-
ఉదారవాద ‘పీఠాధిపతులు’!
ఉదారవాద గురుపీఠానికి చెందిన అయతుల్లాలు, లేక ఆర్చిబిషప్లు అని ఈ వ్యాసానికి నేను శీర్షికను పెడినట్లయితే సరిగ్గా సరిపోవచ్చు. శంకరాచార్యులు ఎన్ని ప్రభోధాలు చేసినప్పటికీ వారు ఫత్వాలు మాత్రం జారీచేయరు. లేదా రంకెలేయరు కూడా.య కానీ ఈ రోజుల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఇలాంటి వ్యాఖ్యలు నేను చేశానంటే ఇరుపక్షాలూ నన్ను లక్ష్యంగా చేసుకోవచ్చు. విశ్వాసాలకు సంబంధించినంతవరకు ఛాందసులు, ఉదారవాదులు ఇరువురూ మైనారిటీలపై ఆరోపించడంలో సమాన స్థాయిలో ఉంటున్నారు. కాబట్టి, నేను నా సొంత హిందువుల వ్యవహారాలతో జోక్యం చేసుకుంటేనే ఉత్తమంగా ఉంటుంది. నేను చేస్తున్న ఈ వాదన పైన చెప్పిన మహా విశ్వాసాలలో దేనిగురించో కాదు. మనుషుల చరిత్రలో (మానవజాతి అనే పదం నేను వాడటంలేదు) ఆవిర్భవిస్తున్న సరికొత్త మతం అంటే ఉదారవాద వ్యవస్థ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఇది కొత్త వ్యవస్థ కాబట్టి అనేక వైవిధ్యపూరితమైన ప్రయాసల గుండా ముందుకు వెళ్లాల్సి ఉంది. తన సొంత పవిత్ర గ్రంథం నుంచి కాస్త పక్కకు పోయినా ఈ కొత్త వ్యవస్థ కూడా సహించదు. షియా/సున్నీ అని కాదు, కాథలిక్/ప్రొటెస్టెంట్ అని కాదు, వైష్ణవులు/శైవులు అని కాదు. నువు నా పీఠానికి లేక నా అధికారానికి చెంది ఉంటే, దానికి నీవు పూర్తిగా విధేయుడవై ఉండాల్సిందే. ఎలాంటి మినహాయింపులు, రాయితీలు లేవు. మార్గం నుంచి కాస్త పక్కకు పోవడానికి లేదు. వారాంతాల్లో కూడా హాజరు కాకుండా ఉండటానికి లేదు. నువ్వు మాతో అయినా ఉండు, లేదా మాకు వ్యతిరేకంగా అయినా ఉండు. ఇలాంటి పంథాను గతంలో జార్జి బుష్ జూనియర్ నుంచి విన్నాం. కానీ తాను ఉదారవాది కాదు. ఉదారవాది అంటే నిర్వచనం ఇదా? నా ప్రశ్న ఏదంటే, ఏమాత్రం వెసులుబాటు లేని నిబంధనలను, ప్రవర్తనను, ప్రసంగాలను కలిగి ఉంటూ మీరు ఎలా ఉదారవాదిగా ఉంటారన్నదే. కాకపోతే ఇతరులకోసం మీరు రూపొందించిన కనీస ప్రవర్తనా నియమావళిని వివరించడానికి నన్ను ప్రయత్నించనివ్వండి. మొదటిది, నా నిబంధనల ప్రకారం లౌకికవాదిగా ఉండండి. ఆవిధంగా మీ మతధర్మాలను, దేవుళ్లను డంప్ చేయండి. రెండు, స్వేచ్ఛా–మార్కెట్, ప్రపంచీకరణ, క్రమబద్ధీకరణను తీసివేయడం, లేదా వ్యర్థమైన నయా ఉదారవాదపు సకల రోతలను ఆమోదించండి. రాజ్యవ్యవస్థను మీ పవిత్రమైన దేవతగా అంగీ కరించడమే కాకుండా దాన్ని మరింత పరిపూర్ణంగా రూపొందించడంలో మాకు సహా యం చేయండి. కార్పొరేట్ సంస్థలు మొత్తంగా దొంగలని చెప్పండి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలు, గజదొంగలు కాకపోతే పవిత్ర సంస్థలన్నింటికీ నిధులు సమకూర్చిపెట్టేది ఎవరు అనే ప్రశ్న మాత్రం నన్ను అడక్కండి. దానికి ప్రతిఫలంగా ఫోర్డ్, రాక్ ఫెల్లర్, బిల్ – మెలిందా గేట్స్, మెకార్థర్, ఇన్లేక్స్, టాటా వంటి పవిత్రవాద సంస్థలన్నీ నాకు చాలినన్ని నిధులు ఇస్తారు. అంతే కానీ మీ నయా ఉదారవాద వ్యాపార సంస్థలు ఇవ్వవు. అలాగే అన్ని రకాల డ్యామ్లు, విద్యుత్ సంస్థలు, గనులు, పురుగుమందులు కంపెనీలను మొత్తంగా మీరు కచ్చితంగా వ్యతిరేకించాలి మరి. మూర్ఖపు అమెరికన్లు ట్రంప్ భూతాన్ని ఎన్నుకున్నారనే విషయాన్ని మీరూ ఆమోదించండి. కానీ పుతిన్, గ్జి జిన్పింగ్ ఈ జాబితాలోకి రారు. వీళ్లను ఎన్నుకున్నందుకు గాను ఆ దేశాల ప్రజలను కనీసంగా అయినా మీరు తప్పుపట్టరు. ప్రభుత్వం ఘనమైనదే కానీ ఎన్జీవోలే మెరుగైనవి. ప్రైవేట్ సెక్టర్ నియంత్రణలో ఉంది కాబట్టి సైన్స్ కూడా ప్రమాదకరమైనదే. ఇకపోతే మానవజాతికి అతి గొప్ప ప్రమాదం ఏదంటే జన్యుపరంగా మెరుగుపర్చిన ఆహార పదార్థాలే. ఈ తరహా షరియత్ ఆంక్షలను కాదని ఏమాత్రం పక్కకు పోయినా సరే మీరు దుష్ట కార్పొరేట్ సంస్థలు, అమిత్ షా లేక ఈ ఇద్దరినుంచి డబ్బులు పుచ్చుకుంటున్న ఉదారవాద వ్యతిరేక పందులుగా మిగిలిపోతారు. అందుకే సంక్షిప్త సందేశం ఏమిటి: ఉదారవాదిగా ఉండు, కానీ నా మార్గంలో, కచ్చితంగా నేను చెప్పినట్లుగా మాత్రమే పాటించు. నేర నిర్ధారణకు ముందే ఉరి తీయండి అమిత్ షా గురించి మేం చెప్పలేదా? న్యాయమూర్తి లోయా ఉదంతాన్ని జడ్జి లోయా వివాదాస్పద మృతిగా మీరు వర్ణించి దానిపై న్యాయబద్ధమైన దర్యాప్తును చేపట్టాల్సిందిగా కోరినట్లయితే నా పవిత్ర మార్గం నుంచి పక్కకు వెళ్లినట్లే. నిజమైన ఉదారవాది సరైన భాషను ఉపయోగిస్తాడు. న్యాయమూర్తి లోయా మృతిని చూద్దాం. ఆయన ఎలా చనిపోయారో దర్యాప్తు చేసి సమయం వృధా చేసుకోవడం ఎందుకు? ఆయన చనిపోయిన విషయం, ఎవరు చంపారు అనేది కూడా మీకు తెలుసు. ఈ ఆరోపణలన్నింటినీ బలమైన దారాలతో ముడివేసి అమిత్షాను ఉరి తీయండి. ఈ ఆరోపణలకు మీరు దూరంగా ఉండవచ్చు. అప్పుడు మీరు అమిత్ షా భయంకర లక్షణాలను కలిగి ఉన్నట్లే మరి. మిగతావారు సహజంగానే అనుసరిస్తారు. మీరు మేధావి అయినట్లయితే, సోషల్ మీడియా మిమ్మల్ని ప్రభావశీలురిగా పేర్కొన్నట్లయితే, మీరు మాట్లాడే ప్రతి మాటా మీకు వ్యతిరేకంగానే నిలుస్తుంది. చివరగా, మీరు సంపాదకులయినట్లయితే, మీరు పిలిచే ప్రతి న్యూస్ రూమ్ కాల్కి గాను మీపై విచారణ జరుగుతుంది. ఉదారవాద శంకరాచార్యులు, స్వయం ప్రకటిత పవిత్రుల్లో కెల్లా అతిపవిత్రులు మిమ్మల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు. పోయిన బుధవారం దిప్రింట్.ఇన్ లో ముంబైకి చెందిన రూపా సుబ్రహ్మణ్య కథనాన్ని ప్రచురించాం. ఆవిడ ఒక ఆర్థికవేత్త, దృఢమైన ట్విట్టర్ యుద్ధవీరురాలు. గత అయిదేళ్లుగా, ఆమె నరేంద్రమోదీకి అత్యంత మద్దతుదారుగా ఉంటూవస్తున్నారు. ఎవరైనా మోదీని విమర్శించినట్లయితే ఇక వారిని ఆమె క్షమించే ప్రసక్తే లేదు. ఈ రచయితను కూడా ఆమె వదిలిపెట్టలేదు. ఆమె ఇప్పుడు తనకు మోదీ పట్ల భ్రమలు ఎలా తొలిగిపోయాయో చెబుతూ మాకు ఒక కథనం పంపారు. ఆర్థిక సంస్కరణలు చేపడతాననీ, మత దురభిమానాన్ని, ఆర్థికవ్యవహారాల్లో ప్రభుత్వ పెత్తనానికి అవకాశం ఇవ్వనని మోదీ ఇచ్చిన హామీవల్లే తాను ఆయన్ని సమర్థిస్తూవచ్చానని రూపా వివరించారు. నిజంగా కూడా ఆమె రచన చక్కటి వాదనా పటిమతో రూపొందింది. ఊహించినట్లుగానే ఆమె వ్యాసం బీజేపీ నుంచి తీవ్ర అపనిందలను, దూషణలను ఎదుర్కొంది. విద్రోహిగా మారినందుకు ఆమెను, ఆమె విద్రోహాన్ని మా ఎజెండాను పరిపూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకున్నందుకు మమ్మల్ని కలిసికట్టుగా తూర్పారబట్టారు. అనూహ్యంగా స్వయం ప్రకటిత ఉదారవాద ప్రత్యర్థులు కూడా దీనిపై కారాలూ మిరియాలూ నూరారు. ఒకప్పుడు మితవాద కోణంగి (ట్రోల్)లా వ్యవహరించిన రూపాకు మేం వేదిక ఎలా ఇచ్చాం? ఆమెకు గౌరవం ఆపాదిస్తు మా గౌరవాన్ని ఎలా తగ్గించుకుంటాం? న్యూస్ రూమ్ అనేది కోర్టు కాదని, పోలీసు స్టేషన్ అసలే కాదనే మా వాదనను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అవివేకపు, బుద్ధిహీన గతం పట్ల ఆమె ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు, పైగా మన క్షమాపణను ఆమె గెల్చుకోలేదు మరి. ఇతరులకు మాత్రమే నిబంధనలా? ఇప్పుడు ఇది అయోమయానికి దారతీస్తోంది. ఉదారవాదం అంటే ఇతరులకు నిబంధనలు రూపొందించి వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందిగా చెప్పడం కాదు. లేక, మీరు నాకోసం నిబంధనలను రూపొందించినట్లయితే, సత్ప్రవర్తనా నియమావళి అనేది ఎలా ఉంటుందో, మీరు ఆమోదించదగిన ప్రవర్తన ఏదో మీరు నిర్వచిం చాల్సి ఉంది. మీరు ఉదారవాది కాదు. మీరు శీలవంతులే అయి ఉండవచ్చు. నాకంటే మంచి వ్యక్తి కావచ్చు, బహుశా గోవు కంటే పవిత్రమైన వ్యక్తి కావచ్చు. కానీ మీరు ఉదారవాది కాదు. మీరు ఒక అయతుల్లా వంటివారు. క్రీస్తు మతాధిపతి వంటివారు లేక శంకరాచార్యులు కావచ్చు. మీ దండాన్ని మీరు తీసుకుని ఇతరులు ఎలా ప్రవర్తించాలో, ఏం చెప్పాలో, దేన్ని ప్రచురించాలో ఆదేశాలు జారీ చేసేస్తారు. కానీ ఒక ప్రత్యేక ఇజాన్ని అంటే జర్నలిజాన్ని విశ్వసిస్తున్న మాలాంటి వారికి ఇది పెద్ద సవాలుగానే ఉంటుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం, ఒక అమెరికన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని తాను విశ్వసిస్తున్న ఉదారవాదంపై చిన్నపాటి యుద్ధమే చేసింది. కానీ తన విశ్వాసం కారణంగా ఆ యుద్ధంలో ఓడిపోయింది. దీని వివరాలకోసం హలోవెన్, సిల్లిమన్ కాలేజ్, యేల్ యూనివర్శిటీ అన్న సెర్చ్ పదంతో గూగుల్లో వెతకండి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ కాలేజీలోని కొంతమంది విద్యార్థులు ఆల్ సెయిట్స్ డే సందర్భంగా ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అంటూ తలకుమించిన ఆంక్షలు విధిస్తున్నారంటూ (ఇలా దుస్తులు ధరించొద్దు, దానివల్ల ఒక సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయి) వారి మాస్టర్, ఆయన సహోద్యోగి, ఆయన భార్యపై ఆరోపణలు గుప్పించారు. ప్రొఫెసర్ ఎరికా క్రిస్టకిస్ ఈ సందర్భంగా సరదాగా గడపండి అంతే కానీ అతిశయించిన రాజకీయ సవ్యమార్గం గురించి పట్టించుకోవద్దని అందరిగీ చిలిపి ఈమెయిల్ పంపారు. ఇది ఉదారవాద విద్యార్థి బృందాల్లో ఆగ్రహం రగిలించి నిరసనలకు దారితీసింది. అధ్యాపకుడు నికోలస్ క్రిస్టకిస్ను ఒక విద్యార్థి నేరుగా ప్రశ్నించిన దృశ్యం కెమెరా కంటపడింది. ‘‘ఇలాంటి ఆంక్షలను మీరు ఎలా అంగీకరిస్తారు? నిన్ను ఉద్యోగంలోకి తీసుకొచ్చిన వెధవ ఎవరు? వెంటనే ఉద్యోగం మానేయి! నీవు రాత్రి పూట నిద్రపోకూడదు!అసహ్యం కలిగిస్తున్నావు!’’ రాజకీయ పరిశుద్ధత తెచ్చి పెట్టే ఇక్కట్లు ఒక నిమిషం 20 సెకన్ల పాటు సాగిన ఆ వీడియో దృశ్యం ఫాక్స్ న్యూస్లో వచ్చింది. అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న శ్వేత అమెరికన్లను ఇది మరింతగా మండిం చింది. ఉదార వాద రాజకీయాల పరిశుద్ధతకు ఇది అతిశయించిన రూపమని వారు ఆరోపించారు. అది ‘అప్రసిద్ధమైన’ ఉదారవాద ఈస్ట్ కోస్ట్ క్యాంపస్ అని ఆగ్రహించి నది నల్లజాతికి చెందిన విద్యార్థిని అని ప్రత్యేకించి చెప్పడంద్వారా ఒరిగిదేమీ లేదు. ట్రంప్ ఎన్నికకు ఈ ఉదంతం మార్గం కల్పించిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఈ సందర్భంగా ఎరికా క్రిస్టకిస్ వాషింగ్టన్ పోస్ట్కు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘‘అక్టోబర్ 31 రాత్రి హలొవిన్ సందర్భంగా నేను పంపిన ఈమెయిల్ క్యాంపస్ను మండించింది. ఇది స్వయం సెన్సార్షిప్కు సంబంధించిన చక్కటి గుణపాఠం’’ దీనిపై ఆమె మరింతగా వివరిస్తూ, ‘‘స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మన దేశం లోని అతి గొప్ప విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో వెలిగిపోతూండవచ్చు. కానీ ఇతరులు చెప్పేది వినాల్సిన సంస్కృతిని కాస్త చక్కదిద్దాల్సి ఉంది’’ అని ముగించారు. మరింత ముందుకెళ్లి ఇప్పుడు ట్రంప్పై సెమినార్లలో, పబ్లలో, కాఫీ షాపుల్లో, ట్విట్టర్, ఫేస్బుక్లలోనే కాకుండా మీ టీ షర్టులపై కూడా ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేయండి. రాబర్ట్ డి నీరో వంటి సుప్రసిద్ధ వ్యక్తి లాగా ట్రంప్ గురించి దూషణ భూషణలకు దిగి జనంచే చప్పట్లు కొట్టించుకోండి. భారతదేశంలో మోదీ పట్ల కూడా మీరు ఇలాగే వ్యవహరించవచ్చు. ఫలితం మాత్రం ఒకేవిధంగా ఉంటుంది. అలా విమర్శించడం ద్వారా, దూషించడం ద్వారా, గేలి చేయడం ద్వారా ట్రంప్, మోదీ వంటి వారి పునాది మరింత బలపడుతుంది. ఎందుకంటే మీరు చేసే ఇలాంటి దూషణలు, ఖండనమండనలు ఉదారవాద వ్యతిరేక మితవాదులు విజయవంతంగా నిర్మిస్తూవస్తున్నట్లుగా ట్రంప్, మోదీ వంటివారిని బాధితులుగా మార్చివేస్తాయి. అలాంటి పరిణామానికి మీవంటివారి సహాయం కూడా లభిస్తున్నట్లే మరి. విశ్వాసులు అధికారాన్ని కట్టబెట్టలేరు వర్గాలుగా విడిపోయిన ప్రజాస్వామిక వ్యవస్థల్లో అధికారాన్ని ఎవరు గెల్చుకుంటారు అనే అంశాన్ని రెండు పక్షాలలోని నిజమైన విశ్వాసుల సంభాషణ నిర్థారించదు. ఈ రెండు పక్షాలకు చెందని వారే నిజంగా అధికారాన్ని కట్టబెడుతుంటారు. ఇలాంటివారందరినీ మీరు బుర్రతక్కువవారనీ, నాగరికత తెలీనివారని, నిరక్షర కుక్షిలని, ఉదారవాద రహిత క్షుద్రులని మీరు మీవైన తీర్పులు చెబుతున్నప్పటికీ, వాళ్లు మాత్రం మీకూ, మీ వ్యతిరేక పక్షం వారికి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్నీ చూడలేరు. వారు కచ్చింతగా మీకు దూరమౌతారు. లేక మీరు వారిని కోల్పోతారు. అలాగే మీ ప్రత్యర్థి పక్షం వారు సైతం క్షమాపణ అన్నదే ఎరుగని జాతీయవాదంపైవు కొట్టుకుపోతారు. అంతిమంగా ఇది యావత్ ప్రజానీకానీకి ఉపద్రవం కలిగించక మానదు. కాబట్టి, తమకు తాము ఉదారవాదులుగా పిలుచుకుంటున్నావారు తమ పరిధిని కాస్త విస్తరించుకోవాలి. ఉష్ట్ర పక్షిలాగా తమలో తాము కూరుకుపోవడం కాకుండా తమ చోటును ఇతరులకు కూడా కాస్త పంచిపెట్టాలి. అలా కాకుండా దానికి భిన్నమైన మార్గంలో వెళితే గోతులు తీసి గోడలు కడతారు కానీ ద్వీపం మాత్రం ఒరుసుకునిపోతుంది. అందుకని, మనలో చాలామంది ఎరికా క్రిస్టకిస్ చెప్పినట్లుగా ఇతరులు చెప్పింది వినడం అనే సంస్కృతికి మరమ్మతులు చేయాల్సి ఉంది. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సీఎం కేసీఆర్తో శేఖర్ గుప్తా భేటీ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్ శేఖర్ గుప్తా శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కలిశారు. ఈ సందర్భంగా వారు దేశ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న సీఎం కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్తా బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపథ్యాన్ని సీఎం వివరించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ చెప్పారు. పాలకుల దృక్పథంలో మార్పు రాకపోతే ఈ పరిస్థితి ఎన్నటికీ మారదన్నారు. అనేక రాష్ట్రాలు సమ్మిళితంగా ఉన్న మన దేశంలో సమాఖ్య స్ఫూర్తి కొరవడటం వల్ల అన్ని విషయాల్లో సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ వెలిబుచ్చిన అభిప్రాయాలతో శేఖర్ గుప్తా ఏకీభవించారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రయత్నాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాలు, ఫెడరల్ వ్యవస్థకు ఉండాల్సిన లక్షణాలు, దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి అవరోధాలు, దేశాభివృద్ధికి అడ్డుగా ఉన్న అంశాలు, వాటిని అధిగమించే మార్గాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా వారు చర్చించారు. -
కొయ్యగుర్రం సవారీ ఇక చాలు!
జాతిహితం ఉత్తర భారతంలోని వాయు కాలుష్యం జాతీయ అత్యవసర పరిస్థితిగా భావించాల్సినంతటి తీవ్ర సంక్షోభంగా మారింది. ‘మనం ఏమైనా చేయాల్సిందే’నంటూ మన కార్యకర్తలు– న్యాయసంస్థల కూటమి సదుద్దేశాలతో పటాసులు, పాత వాహనాలు, డీజిల్ తదితరాలపై నిషేధం విధించింది. అయినా ఢిల్లీ గాలి, గ్యాస్ ఛాంబర్ స్థాయిల్లోనే ఉంది. విషపూరితమైన ఆ గాలి మునిసిపల్ లేదా జాతీయ సరిహద్దులను లెక్కచేసేది కాదు. అతి తీవ్ర సమస్యను చిల్లరమల్లరదిగా మార్చి మనల్ని మనం వెర్రిబాగుల వాళ్లను చేసుకుంటున్నాం. రాజ్కపూర్ బాబీ (1973) సినిమాలో లతా మంగేష్కర్ గొంతుతో డింపుల్ కపాడియా ‘‘ముఝె కుచ్ కెహనా హై’’ (నాకేదో చెప్పాలని ఉంది) అంటే... రిషీ కపూర్ నాకూ ఏదో చెప్పాలని ఉందంటూ గొంతు కలుపుతాడు. ఆనంద్ బక్షీ రాసిన ఆ మృదు మధుర గేయం టీనేజర్ల హృదయ తంత్రువులను మీటుతుంది. మనం ఇప్పుడు విశ్లేషిస్తున్న అంశానికి సంబంధించి అలాంటి మృదువైనది ఏదీ లేదు. సుప్రసిద్ధమైన ఆ గీతంలోని ‘‘కెహ్నా’’ (చెప్పాలని) స్థానంలో ‘‘కర్నా’’(చెయ్యాలని) పెట్టి, మెలితిప్పి ఉత్తర భారతంలోని వాయు కాలుష్య సమస్యను విశ్లేషిస్తాను. జాతీయ అత్యవసర పరిస్థితిగా భావించాల్సినంతటి తీవ్ర సంక్షోభంగా మారిన ప్రాణాంతక వాయు కాలు ష్యం పట్ల సాధారణంగా మనం డింపుల్ పాటకు వంతలాగా ‘‘ముఝె కుచ్ కర్నా హై’’ (నాకు ఏదో చే యాలని ఉంది) అని బృందగానం చేస్తాం. మనతో పాటూ ప్రభుత్వ పెద్దలు, న్యాయవ్యవస్థ, కార్యకర్తలు, మీడియా, అందరిలోకీ అతి తెలివైనవారైన రాజకీయవేత్తలు... రిషీ కపూర్లా ‘‘ముఝె భీ కుచ్ కర్నా హై’’ (నాకూ ఏదో చేయాలని ఉంది) అనేస్తారు. కాలుష్య వ్యతిరేక యోధుల సాహçసగాథ ప్రతి ఒక్కరూ డింపుల్ అంతరంగంలోని ఆ ‘‘ఏదో’’ని పట్టుకు వేలాడుతారు. మీడియా అద్భుత పతాక శీర్షికలను సృష్టిస్తుంది, మాటల రాయుళ్లు విజ యాన్ని ప్రకటించేస్తారు. ఢిల్లీని కమ్మేసే పొగ మేఘాలకు చిట్కా పరిష్కా రాలను ప్రకటించి, వీరోచితంగా పొగను చావుదెబ్బ తీసేశామని హర్ష ధ్వానాలు చేయడం ఎన్నిసార్లు జరిగిందో గూగుల్ను శోధించి చూడండి. ప్రత్యేకించి దీపావళి–శీతాకాలం మాసాల్లో ఈ తంతు మరీ విపరీతం. అంతే గానీ, అసలు పెద్ద సమస్యపై పరిశోధన జరిపి, పరిష్కరించే ప్రయత్నాలు చేసింది మాత్రం లేదు. అందుకు చాలా కాలం పడుతుంది, నిజమైన పరి ష్కారాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండవు. ఆ పనులు చేయాలంటే ఎంతో సమయం, కఠోరమైన శ్రమ అవసరం. ఈ అత్యవసర సమస్య గురించి ఏమీ చేస్తున్నట్టు కనిపించడం లేదు కాబట్టి, కనీసం మనం ‘‘ఏదో’’ అయినా చేద్దాం. కొయ్య గుర్రం పైకెక్కి స్వారీ చేసే అవకాశం మనకు లభించడం వల్ల కలిగే హాని ఏమీ లేదు. లేదంటే, మనకు ఇష్టమైన రాక్షస సంహారం చేసేస్తే సరి. నేను చేయాల్సింది ఏదో చేసేశాను కాబట్టి ఇక నా బాధ్యత ముగిసి పోతుంది. ఈలోగా మీరు, ఎయిర్–ప్యూరిఫయర్ను (ఎయిర్ కండిషనర్ కంటే ఖరీదైనది) కొనుక్కోండి. ఆ స్తోమత లేకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆ దేవుణ్ణి ప్రార్థించండి. కాలుష్యం పొగను పరిమార్చే మన వీరాధివీరులు పతాక శీర్షికలకు ఎక్కుతూ చాలా ఏళ్లుగా చేసిన వీరోచిత కృత్యాల సంక్షిప్త వర్ణన ఇది. ఒకరు నిర్దిష్ట కాల పరిమితికి మించిన వాహనాలేవీ రాజధానిలో తిరగడానికి వీల్లే దంటూ నిషేధం విధించారు. మరొకరు డీజిల్పై విరుచుకుపడ్డారు, నగరం లోకి ప్రవేశించే భారీ ట్రక్కులపైన కాలుష్యం పన్ను విధించారు, నిర్మాణ ప్రాంతాల్లో పనుల నిలుపుదలకు ఇష్టానుసారం ఆజ్ఞలను జారీ చేశారు. నీళ్లు చల్లాలని ఆదేశించారు. శిథిలాలను రోడ్డు పక్కన వదిలే కుటుంబాలపై జరి మానాలు (రూ. 50,000కు తక్కువ కాదు) విధించారు. ఎయిర్–ప్యూరి ఫైయర్ బ్రాండ్లు ప్రాయోజకులుగా టీవీ చానళ్ల నిరంతర ఆర్భాటంతో ఒక అసాధారణమైన పథకాన్ని సైతం అమలు చేశారు. ఇప్పుడిక పటాసులనునిషేధించారు. ఫలితంగా మన వాయు నాణ్యత ఏ మాత్రం మెరుగయిం దం టారు? ఎయిర్–ప్యూరిఫయర్లలోని రీడింగ్లను ఒక్కసారి చూడండి.సుప్రీంకోర్టు మిస్టర్ జస్టిస్ ‘‘పర్యావరణం’’ కుల్దీప్సింగ్, ప్రజా వ్యాజ్య యోధుడు ఎమ్సీ మెహతాల కాలంలో, 1990ల మధ్యలో కార్య కర్తలు–న్యాయసంస్థల కూటమి ఆవిర్భవించింది. అయితే వారిద్దరూ ఈ సమస్య పరిష్కారం దిశగా నిజమైన కృషినే చేశారు. దేశ రాజధానిలోని ప్రభుత్వం, వాణిజ్య రవాణా వాహనాలన్నీ సీఎన్జీకి మారే పని విజయ వంతంగా పూర్తికావడం వారి ఘనతే. అది వాయు నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను తెచ్చింది. కానీ అలా జరిగిన మేలు దశాబ్ది క్రితమే అడు గంటిపోయింది. ఆ తర్వాత జరిగిన కృషిలో చాలా వరకు గారడీ విద్యలు, ఆలోచనరహితమైన, అహంకారపూరితమైన, నిరంకుశమైన చర్యలే. కార్య కర్తలం, న్యాయమూర్తులం, మీడియాలోని మిత్రులమైన మాకు మీకేది ఉత్త మమో తెలుసు. కాబట్టి మేం ఆదేశిస్తాం, మీరు శిరసావహించండి. కోర్టు ధిక్కార భయంతో ఎదురు ప్రశ్నలు వేయకండి, జవాబుదారీతనాన్ని కోర కండి. ఈలోగా మీ పిల్లలకు నెబ్యులైజర్లను (ఉబ్బసం వంటి రోగ బాధి తులకు ఊపిరి సలపడానికి ఆవిరి రూపంలో మందును అందించే ఉపకర ణాలు) వాడటం నేర్పించండి. ఇదీ వారి ధోరణి. విడ్డూరపు పరిష్కారాలు ఢిల్లీ వాయు కాలుష్యం సమస్య అతి తీవ్రమైనది. అందుకు సూచించే కొన్ని పరిష్కారాలు మరీ విడ్డూరమైనవి, అనాలోచితమైనవి. హఠాత్తుగా ఢిల్లీలోని కుటీర పరిశ్రమలన్నీ బవనా వంటి ప్రాంతాలకు తరలాలన్నారు. కనీసం భౌతిక, మానవ వనరుల పరమైన మౌలిక సదుపాయాలను నిర్మిం చాల్సిన బాధ్యతను సైతం విస్మరించారు. కొంత సమయం ఇచ్చే ఓపికైనా చూపలేదు. ప్రభుత్వ రవాణా సదుపాయాలు, గృహవసతి ఏర్పాట్లయినా లేకుండానే ఆ పరిశ్రమను, ఉద్యోగాలను తరలించారు. ఫలితంగా ఎన్నో ఉద్యోగాలు పోయాయి, ల్యాండ్ మాఫియాలు నిర్మించిన కొత్త మురికి వాడలు, అక్రమ గృహసముదాయాలు పుట్టుకొచ్చాయి. ఇంతా చేసి దీనివల్ల జరిగింది ఏముంది? సాపేక్షికంగా రాజధానికి ప్రధాన భాగం లోపలి కాలు ష్యాన్ని వెలుపలకు తరలించడం మాత్రమే. ఢిల్లీలో ఎలాంటి పరిశ్రమలు ఉండాలనే విధానం గురించి, ఆ దిశగా సాగడం గురించి తగినంతగా ఆలో చించిందే లేదు. సమాజంలోని విశేష హక్కులున్న ఒక సముదాయం తమ కాలుష్యాన్ని తమకంటే తక్కువ స్థాయివారిపైన రుద్దగలగడం హాస్యాస్పదం. ఆ విషపూరి తమైన గాలి మునిసిపల్ లేదా జాతీయ సరిహద్దులను లెక్కచేసేది కాదని లెస్టర్ బ్రౌన్ మనకు బోధించారు. పర్యావరణ కార్యకర్తల ఉద్యమ పితామ హుడైన ఆయన, ఈ సమస్యపై రచించిన సాధికారిక గ్రంథం వరల్డ్ వితవుట్ బార్డర్స్లో (1972) ఈ విషయాన్ని తెలిపారు. 2015లో ఒకప్పటి సామాజిక కార్యకర్తల పార్టీ ఆప్ ఢిల్లీలో అధికారం లోకి వచ్చింది. వెంటనే అది తన పాత అవినీతి వ్యతిరేక ఎజెండాను కాలుష్య వ్యతిరేకమైనదిగా మరల్చి, ఈ గారడీ విద్యను పూర్తిగా భిన్నమైన మరో స్థాయికి చేర్చింది. నా సహోద్యోగి రాజగోపాల్ సింగ్ సహాయంతో ముందు పేర్కొన్న వాస్తవాలను గుదిగుచ్చాను. ఒకటి,ఆప్ ప్రభుత్వం సరి/బేసి పథ కాన్ని ప్రవేశపెట్టింది. దాని వల్ల వాయు నాణ్యతలో ఎలాంటి మార్పూ లేదు. ఆ తర్వాత అత్యంత కాలుష్యభరితమైన ప్రాంతాల్లో ఐదు భారీ ఎయిర్ ప్యూరి ఫయర్లను, ఒక మిస్ట్ ఫౌంటెయిన్ను, ఒక వర్చ్యువల్ చిమ్నీని నెలకొల్పింది. 2016 అక్టోబర్లో ‘‘ప్రయోగాత్మక ప్రాతి పదిక’’పై వాటిని పని చేయించింది కూడా. మన ఊపిరి తిత్తులను ఘోరంగా నాశనం చేసే దుమ్మును తగ్గించడం కోసం రోడ్లను వాక్యుం క్లీనర్లు, యంత్రాలతో శుభ్రం చేయిస్తామని కూడా వాగ్దానం చేసింది. ఈ మధ్య అలాంటిది ఏదైనా కనిపించిందా? దేవుడైనా విప్పలేని చిక్కుముడి ఈలోగా, పర్యావరణ కాలుష్యం (నివారణ, నియంత్రణ) సంస్థ (ఈపీసీఏ), సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... వాహనాలు, ఇంధనాలపై తమ సొంత ఆదేశాలను చాలా వాటిని జారీ చేస్తుంటాయి. అవేమిటో అర్థం కావాలంటే మెక్ కిన్సీ లాంటి అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థను ఆశ్రయించాల్సిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఈపీసీఏ, సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికను చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ప్రత్యేకించి అందులోని సుప్రీం ఆదేశాల అమలు ప్రస్తుత పరిస్థితిపై నివేదిక (పేజీ 14–21)లోని అంశాలు ముఖ్యమైనవి. రాజధానిలోని పొగకు సంబం ధించి సుప్రీం కోర్టు కార్యాచరణ ప్రణాళికపై ఏప్రిల్ 4న ఈపీసీఏ సమర్పిం చిన నివేదిక అంతకంటే ఎక్కువ విషయాలను వెల్లడిస్తుంది (పేజీ. 10–29). అది చాలా అర్థవంతమైనది, సమగ్రమైనది, పరిశుద్ధ ప్రపంచాన్ని ఆవిష్క రించేది. కానీ విప్లవానికి వెంట్రుక వాసి మాత్రమే తక్కువైన ఆ ప్రణాళికను అమలు చేయడం అసాధ్యం. ఢిల్లీతో పాటూ కేంద్రం, పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు డజను సంస్థలు దానికి కట్టుబడాలి. భారీ బడ్జెట్లతో వేలాది బస్సు లను కొనాలి, ప్రత్యేక రహదారులను నిర్మించాలి, ఇంధనపు, పన్నులు విధిం చాలి. రాజధాని సరిహద్దు వ్యవసాయ ప్రాంతాలు, దూరంగా ఉన్న హరి యాణా, పంజా»Œ మునిసిపల్, పౌర సంస్థలు పలు చర్యలను చేపట్టాలి. దాన్ని అమలు చేయడానికి కనీసం ఒక పూర్తికాలపు సుప్రీం కోర్టు ధర్మాసనం అవసరం. చదవడానికి అది అద్భుతంగా ఉంటుంది గానీ, అమలుచేయడం అసాధ్యమని అత్యంత గౌరవంగా చెప్పాల్సి వస్తోంది. క్రూరంగానే ఉండొచ్చు గానీ ఒక్కసారి వాస్తవాలను చూద్దాం. 2010లో కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒక్క కొత్త బస్సును కూడా కొనలేదు. ఇప్పుడు నడుస్తున్న మెట్రో దశ–3 పనులు ఒక ఏడాదికిపైగా, దశ–4 పనులు రెండున్నరేళ్లు ఆలస్యం అయ్యాయి. మొత్తంగా ఇది ఆ భగవంతుడైనా విప్పలేని చిక్కుముడి. కటువుగానే ఉండొచ్చుగానీ నిజం చెప్పక పోవడం పిరికితనం, మన పిల్లల ఊపిరితిత్తుల విషయంలో దగాకు పాల్పడటం. ఎమ్సీ మెహతా ప్రజా వ్యాజ్యం ఫలితంగా 1985 నుంచి ఏర్పడ్డ ఈ కమిటీలు అద్భుతంగా కృషి చేశాయి. కానీ ఇప్పుడు అవి కాలదోషం పట్టి నిరర్థకంగా మారాయి. 20 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈపీసీఏ అధిపతి భూరే లాల్ 1998 నుంచి ఆ బాధ్యతలలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో మన వాయు నాణ్యత ఏమైనా మెరుగై ఉంటే బాగానే ఉండేది. ఇప్పుడిక ఈ సమస్య పరిష్కారానికి ఒక సాధికారిక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సంస్థలో సంబంధిత ముఖ్యమంత్రులంతా ఉండాలి. వారికి తగు లక్ష్యాలను నిర్దేశించి, జవాబుదారీతనం వహించేలా చేయాలి. అవసరమైతే ప్రధాని దానికి నేతృ త్వం వహించాలి. ఇది, న్యాయస్థానాలు ఇకపై ఫుట్పాత్లను వీడాలని అత్యంత వినయంగా మనవి చేయాల్సిన సమయం కూడా. అవి ఇంతవరకు చాలా చేశాయి. పరిపాలనా వ్యవస్థ తన బాధ్యతలను మీ మీదికి నెట్టేయ డాన్ని అను మతించడం ఎందుకు. ఇక విశ్రమించి, పాలనా వ్యవస్థ చేపట్టే చర్యల నిరర్థకతను పరిహసించండి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
బాబుగారూ.. బడాయితనం
► హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ ► నా జీవితం ప్రజల కోసం త్యాగం చేశా ► అప్పుడు నేను సంపదను సృష్టించింది నేనే ► ఎన్నికల్లో చేసిన హామీల కన్నా ఎక్కువ ఇస్తున్నా ► తెలంగాణలో నా జనం ఉంటారు.. కానీ నేనక్కడికి వెళ్లలేను ► టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు ► ఎన్డీటీవీ ‘వాక్ ది టాక్’లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చిద్విలాసంగా చెప్పుకున్న గొప్పలివి! నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నది గట్టుపై నిర్మించిన గెస్ట్హౌస్ను అధికారిక నివాసంగా చేసుకున్న చంద్రబాబు.. ఆ గెస్ట్హౌస్లోనే ఎన్డీటీవీ ‘వాక్ ది టాక్’లో ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణా నది గట్టు మీద, గెస్ట్హౌస్ లాన్లలో విహరిస్తూ ఆయన చెప్పిన మాటలు.. చేసిన వ్యాఖ్యలపై ఫేస్బుక్, ట్విటర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఆయన వ్యాఖ్యలను జోక్లుగా అభివర్ణిస్తూ సెటైర్లు వినవస్తున్నాయి. ఇంటర్వ్యూలో శేఖర్గుప్తా అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిస్తూ చేసిన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... సాక్షి, హైదరాబాద్ : ‘‘నా జీవితం, రాజకీయాలు అంతా పోరాటమయం. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అందరూ నన్ను అంతం చేయాలనుకున్నారు. ఎన్నో కష్టాలు.. పదేళ్ల పాటు పోరాడి చివరకు నేను నవ్యాంధ్రప్రదేశ్కు సీఎం అయ్యాను. హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. హైదరాబాద్, సికిందరాబాద్లకు నేను సైబరాబాద్ను చేర్చాను. నేను హైదరాబాద్ను అభివృద్ధి చేశా అన్న ఆలోచనలు వస్తాయి. కానీ.. నేను జనం కోసం హైదరాబాద్ను నిర్మించానన్నది వాస్తవం. వారిని అనుభవించనివ్వండి.. నేను మరో నగరాన్ని నిర్మిస్తా. ఆరు నెలల కాలంలో.. గోదావరి నుంచి కృష్ణాకు నేను నీళ్లు తీసుకురాగలిగాను. ఈ ఏడాది 8 టీఎంసీ నీళ్లు ఇక్కడికి వచ్చాయి. పోలవరం ద్వారా గోదావరిలో వరద ఉన్నపుడు ఎంత నీటినైనా ఇక్కడికి తీసుకురాగలం. దేశంలో రెండు పెద్ద నదులను తొలిసారి అనుసంధానించాం. ఇక్కడి నుంచి పెన్నాకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. అప్పుడు (గతంలో అధికారంలో ఉన్నపుడు) నేను సంపదను సృష్టించాను. అది దానికదిగా కింది వర్గాల వారికి చేరుతుందని (ట్రికిల్ డౌన్) నేను భావించా. కానీ అలా జరగలేదు.. నేను అధికారం కోల్పోయాను. నా కృషి మొత్తం వృథా అయింది. ఇప్పుడు మళ్లీ మైనస్లో నేను మొదలు పెట్టా. సున్నాతో కాదు.నావల్లే 2004 నాటికి విద్యుత్ మిగులు ఉంది. నేను మళ్లీ అధికారంలోకి వచ్చేటప్పటికి.. ఒక్క ఏపీలోనే 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. తెలంగాణలో కాదు. ఒక నెల కాలంలోనే నేను దానిని మళ్లీ సరి (రివర్స్) చేయగలిగాను. నేను ఇలా ఎందుకు పనిచేయాలి? నా కుటుంబం ఇక్కడ లేదు. వారు ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఆమె కూడా బిజీ. నాకొక మనవడు ఉన్నాడు. రోజుకు గంట సమయం కూడా గడపటం లేదు. నేను మనవడితో ఆడుకునే సమయం ఇది. కానీ నేను నా జీవితం త్యాగం చేస్తున్నాను. ఎందుకు? ప్రజల కోసం. నేను ఎన్నికల్లో అతిగా హామీలు ఇవ్వలేదు. నేను హామీలు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నా. కొన్నిసార్లు మేం ఆలోచనలు మార్చుకోవచ్చు. అప్పుడు అది సరికావచ్చు.. ఇప్పుడు ఇంకొకటి సరికావచ్చు. ఉదాహరణకు ఇప్పుడు 44 లక్షల పెన్షన్లు ఇస్తున్నా. ఇంటికి పంపిస్తున్నా. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిలో 9 మందిని (కేసీఆర్) తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అసలు పార్టీని చీల్చలేరు. దానిపై న్యాయపోరాటం ఒక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్లో తెలంగాణలో నా జనం ఉంటారు.. నేను అక్కడికి వెళ్లలేను. అక్కడ (అసెంబ్లీ ఎన్నికల్లో) పోటీ చేయలేను. 2018 ఎన్నికల్లో అక్కడ అధికారం కోసం పోటీచేస్తాం.’’ -
సారీ చెప్పే కాలం కాదిది
జాతిహితం జేఎన్యూ-కన్హయ్య-ఢిల్లీ పోలీసులు... సరిగ్గా 35 ఏళ్ల క్రితం నాటి భయా నకమైన 1981 రోజులను గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో నేను, ఒకేసారి ఐదు చోట్ల తిరుగుబాట్లు చెలరేగుతున్న ఈశాన్యం వార్తా కథనాలను వెలువరిస్తూ ఉండే వాడిని. అధికారిక ప్రకటనల్లో జాతి వ్యతిరేక శక్తులు(ఏఎన్ఈ) అని మాత్రమే చెబుతూ తిరుగుబాటుదార్లను లేదా అజ్ఞాతంలో ఉన్నవారిని ఎంద రినైనా బంధించేవారు, విచారించేవారు, తరచుగా ఏదో ఒక పద్ధతిలో హత మార్చే వారు. రాజద్రోహ నేరం కేసు పెట్టడం అంటే మహా జంఝాటం, అంతకంటే ఇవన్నీ చేయడమే తేలిక. అయితే అది ఒక్కోసారి నమ్మశక్యం కానంతటి మూర్ఖత్వానికీ దారి తీసేది. అమాయక ప్రాణాలకు హానిని కలుగ జేయకపోతే అలాంటి సందర్భాలు గొప్ప హాస్యస్ఫోరకంగా కూడా ఉండేవి. అలనాటి మంచిరోజుల కథ ఆనాటి పరిస్థితుల్లో సైన్యం, పోలీసు, నిఘా విభాగాలలో పనిచేసేవారికి, విలేకరులకు మధ్య ఒక్కోసారి మైత్రీపూర్వకమైన, తరచుగా వైషమ్యపూరి తమైన అసాధారణ అనుబంధం ఉండేది. అయితే అనివార్యంగానే వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం, సహకరించుకోవడం అనే అనుబంధం కూడా ఉండేది. ఈశాన్యంలో పనిచేసిన అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో అజిత్ దోవల్ కాక, కోషీ కోషీ కూడా నాకు మిత్రులు. తిరుగుబాటుకు వార్తల సేకరణ గురించి తెలిసిన వారెవరికైనా విలేకరులు, ఇంటెలిజెన్స్ అధికారులు వాస్తవాలను సరిపోల్చి చూసుకుంటారని తెలిసి ఉంటుంది. అలాగే మేమి ద్దరం తరచుగా మా నోట్స్ను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్లం. మరీ ముఖ్యంగా ప్రమాదరహితమైన ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఏ బంద్ రోజునో నేను ఆయన కార్యాలయానికి వెళుతుండేవాడిని లేదా ‘‘బౌద్ధ భిక్షువు’’కు (ఓల్డ్ మాంక్ రమ్కు మేం పెట్టుకున్న పేరు) రోజువారీ నివాళు లర్పించడానికి కేపీఎస్ గిల్ ఇంట్లో సాయంకాలాలు కలుస్తూ ఉండేవాళ్లం. ఒక సాయంత్రం మహా ఉద్వేగంగా కోషీ, నన్ను ఉన్న పళాన తన కార్యాలయానికి రమ్మని పిలిచారు. గొప్ప కథనం ఉందని, కల్నల్ ఎక్స్కు (సైనిక నిఘా విభాగంలో కోషీకి సమాన స్థాయి వారు) పెద్ద తీవ్రవాది దొరి కాడని, కాకపోతే ‘‘జాతి వ్యతిరేక శక్తులలో అతని హోదా’’ ఏమిటో కనిపెట్ట డానికి నా మేధస్సును ఉపయోగించాలన్నారు. అదేదో నన్ను అడగమని ఆయనకు చెప్పారు. తామెన్నడూ విని ఉండని గ్రూపునకు చెందిన ఒక స్వయం ప్రకటిత నాగా లెఫ్టినెంట్ కల్నల్ను తమ కుర్రాళ్లు ‘‘పట్టుకు న్నార’’ని, కానీ తమ వద్ద ఉన్న జాబితాలో అతనెవరో గుర్తించలేకపోతు న్నామని ఆయన చెప్పారు. ఆ తీవ్రవాది మాత్రం తాను సాల్వేషన్ ఆర్మీ (పేదల సంక్షేమానికి కృషి చేసే క్రైస్తవ సంస్థ) లాంటి ఏదో గ్రూపునకు చెందినవాడినని పదేపదే చెబుతున్నాడన్నారు. దీంతో, సిరియన్ క్రిస్టియన్ ఆయిన కోషీ నిస్సహాయమైన ఓ నవ్వు నవ్వి, సదరు కల్నల్కు ఆ సాల్వేషన్ ఆర్మీ ఎంత నిరపాయకరమైనదో వివరించి, నిర్భాగ్యుడైన ఆ దైవ సైనికునికి క్షమాపణలు చెప్పి తక్షణమే విడుదల చేయమని చెప్పారు. తర్వాత ఓ గంటకల్లా ఆ పని జరిగిపోయింది. జీవితాంతం ఇతరులకు చెప్పాల్సిన కథగా అది మిగిలిపోయింది. అయితే, అవి మంచిరోజులు కాబట్టి అంత సమస్యాత్మక ప్రాంతంలోనూ ఆ కథ వెంటనే మర్యాదకరమైన, తార్కికమైన ముగింపునకు వచ్చేసింది. నేటి హాస్యాస్పద గాథ కన్హయ్య కుమార్ అరెస్టు విషయంలో జరిగింది కూడా సరిగ్గా అలాం టిదే, అంతగానూ హాస్యాస్పదమైనదే. కాకపోతే ప్రభుత్వమో లేదా కోర్టులో అతనిని విడుదల చేయమని చెప్పేవరకు వేచి ఉండాల్సి ఉంటుంది. హఫీజ్ సయీద్ పేరిట వెలువడ్డ ఒక నకిలీ ట్వీట్ , దేశంలోనే అత్యుత్తమమైన ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని చవటాయలను చేసింది. అంతకంటే మరింత నకిలీ వీడియో దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎన్నుకున్న అధ్యక్షునిపై రాజద్రోహ నేరం అభియోగాన్ని మోపేలా చేసింది. రాజద్రోహం అంటే దేశంపై యుద్ధం చేయడమని అర్థం. ఇప్పుడు, ఆయన్ను ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. సామాజిక, సంప్రదాయక మీడియాలో ఢిల్లీ పోలీసు అధినేత సహా అత్యున్నత స్థాయిలలోని వారంతా కన్హయ్య దేశద్రోహా నికి పాల్పడ్డాడని చెప్పారు. కాబట్టి, గువాహతిలో నాడు సైనిక కల్నల్ ‘సారీ’ చెప్పి ఆ అభాగ్యుడ్ని వదిలి పెట్టేసినంత తేలిక వ్యవహారం కాదిది. పైగా అది దయాదాక్షిణ్యాలున్న కాలం. కాగా, నేడు మనం దేశ మస్తిష్కాన్ని సన్నీ డియో లైజేషన్ (దేశభక్తి అంటూ రంకెలేయడం) చేస్తున్న కాలంలో ఉన్నాం. ఈ సంస్కృతి నేడు నగ్నంగా నర్తిస్తోంది. కాబట్టి రోహిత్ వేముల ఆత్మహత్యపై వచ్చిన ఒత్తిడికి గురై ఉన్నప్పుడు, మొదట అతను దళితుడు కాదంటూ దాటవేయాలని చూసి, ఆ మీదట మొత్తం చర్చనంతా కులం మీదకు మరల్చారు. తర్వాత జేఎన్యూపై దాడితో చర్చను జాతీయవాదం కొరవడటంపైకి తిప్పారు. వామపక్ష చింతనకు కేంద్రంగా ఉన్న జేఎన్ యూలో గత పలు సంవత్సరాలుగా వామపక్ష విద్యార్థి సంఘాలకు, అఖిల భారత విద్యార్థి పరిషత్ వంటి మితవాద విద్యార్థి సంఘాలకు మధ్య సంఘ ర్షణ పెరుగుతోంది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎప్పుడు చూసినా విస్పష్ట రాజకీయాలు, భావజాల సంఘర్షణ దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలోకెల్లా నాకు ఇష్టమైన పెద్ద గోడ చిత్రం... అటూ ఇటూ మార్క్స్, లెనిన్లూ మధ్య భగత్సింగ్ ఉన్నది. అది ఇప్పటికీ అక్కడే ఉన్నా ఎన్నడూ హింసకు దారితీయలేదు. భావజాల ఘర్షణ ఉన్నా ఆ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమ విద్వద్వంతులను తయారుచేసింది. ఈ మేధోపరమైన, భావజాలపరమైన ఘర్షణా అందుకు కారణమూ అయి ఉండవచ్చు. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడంతో ఏబీవీపీ కూడా కాంగ్రెస్ అంతగానూ అసహనంగా తయారైంది. ప్రధానంగా వామపక్ష భావాల సానుభూతిపరులపట్ల అది అసహనంతో ఉంది. ప్రియుడు కొత్వాలయితే... ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకుని ఎక్కువగా ‘‘వామపక్షీకరణ’’ చెందిన విశ్వవిద్యాలయాలపై ఏబీవీపీ ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకుంటోంది. ‘ప్రియుడు కొత్వాలయితే (పోలీసు కమిషనర్) ఎవరైతే నాకేం లెక్క’ అన్నట్టు (హిందీ మాట్లాడే దేశ ప్రధాన భూభాగంలో ప్రాచుర్యంలో ఉన్న నానుడి) వ్యవహరిస్తోంది. హైదరాబాద్లోనూ, జేఎన్యూలోనూ ప్రభుత్వం దురదృష్టవశాత్తూ పక్షపాతియైన కొత్వాల్లా వ్యవహరిస్తోంది. ఫలితం ఒక దళిత విద్యార్థి విగత జీవి కావడం, పేద కుటుంబానికి చెందిన మరో విద్యార్థి కటకటాల పాలవడం. ఇంతా జరిగాక ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో తోచడం లేదు. మేం గందరగోళపడ్డామంటూ సారీ చెప్పాలి. లేదంటే ఎవరినో తప్పుపట్టి బలిపశువును చేసి, ఇతరుల సంగతి మరచిపోయి కన్హయ్యను విడుదల చేయాలి. అయితే అది హైదరాబాద్ తర్వాత వరుసగా రెండో ఓటమిని అంగీకరించినట్టవుతుంది. లేదంటే, రాజద్రోహ నేరానికి అతనిపై విచారణ జరిపించినట్టయితే ఉదారంగా పెద్ద వివాదాన్ని రాజేసినట్టవుతుంది. మొత్తా నికి కాస్త త్వరగానో లేక ఆలస్యంగానో ఏదో ఒక కోర్టు ఆయన్ను విడుదల చేయక తప్పదు. ప్రత్యేకించి రాజద్రోహ నేరం నిలిచే అవకాశం లేదు. ఏం చేసినా కన్హయ్య పొలిటికల్ స్టార్ అయిపోతాడు. కాబట్టి బీజేపీకి ఎంచుకోవ డానికి ఉన్న అవకాశాలు సరళమైనవే. ఇప్పుడిక వినమ్రంగా తప్పును అంగీకరించి నష్టాలను తగ్గించుకోవడం చేయాలి. లేదా సమర్థించుకోడానికి వీలే లేని దాని కోసం పోరాడి చివరికి అన్ని తప్పులకూ కలిసి ఒకేసారి లెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. ఓపీ శర్మ లాంటి వాళ్లు విద్యార్థులను చితక బాదుతుంటే, పదవీ విరమణ చేయనున్న పోలీసు బాసులు వారికి రక్షణ కల్పించ నిరాకరించడాన్ని చూస్తుంటే... ఛాంద సులైన మామలు చెప్పినట్టు వినని పిల్లలపై యుద్ధం ప్రకటించినట్టుంది. పెద్దలకు, యువతరానికి మధ్య పోరాటం చివరకు అనివార్యంగా ఎలా ముగుస్తుందో మానవజాతి చరిత్ర బోధిస్తోంది. వాజపేయి అయితే ఏం చేసేవారు? ఒక మంచి ఆలోచన చెబుతా. సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం అమలు చేయాల్సినది అది. మీరు చేస్తున్న చర్యలను వాజపేయి కొలబద్దతో పరీక్షించి చూసుకోవడం. ఈ పరిస్థితిలో అటల్ బిహారీ వాజపేయి అయితే ఎలా వ్యవహరించి ఉండేవారని యోచించండి. అప్పుడు మీ ముందు ఎంచుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అవి ఆయన వారసుల ప్రభుత్వం అనుసరిస్తున్న వాటికంటే పూర్తిగా భిన్నమైనవై ఉంటాయి. 1997 మొదట్లో, బీజేపీ-అకాలీదళ్ కూటమి అప్పుడే పంజాబ్లో అధికారంలోకి వచ్చింది (నేటి బీజేపీ-పీడీపీ కూటమిలాగా అందుకు కూడా నాడు అవకాశం లేదనే అనిపించింది). భింద్రన్వాలా అనుకూల అవాంఛ నీయ పరిణామాలు బద్దలై, స్వర్ణ దేవాలయానికీ వ్యాపించాయి. పంజాబ్ ఉగ్రవాదాన్ని సన్నిహితంగా పరిశీలించిన నేను బెంబేలెత్తిపోయాను. నేన ప్పుడు సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆ పరిణామాలపై తీవ్ర దాడిని ప్రారంభించింది. అప్పటికింకా కేంద్రంలో ప్రతిపక్షంగానే ఉన్న బీజేపీ, అకాలీదళ్తో మైత్రిని పునరాలోచించాలని సైతం కోరింది. ఒకరోజు మధ్యాహ్నం, తన నివాసానికి రావాలని వాజపేయి నాకు కబురంపారు. అద్వానీ, మదన్లాల్ ఖురానాలు కూడా అక్కడున్నారు. తేనీరు సేవిస్తూ వాజపేయి నాకు ఉపన్యాసం ఇచ్చారు. ‘హిందువులు, సిక్కులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు’ పంజాబ్లో గొంతులపైకి కత్తులు దూసుకుంటు న్నారు. సిక్కు మిలిటెంట్లు బీజేపీ నేతలను హతమారుస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, అకాలీదళ్ చేతులు కలపడం పంజాబ్కు, భారత్కు మంచిదా, కాదా? పెద్దగా లెక్కచేయాల్సిన అవసరంలేని ఈ చికాకులను మనం విస్మరించాలి. సంపాదకులవారూ, మీరు కాస్త పరిణతి సాధించాలండీ! అన్నారు. ఈ పరిణామాలు అదుపు తప్పిపోతే ఏం జరుగుతుంది? ఆ చికాకులు కలిగిస్తున్న వారు అకాలీల మీద ఆధారపడటం లేదా? అని నేనడిగాను. ఆ విషయాలన్నీ ‘‘ఖురానా జీ చూసుకుంటారు... ఈ సమస్యలను పరిష్కరించగల దృఢ సంకల్పం ఆయనకుంది’’ అని బదులిచ్చారు. ఆయనైతే హైదరాబాద్ ఉదంతంతో ఎలా వ్యవహరించేవారో ఆలోచిం చించి చూడండి. ఆ విశ్వవిద్యాలయం వ్యవహారాలలో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఏబీవీపీ పక్షం వహించారని గమనిస్తే ఆయన ఆగ్రహించి ఉండేవారు. వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆయనే మొట్టమొదట ఆవేదనను, సహానుభూతిని వెల్లడించి ఉండేవారు. ఇక జేఎన్యూ విషయం లోనైతే... కుర్రాళ్లను మాట్లడనివ్వండి, వాళ్లే ఎదుగుతారు, రేపు ఐఏఎస్ క్యాడర్లో చేరుతారు అని సరిపెట్టుకునే వైఖరి చేపట్టేవారు. కశ్మీరీ సమస్యపై ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణాల ప్రాతిపదికపైనే మాట్లాడుతామని పట్టు బడుతుంటే తాము ఇక చర్చలు ఎలా జరుపుతామని కశ్మీర్ వేర్పాటువాదులు ప్రశ్నించినప్పుడు ఆయన ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి. రాజ్యాంగం ఎందుకు, మీతో నేను మానవతావాద ప్రమాణాలతో మాట్లాడు తానని వాజపేయి అన్నారు. సంఘర్షణను పరిష్కరించే వైఖరంటే అదీ. ఇటీవల మనం చూస్తున్నది సంఘర్షణను తెచ్చిపెట్టే వ్యూహాల కోసం సాగిస్తున్న అన్వేషణగానే ఎక్కువగా కనిపిస్తోంది. శేఖర్ గుప్తా Twitter@ShekarGupta
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement