breaking news
Undrallu
-
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
ఓ బొజ్జ గణనాథుడా.. రావయ్యా..రా.. ఏటా ఖరీఫ్ ప్రారంభించి నాట్లు పడిన వెంటనే నువ్వు వస్తావని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లం. వర్షాలు అనుకూలించి పంటలు ఆశాజనకంగా ఉన్న వేళ ఆనందంతో నీ ఉత్సవాలు వైభవంగా చేసి, ఇష్టంగా కొలిచి, నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకం, పప్పుబూరెలు నైవేద్యంగా పెట్టేవాళ్లం. వాటిని ఆరగించి, మూసిక వాహనంపై ప్రయాణిస్తూ భక్తులకు వరాలు కురిపించేవాడి. ఈ ఏడాది వర్షాలు లేవు. వరినాట్లు సరిగ్గా పడలేదు. ఎరువుల కొరత, అధిక ధరలు. ఏమీ చేయాలో తోచని పరిస్థితి. ఈ తరుణంలో నీకు కష్టాలు చెప్పుకుందామనుకునేలోపే నిన్ను పిలవడానికే బాధేస్తుంది. వినాయక చవితికి వచ్చే నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకాలు పెట్టలేని స్థితి ఏర్పడింది. బెల్లం ధర అమాంతంగా పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.45లు ఉండే బెల్లం ధర ఇప్పుడు రూ.80 పలుకుతోంది. పప్పుల, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా మొర నువ్వైనా వింటావా.. గతంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ ఇంటికి నగదుసాయం అందేది. ఇప్పుడు ఏ సాయం లేదు. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. బెల్లానికి బదులు పంచదారతో ఉండ్రాళ్లు చేద్దామంటే పంచదార సైతం కిలో రూ.75లు పలుకుతోంది. కందిపప్పు కిలో ధర రూ.140లు పైబడి ఉంది. గతంలో రేషన్ దుకాణాల్లో పండగ సమయాల్లో బెల్లం, పంచదార, కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు. మేం ఎలాగూ కొనలేం... తినలేం. నీకు నైవేద్యం పెడదామన్నా ధరలు తట్టుకోలేకపోతున్నాం. పోనీ ఉత్తి బియ్యిం పిండి ఉండ్రాలు పెడదామంటే బియ్యం కిలో ధర రూ.60లు నుంచి రూ.70లు ఉంది. ఈ ధరాఘాతంలో మేం ఎలా బతికేది. మా మొర విని, ఈ ఏడాది నీ బొజ్జ నిండేట్టు పెట్టలేని మా బతుకులకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త ఆసరా ఇవ్వ తండ్రీ. ఇట్లు.. గట్టిగా పిలవలేక పిలుస్తున్న నీ భక్తులు -
Ganesh Chaturthi Recipes: తీపి ఉండ్రాళ్ల తయారీ విధానం!
Ganesh Chaturthi Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన తీపి ఉండ్రాళ్ల తయారీ విధానం కావలసినవి ►బియ్యంపిండి: 1 కప్పు ►నీళ్ళు: 1 కప్పు ►నెయ్యి: 2 గరిటెలు ►వంట సోడా: చిటికెడు ►ఉప్పు : చిటికెడు ►ఉండ్రాళ్ళలో నింపడానికి ►పచ్చి కొబ్బరి కోరు: 1 కప్పు ►కొబ్బరి పొడి : 1/2 కప్పు ►వేయించిన గసాలు : 1 గరిటెడు ►యాలకుల పొడి : 1/2 చెంచా తయారుచేసే విధానం : ►కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్లో వేడి చెయ్యాలి. ►ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ►ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ►ఉప్పు, నెయ్యి వేసి మరి గిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపు తుండాలి. ►తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. ►పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి చిన్న ఉండను తీసుకుని చిన్న బౌల్లాగా తయారు చేసి అందులో కొబ్బరి పాకాన్ని కొద్దిగా ఉంచి మూసివేసి, గుండ్రంగా ఉండ్రాళ్ళలా చుట్టాలి. ►లేదా మీకిష్టమైన ఆకృతుల్లో చేసి వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి. క్లిక్: Ganesh Chaturthi Recipes: రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి! -
ఉండ్రాళ్లు
కావలసినవి : బియ్యపురవ్వ– కప్పు; నీళ్లు – రెండు కప్పులు; శనగపప్పు – పావు కప్పు(నానబెట్టాలి); జీలకర్ర – టీ స్పూన్; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఉప్పు–కొద్దిగ; పచ్చికొబ్బరి – 3 టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా మందపాటి పాత్రలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, శనగపప్పు వేసి కొద్దిగా వేయించాలి. అందులో నీరు పోసి, ఉప్పు వేసి, మరుగుతుండగా, బియ్యపు రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. చల్లారాక చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి. వీటిని ఆవిరి మీద ఉడికించి, దించి, తీసుకోవాలి. బెల్లం తాలికలు కావలసినవి: బియ్యప్పిండి – గ్లాసు; గోధుమ పిండి – అర గ్లాసు; బెల్లం – 2 గ్లాసులు; ఎండు కొబ్బరి ముక్క లు – కొద్దిగా; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు, బాదంపలుకులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారి: అర గ్లాసు నీళ్లు పోసి, కొద్దిగా బెల్లం వేసి కరిగించాలి. దీంట్లో గోధుమపిండి వేసి చపాతీపిండిలా కలపాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ సన్నగా తాల్చాలి. గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీళ్లుపోసి మరుగుతుండగా బెల్లం కరిగించి, తాలికలను ఉడికించాలి. దీంట్లో బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం బాగా ఉడికాక, ఏలకుల పొడి వేయించిన బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు కలపాలి.


