breaking news
Shilpakala
-
ఐటీ..కొండంత అండ
ఇక్కడ రాత్రి పగలు అన్న తేడా ఉండదు. ల్యాప్టాప్లు భుజాన వేసుకుని వచ్చిపోయే ఐటీ ఉద్యోగులతో నిండుగా ఉంటుంది. నైట్ షిఫ్ట్ ముగిసి ఇంటికెళ్లే వారు.. మొదటి షిఫ్ట్కు వచ్చేవారికి గుడ్మార్నింగ్.. అంటూ రోజు మొదలవుతుంది. అర్ధరాత్రి వేళ వేడి వేడి ఇడ్లీలు అందించేందుకు రోడ్డుపక్కన బళ్లు.. ఆనందాన్ని ఇచ్చేదుకు షాపింగ్ మాళ్లు.. విహారానికి దుర్గం చెరువు.. సరదా కోసం శిల్పకళా వేదిక.. వివిధ షిఫ్టుల్లో బిజీగా ఉండేవారికి నైట్ బజార్.. నగరం నిద్రపోతున్నా ‘కొండాపూర్’ మాత్రం మేల్కొనే ఉంటుంది. - గచ్చిబౌలి శేరిలింగంపల్లి డివిజన్లో అంతర్భాంగంగా ఉన్న కొండాపూర్ను పునర్విభజనలో నూతన డివిజన్గా ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లో దాదాపు 400 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటి నుంచి గ్రేటర్కు అధిక ఆదాయం సైతం వస్తోంది. శిల్పారామం, దుర్గం చెరువు వంటి పర్యాటక ప్రాంతాలకు నెలవు. 8వ టీఎస్ఎస్పీ బెటాలియన్, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, బయోడైవర్సిటీ పార్కు, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. అత్యంత ప్రాధాన్యత గల డివిజన్గా కొండాపూర్ను చెప్పవచ్చు. కొండాపూర్ డివిజన్లోని లుంబినీ విల్లాస్లో రాష్ట్ర దేవాదయ శాఖా మంత్రి ఇంద్ర కరణ్రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి నివాసం ఉంటున్నారు. డివిజన్లోని కాలనీలు.. కొండాపూర్ డివిజన్లో గుల్షన్నగర్, జనార్దన హిల్స్, డైమండ్ హిల్స్, పత్రికానగర్ , రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీ కాలనీ, తులీప్ గార్డెన్, గౌతమీ ఎన్క్లేవ్, ఆనంద్నగర్, ప్రశాంత్నగర్, కొత్తగూడ, ప్రశాంతినగర్, వైట్ఫీల్డ్, టీఎస్ఎస్పీ క్వార్టర్స్, విఠల్రావునగర్, గఫూర్నగర్, మెగాహిల్స్, కావూరిహిల్స్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ డివిజన్లో ఉన్న దుర్గం చెరువు నిజాం నవాబులకు తాగునీరు అందించేది. ఇప్పుడిది మురికి కుంటగా మారింది. 60 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐటీ కారిడార్లో పర్యాటక కేంద్రంగా ఉన్న దుర్గం చెరువు అభివృద్ధిని అధికారులు మరిచిపోయారు. కాలనీలు, ఐటీ కంపెనీల నుంచి వచ్చే మురుగు యథేచ్ఛగా ఈ చెరువులో కలిసి కంపు కొడుతోంది. నిండ నివ్వరు... ఎండనివ్వరు దుర్గం చెరువుకు రెండు వైపులా ప్రమాదం పొంచి ఉంది. వర్షాకాలంలో ఎఫ్టీఎల్లో నివాసితులు దుర్గం చెరువు నిండకుండా ఎప్పటికప్పుడు నీళ్లను కిందకు వదులుతారు. మరోవైపు పై కాలనీలు, ఇన్బాట్ మాల్ వైపు నుంచి వచ్చే ముగురు నీరుతో వేసవిలోనూ చెరువు ఎండిపోకుండా కంపు కొడుతోంది. మురుగు నీటికి అడ్డు కట్ట వేసి చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. తీవ్ర నీటి సమస్య కొండాపూర్ డివిజన్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. డివిజన్లో దుర్గం చెరువు, నేరాల చెరువు, బరంకుంట ఉన్నాయి. ఈ చెరువులన్నీ ఎండిపోయాయి. దీంతో భూగర్భ జాలాలు పాతాళానికి అడుగంటాయని చెప్పవచ్చు. డివిజన్ పరిధిలో 2 వేల అడుగుల వరకు బోర్లు వేసినా దుమ్ము మాత్రమే వస్తోంది. దీంతో ప్రజలు ప్రైవేట్, మంజీరా ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. మెట్రో వాటర్వర్క్స్ సరఫరా చేస్తున్న నీళ్లు ఏ మూలకు సరిపోవడం లేదు. మాదాపూర్లోని రిజర్వాయర్ ఈ డివిజన్లో ఉన్నా నీటి కష్టాలు తప్పడం లేదు. అపార్ట్మెంట్లకు ప్రైవేట్ ట్యాంకర్లే దిక్కయ్యాయి. ఒక్క రాఘవేంద్రకాలనీలోనే రోజుకు దాదాపు వంద ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చీకట్లో ఉంటున్నాం.. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎన్నోసార్లు కోరాం. ఇప్పటి వరకు 50 శాతం వీధి దీపాలు ఏర్పాటు చేశారు. రెండు మూడు ప్రాంతాల్లో వీధి దీపాలు అమర్చి చేతులు దులుపుకున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - బాల్రెడ్డి, రాఘవేంద్ర కాలనీ సి-బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రోగాలబారిన పడుతున్నాం ఏడాది నుంచి ఇళ్ల ముందే మురుగు పారుతోంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయమేస్తోంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ సమస్య పరిష్కరించేదెవరు..? - మాసమ్మ, అంజయ్యనగర్ ఓటర్ల సంఖ్య మొత్తం ఓటర్లు : 67,181 పురుషులు : 38,669 మహిళా ఓటర్లు: 28,512 పోలింగ్ స్టేషన్లు : 76 -
