readymade garments
-
ప్రతి ముగ్గురిలో ఒకరికి నకిలీల బెడద
సాక్షి, స్పెషల్ డెస్క్: కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టుగా.. ఔషధాలు, ఎల్రక్టానిక్స్, రెడీమేడ్స్, ఎఫ్ఎంసీజీ.. ఇలా దాదాపు అన్ని విభాగాల్లోనూ నకిలీ వస్తువుల తాకిడి భారతీయ వినియోగదారుల మార్కెట్లను ముంచెత్తుతోంది. పది మంది పట్టణ వినియోగదారుల్లో తొమ్మిది మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా నకిలీ ఉత్పత్తిని కొనుగోలు చేశారంటే మన రిటైల్ వ్యవస్థలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. లాభాపేక్షలేని అథెంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఏఎస్పీఏ), రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ సంయుక్తంగా విడుదల చేసిన స్టేట్ ఆఫ్ కౌంటర్ఫీటింగ్ ఇన్ ఇండియా 2025 నివేదిక ప్రకారం.. ఏడాది కాలంలో సుమారు 35% మంది పట్టణ వినియోగదారులు నకిలీ ఉత్పత్తుల బారిన పడ్డారు. ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ విడిభాగాలు, దుస్తులు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వ్యవసాయ ఉత్పత్తుల వంటి విభాగాల్లో నకిలీ వస్తువుల ప్రభావం పెరుగుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్లలో చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఏడాది కాలంలో నకిలీ వస్తువుల బెడద పెరిగిందని 74% మంది నమ్ముతున్నారు. మూడింట రెండొంతుల మంది తాము నకిలీ ఉత్పత్తులను గుర్తించగలమని విశ్వాసంగా ఉన్నప్పటికీ.. మరిన్ని అవగాహన కార్యక్రమాలు అవసరమని 93% మంది భావిస్తున్నారు. సింహభాగం ఆన్లైన్లో.. గత 12 నెలల్లో తాము నకిలీ దుస్తులను చూశామని లేదా కొనుగోలు చేశామని దాదాపు మూడింట ఒక వంతు మంది వినియోగదారులు తెలిపారు. నకిలీ ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయాలు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ మార్కెట్లలోనూ దర్శనమిస్తున్నాయి. రోజువారీ వినియోగ వస్తువులపైనా వాటి ప్రభావం పెరుగుతోంది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, గృహ వినియోగ వస్తువుల వంటి ఎఫ్ఎంసీజీ విభాగాల్లో కౌంటర్ఫీట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఔషధాల నకిలీలు ప్రజారోగ్యానికి పెద్ద సవాల్గా మారుతున్నాయి. కౌంటర్ఫీట్ ఆటోమోటివ్ విడిభాగాలు వాహనాల పనితీరును, విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా భద్రత పరంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్తో కూడిన కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా నకిలీల బెడద పెరుగుతోంది. నకిలీ వ్యవసాయ ముడిసరుకులు పంట దిగుబడి, రైతుల ఆదాయం, ఆహార భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. అయితే కౌంటర్ఫీట్ వస్తువుల కొనుగోళ్లలో సగానికి పైగా ఆన్లైన్ చానళ్ల ద్వారానే జరుగుతున్నాయి. ఆరోగ్యం, క్షేమానికి ముప్పు.. నకిలీల బెడద దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఒక అంతర్జాతీయ సమస్య. నకిలీ వస్తువులు వినియోగదారుల ఆరోగ్యం, క్షేమానికి ముప్పు కలిగించడమే కాకుండా మార్కెట్ పోటీని దెబ్బతీస్తాయి. అసలైన తయారీదారులకు నష్టం కలిగిస్తాయి. ప్రభుత్వాలకు పన్ను ఆదాయం రాకుండా చేస్తాయి. భారత్లో మూడేళ్లలో నకిలీ ఘటనలు పెరిగాయి. నకిలీ వస్తువులను తయారు చేసేవారు సాంకేతికంగా మరింత బలపడ్డారు. ఈ–కామర్స్ వృద్ధి, మార్కెట్ల ప్రపంచీకరణ వల్ల నకిలీలపై పోరాటం మరింత సవాలుగా మారిందని నివేదిక వెల్లడించింది. నకిలీ వస్తువుల నిరోధానికి, అక్రమ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలో అథెంటికేషన్ (ధ్రువీకరణ) వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంగా ఏఎస్పీఏ 1998 నుంచి పనిచేస్తోంది. వివిధ రంగాల్లో నకిలీల ప్రభావం.. » దుస్తులు: 31% » వ్యవసాయ ఉత్పత్తులు: 30% » మందులు: 28% » ఎఫ్ఎంసీజీ: 27% » వాహన విడిభాగాలు: 22% » ఎల్రక్టానిక్స్: 18% కొనుగోలు మార్గాలు.. » ఆన్లైన్ ప్లాట్ఫామ్స్: 53% » స్థానిక దుకాణాలు: వ్యవసాయ ఉత్పత్తులు 75%, మందులలో 63% వాటా » సోషల్ మీడియా: దుస్తుల విభాగంలో 46%, ఎలక్ట్రానిక్స్లో 35% వాటా వినియోగదారుల వైఖరి.. » ధర వ్యత్యాసం: కౌంటర్ఫీట్ గూడ్స్ అసలైన వాటికంటే 22% చౌకగా ఉంటాయని అంచనా » అదనపు చెల్లింపు: అసలైన వస్తువుల కోసం సగటున 9% అదనంగా చెల్లించడానికి కస్టమర్లు సిద్ధం » ఫిర్యాదు చేసే ధోరణి: నకిలీ వస్తువులపై ఫిర్యాదు చేసేందుకు 50% మంది రెడీ -
