనే చెప్పాలి. 2019 నాటికి దేశంలో కోటి గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ చెప్పగా... జైట్లీ దానికి రోడ్మ్యాప్ వేశారు. అందుకు అనుగుణంగానే అందుబాటు గృహాల విభాగానికి మౌలిక రంగ హోదానిచ్చారు. గతేడాది రూ.15 వేల కోట్లుగా ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంవైఏ) కేటాయింపును ఈసారి బడ్జెట్లో రూ.23 వేల కోట్లకు పెంచారు. అలాగే అందుబాటు గృహాలను నిర్మించే డెవలపర్లను ప్రోత్సహించేందుకు గాను 80–ఏబీఏ సెక్షన్ను సవరించారు కూడా. ప్రస్తుతం మూడేళ్లుగా ఉన్న అందుబాటు ఇళ్ల ప్రాజెక్ట్ నిర్మాణ గడువును 5 ఏళ్లకు పెంచారు.
 – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 
 మెట్రోలో 30 చ.మీ., నాన్మెట్రోలో 60 చ.మీ.
 గతేడాది బడ్జెట్లో అందుబాటు ఇళ్లను ప్రోత్సహించేందుకు ఆదాయ పన్ను రాయితీలను కల్పించిన జైట్లీ.. ఈసారి అందుబాటు గృహాల బిల్టప్ ఏరియాలను కార్పెట్ ఏరియాలుగా మార్పు చేశారు. అంటే గతంలో 30 చ.మీ., 60 చ.మీ. బిల్టప్ ఏరియాలుంటే అందుబాటు గృహాలుగా పరిగణించేవి కాస్త తాజా బడ్జెట్తో మెట్రో నగరాల్లో 30 చ.మీ., నాన్మెట్రో నగరాల్లో 60 చ.మీ. కార్పెట్ ఏరియాలుగా ఉండాలన్నమాట. ఒక చదరపు మీటరంటే 9 చదరపు అడుగులు. ఈ లెక్కన 60 చదరపు మీటర్లంటే 540 చదరపు అడుగుల ఇళ్లన్న మాట. గతంలో సింగిల్ బెడ్ రూమ్ మాత్రమే అందుబాటు ఇళ్ల పథకం కిందకు వచ్చేది.
 
 ఎటూ చాలదనే భావనతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతుల వారు కొనేవారు కాదు. దాంతో డిమాండ్ లేక వీటి నిర్మాణానికి సంస్థలు కూడా సాహసించలేని పరిస్థితి ఉంది. తాజా మార్పుతో దాదాపు 900 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ( 650 – 700 అడుగుల కార్పెట్ ఏరియా) అవుతుంది. ఈ విస్తీర్ణంలో చిన్న డబుల్ బెడ్ రూమ్స్ వస్తాయి. దీంతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతి వారు ఈ పథకం కింద ఇళ్ల కొనుగోలుకు ముందుకు వస్తారని, నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 
 2001 నాటి మార్కెట్ రేటు ఆధారంగా
 ఇప్పటివరకు 1980 కంటే ముందుకొన్న ఫ్లాట్, ప్లాట్ ఏదైనా స్థిర, చరాస్తులను ఎప్పుడు విక్రయించినా సరే 1981 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ రేటు ఆధారంగా మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్) విలువలను లెక్కగట్టేవారు. కానీ, తాజా బడ్జెట్లో విలువ లెక్కింపు సంవత్సరాన్ని 2001 ఏప్రిల్ 1కి మార్చారు. దీంతో విక్రయదారుడికి సరైన మార్కెట్ రేటు వస్తుంది. గతంలో మూడేళ్లుగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ పన్ను ప్రయోజనాలను 2 ఏళ్లకు కుదించారు. మూడేళ్ల కంటే ఎక్కువున్న స్థిరాస్తుల దీర్ఘకాలిక మూలధన లాభాలు 20 శాతం చెల్లించాలి.
 
 మౌలిక రంగ హోదాతో ఏం జరుగుతుంది?
 మౌలిక రంగ హోదా ఇవ్వటం వల్ల అఫర్డబుల్ ఇళ్లను నిర్మించే కంపెనీలకు ఇన్ఫ్రా రంగానికిచ్చే వడ్డీ రేటుతో రుణాలు లభించే అవకాశముంటుంది. అంటే తక్కువ వడ్డీకే అన్నమాట. దీనివల్ల అవి నిర్మాణానికి ముందుకొస్తాయి. ఆ మేరకు కలిగే లాభాన్ని వినియోగదారులకు బదలాయించే అవకావం కూడా ఉంటుంది. 
 
