Suspended IPS officer
-
ఆర్జీ కర్ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ల సస్పెన్షన్
కోల్కతా: 2024లో సంచలనం రేపిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన కేసును తిరిగిదోడుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దారుణంపై ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరిగ్గా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలపై ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సీఎం సువేందు అధికారి ఆదేశాలిచ్చారు. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సెక్రటేరియట్లో ప్రకటించారు. వీరు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేకపోవడమే కాదు, మృతురాలి తల్లిదండ్రులకు లంచం ఎరజూపారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన దర్యాప్తు నిర్ణీత వ్యవధిలోగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంఘమిత్ర ఘోష్ ముగిస్తారని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీబీఐ జరుపుతున్న దర్యాప్తు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ కంటే ముందు, కోల్కతా పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు దశలపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు. -
ఆ పోలీసుల మూడో నిర్లక్ష్యం
లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ నేతలకే కాదు.. ప్రభుత్వాధికారులకు కూడా కాసింత లెక్కలేనితనం ఒంటబట్టింది. ఈ విషయం తెలిస్తే ఆ మాట నిజమే అనుకోక తప్పదు. సమాజ్ వాది పార్టీ అధినేత తనను బెదిరించాడని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని సస్పెండ్కు గురైన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కోర్టును ఆశ్రయించడంతో ఆ మేరకు విచారణ చేపట్టి రిపోర్టు తనకు సమర్పించాలని అక్కడి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పోలీసు అధికారిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాలను పోలీసులు ఇప్పటికే రెండుసార్లు బేఖాతరు చేయగా మరోసారి కూడా అలాంటి తప్పిదానికి పాల్పడ్డారు. కోర్టు ఇచ్చిన మూడో అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా రిపోర్టు విషయం పట్టించుకోలేదు. దీంతో ఠాకూర్ భార్య ఆర్టీఐ ఉద్యమకారురాలు నూతన్ ఠాకుర్ కోర్టుకు ఈ విషయం గుర్తు చేశారు. దీంతో హజ్రతాంజ్ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం లోగా నివేదిక ఇవ్వాలని ఇక అదే పోలీసులకు చివరి అవకాశం అని హెచ్చరించింది. అప్పటిలోగా నివేదిక ఇవ్వకుంటే శుక్రవారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. -
కోర్టు తలుపు తట్టిన అమితాబ్
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై పోరాడుతున్న సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ కోర్టు తలుపు తట్టారు. తనను బెదిరించిన ములాయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమితాబ్ ఫిర్యాదును స్వీకరించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సోమప్రభ మిశ్రా.. నివేదిక సమర్పించాలని హజ్రత్ గంజ్ పోలీసులను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. థాకూర్ భార్య నూతన్ థాకూర్ తన న్యాయవాదితో ఈ ఫిర్యాదు చేశారు. జూలై 11న హజ్రత్ గంజ్ లో, జూలై 23న లక్నోలో థాకూర్ ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఓ సామాజికాంశంలో ములాయం తనను బెదిరించారంటూ మీడియాకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. అంతేకాకుండా ములాయంపై కేసు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ సర్కారు ఆయనపై కక్ష గట్టింది. ఆయనపై రేప్ ఆరోపణలతో ఓ కేసును పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత మూడు రోజులకే సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించావంటూ సస్పెండ్ చేశారు. తర్వాత థాకూర్, ఆయన బంధువుల ఆస్తుల వివరాలు వెలికి తీసేందుకు ఆదేశాలు జారీ చేసింది.


