breaking news
Shes cabs
-
ఫ్యామిలీ 2015
365 రోజులు. అంటే ఎన్నో గంటలు. ఇంకెన్నో నిమిషాలు. లెక్కపెట్టలేనన్ని సెకండ్లు. అంతకంటే లెక్కలేనన్ని ఆవిష్కారాలు... జయాలు... అపజయాలు... కలగలిస్తే 2015. ఒక్కసారి చేయి కదిలిస్తే దాని వల్ల కదలిన గాలి... కొన్నేళ్ల తర్వాత తుపానుగా మారుతుందని ఒక మహాశయుడు చెప్పాడు. ఈ ఏడాదిలో జరిగిన ప్రతి చిన్న ఘటన... అలాగే ఎదిగి పెద్ద అలై ఈ ప్రపంచ స్వభావాన్ని మారుస్తుంది. మనమందరం మంచే కోరుకుంటాం. మంచే జరగాలని ప్రార్థిస్తాం. అవసరమైతే పోరాడతాం. 2015లో అలాంటి జయాలు, అపజయాలు కొన్ని మీ కోసం... మరింత రక్షణ షీ క్యాబ్స్ మహిళల భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ క్యాబ్స్ సేవలు హైదరా బాద్లో ప్రారంభం అయ్యాయి. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్ను పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేశారు. దాని వల్ల క్యాబ్ల కదలికలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదు అవుతాయి. సెప్టెంబర్ 8న ‘షీ క్యాబ్స్’ ప్రారంభం అయ్యాయి. మరింత న్యాయం కట్నం ఎప్పుడు అడిగినా నేరమే! వరకట్నం అనేది ఎప్పుడైనా అడిగే అవకాశముందని, పెళ్లి తర్వాత అడిగినా అది నేరమేనని ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యకు విషమిచ్చి, కాల్చి చంపిన కేసులో ఉత్తరాఖండ్కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు గతంలో విధించిన జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది. పెళ్లికి ముందు తాను ఎలాంటి కట్నం అడగలేదని, పెళ్లి తర్వాతే అడిగినందున దానిని పరిగణనలోకి తీసుకోరాదని భీమ్సింగ్ అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు ఎం.వై.ఇక్బాల్, పినాకీ చంద్రఘోష్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మరింత తెగువ యుద్ధ విమానాల పైలట్లు దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధక్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళా పైలట్లను నియమిస్తామని అక్టోబర్ 24న రక్షణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్లోంచి తొలి మహిళాయుద్ధ విమాన పైలట్లను కేంద్రం ఎంపిక చేస్తుంది. 2017 జూన్ నాటికి వారికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు అప్పగిస్తారు. ముందడుగు హర్యానాలో 21 మహిళా పోలీస్ స్టేషన్లు మహిళలకు మరింత భద్రత కల్పించే చర్యలో భాగంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాలో పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే పోలీస్స్టేషన్లను ఆగస్టు 28న ప్రారంభించింది. ఈ స్టేషన్లలో స్త్రీలకు సబంధించిన వివిధ నేరాలు, కేసుల దర్యాప్తును మహిళా పోలీసులే నిర్వర్తిస్తారు. మేలిమి సంతకం నీతి ఆయోగ్ సీఈవో గా సింధుశ్రీ ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు అయిన ‘నీతి ఆయోగ్’ (భారత జాతీయ పరివర్తన సంస్థ)కు సీఈవోగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సింధుశ్రీ ఖుల్లర్ నియమితులయ్యారు. సింధుశ్రీని నియమించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ జనవరి 10న వెల్లడించింది. అప్పటివరకు ఆమె ప్రణాళికా సంఘం కార్యదర్శిగా పని చేశారు. ఐరాస శాంతిస్థాపన ప్యానెల్లో సరస్వతీ మీనన్ ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ బాన్కీ మూన్.. శాంతి స్థాపన కార్యక్రమాల సమీక్ష ప్యానల్లో భారత సామాజికవేత్త సరస్వతీ మీనన్ను నియమించారు. ఈ నియామకం ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ప్యానెల్లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ సలహా బృందం బురుండీ, దక్షిణ సూడాన్ తదితర దేశాల్లో పర్యటించి, శాంతిస్థాపన చర్యలను సమీక్షిస్తుంది. అమెరికా విద్యామండలి అధిపతిగా భారతీయ మహిళ అమెరికా విద్యామండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల ఛైర్పర్సన్గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి16న వాషింగ్టన్లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రేణు 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరెన్నో నవ్వులు బేటీ బచావో.. బేటీ పఢావో బాలికా సంక్షేమం, లింగ వివక్ష నిర్మూలన లక్ష్యాలుగా ‘బేటీ బచావో బేటీ పఢావో’ (ఆడపిల్లల్ని కాపాడండి... ఆడపిల్లల్ని చదవించండి) ప్రచార ఉద్యమాన్ని హరియాణలోని పానిపట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’నను మోదీ ప్రారంభించారు. దీనిని బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ (9.1శాతం), ఆదాయపు పన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్ల లోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్తో బ్యాంకుల్లోగానీ, పోస్టాఫీసుల్లోగానీ అకౌంట్ ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయలను డిపాజిట్ చెయ్యొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్లపాటు లేదా ఆ బాలికకు వివాహం అయ్యేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకోవచ్చు. మనో ధైర్యం మూడు మంచి ఆలోచనలు హిమ్మత్: మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జనవరి 1న ఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను రూపొందించారు. మహిళలు అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తం చేయడానికి ఇది పనికొస్తుంది. అభయం: ఆపదలో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు ఏపీ పోలీసులు ‘అభయం’ అనే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీని కింద టోల్ ఫ్రీ నెంబర్ 040-7101-1800ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా మిస్డ్కాల్ ఇచ్చిన రెండు నిమిషాల్లోనే బాధితులకు ఆపన్నహస్తం అందుతుంది. ఆరోగ్యలక్ష్మి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘ఆరోగ్యలక్ష్మి’గా నామకరణం చేశారు. శిశు వికాసం ప్రతి నెలా టీకాల వారం వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించింది. ఈ ఏడాది తొలి విడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు. బుజ్జి అడుగు శిఖరంపై చిచ్చర పిడుగులు ఇద్దరు భారత చిన్నారుల అరుదైన రికార్డును నెలకొల్పారు. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్ను అధిరోహించిన వారిగా రికార్డుల కెక్కారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన కందర్ప్ శర్మ, రిత్విక 5380 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు శిఖరం బేస్క్యాంపు వద్దకు ఆగస్టు 10న చేరుకున్నారు. కందర్ప్ వయసు 5 ఏళ్ల 10 నెలలు. రిత్విక వయసు 8 ఏళ్ల 11నెలలు. ఆగస్టు 2న వీరు ప్రయాణం మొదలు పెట్టారు. మహా విజయం ప్రపంచ నెంబర్ వన్ సైనా నెహ్వాల్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే 1980లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నారు. మరువలేని విషాదం విలవిలలాడిన పసిప్రాణం విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్న చావలి నాగ చిరుద్యోగి. బట్టల షాపులో గుమస్తా. భార్య లక్ష్మి రెండో కాన్పుకు సిద్ధమైంది. ఆగస్టు 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టుకతోనే ఆ పసికందులో అసాధారణ శారీరక సమస్య... కన్జెనిటల్ ఎనామలీ కనిపించింది. వైద్యులు చూసి శస్త్ర చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. అదొక నరకమనీ, యమభటులు అక్కడ ఎలుకల రూపంలో తిరుగుతుంటారనీ తెలియని ఆ అమాయక తల్లితండ్రులు ఎన్నో ఆశలతో బిడ్డను తీసుకు వెళ్లారు. ఆగస్టు 16న ఆపరేషన్ జరిగింది. బిడ్డను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. బాలింతరాలైన తల్లి కూడా అక్కడే ఉంది. ఐసీయూ అంటే ఇరవై నాలుగు గంటలూ సిబ్బంది పర్యవేక్షణలో ఉండే అత్యవసర చికిత్సా గది. డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఆయాలు తిరుగుతూనే ఉండాలి. కానీ ఆగస్టు 23 న బాబు కాలి వేళ్ల నుంచి, చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ కనిపించింది! ఎలుకలు కొరికాయి. తల్లి గమనించి, ఫిర్యాదు చేస్తే... ఆ రోజుల పసిగుడ్డు ఎలుక కాటు వల్ల ఎంత బాధ పడి ఉంటాడో, ఎంత నొప్పిని అనుభవించి ఉంటాడో అన్న కనీస స్పందన కూడా లేకుండా... డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. ఆశలు వదులుకోండి అన్నారు. వైద్యం చేయకుండా వదిలేశారు. ఆ పసికందు చనిపోయాడు. ఈ అమానుష ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ నవ్వు గుర్తొస్తూనే ఉంటుంది! ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్ సానప్ అలియాస్ లౌక్యాకు ఉరిశిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 30న న్యాయమూర్తి వృషాలీ జోషీ శిక్షను ఖరారు చేశారు. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్ మార్గ్-ఖండూప్ల మధ్య శవమై తేలింది. ఈ కేసులో నిందితుడైన చంద్రభాన్ను అక్టోబర్ 27న కోర్టు దోషిగా నిర్ధారించి, 30న శిక్ష ఖరారు చేసింది. ఆ కార్టూన్లు మరి లేవు! తన కార్టూన్లతో నవ్వులు పూయించిన రాగతి పండరి (50) అనారోగ్యంతో విశాఖపట్నంలో ఫిబ్రవరి 19న మరణించారు. పోలియో వల్ల రెండు కాళ్లూ బలహీన పడినా తెలుగునాట ఆమె కార్టూన్ మాత్రం దిటవుగా బలంగా నిలబడగలిగింది. ఉమన్ కార్టూనిస్ట్గా ఆమె విజయం స్ఫూర్తిదాయకం. ర్యాగింగ్కు బలైన రిషితేశ్వరి జులై 14 గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఎం. రిషితేశ్వరి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీనియర్స్ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన డైరీలో రాసుకుంది రిషితేశ్వరి. జడలు విప్పిన ర్యాగింగ్ భూతం రిషితేశ్వరిని పొట్టనపెట్టుకున్న తీరు తెలుగురాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మురళీకృష్ణ, దుర్గాబాయిల ఏకైక కూతురు రిషితేశ్వరి. కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలలో ఆమె సీనియర్ల వేధింపులకు గురైంది. ఆ తర్వాత వాళ్లు కొన్ని రోజుల పాటు రిషితేశ్వరి వెంటపడి మానసికంగా, శారీరకంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పుకోలేక హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందింది. మహానటి మరణం ప్రముఖ తమిళ నటి మనోరమ (78) అక్టోబర్ 10న అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 1500 చిత్రాల్లో ఆమె నటించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన నటిగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. అస్తమించిన అరుణ లైంగికదాడికి గురైనప్పుడు తీవ్రంగా గాయపడి 42 ఏళ్లుగా కోమాలో ఉన్న మాజీ నర్సు అరుణా షాన్బాగ్ (65) మే 18న తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొన్ని రోజులుగా న్యూమోనియా తీవ్రం కావడంతో వెంటిలేటర్పై ఉంచి, చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముంబైలోని కేఈఎం ఆసుపత్రి నర్సుగా పని చేస్తున్న అరుణపై 1973 నవంబర్ 27న వార్డుబాయ్ సోహన్లాల్ లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. ఇనుప గొలుసుతో బంధించాడు. గొలుసును విడిపించుకునే ప్రయత్నంలో తలకు గట్టి దెబ్బ తగలడంతో మెదడుకు రక్తసరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె కోమాలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు కోమాలో ఉన్న అరుణను కేఈఎం ఆసుపత్రి నర్సులు 42 ఏళ్ల పాటు అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్నారు. మృత్యువుతో ఆమె చేసిన పోరాటానికి వాళ్లంతా అండగా నిలిచి అన్ని రకాల సేవలు అందించారు. ప్రాణం తీసిన నిర్లక్ష్యం... ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పుష్కరాల్లో తొలిరోజు విషాదం చోటు చేసుకుంది. జూలై 14న రాజమండ్రి పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 24మంది మహిళలే. ఇంటికి కొడుకు...పర్వతానికి ముద్దుబిడ్డ పర్వతారోహకుడు మల్లె మస్తాన్బాబు (40) అర్జెంటీనా, చిలీ మధ్య ఉన్న ఆండిస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్బాబు ఇంజినీరింగ్ పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందారు. -
ఇక షీ క్యాబ్స్ పరుగులు
10 వాహనాలను ప్రారంభించిన మంత్రి మహేందర్రెడ్డి త్వరలో వంద షీ క్యాబ్లు... మహిళల భద్రతే సర్కార్ లక్ష్యం హైదరాబాద్: అదిగో ఇదిగో అంటూ ఏడాది పాటు ఊరించిన షీ క్యాబ్స్ ఎట్టకేలకు రోడ్డెక్కాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం మంత్రి మహేందర్రెడ్డి షీ క్యాబ్స్ను లాంఛనంగా ప్రారంభించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, మహిళలకు సురక్షితమైన, నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతోనే షీ క్యాబ్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు. దశల వారీగా 100 షీ క్యాబ్స్ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. షీ క్యాబ్స్పై ప్రభుత్వం 35 శాతం సబ్సిడీ అందజేస్తోందన్నారు. మొదటి విడతగా 10 క్యాబ్లను ప్రవేశపెట్టామని, త్వరలో మరో 8 అందుబాటులోకి రానున్నట్లు రవాణా కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా తెలిపారు. ఫిక్కీ సంస్థలో మహిళా డ్రైవర్లకు ఉచిత శిక్షణనిస్తున్నారని, డ్రైవింగ్లో అత్యుత్తమ శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లను ప్రతి నెలా 20 మంది చొప్పున ఎంపిక చేసి షీ క్యాబ్స్ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాతిలఖ్రా, సౌమ్యామిశ్రా, స్త్రీశిశు సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేందిర, ఫిక్కీ సంస్థ నిర్వాహకులు జ్యోత్స్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్ను పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. క్యాబ్ల కదలికలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదవుతాయన్నారు. సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీటీమ్స్ సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయన్నారు. స్వాతీలఖ్రా మాట్లాడుతూ ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ఒంటరి మహిళలకు క్యాబ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. -
కదిలింది... నారీ లోకం
షి క్యాబ్స్పై మహిళల ఆసక్తి తరలివచ్చిన ఉన్నత విద్యావంతులు {స్కీనింగ్ పరీక్షలు ప్రారంభం ప్రభుత్వం తలపెట్టినషీ క్యాబ్స్ పథకానికి మహిళా డ్రైవర్ల నుంచి మంచి స్పందన లభించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 47 మంది మహిళా డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలకు 12 మంది మహిళా డ్రైవర్లు హాజరయ్యారు. వీరిలో ఎంటెక్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు...సాధారణ డ్రైవింగ్ లెసైన్స్తో పాటు, ట్రాన్స్పోర్టు డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన వారు ఉండడం విశేషం. కొంతమంది ఏడాది కాలంగా డ్రైవింగ్ చేస్తుండగా... మరి కొందరు ఏడెనిమిదేళ్ల అనుభవం ఉన్న మహిళా డ్రైవ ర్లు ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. మియాపూర్కు చెందిన శివలీల ఎంటెక్ పూర్తి చేశారు. ఆమె బస్సులు, లారీల వంటి పెద్ద వాహనాలు నడిపేందుకు అర్హతగా భావించే హెవీ డ్రైవింగ్ లెసైన్సు కలిగి ఉన్నారు. మరో 8 మంది డ్రైవింగ్లో ఏడాది అనుభవం కలిగిన వారున్నారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేశారు. పదో తరగతితో పాటు, ఐటీఐ పూర్తి చేసిన మహిళ లూ షీ క్యాబ్స్ నడిపేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అభ్యర్ధుల దరఖాస్తులు, డ్రైవింగ్ లెసైన్సులు, ఇతర డాక్యుమెంట్లు స్వీకరించిన అధికారులు అర్హత గల వారిని త్వరలోనే శిక్షణకు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధికి చక్కటి మార్గం - జేటీసీ రఘునాథ్ షీ క్యాబ్స్తో మహిళా డ్రైవర్లకు చక్కటి ఆదాయం లభించగలదని జేటీసీ రఘునాథ్ తెలిపారు. నగరంలోని ఐటీ పరిశ్రమలు, స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల కోసం ఈ వాహనాలను నడిపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పగటిపూట మాత్రమే షీ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం త్రివేండ్రమ్లో నడుపుతున్న 50 మంది మహిళా డ్రైవర్లు ప్రతి నెల రూ.50 వేలకు పైగా ఆర్జిస్తున్నారని తెలిపారు. వాహనాలపై వాణిజ్య ప్రకటనల వల్ల కొంత మేర ఆదాయం వస్తుందన్నారు. త్వరలోనే విధివిధానాలను రూపొందించి, శిక్షణ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నగరంలో వసతి కల్పిస్తామన్నారు. -
మహిళా డ్రైవర్లకు అద్భుతభవిష్యత్తు
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి 24న ఆర్టీఏలో స్క్రీనింగ్ టెస్ట్ ఆసక్తి గల వారికి ఆహ్వానం ‘సాక్షి’తో జేటీసీ రఘునాథ్ సిటీబ్యూరో: షీక్యాబ్స్ విధి విధానాలపై ఆర్టీఏ కసరత్తు చేపట్టింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న (బుధవారం) స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అనంతరం వారికి రహదారి భద్రతా నిబంధ నలకు అనుగుణంగా మరింత శిక్షణనిస్తారు. నగరంలో షీ క్యాబ్స్ నడిపేందుకు ఆసక్తి చూపుతూ ఇప్పటి వరకు 47 మంది మహిళా డ్రైవర్లు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు నల్లగొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల డ్రైవర్లు కూడా వీరిలో ఉన్నారు. రవాణా శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళా డ్రైవర్ల నైపుణ్యం, వాహనాలు నడపడంలో వారి అనుభవం, ఆసక్తి, ఎలాంటి వాహనాలను నడపగలరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని, అదే రోజు సాయంత్రం విధివిధానాలను రూపొందిస్తారు. బ్యాంకులు, ఇతర విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. హైదరాబాద్లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు కాబట్టి లోపాలకు. వైఫల్యాలకు తావు లేకుండా, సమర్థంగా నిర్వహించేందుకు రవాణా శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని త్రివేండ్రంలోని షీ క్యాబ్స్ ప్రాజెక్టును అధ్యయనం చేసిన అధికారులు అక్కడి కంటే విజయవంతంగా దీనిని నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించారు. వాహనాల కొనుగోలుతో పాటు, 35 శాతం ప్రభుత్వమే సబ్సీడీని అందజేయడంతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు అన్ని విధాలుగా బాసటగా నిలిచి శిక్షణతో పాటు, అవసరమైన వారికి వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఆఖరు తేదీలు లేవు: రఘునాథ్, సంయుక్త రవాణా కమిషనర్ మహిళలు వాహనాలు నడపడం ఏ మాత్రం సమస్య కాబోదు. ఆసక్తి, అభిరుచి ఉంటే చాలు. రహదారులపై పరుగులు తీయవచ్చు. డ్రైవింగ్ వల్ల ఉపాధి లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళా డ్రైవర్లు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేదీలంటూ ఏమీ లేవు. హైదరాబాద్లో ఈ వృత్తిని స్వీకరించబోయే మహిళలు ఒక సామాజిక బాధ్యతను కూడా తమ భుజాన వేసుకోబోతున్నారు. తోటి మహిళల భద్రతకు తాము భరోసా ఇవ్వబోతున్నారు. ఆ రకంగా వారు విజయం సాధించాలని ఆశిస్తున్నాం. మహిళా డ్రైవర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అంద జేస్తుంది. -
రోడ్డెక్కిన ‘షీ క్యాబ్స్’
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోనే ప్రథమంగా మహిళల కోసం మహిళలే నడిపే ‘షీ క్యాబ్స్’ రోడ్డెక్కాయి. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో నడిచే ఈ క్యాబ్స్ను పబ్లిక్గార్డెన్స్లో బుధవారం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, ట్రాఫిక్ డీసీపీ సుధీర్బాబు, సామాజిక కార్యకర్త రాగిడి లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంలో నీలం సహానీ మాట్లాడు తూ మహిళలే క్యాబ్ నడిపిస్తామని ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ క్యాబ్లు రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు విస్తరించాలన్నారు. షీ క్యాబ్స్ ఎండీ విజయారెడ్డి మాట్లాడుతూ... ముందుగా రెండు క్యాబ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆదరణను బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తా మన్నారు. నగరాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు వీటిని ప్రవేశపెట్టామన్నారు. క్యాబ్లో జీపీఎస్ విధానాన్ని అమర్చామన్నారు. క్యాబ్ కావల్సినవారు 9393024242కు ఫోన్ చేయాలని సూచించారు. కరాటే మాస్టర్ నరేందర్ ఆత్మరక్షణకు మెళకువలు ప్రదర్శించారు. మొదటి ప్రయాణికురాలిగా అదనపు ఎస్పీ పద్మజ ప్రయాణించారు. షీక్యాబ్స్ సీఈఓ అనురాధారావు పాల్గొన్నారు.