 రూ.20 వేల కోట్ల గృహ రుణాలు..
 గృహ రుణాలు అందించే బ్యాంకులకు 2017–18కి గాను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలను అందించనున్నారు. మధ్య ఆదాయ వర్గాల కోసం కొత్తగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రూ.1,000 కోట్లు కేటాయించారు. అలాగే నివాస విభాగంలో అమ్ముడుపోకుండా ఉండిపోయే ఇళ్లపై (ఇన్వెంటరీ) పన్ను రాయితీలను ప్రకటించారు. కంప్లీషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఖాళీగా ఉన్న ఇళ్లపై అద్దెను ఆదాయ పన్నుకు లోబడి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోగానే ల్యాండ్ ఓనర్ చెల్లించే మూలధన రాబడిని కాస్త ప్రాజెక్ట్ పూర్తయ్యాక చెల్లించే వీలును కల్పించారు.
 
 కార్పెట్..బిల్టప్ అంటే..
 సాధారణంగా కార్పెట్ ఏరియా అంటే గోడలు కాకుండా మనం ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ బిల్టప్ ఏరియా అంటే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని బిల్టప్ ఏరియాగా పరిగణిస్తారు. ఇందులో బాల్కనీ కూడా వస్తుంది. ఈ లెక్కన చూస్తే గతంలోకన్నా కాస్తంత పెద్ద ఇళ్లు ఇపుడు అందుబాటు గృహాల పరిధిలోకి వస్తాయన్న మాట. ఆ మేరకు వాటికి వర్తించే ప్రోత్సాహకాలు, రాయితీలు దీనికీ వర్తిస్తాయి. సూపర్ బిల్టప్ ఏరియా అంటే మాత్రం లాబీ, లిఫ్టు, మెట్లు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్హౌస్ వంటి అన్ని రకాల వసతులకు కేటాయించే స్థలాన్ని కూడా కలుపుతారు.
- 
      
                   
                                 యువ ‘సంకల్ప్’
 
 రూ. 4 వేల కోట్లతో నైపుణ్య వృద్ధి పథకం
 
 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ
 
 యువతకు ‘స్కిల్’ కేంద్రాలు
 ‘త్రీ ఇడియట్స్లో’ పున్షుక్ వాంగ్డూ తెలుసు కదా!! అనుభవాలనే ప్రయోగాలుగా మారుస్తుంటాడు. అలాంటివాళ్లను తయారు చెయ్యటానికి సైన్స్పై ఫోకస్ పెట్టి... స్థానిక ఆవిష్కరణల్ని కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తామని జైట్లీ చెప్పారు. 600 జిల్లాల్లో ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలు... 100 అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి... వీటిలో అత్యాధునిక శిక్షణతో పాటు విదేశీ భాషలు కూడా నేర్పిస్తారట. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల్ని అనుసంధానిస్తామన్నారు. కాకపోతే ఇపుడు ఐటీఐల పనితీరు అంతంతమాత్రమన్నది తెలియనిదేమీ కాదు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ... ఈ శిక్షణ పొందిన వారికి ఉపాధి కూడా ముఖ్యమే కదా?
 
 దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న యువత శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ‘సంకల్ప్’పథకాన్ని ప్రారంభించనుంది. 3.5 కోట్ల మందికి మార్కెట్ అవసరాలకు సరిపోయే శిక్షణ ఇచ్చేందుకు రూ. 4 వేల కోట్లతో స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్(సంకల్ప్)ను 2017–18లో ప్రారంభించనున్నట్లు జైట్లీ తెలిపారు. సామాన్యులకు ఉపయోగపడని విద్యతో ఏం ప్రయోజనముందన్న వివేకానందుడి మాటలను ఆయన ఉటంకించారు. 
 – న్యూఢిల్లీ
 
 యువత నైపుణ్యాల అభివృద్ధి కోసం జైట్లీ చేసిన మరికొన్ని ప్రతిపాదనలు..
 ► ప్రస్తుతం 60 జిల్లాల్లో ఉన్న ప్రధాన్మంత్రి కౌశల్ కేంద్రాలను 600కుపైగా జిల్లాలకు విస్తరించడం.
 ► విదేశాల్లో ఉద్యోగాల కోసం యత్నించే వారికి అధునాతన శిక్షణ, విదేశీ భాషా కోర్సులు అందించేందుకు దేశవ్యాప్తంగా 100 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు.
 ► పరిశ్రమల కోసం నైపుణ్యాల వృద్ధికి సంబంధించిన స్కిల్ స్ట్రెంగ్తెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్(స్ట్రయివ్) పథకం రెండో దశ ప్రారంభం. దీని కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు. దీని కింద ఐటీఐలలో ఇచ్చే శిక్షణను బలోపేతం చేస్తారు.
 ► పాఠశాలల్లో అభ్యసన ఫలితాల విశ్లేషణ కోసం వార్షిక మూల్యాంకన విధానం. స్థానికంగా నవకల్పనల ప్రోత్సాహం, లింగ సమానత్వం కోసం ‘ఇన్నోవేషన్ ఫండ్ సెకండరీ ఎడ్యుకేషన్’ఏర్పాటు, విద్యాపరంగా వెనకబడిన 3,479 బ్లాకులపై ప్రత్యేక దృష్టి. ‘స్వయం’ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా 350 కోర్సులు.
 కాగా, ప్రపంచ బ్యాంకు మద్దతు ఉన్న సంకల్ప్, స్ట్రయివ్ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు దేశం లో నైపుణ్యాల అభివృద్ధికి విస్తృతంగా దోహదం చేస్తాయని నైపుణ్యాల అభివృద్ధి, వ్యవస్థాపన మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ పేర్కొన్నారు.
- 
      
                   
                                 మొబైల్స్, సిగరెట్లు ప్రియం
 న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు వాడేవారికి ఇది చేదువార్తే. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈ బడ్జెట్లో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచారు. మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ బల్బుల ధరలకూ రెక్కులు రానున్నాయి. మొబైల్స్లో వాడే పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)లు, ఎల్ఈడీ బల్బుల విడి భాగాల దిగుమతిపై సుంకం భారీగా పెంచడం వల్ల ఇవి ప్రియం కానున్నాయి. మరోవైపు జైట్లీ... సహజసిద్ధ ఇంధన వనరుల వినియోగంపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్ల బుకింగ్పై సర్వీస్ చార్జీలను ఎత్తివేశారు.
 
 ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్స్లో ఉపయోగించే ఫిల్టర్లపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అలాగే దేశీయ ఆర్ఓ ఫిల్టర్లను ప్రోత్సహించేందుకు దిగుమతులపై పన్నును 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. తోళ్ల పరిశ్రమకు ఊతమిచ్చేలా వీటి ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలపై 7.5 శాతం ఉన్న పన్నును 2.5 శాతానికి తగ్గించారు. రక్షణ రంగంలోని వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలపైనున్న 14 శాతం సేవా పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.
 
 భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకం...
 ముడి పొగాకుపై 4.2 శాతం నుంచి ఏకంగా 8.3 శాతానికి... పాన్ మసాలాలపై 6 శాతం నుంచి 9 శాతానికి ఎక్సైజ్ సుంకాలు పెంచారు. ఇక ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని నిర్ణయించారు. చేతితో తయారుచేసే కాగితం చుట్టిన బీడీలపై ఎక్సైజ్ పన్నును వెయ్యికి రూ.21 నుంచి రూ.28 చేశారు. అలాగే దిగుమతి చేసుకున్న రోస్టెడ్, సాల్టెడ్ జీడిపప్పుపై సుంకాన్ని 30 శాతం నుంచి 45 శాతానికి పెంచారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే క్రమంలో దిగుమతి చేసుకునే వెండి నాణేలు, పతకాలు, వస్తువులపై కొత్తగా 12.5 శాతం సీవీడీ విధించారు.
 
 ఇవి ఖరీదు...
 ► మొబైల్ ఫోన్లు
 ► సిగరెట్, సిగార్, బీడీలు, ఖైనీ, పాన్ మసాలాలు
 ► దిగుమతి చేసుకున్న జీడిపప్పు (రోస్టెడ్, సాల్టెడ్)
 ► ఎల్ఈడీ బల్బులు, దిగుమతి చేసుకున్న వెండి నాణేలు, పతకాలు, వస్తువులు
 ► ముడి అల్యూమినియం
 ► ఆప్టికల్ ఫైబర్స్ తయారీలో ఉపయోగించే పాలిమర్ పూత కలిగిన ఎంఎస్ టేపులు
 
 ఇవి చౌక
 ► ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్, గృహావసరాలకు వినియోగించే ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లు
 ► సోలార్ ప్యానెల్లో ఉపయోగించే గాజు
 ► ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ
 ► గాలిమర ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్లు
 ► తోలు ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలు, స్వైపింగ్ మెషీన్లు, వేలిముద్రను చదివే పరికరాలు రక్షణ రంగంలోని వారికి గ్రూప్ ఇన్సూరెన్స్


