నేత్రపర్వంగా లక్ష్మీగణపతి హోమం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకుడైన శివదేవుని ఆలయ ప్రాంగణంలో సిద్ధసంకల్పంలో భాగంగా ఆదివారం నిర్వహించిన లక్ష్మీగణపతి హోమం నేత్రపర్వంగా జరిగింది. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తలపెట్టిన మహాసంకల్పం సిద్ధించుటకు నిర్వహిస్తున్న సిద్ధసంకల్పంలో భాగంగా ఈ హోమాన్ని పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా జరిపారు. ఇందులో దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావుతో పాటు విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆస్థాన జోతిష్యులు పూజ్యం విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువైన గణపతి దేవునికి విశేష అలంకారాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీగణపతి హోమం కన్నులపండువగా జరిగింది. ఈనెల 13న జరిగే మహాపూర్ణాహుతితో ఈ సిద్ధసంకల్పం పూర్తి కానున్నట్టు ఈవో వివరించారు.