breaking news
Small pond
-
మహోద్యమంగా జలసంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణను ఓ మహోద్యమంగా చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలంతా వర్షపునీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పలు నదులు, జలాశయాలు ఎండిపోయి ప్రజలు నీటికి కటకటలాడుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆదివారం నిర్వహించిన తొలి మాసాంతపు మన్కీ బాత్(మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం పాటించడం సరైన పద్ధతి కాదని మోదీ అభిప్రాయపడ్డారు. ఒక్కో ప్రాంతంలో అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ప్రతీ నీటిచుక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నీటి వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు, ఇతర సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, జలసంరక్షణ పద్ధతులను అందరికీ వివరించాలని కోరారు. ప్రస్తుతం భారత్లో కురుస్తున్న వర్షంలో కేవలం 8 శాతం నీటిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామన్నారు. గ్రామసభలను ఏర్పాటుచేసి ప్రజలంతా జల సంరక్షణ విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జలసంరక్షణ చర్యల్ని ప్రజలంతా ‘జన్శక్తి4జల్శక్తి’ అనే హ్యాష్ట్యాగ్ ద్వారా పంచుకోవాలని సూచించారు. 2014 అక్టోబర్ 3 నుంచి 2019, ఫిబ్రవరి 24 వరకు 53 సార్లు ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని నిర్వహించిన మోదీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిపివేశారు. కేదార్నాథ్ను అందుకే దర్శించుకున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 24న మన్కీబాత్ కార్యక్రమంలో ఓ 3–4 నెలల తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పాను. ఈ నమ్మకం మోదీది కాదు. ఇది మీరునాపై ఉంచిన నమ్మకం. ఈ నమ్మకానికి మీరే మూలకారణం. నన్ను మళ్లీ గెలిపించి ఇక్కడకు తీసుకొచ్చారు. మరోసారి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు’ అని మోదీ తెలిపారు. ‘మన్కీ బాత్’ ఆగిపోయిన సమయంలో తనకు ప్రజలతో సంభాషించే అవకాశం లేకుండాపోయిందనీ, అసౌకర్యంగా, ఒంటరిగా అనిపించిందని వెల్లడించారు. ‘ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ కేదార్నాథ్, బద్రీనాథ్లను దర్శించుకున్నాను. ఎన్నికల మధ్యలో ఎందుకు వెళ్లారని నన్ను చాలామంది అడిగారు. రాజకీయ ప్రచారం కోసమే వెళ్లానని కొందరు అనుకున్నారు. కానీ నా అంతరాత్మను కలుసుకోవడానికి, నన్ను నేను సమీక్షించుకోవడానికే కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లాను. అక్కడ ధ్యానం చేయడం మన్కీబాత్ కార్యక్రమం లేనిలోటును పూడ్చింది’ అన్నారు. మోదీ నోట ‘ఊటకుంట’ అడ్డాకుల (దేవరకద్ర): ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మహబూబ్నగర్ జిల్లాలోని తిమ్మాయిపల్లితండా శివారులో నిర్మించిన ఊటకుంటను ప్రస్తావించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన ఈ ఊటకుంట సత్ఫలితాలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. వర్షాలు కురిసినప్పుడు నీరు వృథాగా వెళ్లకుండా ఉండేందుకుగాను 4–5 ఏళ్ల క్రితం ఈ కుంటను నిర్మించారు. దీనికి అనుబంధంగా మరో రెండింటిని ఏర్పాటుచేశారు. దీనివల్ల వర్షం కురిసినప్పుడు గుట్టల పైనుంచి వచ్చే వర్షపునీరు కుంటలోనే నిలిచి పరిసరాల్లో ఉండే బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పెద్దపెద్ద చెరువుల వల్ల కలిగే ప్రయోజనాలు ఉపాధిహామీలో చిన్న కుంటలతోనూ లభిస్తున్నాయని చెబుతూ మోదీ ఈ ఊటకుంటను ప్రస్తావించారు. ప్రజాస్వామ్య గొప్పతనం తెలియట్లేదు.. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రోజూ సమయానికి భోజనం చేసే వ్యక్తికి ఆకలి కేకలు ఎలా ఉంటాయో తెలియదు. అలాగే ప్రస్తుతం ప్రజాస్వామ్య హక్కులను హాయిగా అనుభవిస్తున్న ప్రజలకు వాటి విలువ పోగొట్టుకుంటే తప్ప బోధపడదు. ఏదైనా మన దగ్గరున్నప్పుడు దాని విలువను అర్థం చేసుకోలేం. ఎమర్జెన్సీ సమయంలో ప్రతీపౌరుడికి తమకు సంబంధించినదేమో లాక్కున్న భావన కలిగింది. దీంతో 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేశారు. అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం నిజంగా మన అదృష్టమే. కానీ దాన్ని మనం తగినరీతిలో గౌరవించడం లేదు’ అని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఏకంగా 61 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రధాని వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా జనాభాకు రెట్టింపని తెలిపారు. భారత్లోని మొత్తం ఓటర్ల సంఖ్య యూరప్ ఖండం జనాభా కంటే ఎక్కువన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారనీ, ప్రస్తుతం పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. ప్రజలంతా గూగుల్ ద్వారా ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. ఈ సందర్భంగా గూగుల్ను ‘గూగుల్ గురు’గా ప్రధాని అభివర్ణించారు. -
నీటిగుంటలో పడి పదేళ్ల బాలిక మృతి
బొమ్మలరామారం (నల్లగొండ) : ఆడుకోవడానికి వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని నీటి గుంట వద్ద ఆడుకుంటున్న అనురాధ(10) ప్రమాదవశాత్తు అందులో పడి మృత్యువాత పడింది. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహన్ని బయటకు తీశారు. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గుండెలు పగిలేలా..
నలుగురు విద్యార్థుల మృతితో తల్లిదండ్రుల రోదన మృతుల గ్రామాల్లో అలముకున్న విషాదం ప్రత్తిపాడు/పెదనందిపాడు/వట్టిచెరుకూరు: కన్నకొడుకును ప్రయోజకుడిగా చూడాలన్న ఓ తల్లి కలలు కల్లలయ్యాయి. తనయుడిపైనే కోటి ఆశలు పెట్టుకున్న మరో నాన్న ఆశలు అడిఆశలయ్యాయి. కొడుకును ఉన్నతునిగా తీర్చిదిద్దాలన్న ఇంకొక తండ్రి ఆకాంక్ష చెదిరిపోయింది. కన్నకొడుకే శ్వాసగా బతుకుతున్న మరో తల్లికి గర్భశోకమే మిగిలింది... ఇలా విధి ఆ అభాగ్యుల కుటుంబాలపై క్వారీకుంట రూపంలో విషం చిమ్మింది. గుంటూరురూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలోని క్వారీ కుంటలో ఈతకు దిగి నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. పున్నామ నరకం నుంచి తప్పిస్తారనుకున్న కొడుకులను కాటికి సాగనంపాల్సి రావడంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. ఒక్కసారి లేనాన్న.. ఒక్కసారి లే బిడ్డా.. నీ కోసమే కదా ఈడ దాకా వచ్చాం.. అంటూ పందిరి సాయితేజ (14) కుటుంబం బోరున విలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పందిరి అప్పారావు, అమ్మన్న దంపతులు సుమారు పదహారేళ్ల క్రితం గుంటూరురూరల్ మండలం చౌడవరం వలస వచ్చారు. స్థానిక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేసుకుంటూ కూతురు, కుమారుడు సాయితేజను చదివించుకుంటున్నారు. కుమారుడి మృతితో వారి రోదించడం వారిని కంటతడి పెట్టించింది. కంటికి రెప్పలా పెంచి.. కంటికిరెప్పలా పెంచుకున్నాడు. తనకున్నదానిలో అడిగినవన్నీ ఇచ్చాడు. గారాభంగా చూసుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. గుంటూరురూరల్ మండలం జూనంచుండూరు గ్రామానికి చెందిన కనపర్తి మాణిక్యరావు, కనకాంబరం దంపతులు వ్యవసాయకూలీలు. వీరికి కుమార్తె తిరుమల దేవి, కుమారుడు మహేష్ ఉన్నారు. కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతోంది. కొడుకు మహేష్ను ఇంగ్లీషుమీడియం చదివిస్తున్నారు. మహేష్ మృతితో తండ్రి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది. కొడుకు మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని పదేపదే ముద్డాడుతూ ఆ తండ్రి తన ప్రేమను చాటడం అక్కడున్న వారందరికీ కన్నీటిని తెప్పించింది. చివరి ఆశగా.. కన్నకొడుకు కళ్ల ఎదుటే నిర్జీవంగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల గుండెలు అవిశిపోయాయి. ఒక్కసారి లేరా అభి.. మా నాన్నవి కదూ ఒక్కసారి లే.. అంటూ గుండెలపై తడుతూ అభిషేక్ తల్లి రోధించిన తీరు స్థానికుల మనసులను కలిచివేసింది. కొన ఊపిరి ఉందేమో అని చివరి ఆశగా కొడుకు గుండెలపై కొడుతూ ఆ తల్లి ప్రయత్నాలు చేయడం స్థానికుల గుండెలను పిండేసింది. గుంటూరురూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ చుక్కా నానిబాబు, చిట్టి మరియమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు అభిషేక్ మరణించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారి చూడయ్యా.. ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా.. నీ కోసమే బతుకుతున్నాం.. ఆ దేవుడు మమ్మల్ని తీసుకోపోకుండా నిన్ను తీసుకుపోయాడు.. అంటూ జూనంచుండూరుకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసరావు, విజయ దంపతులు బోరున విలపించారు. వీరికి కుమార్తె, కుమారుడు గోపీచంద్ ఉన్నారు. తండ్రి ఆటో నడుపుకుంటూ ఇద్దరినీ చదివిస్తున్నాడు. గోపీచంద్ మరణించడంతో వారి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది.