మరో 'కాన్సన్ట్రేషన్ క్యాంప్' కానివ్వం
'మూడు బిలియన్ డాలర్లు కాదు.. పదమూడు బిలియన్ డాలర్లు ఇచ్చినా ఈయూ(యూరోపియన్ యూనియన్) సూచిస్తున్న ప్రతిపాదనలకు ఒప్పుకోం. శరణార్థులకు ఆశ్రయం పేరుతో దేశాన్ని మరో కాన్సన్ట్రేషన్ క్యాంప్ గా మార్చబోం. అసంఖ్యాకంగా దూసుకొస్తున్న శరణార్థులకు ఇక్కడే శాశ్వత నివాసం కల్పించేకంటే.. వారి మాతృదేశంలో శాంతి స్థాపనకు కృషి చేయాలి. అంతకంటే ముందు అక్కడి ఉగ్రమూకలకు ఆయుధాల సరఫరా నిలిపివేయాలి' అంటూ పాలక పక్షం, ఈయూలపై విరుచుకుపడ్డారు టర్కీ ప్రధాన ప్రతిపక్ష నేత కెమాల్ ఖరాబులుబ్.
నవంబర్ 1న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టర్కీ రాజకీయాలు మొత్తం శరణార్థి సంక్షోభం చుట్టూరా తిరుగుతున్నాయి. కల్లోలిత సిరియా, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వెల్లువలా వస్తోన్న శరణార్థులు, వారికి కనీస సౌకర్యాల కల్పన తదితర అంశాలు కీలకంగా మారాయి. సిరియా నుంచి వచ్చే శరణార్థులకు టర్కీలోనే శాశ్వత నివాసం కల్పిస్తే అందుకు ప్రతిగా 3.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఈయూ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను టర్కీ ప్రధానమంత్రి అహ్మేట్ దవుతోగ్లూ తిరస్కరించినప్పటికీ ఆపనిని మంద్రస్వరంతో చేశారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
ప్రస్తుత ప్రతిపక్ష నేత, రిపబ్లిక్ పీపుల్స్ పార్టీ ప్రధాన నాయకుడు కెమాల్ ఖరాబులుబ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ టర్కీని యూరప్ కాన్సట్రేషన్ క్యాంప్ గా మార్చబోమని, ఎంత డబ్బిచ్చినా ఈయూ ప్రతిపాదనలకు తలొగ్గమని తేల్చిచెప్పారు. 'సిరియాలో పేలుతున్న ఆయుధాలన్నీ టర్కీ నుంచి ఎగుమతి అవుతున్నవే. ముందు ఈ ఆయుధాల సరఫరాను అడ్డుకోవాలి. ఆ తరువాత సిరియాలో శాంతి స్థాపనకు ప్రయత్నించాతి. తద్వారా శరణార్థులు.. తిరగి తమ దేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది' అని కెమాల్ వ్యాఖ్యానించారు.