breaking news
Svetlana Alexievich
-
యుద్ధానికి మగువ మనసులేదు: స్వెత్లాన!
దూరాన వినిపించెనొక తల్లి నోట, చిరుమువ్వ సడి పోలు ఓ జోలపాట అంతమెరుగని భయము, హద్దులెరుగని వగపు ఆ జోలపాటగా అల్లుకున్నాయి; రణభూమి వెలువర్చు ప్రతి ఒక్క గుండు, బలి తీసుకుంటుంది ఒక తల్లి గుండె విజయమెవ్వరినైన వరియించవచ్చు– తల్లి గుండెలు మటుకు తల్లడిలితీరు!కరుణరసార్ద్రమైన ఈ శాంతిమంత్రాన్ని గానంచేసిన కవి పేరు కైసీన్ కులియేఫ్. ఒకప్పటి సోవియెట్ యూనియన్లో సుప్రసిద్ధుడైన ఈ కవి 1977లో బల్కార్ భాషలో ప్రచురించిన కవితా సంకలనంలోనిది ఈ గీతం. ఈ కవితా సంకలనానికి అప్పట్లోనే ‘గ్రాస్ అండ్ స్టోన్ (గడ్డి–రాయి)’ పేరిట ఆంగ్లానువాదం కూడా వెలువడింది. ఇది నాలుగుపాదాల చిరుకవిత మాత్రమే కాదు– ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకించిన జాతి, ప్రపంచానికి వినిపించిన మాతృశోకమిది!ఇక, నోబెల్ పురస్కారాల విషయానికి వస్తే– నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళలో జర్నలిస్టులు సప్తర్షుల్లా ఏడుగురంటే ఏడుగురే! వాళ్ళలో నలుగురు– రడ్యార్డ్ కిప్లింగ్ (1907), ఎర్నెస్ట్ హెమింగ్వే (1954), అల్బర్ట్ కామూ (1957), స్వెత్లాన అలెక్సియేవిచ్ (2015) నోబెల్ ‘సాహిత్య’ పురస్కారం గెల్చుకున్నారు. ఇక, కార్ల్ ఫాన్ అసియేట్స్కియ్ (1935), మారీ రేజ– ద్మిత్రీయ్ మురతోఫ్ (2021) నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకోగలిగారు. నోబెల్ బహుమతుల్లో ‘జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కేటాయించినవి’ అంటూ ఏవీ లేకపోవడంతో, నోబెల్ విజేతల్లో ఎవరికీ ఆ బహుమతులు జర్నలిస్టులుగా రాలేదు. దాని మీద పత్రికల్లో పెద్ద చర్చే జరిగింది కానీ, పెద్ద ఫలితం లేకపోయింది.తాను పుట్టడానికి మూడేళ్ళు ముందే ముగిసిన రెండో ప్రపంచ యుద్ధానిది మానవ నైజానికి– ముఖ్యంగా స్త్రీ ప్రకృతికి– విరుద్ధమైన స్వభావమని స్వెత్లాన తన రచనల్లో తీర్మానించారు. వాస్తవానికి, ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ యుద్ధ స్వభావాన్ని పరిశీలించినా, దానికి స్త్రీ నైజం లేదనే అర్థమవుతుందంటారామె. స్త్రీల –అందులోనూ, మాతృమూర్తుల– శోకం చరిత్ర రచనల్లో సక్రమంగా నమోదు కాలేదన్నది స్వెత్లాన నిశ్చితాభిప్రాయం. 1983లో వెలువడిన స్వెత్లాన రచన ‘సమరానికి మగువ మనసు లేదు!’ ఇదే విషయాన్ని కుండబద్దలుకొట్టి మరీ చెప్పింది. రెండో ప్రపంచయుద్ధం గురించిన బెలరూస్ స్త్రీల మనోభావాలను స్వెత్లాన నమోదుచేశారు. ఈ రచనను ‘భావోద్వేగాల చరిత్ర’గా పేర్కొంటూ, దాన్ని ‘సరికొత్త సాహిత్య ప్రక్రియ’గా అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.అయితే పాఠకులుగా మనం ఇక్కడ మనసులో పెట్టుకోవలసిన విషయం ఒకటుంది– ఈ ధోరణి స్వెత్లానతోనే మొదలు కాలేదు! గోర్కియ్, షలహోఫ్, యెసినీన్, పస్తర్నాక్, మయాకఫ్స్కియ్ మొదలుకొని చింగిజ్ ఐత్మతోఫ్ వరకూ ఎందరో ప్రసిద్ధులు యుద్ధాన్ని ఏనాడో వ్యతిరేకించారు. లెనిన్ నాయకత్వంలో సోవియెట్ యూనియన్ జారీ చేసిన మొట్టమొదటి శాసనమే శాంతి శాసనం. ‘కత్తులను నాగేటి కర్రులుగ తీర్చుదాం!’ అన్నది దానికిచ్చిన శీర్షిక. కొందరు పాశ్చాత్య విమర్శకులు చిత్రించినట్లుగా స్వెత్లాన రచనకూ మిహయీల్ గొర్బచ్యేఫ్ ‘గ్లాస్నస్త్’కూ కూడా ఏ సంబంధం లేదు. స్వెత్లాన రచన వెలువడిన రెండేళ్ళకు–1985లో– గానీ మిహయీల్ గొర్బచ్యేఫ్ సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎన్నికకాలేదు! మరో మూడేళ్లకు గానీ గ్లాస్నస్త్ రంగం మీదికి రానేలేదు!!1945లో ముగిసిన రెండో ప్రపంచయుద్ధం నుంచి, 1979లో మొదలై– పదేళ్ళపాటు సాగిన అఫ్గాన్ దురాక్రమణ యుద్ధం వరకూ జరిగిన ఎన్నెన్నో పరిణామాలు మిగిల్చిన విషాద స్మృతులను ఆమె తన రచనల్లో– ముఖ్యంగా, 1992లో ఆంగ్లానువాదంగా వెలువడిన ‘జింకీ బ్రదర్స్’లో– నమోదుచేశారు. అలాగే, ‘వాయిసెస్ ఫ్రం చెర్నోబిల్’(2005) లో కూడా అధికారిక చరిత్రకెక్కని వాస్తవాలను ఆమె నమోదుచేశారు. మరో ఒకటిన్నర దశాబ్దానికి వెలువడిన ‘లాస్ట్ విట్నెసెస్’లో కూడా, రెండో ప్రపంచయుద్ధ కాలంలో బాలలుగా వుండినవారి జ్ఞాపకాలను నమోదు చేశారు. ఇదే కోవకు చెందిన మరో రచన ‘సెకండ్ హ్యాండ్ టైం.’ గడియారం ముళ్ళను ఇంగ్లిషులో హ్యాండ్స్ అంటారు. వర్తమానాన్ని రచయిత్రి – చమత్కారంగా– ‘సెకండ్ హ్యాండ్ టైం’ అన్నారు.ఇవన్నీ వాగ్రూపంలో వున్న చరిత్రను అక్షరబద్ధం చేసే క్రమంలో స్వెత్లాన రచించిన పుస్తకాలు. వీటిని ‘పాలీఫోనిక్’ రచనలుగా పాశ్చాత్య విమర్శకులు పరిగణించారు. సాధారణంగా చరిత్రగ్రంథాల్లో రచయిత దృక్కోణం ఒక్కటే స్ఫుటంగా కనిపిస్తుంది. కానీ వాగ్రూప చరితలకు మూలం వ్యక్తుల జ్ఞాపకాలు. అవన్నీ ఒకే కోణం నుంచి చూసిన దృశ్యాలు కానవసరంలేదు. అంచేత వాటి దృక్కోణం బహుళంగా వుండవచ్చు. స్వెత్లాన రచనల్లో అలా వుంటాయి కూడ! అందుకే అవి అక్షరాలా ‘పాలీఫోనిక్’ రచనలు.స్వెత్లానా అలెక్సియేవిచ్ లాంటి రచయితలు రాసిన పుస్తకాలు, పాఠకుల వ్యక్తిగత పరిమితులూ– విస్తృతులకు తగినట్లుగా అర్థమవుతాయి. ఇప్పుడు చదివితే ఒకలా అనిపించి, తర్వాత చదివినప్పుడు మరోలా అనిపించవచ్చు కూడా. మనుషుల్లో మార్పు సహజం కదా! నన్నడిగితే, 2013లో రాసిన ‘సెకండ్ హ్యాండ్ టైం’ అనే పుస్తకాన్ని స్వెత్లాన ఇప్పుడు తిరిగి రాస్తే, అది అలా వుండదు. లుకాషెంకో పాలనతో సోవియెట్ పాలనను పోల్చుకున్న బెలారూస్ పౌరులు ఇంతకుముందు మాట్లాడినట్లే ఇప్పుడూ మాట్లాడతారనుకోను!- మందలపర్తి కిషోర్ -
యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం
రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన కొందరు సోవియట్ మహిళలు స్వెత్లానా అలెక్సీయెవిచ్కు స్వయంగా వినిపించిన అనుభవాల గాథలు ఈ పుస్తకం. 2015 నోబెల్ బహుమానం స్వెత్లానాను వరించడానికి కారణమైన రచనల్లో ఇదీ ఒకటి. 1985లో రష్యన్లో వచ్చిన దీన్ని 1988లో ప్రగతి ప్రచురణాలయం తొలిసారి తెలుగులో ప్రచురించింది. అక్టోబర్ విప్లవం జరిగి వంద సంవత్సరాలైన సందర్భంగా ‘మలుపు’ దీన్ని పునర్ముద్రించింది. ‘స్త్రీ గురించి మనకి తెలిసిందంతా ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, ‘‘కరుణ’’ అన్నదే అందుకు మిక్కిలి సరిపోయే పదం’ అంటారు అలెక్సీయెవిచ్. ‘స్త్రీకి సోదరి, భార్య, స్నేహితురాలు, అన్నింట్లోకీ అత్యున్నతమైన మాత అన్న పదాలు కూడా ఉన్నాయనుకోండి. అయితే కరుణ అన్నది యీ మాటల్లో యిమిడిలేదూ? వాటి సారాంశం, వాటి కర్తవ్యం, వాటి పరమార్థం యిదే కాదూ?’ అంటారామె. అలాంటి కరుణామూర్తి 1941 నాటి యుద్ధ కాలంలో శత్రువు మీద కాల్పులు జరిపింది, విమానం నుంచి బాంబులు విడిచింది, వంతెనలు పేల్చింది, వేగుగా పనిచేసింది, యుద్ధఖైదీలను పట్టుకుంది, శత్రువుల ప్రాణాలు కూడా తీసింది. ‘యుద్ధంలో మొత్తం 8 లక్షలకి పైగా అమ్మాయిలు యుద్ధ రంగ సైన్యాలకు చెందిన వివిధ శాఖల్లో పనిచేశారు’. ‘దారి పక్కన పూచిన ఊదారంగు పూల గుత్తులను తుపాకి బయోనెట్కు తగిలించుకు’నేంతటి సౌందర్యపిపాసులైన ఆ యువతులు అలా ప్రాణాలు ఎలా తీయగలిగారు? దానికి వారి జవాబు: ‘దేశభక్తియుత మహాయుద్ధం స్త్రీలు తమ మాతృదేశ రక్షణలో మూకుమ్మడిగా’ పాల్గొనేలా చేసింది. అంతమాత్రమే ఈ పుస్తక సారాంశం కాదు. ‘నాగలిచేత పెళ్లగింపబడిన బంగాళదుంపల మాదిరిగా’ డజన్ల కొద్దీ మృతదేహాలు పడే యుద్ధాన్ని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? ఈ యుద్ధంతో ఇక యుద్ధం అనేదాన్ని చంపేస్తాం, అన్న భావన వీరి మాటల్లో కనిపిస్తుంది. యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం; మూలం: స్వెత్లానా అలెక్సీయెవిచ్; తెలుగు: నిడమర్తి ఉమారాజేశ్వరరావు; పేజీలు: 112; వెల: 100; ప్రతులకు: మలుపు, 2–1–1/5, నల్లకుంట, హైదరాబాద్-44. ఫోన్: 9866559868 - సాహిత్యం డెస్క్ -
జర్నలిస్టుకు తొలిసారి నోబెల్ బహుమతి
రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రకు అద్దం పడతాయి స్వెత్లానా అలెగ్జీవి రచనలు. ఆమె కలం నుంచి కన్నీటి ధారలు కారుతాయి. యుద్ధాలు, దేశాల పతనాలు మిగిల్చిన విషాదాలు కనిపిస్తాయి. చెర్నోబిల్ విరజిమ్మిన పాషాణానికి బలవుతున్న తరతరాల జీవనగాధలను వినిపిస్తాయి. వాటిని యథాతథంగా సమకాలీన ప్రపంచానికి చాటి చెప్పడమే ఆమె రచనల ముఖ్య ఉద్దేశం. రచనా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆమె ఎన్నడూ ఫిక్షన్ జోలికి వెళ్లలేదు. జీవన గమనంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను వారి మాటల ద్వారానే చెప్పించడం ఆమె సహజ శైలి. అందుకు కారణం.. ఆమె వృత్తిరీత్యా జర్నలిస్టు అవడమే. నోబెల్ అవార్డును ఆవిష్కరించాక ఆ అవార్డును గెలుచుకున్న తొలి జర్నలిస్టు ఆమే కావడం విశేషం. ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ అందుకున్న మహిళల్లో ఆమె 14వ వారు. ఆమె ఉక్రెయిన్లోని స్టానిష్లే నగరంలో 1948, మే 31వ తేదీన జన్మించారు. తండ్రి బెలారస్కు చెందినవారు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. పాఠశాల చదువు పూర్తి కాగానే పలు స్థానిక పత్రికల్లో జర్నలిస్ట్గా పనిచేశారు. మిన్స్క్ నగరంలో 'నేమన్' అనే సాహిత్య పత్రికలో పనిచేశారు. చెర్నోబిల్ అణు దుర్ఘటనపై పుస్తకం రాసేందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. బాధితుల్లో ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేయడమే అందుకు కారణం. ఈ పుస్తకానికే ఇప్పుడు నోబెల్ సాహిత్య అవార్డు లభించింది. రెండో ప్రపంచ యుద్ధం, అఫ్ఘాన్-సోవియట్ యుద్ధం, సోవియెట్ పతనంపై ఆమె పలు పుస్తకాలు రాశారు, పలు అవార్డులు అందుకున్నారు. అదే సమయంలో జీవతంలో పలు దేశాల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. అందుకనే 2000 సంవత్సరంలో బెలారస్ను వీడాల్సి వచ్చింది. పారిస్, గోథెన్బర్గ్, బెర్లిన్లో ప్రవాస జీవితం గడిపిన ఆమె 2011లో తిరిగి మిన్స్క్ నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడ్డారు. 'వాట్ ఈజ్ టు బి డన్, హూ ఈజ్ టు బి బ్లేమ్డ్' అన్న నినాదమే ఆమె రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. -
బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
రష్యన్ పాలనపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి, చెర్నోబిల్ అణుప్రమాదంలో మరణించిన వాళ్ల కోసం కన్నీటి చుక్కలు కార్చి.. వాటినే సిరాగా మార్చి పుస్తకాలు రాసిన ప్రముఖ బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సివిచ్ను ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి గాను స్వెత్లానాకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ ప్రకటించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తన రచనల్లో ప్రతిబింబిస్తూ, రాయడంలో అపార ధైర్య సాహసాలు కనబరిచే స్వెత్లానాకు నోబెల్ బహుమతి రావడం పట్ల పలువురు సాహిత్యకారులు, విమర్శకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, స్వెత్లానా పేరు మీద ఒక ట్విట్టర్ ఖాతాను తెరిచిన ఓ పాత్రికేయుడు.. రెండు గంటల ముందే ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినట్లు ఆ పేరుమీదే ట్వీట్ చేశారు. అంటే బహుమతి ప్రకటనకు ముందే అతడికి ఈ విషయం తెలిసిపోయిందన్న మాట!


