breaking news
r.subhash reddy
-
ప్రధాన పార్టీల నేతలకే తలపోటు
చిన్నశంకరంపేట, న్యూస్లైన్: మండలంలోని అంబాజిపేట ఎంపీటీసీ స్థానం ప్రధాన పార్టీల అధ్యక్షులకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ అభ్యర్థులకన్నా ఆయా పార్టీల అధ్యక్షులకే టెన్షన్ ఎక్కువైంది. అంబాజీపేట ఎంపీటీసీ స్థానం పరిధిలో అంబాజిపేటతోపాటు కామారం గ్రామాలు ఉన్నాయి. అంబాజిపేటలో 728 ఓట్లు, కామారంలో 904 ఓట్లు ఉన్నాయి. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకుడు పూలపల్లి యాదగిరి సతీమణి మంజుల యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈమె గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంపీటీసీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున అంబాజిపేటకు చెందిన ద్యాప మణెమ్మ పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, అంబాజిపేటకు చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ సమీప బంధువు లతాశ్రీని బరిలో నిలిపారు. బీజేపీ నాయకులు కామారం గ్రామానికి చెందిన జూకోటి లక్ష్మిని అభ్యర్థిగా పోటీలో దింపారు. ప్రధాన పార్టీల నేతలకు సవాల్.. అంబాజిపేట స్థానం నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మండల అధ్యక్షులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్.రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపయ్యగారి రాంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పాపయ్యగారి రాజిరెడ్డిలది కామారం గ్రామం. వీరందరిదీ ఒకే గ్రామం కావడంతో ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తంటాలు పడుతున్నారు. అదీగాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సుభాష్రెడ్డి స్వయాన సోదరులు. టీఆర్ఎస్, బీజేపీ అధ్యక్షులు కూడా సొంత అన్నదమ్ములు. ఇలా ఆయా పార్టీ నేతల మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అభ్యర్థులు సైతం ఆయా పార్టీ నేతలకు సమీప బంధువులు, అనుచర వర్గమే కావడంతో అభ్యర్థుల కన్నా సదరు పార్టీల నాయకులకే టెన్షన్ ఎక్కువైంది. ఆ మేరకు ప్రచారాన్ని కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఓ రకంగా ఇది పార్టీ నేతల మధ్య జరుగుతున్న పోరుగా మారడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. -
‘నాటా’ కృషి శ్లాఘనీయం
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛందంగా సామాజిక సేవ చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) కృషి శ్లాఘనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి కొనియాడారు. సామాజిక సేవ చేసేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 29 వరకు నాటా ఆధ్వర్యంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాల ముగింపు సభ ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, అమెరికాలో క్షణం తీరిక లేకుండా గడిపే తెలుగువారు పుట్టిన గడ్డపై మమకారంతో పలు సామాజిక సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వాలే అన్నీ చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు కూడా సామాజిక సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంక టరమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనివార్యమని, అయినప్పటికీ తెలుగువారు రెండు రాష్ట్రాల్లోనూ కలసిమెలసి ఉంటారన్నారు. ప్రముఖ వ్యాపార వేత్త సజ్జల దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ‘సహీ’ సంస్థ పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందన్నారు. చెవిటి పిల్లల సహాయానికి, వారి ఆరోగ్యం బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సంరక్షణ కోసం వైద్యపరీక్షలు, యంత్రాల పంపిణీ లాంటివి చేపడుతున్నామని తెలిపారు. 20 ఏళ్లుగా ఇంగ్లండ్లో ఉన్న తాను మాతృభూమిపై మమకారంతో ఇక్కడకు వచ్చి అధునాతన టెక్నాలజీతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మ్యాక్సి విజన్ గ్రూప్ అధినేత డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి తెలిపారు. నాటా సేవలు అభినందనీయమని సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. తెలుగు ప్రజల సేవే నాటా లక్ష్యమని నాటా అధ్యక్షుడు డాక్టర్ టి.సంజీవ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ నెల 16 నుంచి చేపట్టిన కార్యక్రమాల్లో రూ.3.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అనంతరం, రూ.70 లక్షల చెక్కును సజ్జల దివాకర్రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రాంబాబులకు నాటా నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుభాష్ రెడ్డి, డాక్టర్లు మల్లారెడ్డి, సంజీవ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డికి నాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును, శేఖర్ కమ్ముల, ఎమ్మెల్సీ వి.నారాయణ రెడ్డిలకు నాటా ఎక్సలె న్సీ అవార్డులను ప్రదానం చేశారు. వ్యాపార వేత్త సజ్జల దివాకర్ రెడ్డి, నాటా అధ్యక్షుడు డాక్టర్ సంజీవ రెడ్డి తదితరులను సత్కరించారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా, నాటా సేవా డేస్ ముగింపు సందర్భంగా హైదరాబాద్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నిర్వహించిన ‘సేవ్ గర్ల్ చైల్డ్’ అవగాహన నడక కార్యక్రమంలో మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ బాలికల పట్ల వివక్ష కొనసాగుతోందని, దీనిని నిర్మూలించాలని అన్నారు. వైద్య రంగంపై నిర్వహించిన సదస్సులో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ మాట్లాడారు.