శిల్పారామంలో అగ్నిప్రమాదం
హస్త కళా స్టాళ్లు దగ్ధం రూ.60 లక్షల ఆస్తి నష్టం మాదాపూర్ : శిల్పారామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏడు స్టాళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 14 స్టాళ్లు పాక్షికంగా కాలిపోయాయి. దాదాపు రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దసరా నేపథ్యంలో హస్తకళా మేళా కోసం శిల్పారామంలో 120 స్టాళ్లను ఏర్పాటు చేశారు. యజమానులు రాత్రి 10 గంటలకే స్టాళ్లను మూసివేసి వెళ్లిపోయారు. 212 స్టాల్ సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పదినిమిషాల్లోనే ఒక స్టాల్ నుంచి మరో స్టాల్కు మంటలు వ్యాపించాయి. దీంతో విలువైన పట్టు చీరలు, ఖాదీ వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. మంటలు విస్తరించడంతో స్థానికులు గుర్తించి ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. వారు ఐదు నిమిషాల్లో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పండగ కోసం తెచ్చిన సామగ్రిని స్టాళ్లలోనే ఉంచారు. అగ్నిప్రమాదంతో శనివారం శిల్పారామం మూసివే శారు. సాయంత్రం సందర్శకులను అనుమతించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఫైర్ ఆఫీసర్... సంఘటన స్థలాన్ని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ సురేందర్ ఆనంద్ సందర్శించారు. కాలిపోయిన స్టాళ్లను పరిశీలించారు. కాలిపోయిన సామగ్రిని వెంటనే అంచనా వేయలేమన్నారు. కాలిపోయిన స్టాళ్లలోని స్టాక్ వివరాలను శిల్పారామం అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం రూ. 60 లక్షల ఆస్తి నష్టం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే.. స్టాల్స్ సమీపంలోని ఫ్యూజ్ బాక్స్ వద్ద విద్యుత్ వైర్లు చిందర వందరగా ఉండటంతో షార్ట్ సర్క్యూట్ అయిఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా ఓ యువకుడు మం టలను చల్లార్చేందుకు యత్నిస్తుండగా అతడి ముఖానికి గాయాలయ్యాయి. ఏసీ బస్సులో మంటలు చాదర్ఘాట్: దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఏసీ బస్ (ఏపీ 116 7286) టైర్ నుంచి మంటలు వచ్చాయి. బస్సు శనివారం సాయంత్రం లింగంపల్లి నుంచి దిల్సుఖ్నగర్ వస్తోంది. నల్గొండ క్రాస్రోడ్ వద్దకు రాగానే వెనుక టైర్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రీనివాస్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. ఆందోళన చెందిన ప్రయాణికులు కొంతదూరం పరుగుపెట్టగా.. డ్రైవర్ తన వద్ద గల క్యాన్లోని నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు గంటపాటు వెనుక టైర్ల నుంచి పొగలు వచ్చాయి. బేరింగ్ల నుంచి మంటలు వచ్చి ఉంటాయని డ్రైవర్ పేర్కొన్నారు. కారులో .... చైతన్యపురి: కారులో ఒక్కసారిగా మంటలు వచ్చి ఇంజిన్ కాలిపోయింది. శంషాబాద్కు చెందిన వ్యాపారి పాషా శనివారం ఎల్బీనగర్లోని తన స్నేహితుడిని కలిసేందుకు శాంత్రో కారులో వచ్చాడు. 3 గంటల ప్రాంతంలో తిరిగి వెళుతుండగా చైతన్యపురి చౌరస్తా సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయి. బైక్పై వెళుతున్న వ్యక్తి ఈ విషయాన్ని కారు నడుపుతున్న పాషాకు చెప్పటంతో రోడ్డు పక్కన ఆపాడు. మంటలు ఎక్కువై పొగలు వ్యాపించాయి. స్థానికులు కొందరు బకెట్లలో నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. మలక్పేట నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. కారు ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది.