breaking news
SP Vikram Jeet duggal
-
కిడ్నీ రాకెట్కు 2008లోనే బీజం
-
కిడ్నీ రాకెట్కు 2008లోనే బీజం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ కేంద్రంగా వెలుగుచూసిన కిడ్నీ రాకెట్కు ఏడేళ్ల క్రితమే బీజం పడిందా? అప్పటి నుంచి పకడ్బందీగా నెరపుతున్న ఆన్లైన్ లావాదేవీలతో ఎవరికీ అంతుచిక్కని విధంగా నెట్వర్క్ను ఏర్పాటు చేశారా? ఈ రాకెట్తో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మందికి సంబంధముందా? ఇప్పటి వరకు ఈ రాకెట్ ద్వారా దేశంలో 60 మంది కిడ్నీలు అమ్ముకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నాడు కిడ్నీ రాకెట్లో దేశంలోనే కీలక ఏజెంట్గా వ్యవహరిస్తున్న సురేశ్భాయ్ అమృత్భాయ్ ప్రజాపతి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సఫాల్వివాన్ ప్రాంతానికి చెందిన ఇతను పోలీసు విచారణలో పలు ఆసక్తికర వెల్లడించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్జీత్ దుగ్గల్ వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జరిగిన ఈ కిడ్నీ కుంభకోణం పూర్వాపరాలివి. 2008లోనే ‘ఆన్లైన్’ పోస్టింగ్.. గుజరాత్కు చెందిన సురేశ్ ప్రజాపతికి ఏడేళ్ల క్రితమే కిడ్నీ వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే, వ్యాపారానికి నెట్వర్క్ కావాల్సి ఉన్నందున ఆ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకునేందుకు అతను ఇంటర్నెట్ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. 2008లోనే పలు వెబ్సైట్లు, బ్లాగ్లలో కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. ‘ఐ వాంట్ టు హెల్ప్ యూ. ఐ వాంట్ సమ్ మనీ. ఐ విల్ గివ్ యు మై కిడ్నీ.’ అంటూ కిడ్నీలు అవసరమున్నవారిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అతను ఏ స్థాయిలో ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించాడంటే ‘బ్లాగ్స్.సులేఖ.కామ్’లో కిడ్నీ ట్రాన్స్ప్లాం ట్ ఆర్గనైజర్ను క్లిక్ చేస్తే నేరుగా సురేశ్ ప్రజాపతి వివరాలు లభిస్తాయి. అదే విధంగా 2009, మే14న ఎంఆర్ఐషాన్షరీఫ్.బ్లాగ్స్పాట్.ఇన్ అనే వెబ్సైట్లో కూడా అతని వివరాలు పొందుపరిచాడు. ఈ క్రమంలో అతనికి మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి సబ్ ఏజెంట్గా కలిశాడు. ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకుని సురేశ్ ప్రజాపతిని అతను ఇద్దరూ కలసి ఈ వ్యాపారం ప్రారంభించారు. ఈ మహారాష్ట్రకు చెందిన సబ్ఏజెంట్ను అరెస్టు చేయాల్సి ఉంది. 2013లో మొదలు.. అసలు ఈ వ్యాపారాన్ని 2013లో ప్రారంభించాడు సురేశ్ ప్రజాపతి. ఆన్లైన్ ద్వారా మంచి నెట్వర్క్ను తయారు చేసుకున్న అతను శ్రీలంకలోని ఏజెంట్ల సహకారంతో అక్కడి నాలుగు ఆసుపత్రులకు చెందిన డాక్టర్లతో కుమ్మక్కయ్యాడు. మూడేళ్లలో ఇప్పటివరకు 60 మంది కిడ్నీలను శ్రీలంకలో అమ్మించాడు. కొలంబోలోని నవలోక్, హేమ, లంకన్ ఆసుపత్రులతో పాటు బొరెల్లాలోని వెస్టర్న్ ఆసుపత్రులలో ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించాడు. ఇందుకు ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ మాధవ, డాక్టర్ మోనిక్, డాక్టర్. సాధన (నవలోక్), డాక్టర్. చమిల (హేమ), డాక్టర్. నిరోషిని (లంకన్), డాక్టర్. హబీబా షరీఫ్ (వెస్టర్న్)లు సహకరించారు. వీరంతా శ్రీలంకీయులే. వీరి సహకారంతో పాటు ఆయా ఆసుపత్రుల యజమానులు డాక్టర్. హర్షిద్ (నవలోక్), డాక్టర్. శరత్ (లంకన్), డాక్టర్. రిజ్వీ షరీఫ్ ఆయన కుమారుడు రికజ్ షరీఫ్లు కూడా తోడయ్యారు. కిడ్నీలు ఇండియావి..అమ్మేది శ్రీలంకలో.. రేటు మాత్రం డాలర్లలో ఇక, ఈ కిడ్నీ రాకెట్కు సహకరించేందుకు గాను శ్రీలంకలోని ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పాడు సురేశ్ప్రజాపతి. ఒక్కో కిడ్నీని మార్పిడి చేసేందుకు గాను ఆస్పత్రి ఫీజుల కింద 22 వేల డాలర్లు చెల్లించాడు. కిడ్నీ మార్పిడి చేసేందుకు ఆసుపత్రి ఎథిక్స్ కమిటీ అనుమతి అవసరం. కాగా, అందులో ఒక ఆసుపత్రి డాక్టర్, మరో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్తో పాటు ఆరోగ్య శాఖ నుంచి మరో ఉన్నతాధికారి సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులను మేనేజ్ చేసేందుకు గాను 500 డాలర్లు చెల్లించారా..? లేక ఎథిక్స్ కమిటీకి కూడా చెప్పకుండా కేవలం ఫీజు రూపంలో చెల్లించారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇక, ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఒక్కో కిడ్నీకి రూ.28 నుంచి 30 లక్షలను వసూలు చేస్తుంటాడు సురేశ్ ప్రజాపతి. అందులో రూ.5 లక్షలు కిడ్నీ విక్రేతలకు ఇచ్చి మిగిలినవి డాక్టర్లు, ఆసుపత్రి ఖర్చులతోపాటు ఏజెంట్లకు, ప్రయాణచార్జీలకు, వీసా ప్రాసెసింగ్, శ్రీలంక వెళ్లి వచ్చేందుకు టికెట్లు, అక్కడ వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టేవాడు. సురేశ్ కూడబెట్టిన ఆస్తులివే.. ఏడేళ్ల క్రితమే తాను కిడ్నీని అమ్ముతానని ఆన్లైన్లో పెట్టిన సురేశ్ ప్రజాపతికానీ, అతనికి సహకరించిన దిలీప్కానీ కిడ్నీలు అమ్ముకోకపోవడం కొసమెరుపు. మరో విశేషమేమిటంటే ఈ రాకెట్ ద్వారా సురేశ్ ప్రజాపతి రూ.3 కోట్ల వరకు ఆస్తులు సంపాదించాడు. అహ్మదాబాద్లో రూ.1.40 కోట్ల విలువైన ఓ ఇల్లు, రూ.30 లక్షలతో ఓ ఆఫీసు, రూ.27 లక్షలతో తన ఆఫీసుకు, ఇంటికి ఫర్నీచర్, రూ.8.5 లక్షలు చెల్లించి, మిగతా బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఓ ఆడి కారు కూడా కొన్నాడు. రూ. లక్ష వెచ్చించి బజాజ్ ఎవెంజర్ మోటార్ సైకిల్ కూడా కొన్నాడు. మొత్తం రూ.45 లక్షల వరకు ఏజెంట్లకు ముట్టచెప్పాడు. తాను గతంలో కొన్న అపార్ట్మెంట్కు ఉన్న రూ. 7లక్షల బ్యాంకు రుణం కూడా తీర్చేశాడు. ఇప్పుడు సురేశ్ ప్రజాపతి బ్యాంకు బాలెన్స్ ఎంతో తెలుసా.. రూ.21లక్షలు. ఇతనికి సహకరించిన దిలీప్ కూడా 15లక్షలు పెట్టి అహ్మదాబాద్లో ఇల్లు కొనుక్కుని మరో రూ.లక్ష ఖర్చుచేశాడు. మరో ముగ్గురు అరెస్టు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి, దేశవ్యాప్త ఏజెంట్ గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన సురేశ్భాయ్ అమృత్భాయ్ ప్రజాపతిని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తున్న మరో ఏజెంట్ దిలీప్చౌహాన్ (గుజరాత్), తన కిడ్నీని అమ్ముకుని ఏజెంట్గా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జెను నూకరాజులను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ముగ్గురినీ నల్లగొండ ఎస్పీ విక్రమ్జీత్ దుగ్గల్ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురి అరెస్టుతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. సమావేశంలో ఏఎస్పీ గంగారాం, నల్లగొండ డీఎస్పీ సుధాకర్, సీఐలు రవీందర్, టి.శ్రీనివాస్. శాలిగౌరారం సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు. అమ్మినవాళ్లు... కొన్నవాళ్లు వీరే.. సురేశ్ ప్రజాపతి నెట్వర్క్ ద్వారా 60 మంది కిడ్నీలు అమ్ముకోగా, 54 మంది డబ్బు లు చెల్లించి కిడ్నీలు మార్పిడి చేయించుకున్నారని తేలింది. కిడ్నీలు అమ్ముకున్న వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 22 మంది ఉన్నారు. తమిళనాడు ఆరుగురు, మహారాష్ట్ర ఐదుగురు, క ర్నాటక నలుగురు, ఢిల్లీకి చెందిన ముగ్గురు, జమ్ము-కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్లకు చెందిన ఒక్కొక్కరున్నారు. ఇతర రాష్ట్రాల వారు మరో 11 మంది ఉన్నారు. ఇక, కిడ్నీలు మార్పిడి చేసుకున్నవారిలో ఢిల్లీ (2), గుజరాత్ (8), మహారాష్ట్ర (6),జమ్ము-కాశ్మీర్ (5), పంజాబ్ (3)తోపాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అవయవ మార్పిడి చట్టం ప్రకారం అనుమతి లేకుండా కిడ్నీలు దానం చేయడంతో పాటు డబ్బులు వెచ్చించి మార్పిడి చేయించుకోవడం కూడా నేరమేనని, ఈ రాకెట్తో సంబంధమున్న అందరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ దుగ్గల్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక నిందితుడి అరెస్టుతో శ్రీలంకకు సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా లభిస్తున్నాయని, అవసరమైతే శ్రీలంక వెళ్లి విచారణ జరిపేందుకు కూడా నల్లగొండ పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. -
వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి
-
వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి
* కిడ్నీ రాకెట్లో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి * దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్ల కీలకపాత్ర! * గతంలోనూ హైదరాబాద్ కేంద్రంగా మూడుసార్లు రాకెట్ బట్టబయలు * కేంద్రం పట్టించుకుంటేనే ఈ రాకెట్కు చెక్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ రాకెట్తో సంబంధం ఉండి కిడ్నీలు అమ్ముకున్న వారందరూ టూరిస్టు వీసాలపై శ్రీలంకకు వెళ్లారని పోలీసుల విచారణలో తేలింది. నల్లగొండ జిల్లాతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన వీరు కొలంబోలో ఉన్న ఏజెంట్లను కలసి కిడ్నీలు అమ్ముకుని గుట్టుచప్పుడు కాకుండా తిరిగి వచ్చినట్టు వెల్లడైంది. ఈ రాకెట్తో సంబంధమున్న నలుగురిని నల్లగొండ పోలీసులు బుధవారంరాత్రి అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ రాకెట్లో దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు పోలీ సు విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు చెందిన వారే కీలకంగా ఉన్నారని తెలుస్తోంది. అందులో కూడా పశ్చిమబెంగాల్ కేంద్రంగా ఈ రాకెట్ సూత్రధారులు పనిచేస్తున్నట్టు సమాచారం. పోలీసుల దర్యాప్తులో కూడా బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొందరు కొలంబో వెళ్లి కిడ్నీలు అమ్ముకున్నట్టు తేలింది. వీరిని నల్లగొండకు చెందిన కీలక పాత్రధారి ఇంటర్నెట్లో పరిచయం చేసుకున్నా, అక్కడ ఉన్న కీలక ఏజెంట్లతో కలసి వారిని శ్రీలంకకు పంపారని తెలుస్తోంది. అయితే, ప్రతిసారీ ఈ ఏజెంట్లు శ్రీలంకకు వెళ్లలేదని, అక్కడ ఉన్న మూడు ఆసుపత్రుల నెట్వర్క్తోపాటు మరికొంత మంది వ్యక్తుల సాయంతో ఒక్కొక్కరే వెళ్లి కిడ్నీలు అమ్ముకుని వచ్చారని తెలుస్తోంది. ఇక్కడి కీలక వ్యక్తులు అక్కడి ముఠాలోని ఏజెంట్లకు సమాచారం ఇస్తారని, వారి ఫోన్ నంబర్లు, అడ్రస్లు ఇక్కడే కిడ్నీ దాతలకు ఇచ్చి పంపిస్తారని పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు తక్కువ ఈ రాకెట్తో శ్రీలంకకు సంబంధాలు ఉండేందుకు రెండు కారణాలు ఉన్నాయని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు శ్రీలంకలో చాలా తక్కువ(మన దేశంతో పోలిస్తే) ఉంటుందని, దీంతో పాటు కిడ్నీ మార్పిడి కోసం అవసరమైన న్యాయపరమైన డాక్యుమెంట్లను సమర్పించడం కూడా సులువుగా ఉంటుందని, అందుకే కిడ్నీ కుంభకోణం అంటేనే వేళ్లు శ్రీలంక వైపు చూపెడుతున్నాయని పోలీసులంటున్నారు. గతంలోనూ మూడుసార్లు గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా మూడుసార్లు ఈ కిడ్నీ రాకెట్ బయటకు వచ్చింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్శర్మ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు కూడా కిడ్నీ డొంక కదిలించారు. అప్పుడు కూడా శ్రీలంకతో సంబంధాలున్నట్టు తేలింది. మరోసారి శ్రీలంకతో, ఇంకోసారి ఇరాన్తో కిడ్నీ రాకెట్కు సంబంధాలున్న కేసులు కూడా పోలీసులకు లభించాయి. ఎన్నిసార్లు కిడ్నీ రాకెట్ బయటకు వచ్చినా కేసును ఛేదించలేకపోయారు. ఈ రాకెట్లకు అంతర్జాతీయ సంబంధాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుందని, జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుందని, ఈ కేసుల విషయంలో ఇతర దేశాల సహకారం కూడా అవసరం ఉంటుందని రాష్ట్రస్థాయిలో పనిచేస్తోన్న ఓ పోలీసు అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. శ్రీలంకకు వెళ్తాం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకుగాను శ్రీలంకకు వెళ్లే యోచనలో జిల్లా పోలీసులున్నట్టు తెలుస్తోంది. తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను అడిగే యోచనలో జిల్లా పోలీసులున్నారు. ‘ఈ కేసును మేమే దర్యాప్తు చేయాలనుకుంటున్నాం. అందుకుగాను శ్రీలంకకు వెళ్తామని ప్రభుత్వాన్ని అనుమతి అడుగుతాం. మాకు అనుమతి లభిస్తే మేమే వెళ్తాం. లేదంటే అప్పుడు ఈ కేసును సీఐడీకి లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పగించే దిశలో నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటివరకు కేసు మా దగ్గరే ఉంటుంది.’ అని జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. -
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
♦ నల్లగొండ కిడ్నీ రాకెట్కు అంతర్జాతీయ లింక్ ♦ కొలంబోలోని మూడు ఆస్పత్రుల్లో నెట్వర్క్ ♦ ఒక్కో కిడ్నీకి రూ.25 లక్షలు ♦ ఖర్చుపోనూ దాతకు ఇచ్చేది రూ. 5 లక్షలు ♦ రాకెట్ ఏజెంట్ సహా ముగ్గురు అరెస్టు ♦ కారు, ఏటీఎం కార్డు, పాస్పోర్టుల స్వాధీనం ♦ సాక్షి కథనాలతో వెలుగులోకి.. వెల్లడించిన ఎస్పీ నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కిడ్నీ రాకెట్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటర్నెట్ ద్వారా అమాయకులకు ఎరవేసి జాతీయస్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న విషయాన్ని సాక్షి కథనాలను ప్రచురించిన విషయం విదితమే. ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ రాకెట్ వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో సురేష్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, బెంగాల్లో నలుగురు, హైదరాబాద్లో నలుగురు, తమిళనాడులో ఇద్దరు, ముంబైలో ఒక్కరు, న్యూఢిల్లీలో ఒక్కరు చొప్పున కిడ్నీలను అమ్మించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండలోని ఏజెంటు కస్పరాజు సురేష్ (22) తన కిడ్నీని అమ్ముకుని.. అనంతరం ఏజెంటుగా అవతారమెత్తి 15 మంది కిడ్నీలను వివిధ ప్రాంతాల్లో అమ్మేసినట్లు తెలిపారు. అయితే అవసరమున్న వారు ఒక్కో కిడ్నీకి రూ. 25 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. దాంట్లో కిడ్నీ దాతకు అన్ని ఖర్చులు పోను రూ. 5 లక్షలు చెల్లిస్తారని వివరించారు. ఈ రాకెట్కు మహారాష్ట్ర, కర్నాటక, న్యూఢిల్లీ, బెంగాల్, ముంబై, కొలంబో ప్రాంతాలకు సంబంధాలు ఉన్నాయని ఎస్పీ వివరించారు. అమాయకులను ఎరవేసి కిడ్నీలను కొలంబోలోని నవలోక, వెస్ట్రన్, లంకన్ ఆస్పత్రుల్లో ఇస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లో మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తూ అందుకు అవసరమయ్యే ఆపరేషన్, రవాణా ఖర్చులను ఓ ఏజెంటు ద్వారా నడిపిస్తున్నట్లు వివరించారు. కిడ్నీ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఏజెంటు సురేష్తో పాటు జిల్లా కేంద్రానికి చెందిన మరో ముగ్గురు అబ్దుల్ హఫీజ్ అలీయాస్ ఖాజీం, పాలెం మహేష్, నరేష్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద మూడు పాస్పోర్టులు, మోటారు బైకు, టాటా ఇండిగో కారు, డెబిట్ కార్డు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.