breaking news
Tantiyakumari
-
స.హ.చట్టంపై కొరవడిన పర్యవేక్షణ
స.హ.చట్టం కమిషనర్ తాంతియాకుమారి ఉయ్యూరు : సమాచార హక్కు చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడటంతో ప్రజలకు పూర్తి న్యాయం జరగడంలేదని రాష్ట్ర కమిషనర్ లాం తాంతియకుమారి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ బంగళాలో బుధవారం ఆమె సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లతో సమీక్ష, సామాజిక కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాంతియాకుమారి మాట్లాడుతూ కొందరు అధికారులు సమాచార హక్కు చట్టాన్ని శత్రువుగా చూస్తూ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తమ నైతికతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం అమలుపై ఆశాజనక పరిస్థితులు లేవన్నారు. ఈ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. సామాజిక కార్యకర్తలను బ్లాక్మెయిల్ర్లుగా చూపుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఒకరిద్దరు చేసే తప్పులను పెద్దగా చూపి, చట్టం మొత్తాన్ని అపహాస్యం చేయడం తగదన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంపొందించేలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాస్ గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, అలమూడి చంద్రమోహన్, వల్లే శ్రీనివాసరావు తదితరులు పాల్గొని తాంతియాకుమారిని సన్మానించారు. -
సమాచార హక్కు చట్టం అమలుకు సహకారం కరువైంది
నూజివీడు: సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించ డంలో ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేదని రాష్ట్ర సమాచార కమిషనర్ లాం తాంతియాకుమారి పేర్కొన్నారు. నూజివీడు ఆర్అండ్ బీ అతిథి గృహంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషిచేయాల్సి ఉందన్నారు. అయితే కలెక్టర్లు ఆ పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ఈ చట్టంపై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చినట్లయితే అధికారులెవరూ తప్పు చేయడానికి సాహసించరన్నారు. అవినీతి కూడా చాలా వరకు తగ్గిపోతుందన్నారు. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సమాజానికే నష్టం వాటిల్లుతుందన్నారు. తన పరిధిలో ఇప్పటి వరకు 12వేల దరఖాస్తులు రాగా, వాటిలో 10వేల దరఖాస్తులు పరిష్కరించానని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కొందరు అధికారులు కోరిన సమాచారాన్ని దరఖాస్తు దారుడికి ఇవ్వకుండానే తమ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారని, ఇలా చేయడం సమంజసం కాదన్నారు. దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం ఇవ్వడానికి అధికారులకు వచ్చే నష్టమేమిటని ఆమె ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులే సమాచారాన్ని ఇవ్వడానికి భయపడతారన్నారు. ప్రజలు కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా చూడాలన్నారు. -
స.హ. చట్టంతో ప్రశ్నించే హక్కు
సామాన్యుల్లో అవగాహన రాహిత్యం అమలు తీరులో లోపాలు స.హ. చట్టం కమిషనర్ తాంతియాకుమారి విశాఖపట్నం: ఏ సమాచారాన్నయినా ఎప్పుడైనా ఎవరైనా తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం కల్పించింది. సామాన్యుడు సైతం సమాజంలో ఏం జరుగుతుందో అధికారులను ప్రశ్నించే వెసులుబాటు కల్పిస్తూ 2005లో వచ్చిన ఈ చట్టం తొలినాళ్లలో అధికారుల గుండెల్లో గుబులు రేపింది. రానురాను ఈ చట్టం మిగతా చట్టాల్లాగా సామాన్య మధ్యతరగతి వారికి న్యాయం చేయలేక పోయింది. ఈ చట్టం అమలులోకి వచ్చి అక్టోబర్ 12 నాటికి తొమ్మిదేళ్లయిన సందర్భంగా చట్టం అమలు తీరు లోపాలు గురించి సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారితో ముఖాముఖి.. సమాచారహక్కు చట్టం వచ్చిన తొమ్మిదేళ్లలో ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయి? ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అప్పీళ్లకు వచ్చిన వాటి ని పరిష్కరించేందుకు సాధ్యమైనంత వరకూ కృషి చేస్తున్నాం. సమస్య పరిష్కారంమయ్యేలా చూస్తున్నాం. చట్టంపై చైతన్యం ఎంతవరకూ వచ్చింది? చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం గ్రామాల్లో అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలి. అది ఎక్కడా జరగడంలేదు. అధికారులు నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతోంది. జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఉన్నాయా? ప్రతి జిల్లాకు మోనటరింగ్ కమిటీలు ఉండాలి. కలెక్టర్, పోలీస్ కమిషనర్/ఎస్పీ, డీఆర్ఓతో పాటు ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇద్దరు కార్యకర్తలతో జిల్లా కమిటీ ఉండాలి. ఇంతవరకూ ఎక్కడా ఈ కమిటీలు వేయలేదు. సరికదా ఈ చట్టం పై కలెక్టర్లు దృష్టి పెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన లేదు. రాష్ట్ర స్థాయిలో చట్టం అమలు తీరు ఎలా ఉంది? ఈ చట్టం అమలులో అనేక లోపాలున్నాయి. సక్రమంగా అమలు చేసేందుకు కావాల్సిన సిబ్బంది లేరు. ఫిర్యాదులు స్టోర్ చేసుకునేందుకు కంప్యూటర్లు లేవు. ఉన్న సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవు. ఇలా అయితే అమలు చేయడం కష్టం కదా. ఫిర్యాదుదారులు, అధికారులు హైదరాబాద్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారు... సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కావాలంటే ఆర్టీఐ హియరింగ్ బెంచ్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజల మధ్యనే చేయాలి. మేం పోరాడుతున్నది అవినీతి మీద . ఆ అవినీతి అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రజల మధ్య నిలబెట్టి సమస్య పరిష్కారం చేస్తే గొడవలు అవుతాయి. మాకు రక్షణ ఉండదు. ఇంతవరకూ నాకు గన్మెన్ కూడా ఇవ్వలేదు. సమాచారానికి కట్టే డబ్బులును అధికారులు వాడుకుంటున్నారనే అపవాదు ఉంది. పౌరులు, ధరఖాస్తుదారులు సమాచారానికి కట్టే డబ్బులు ఖచ్చితంగా ఆర్టీఐ ఖాతాలోకే చేరాలి. రూపాయి అయినా సరే అధికారులు చలానా తీసి ఆర్టీఐ ఎకౌంట్ కు జమచేయాలి. అంతేతప్ప ఆ డబ్బులను జనరల్గా వాడుకునేందుకు అధికారులకు హక్కు లేదు. జిల్లాల్లో మీ పర్యటనలు ఎవరు నిర్ణయిస్తారు, మీ ప్రొటోకాల్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? జిల్లాల్లో పర్యటనలు మేమే నిర్ణయించుకుంటాం. ఆయా జిల్లాలకు వెళ్లేటప్పుడు జిల్లా కలెక్టర్ తప్పకుండా కలిసి ప్రొగ్రాం ఫిక్స్ చేయాలి. ప్రొటోకాల్ ప్రకారం వచ్చి నన్ను కలవాలి. ఆయన లేకపోతే డీఆర్ఓదే బాధ్యత.