‘ఫుడ్ పాయిజన్.. లేదంటే స్వర్ణం గెలిచేవాడిని’
భారత ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అనారోగ్యం బారిన పడకపోయి ఉంటే కామన్వెల్త్ గేమ్స్-2026లో స్వర్ణం గెలిచేవాడినన్నాడు. కాగా తాజాగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో సెల్వ ప్రభు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.గ్లాస్గో వేదికగా ట్రిపుల్ జంప్ మెన్స్ ఫైనల్లో అత్యుత్తమంగా 16.52 మీటర్లు దూకిన సెల్వ ప్రభు మూడో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన ప్రవీణ్ చిత్రావల్ 16.58 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఇక ఈ విభాగంలో స్కాట్లాండ్ అథ్లెట్ జోర్డాన్ స్కాట్ (16.72 మీటర్లు) పసిడి పతకాన్ని ముద్దాడాడు.ఫుడ్ పాయిజనింగ్ ఈ నేపథ్యంలో సెల్వ ప్రభు పీటీఐతో మాట్లాడుతూ.. పోటీకి ముందు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. ‘‘నిజంగా నేను స్వర్ణ పతకం గెలవాలని పట్టుదలగా ఉన్నాను. పోటీ మొదలైనపుడు కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాను. కానీ అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాను.ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇక అంతా అయిపోయిందనే అనుకునే తరుణం. కానీ నేను మానసికంగా చాలా బలవంతుడిని. ఏం జరిగినా మన మంచికే అని ముందుకు సాగాను. అనుకున్నది సాధించగలననే ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాను.నేను ఆరోగ్యంగా ఉండి ఉంటే పసిడి పతకం గెలిచేవాడినే. అయితే, ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్నెస్పై మరింత దృష్టి పెట్టాలి. ఒక్కసారి నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాని కోసం ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా స్వీకరిస్తా.ప్రతి రోజూ మనకొక సవాలేప్రతి ఉదయం సరికొత్తగా మొదలవుతుంది. ప్రతి రోజూ మనకొక సవాలే. ప్రదర్శన రోజురోజుకీ మెరుగుపరచుకోవాలి. అలా అయితే గోల్డ్ గెలవాలన్న లక్ష్యం నెరవేరుతుంది. ఆసియా క్రీడలకు అర్హత సాధించడమే నా ముందున్న తక్షణ లక్ష్యం’’ అని తమిళనాడు అథ్లెట్ సెల్వ ప్రభు చెప్పుకొచ్చాడు. చదవండి: రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్