Technical institutes
-
కొత్త ఆవిష్కరణలకు ‘అటల్ ర్యాంకింగ్’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇన్నోవేషన్ సెల్’ను ఏర్పాటు చేయడంతో పాటు నూతన ఆవిష్కరణలు చేసే ఆయా సంస్థలకు ‘అటల్ ర్యాంకింగ్’విధానానికి శ్రీకారం చుట్టింది. యువతలో నూతన ఆలోచనలు, వారి ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ ర్యాంకింగ్ విధానం చేపట్టింది. భవిష్యత్ అంతా నూతన ఆవిష్కరణలపైనే ఆధారపడి ఉందని, దేశం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఉన్నత విద్యాసంస్థల్లో వినూత్న ఆవిష్కరణలు మరింతగా సాగాలని కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఆవిష్కరణలకు అటల్ ర్యాంకింగ్ వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అటువంటి ఆవిష్కరణలను చేపట్టే సంస్థలకు అటల్ ర్యాంకింగ్లను ఇచ్చేందుకు ‘అటల్ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్సు’(ఏఆర్ఐఐఏ)ను ఏర్పాటు చేసింది. విద్యాసంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కోసం దీన్ని నెలకొల్పింది. నూతన ఆవిష్కరణలు కేవలం సాంకేతిక విద్యాసంస్థల్లోనే కాకుండా అన్ని విద్యాసంస్థల్లోనూ సాగేందుకు ఈ అటల్ర్యాంకింగ్లో చోటు కల్పిస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై, సంస్కృతులను తెలుసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న నెట్వర్క్ ఆఫ్ ఇన్నోవేషన్ క్లబ్ల విధివిధానాలను కేంద్రం త్వరలోనే ప్రకటించనుంది. విద్యార్థులు, అధ్యాపకులు ఈ క్లబ్లో భాగస్వాములై కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించే వివిధ ఆవిష్కరణల పోటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతినెల జరిగే ఈ పోటీల్లోని విజేతలకు బహుమతులతో పాటు ధ్రువపత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ అటల్ ర్యాంకింగ్లకు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికిగాను అక్టోబర్ 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను కేంద్రం అందుబాటులో ఉంచనుంది. నవంబర్ 30 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ర్యాంకింగ్ జాబితాను 2019 ఏప్రిల్లో ప్రకటిస్తుంది. ర్యాంకింగ్లో 5 అంశాలకు ప్రాధాన్యం - అటల్ ర్యాంకింగ్లో అయిదు అంశాలకు ప్రాధాన్యమివ్వాలన్నది ఎంహెచ్ఆర్డీ భావన. ఈ అంశాల ఆధారంగా కేంద్రం ఆయా సంస్థలకు వెయిటేజీ ఇచ్చి అనంతరం ర్యాంకింగ్ ప్రకటిస్తుంది. - నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్ల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆయా సంస్థలకు బడ్జెట్ ఖర్చులను సమకూర్చడం. దీనికి 20 పాయింట్లు వెయిటేజీ ఇస్తారు. - ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సదుపాయాలు కల్పిస్తూ సహకారం అందించడం, అందుకు వీలుగా అడ్వాన్సు సెంటర్లు ఏర్పాటు చేయడం. దీనికి 10 పాయింట్లు వెయిటేజీ. - ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వినూత్న ఆలోచనలు అందించడం. దీనికి 54 పాయింట్ల వెయిటేజీ. - బోధనాభ్యసనాల ద్వారా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను అభివృద్ధిపర్చడం. దీనికి 10 పాయింట్ల వెయిటేజీ. - తమ విద్యాసంస్థల పాలనా వ్యవహరాలకు అనువుగా అత్యుత్తమ వినూత్న ఆవిష్కరణలను అభివృద్ధిపర్చడం. దీనికి 6 పాయింట్లు ఉంటాయి. -
సాంకేతిక విద్యాసంస్థల్లో 3ఏళ్లకు ఫీజుల ఖరారు
-
వర్సిటీలకే సాంకేతిక విద్యా సంస్థలపై అజమాయిషీ
యూజీసీ కొత్త నియంత్రణా నియమావళి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులను అందించే విద్యాసంస్థలపై ఇక నుంచి పూర్తి అజమాయిషీ విశ్వవిద్యాలయాలకే దక్కనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వీటిపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అజమాయిషీ రద్దయింది. విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్తో పాటు ఇతర సాంకేతిక విద్యాసంస్థలు ఏఐసీటీఈ చట్టంలోని సెక్షన్ 2(హెచ్) నిర్వచించిన ‘సాంకేతిక విద్యాసంస్థలు’ అనే నిర్వచనం పరిధిలోకి రావని గత ఏప్రిల్ 25న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రమాణాలు తగ్గకుండా కొత్తగా నియంత్రణ విధానాన్ని తేవాలని యూజీసీ భావించింది. ఈ నియంత్రణ యంత్రాంగానికి ఒక నియమావళిని రూపొందించింది. దీనిని యూజీసీ రెగ్యులేషన్స్(సాంకేతిక విద్యను అందించే కళాశాలలకు వర్సిటీ అనుమతులు)-2013గా వ్యవహరిస్తారు. దీని ముసాయిదా ప్రతిని వెబ్సైట్లో పొందుపరిచింది. దీనిపై అభ్యంతరాలను డిసెంబరు 12లోగా పంపాలని కోరింది. ఈ ముసాయిదా ప్రకారం ఇక ఈ విద్యాసంస్థలపై పూర్తి అజమాయిషీ వర్సిటీలకే ఉండనుంది. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఇవీ.. వర్సిటీ పరిధిలో సాంకేతిక విద్యాసంస్థను ఏర్పాటు చేసుకునేందుకు, లేదా ఇతర అనుమతులు పొందేందుకు దాఖలైన దరఖాస్తులను వర్సిటీ ఏర్పాటు చేసిన స్క్రూటినీ కమిటీ పరిశీలించి లోపాలుంటే వెబ్సైట్లో తెలియపరుస్తుంది. ఈ నోటీసును ప్రచురించిన 15 రోజుల్లోపు సంస్థలు వసతులు సమకూర్చుకుని తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. కాలేజీల అఫ్లియేషన్, రెన్యువల్, చిరునామా మార్పు, పేరు మార్పు, మహిళా కళాశాలను కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చడం, సీట్ల సంఖ్య పెంపు, తగ్గింపు, కొత్త కోర్సులు, కోర్సుల రద్దు, డ్యూయల్ డిగ్రీ కోర్సులకు అనుమతి తదితర అంశాలు వర్సిటీ పరిధిలోకి వస్తాయి. అనుమతులు లేని కళాశాలలు, కోర్సుల వివరాలను యూనివర్సిటీ ఎప్పటికప్పుడు ఒక రిజిస్టర్లో పొందుపరిచి, ఆ వివరాలను యూజీసీకి తెలియజేయాలి. ప్రజలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయాలి. అనుమతులు లేని కళాశాలల్లో చేరిన విద్యార్థులకు అడ్మిషన్ను క్రమబద్ధీకరించుకొనేందుకు ఎలాంటి హక్కూ ఉండదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాలలపై క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. సీట్ల పరిమితిని మించి ప్రవేశాలు కల్పించినా అనుమతులు కోల్పోవాల్సిరావడంతోపాటు, జరిమానాలను ఎదుర్కోవాల్సివస్తుంది. 18 నెలల పాటు అర్హులైన ప్రిన్సిపాల్, డెరైక్టర్ లేనిపక్షంలో, అర్హులైన అధ్యాపకులు లేకపోయినా ‘నో అడ్మిషన్’ స్టేటస్ను ఎదుర్కోవలసి ఉంటుంది. అనుమతులను కూడా కోల్పోవలసి వస్తుంది. ల్యాబ్, భవనాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించని విద్యాసంస్థలకు కూడా ఇదే పరిస్థితి. అడ్మిషన్ల రద్దు, ఫీజుల తిరిగి చెల్లింపు అంశాల్లో విద్యార్థులను ఇబ్బంది పెడితే కోర్సుల అనుమతి రద్దు చేయవచ్చు. పార్ట్ టైమ్ కోర్సుల నిర్వహణ, రెగ్యులర్ కోర్సులకు అర్హతలు, ఫ్యాకల్టీ అర్హతలు, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల వివరాలు, విద్యాసంస్థల ఏర్పాటుకు అర్హతలు, మౌలిక వసతుల వివరాలు తదితర అన్ని రకాల నిబంధనలను యూజీసీ ఈ ముసాయిదాలో పొందుపరిచింది.