breaking news
Udon Scheme
-
జాతీయ క్యారియర్గా ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా రెండున్నరేళ్ల కిందట ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ఆరంభించిన ట్రూ జెట్.. జాతీయ స్థాయి సంస్థగా ఆవిర్భవిస్తోంది. టర్బో మేఘా ఎయిర్లైన్స్కు చెందిన ఈ సంస్థ... తాజాగా మరో 20 రూట్లలో విమాన సేవలు ఆరంభించేందుకు అనుమతులు సాధించినట్లు ప్రకటించింది. ప్రాంతీయంగా కనెక్టివిటీకి ఉద్దేశించిన ఉడాన్ పథకం రెండో దశ కింద ఈ 20 రూట్లలో తాము లైసెన్సులు పొందినట్లు టర్బో మేఘా ఎయిర్వేస్ హెడ్ (కమర్షియల్ విభాగం) సెంథిల్ రాజా తెలియజేశారు. కొత్త రూట్లలో అహ్మదాబాద్ – పోర్బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గామ్, గౌహతి– కుచిహార్, బర్నపూర్, తేజు, తేజపూర్ తదితరాలున్నాయి. ‘‘ఇప్పటిదాకా ట్రూజెట్ ద్వారా 10 లక్షల మంది ప్రయాణించారు. తాజా రూట్లతో పశ్చిమ, తూర్పు తీరంతో పాటు ఈశాన్య భారత్లో కూడా సేవలు విస్తరించినట్లు అవుతుంది. ఈ నెల 25న చెన్నై–సేలం రూట్లో విమాన సేవలు ప్రారంభిస్తున్నాం. ప్రమోషనల్ ఆఫర్గా టికెట్ను రూ.599కే ఆఫర్ చేస్తున్నాం’’ అని రాజా వివరించారు. ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)లో టర్బోమేఘా ఎయిర్వేస్ భాగంగా ఉంది. మరో ఏడు విమానాల కొనుగోలు.. ట్రూజెట్కు ప్రస్తుతం 5 విమానాలున్నాయి. వీటితో 13 ప్రాంతాలకు రోజుకు 32 సర్వీసులు నడుపుతోంది. త్వరలోనే మరో ఏడు విమానాలను సమకూర్చుకోనున్నట్లు రాజా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఔరంగాబాద్ రూట్లతో పాటు ఉడాన్ స్కీమ్ కింద కడప, ఔరంగాబాద్, మైసూరు ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రోజూ సుమారు 2 వేల మందిని వివిధ ప్రాంతాలకు చేరుస్తున్నట్లు తెలియజేశారు. సీఎఫ్ఎంతో స్పైస్జెట్ భారీ డీల్ గురుగ్రామ్: విమానయాన సేవల సంస్థ స్పైస్జెట్ తాజాగా జెట్ ఇంజిన్ల తయారీ సంస్థ సీఎఫ్ఎం ఇంటర్నేషనల్తో 12.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. లీప్ 1బీ ఇంజిన్ల కొనుగోలు, సర్వీసులకు ఈ డీల్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం తమ విమానాల్లో ఉపయోగిస్తున్న సీఎఫ్ఎం56 కన్నా లీప్–1బీ ఇంజిన్లు సమర్థమంతంగా ఉండగలవని స్పైస్జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం 38 పైచిలుకు ’సీఎఫ్ఎం56–7బి’ ఇంజిన్ల ఆధారిత బోయింగ్ ’737’ రకం విమానాలు స్పైస్జెట్ ఉపయోగిస్తోంది. -
మధ్య తరగతి ‘టేకాఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమయం కలిసొస్తుంది! అందుబాటు ధరలూ ఉన్నాయి! ఇవే ఇపుడు విమాన ప్రయాణానికి ఇంధనంలా పనిచేస్తున్నాయి. ఈ ఏడాది దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 25% పెరిగి... 13 కోట్లకు చేరుతుందని విమానయాన శాఖ అంచనా వేస్తుండటం పరిశ్రమ పరుగుకు నిదర్శనం. ఒక దేశంలో అమ్ముడవుతున్న టికెట్ల పరంగా చూసినపుడు భారత్ టాప్–3లో నిలవటమే కాదు.. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్గా, వృద్ధిలో అమెరికా, చైనాలనూ తలదన్నిందని ‘ఆర్థిక సర్వే’నే వెల్లడించింది. ఆంక్షలు లేకుంటే.. దేశీయంగా సరే!! అంతర్జాతీయ సర్వీసుల విషయంలో అమలు చేస్తున్న ద్వైపాక్షిక ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేస్తే ట్రాఫిక్ వృద్ధి వచ్చే 3–5 ఏళ్లు ఏటా 15 శాతం దాటేస్తుందనే అంచనాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ప్రయాణికులు 12 శాతం వృద్ధితో 6.5 కోట్లకు చేరవచ్చని, 2018–19లో 7.5 కోట్లను తాకవచ్చని అంచనాలున్నాయి. అంతేకాదు! 2018లో కనీసం మూడు భారతీయ సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తాయని తెలుస్తోంది. ‘‘మన ఏవియేషన్ పరిశ్రమలో సంస్కరణలకు డీజీసీఏనే ప్రధాన అడ్డంకి. ఎందుకంటే డీజీసీఏ వద్ద వనరులు, నైపుణ్యం లేవు. యూకే మాదిరి భారత్లో స్వయం ప్రతిపత్తి కలిగిన సివిల్ ఏవియేషన్ అథారిటీ ఉండాలి’’ అని విమానయాన రంగ రీసెర్చ్ దిగ్గజం ‘కాపా’ దక్షిణాసియా సీఈవో కపిల్ కౌల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. విమాన ఇంధన ధరలతో వృద్ధి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని బోయింగ్ కమర్షియల్ ఎయిర్ప్లేన్స్ ఆసియా పసిఫిక్, ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్ తెలియజేశారు. దేశీయంగా పథకాల తోడు... దేశీయ ప్రయాణాల్లో వృద్ధికి కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలూ కలిసొస్తున్నాయి. చిన్న పట్టణాలకు విమాన సౌకర్యం కలిగించేందుకు ఉద్దేశించిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా ఇపుడు 17 చిన్న నగరాలకు విమానాలు తిరుగుతున్నాయి. ట్రూజెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ డెక్కన్, స్పైస్జెట్ ఈ పథకం కింద సర్వీసులు నడుపుతుండగా... త్వరలో జెట్ ఎయిర్వేస్, ఇండిగో, ఎయిర్ ఒడిశా పోటీకి రానున్నాయి. 2018లో కొత్తగా 60 నగరాల్లోకి తొలిసారి విమానాలు ల్యాండ్ కానున్నాయి. హైదరాబాద్కు చెందిన ట్రూజెట్... ఉడాన్ స్కీమ్ కింద నాలుగు నగరాల్లో సర్వీసులు నడుపుతోంది. ఈ ఏడాది మరో ఆరు నగరాల్లోకి అడుగు పెడతామని ట్రూజెట్ను ప్రమోట్ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘ఉడాన్ రెండో దశలో మాకు కొత్తగా 20 రూట్లు దక్కాయి. కాండ్లా, అహ్మదాబాద్, పోర్బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గావ్, గువాహటి, కూచ్బిహార్, తేజు, రూప్సి నగరాల మధ్య ఈ సర్వీసులుంటాయి’’ అని తెలియజేశారు. ఇదే పథకం కింద నిరుపయోగంగా, పరిమిత సర్వీసులు నడుస్తున్న 50 విమానాశ్రయాలు, ఎయిర్స్ట్రిప్స్ పునరుద్ధరణకు కేంద్రం రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తోంది. పునరుద్ధరణ పనులు ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి పూర్తి కానున్నాయి. ఉడాన్ రెండో దశలో 17 విమాన సంస్థల నుంచి 502 కొత్త రూట్లలో సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇది కార్యరూపంలోకి వస్తే 126 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్ అనుసంధానమవుతాయి. మరోవంక ‘దిశ’ కార్యక్రమం కింద విమానాశ్రయాల్లో మెరుగైన సేవలకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.17,500 కోట్లతో ప్రణాళిక సైతం సిద్ధం చేసింది. జతకూడనున్న విమానాలు.. విమానయాన అభివృద్ధి నేపథ్యంలో... దేశీయంగా కొత్త నగరాల్లో అడుగు పెట్టడం, సర్వీసుల పెంపు, విదేశాలకు విస్తరించటం వంటివి జోరందుకున్నాయి. దీన్లో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి 124 నుంచి 130 కొత్త విమానాలు రావచ్చని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 25 శాతం అధికం. వీటిలో 25 విమానాలు అంతర్జాతీయ కార్యకలాపాలకు ఉద్దేశించినవి. అలాగే ఉడాన్ స్కీమ్ కోసం 22 దాకా విమానాలుంటాయని తెలిసింది. వచ్చే 20 ఏళ్లలో భారత్కు 290 బిలియన్ డాలర్ల విలువైన 2,100 విమానాలు కొత్తగా వచ్చి చేరతాయని బోయింగ్ కంపెనీ చెబుతోంది. -
ప్రధాన మార్గాల్లో విమానాలపై లెవీ రూ.5,000
ముంబై: చిన్న పట్టణాలకు విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేం దుకు ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం కోసం నిధులను రాబట్టుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధాన మార్గాల్లో విమానయాన సర్వీసులపై రూ.5,000 పన్నును ఖరారు చేసింది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటుందని పౌర విమానయాన శాఖ డైరక్టరేట్ జనరల్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఉడాన్ పథకం కోసం నిధులు రాబట్టేందుకు పౌర విమానయాన శాఖ ముంబై, ఢిల్లీ సహా ప్రధాన విమానాశ్రయాల నుంచి నడిచే విమాన సర్వీసులపై లెవీ కింద రూ.8,500 వరకు ప్రస్తుతం వసూలు చేస్తోంది. కాగా, పాత చార్జీల మేరకు ఇప్పటికే చెల్లించేసి ఉంటే సవరించిన రేట్ల మేరకు వాటిని సర్దుబాటు చేస్తామని ఆ శాఖ స్పష్టం చేసింది.