టైలరన్నలకు ‘రెడీమేడ్’ దెబ్బ
ధరించే దుస్తులతోనే మనిషికి అందం.. హుందాతనం లభిస్తాయి. వస్త్రానికి ఒక ఆకృతిని ఇచ్చి కళాత్మకంగా తీర్చిదిద్దేది దర్జీలే.. ప్రస్తుతం వారికి ఆదరణ తగ్గిపోయింది. మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు (Readymade Garments) విపరీతంగా రావడంతో జనం వాటి పట్ల మక్కువ చూపుతున్నారు. దానితో టైలర్లకు ఉపాధి కరువైంది. గతంలో పండగలు, పర్వదినాలు, శుభకార్యాల సమయంలో చేతినిండా పనితో బిజీగా ఉండే దర్జీలు (Tailors) నేడు పనులు లేక వారి కుటుంబాల పోషణ కష్టమై ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 5,478 మంది టైలర్లు ఉన్నారు. చిన్న గదుల్లో షాపులు పెట్టుకుని వచ్చే అరకొరమందికి దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు.ఒకప్పుడు ప్రతీ పండగకు ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ తదితర పండగలకు, పలు పర్వదినాలకు, కుటుంబాల్లో వివిధ శుభకార్యాలకు ఇంటిల్లిపాదీ కొత్త వస్త్రాలు తెచ్చుకుని కుట్టించుకునేవారు. ఆయా పండుగలకు నెల ముందు నుంచే టైలర్లకు పని ఎక్కువగా ఉండేది. భోజనం చేసే తీరిక కూడా లేకుండా పనిచేసేవారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. దుస్తులు కుట్టించుకునేవారే కరవయ్యారు. మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకొక ఫ్యాషన్తో దుస్తులను ఫ్యాక్టరీల్లో తయారుచేసి మార్కెట్లోకి దించుతున్నారు. దీంతో ఆ దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కువ మంది అప్పటికప్పుడు ఆ దుకాణాలకు వెళ్లి తమకు కావలసిన దుస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టైలర్లు పనులు లేక ఆ వృత్తిని వదిలేసి బతుకు జీవుడా అంటూ ప్రత్యామ్నాయ వృత్తులు వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు.గతంలో ఆదుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపనులు తగ్గిపోయి కష్టాల్లో నలిగిపోతున్న టైలర్లను గత వైఎస్సార్ సీపీ (YSRCP) ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. చేతి వృత్తుల వారి కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక భరోసా కల్పించింది. దానిలో భాగంగా ప్రతీ టైలర్కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం చేసింది. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 5,478 మంది టైలర్ల లబ్ధి పొందారు. ఈ విధంగా ఏడాదికి సుమారు రూ.5.48 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసేవారు. అంతేకాక ప్రతీ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాం క్లాత్ అందచేసి, దుస్తుల కుట్టుకూలీ డబ్బులను కూడా చెల్లించేది. ఆ విధంగా కూడా టైలర్లకు ఉపాధి లభించేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టైలర్ల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. గత ప్రభుత్వం మాదిరిగానే టైలర్లకు చేయూతనిస్తే ఆర్థిక తోడ్పాటుతో పాటు యూనిఫాం దుస్తుల ద్వారా కొంతవరకై నా ఉపాధి లబిస్తుందని టైలర్లు అభిప్రాయపడుతున్నారు.నేడు ప్రపంచ టైలర్స్ దినోత్సవంఏటా ఫిబ్రవరి 28న కుట్టుమెషీన్ సృష్టికర్త విలియమ్ ఎలియాస్ హోవే జయంతిని ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) గా జరుపుకుంటున్నారు. దర్జీ చేతి పనిని, వస్త్ర పరిశ్రమలో వారిని గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. కుట్టుమెషీన్ను కనిపెట్టి తమ జీవనానికి దారి చూపిన విలియమ్ పట్ల విశ్వాసం, గౌరవంతో నియోజకవర్గ కేంద్రం కొత్తపేటలో టైలర్స్ కొన్నేళ్ల క్రితం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా ప్రపంచ టైలర్స్ డే (World Tailors Day) నాడు విలియమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పిస్తారు.చదవండి: ప్రజల చేతిలో ఆయుధం సైన్స్ఇదే జీవనాధారంటైలరింగ్ పనిమీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. రెడీమేడ్ దుస్తుల రాకతో వస్త్రం కొనుగోలు చేసి కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తి రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. కుట్టు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం చేతి వృత్తిదారులను ఆదుకోవాలి. విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఇస్తే టైలర్లకు కొంతవరకై నా పని దొరుకుతుంది.– అవిడి వీరవెంకట సత్యనారాయణ, టైలర్, కొత్తపేట -
సిరిసిల్లలో రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ శివారులో 63 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తెలంగాణ అపారెల్ పార్కులో దుస్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్పోర్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వేలాది మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా వస్త్రోత్పత్తి, ఎగుమతుల కోసం బిల్ట్ టు సూట్ పద్ధతిలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ అపారెల్ పార్కు’ను అభివృద్ధి చేస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న టెక్స్పోర్ట్ కంపెనీ 1978 నుంచి అపారెల్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, విదేశీ ఎగుమతులు లక్ష్యంగా రెడీమేడ్ దుస్తులను తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 19 చోట్ల రెడీమేడ్ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రూ.620 కోట్ల వార్షికాదాయంతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. రెండు వేల మందికి ఉపాధి ప్రస్తుత ఒప్పందం మేరకు సిరిసిల్లలోని తెలంగాణ అపారెల్ పార్కులో 7.42 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, టెక్స్పోర్ట్ ఎండీ నరేంద్ర డి.గోయెంకా సంతకాలు చేశారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సిరిసిల్లలోని నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అపారెల్ పార్కులో ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని టెక్స్పోర్ట్ కంపెనీ ఎండీ గోయెంకా తెలిపారు. -
క్లాసిక్ పోలో మరో 65 ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ తయారీలో ఉన్న రాయల్ క్లాసిక్ మిల్స్ ‘క్లాసిక్ పోలో’ ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ ఔట్లెట్ల సంఖ్యను 200లకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థకు పలు రాష్ట్రాల్లో ఇటువంటి స్టోర్లు 135 ఉన్నాయి. వీటిలో అత్యధికం దక్షిణాదిన ఉన్నాయి. కొత్త కేంద్రాలు తూర్పు, పశ్చిమ భారత్లో రానున్నాయని క్లాసిక్ పోలో రిటైల్ డైరెక్టర్ రమేశ్ వి ఖేని మంగళవారం తెలిపారు. నూతన కలెక్షన్ను ఇక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్లాసిక్ పోలో బ్రాండ్ ద్వారా 2018–19లో రూ.160 కోట్లు సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.200 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. గ్రూప్ టర్నోవర్ 2019–20లో 25 శాతం వృద్ధితో రూ.1,000 కోట్లను తాకుతుందని కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ జీఎం గుండుబోయిన శ్రీకాంత్ వెల్లడించారు. గ్రూప్ ఆదాయంలో అత్యధిక వాటా ఎగుమతులదేనని, యూఎస్, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు దుస్తులను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ఏటా 2,000 కొత్త డిజైన్లు.. క్లాసిక్ పోలో నుంచి ఏటా 2,000 డిజైన్లు ప్రవేశపెడుతున్నట్టు సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధ్యనేశ్ కుమార్ వెల్లడించారు. విక్రేతల కోసం ప్రత్యేక యాప్ను రూపొందించామని, దీని ద్వారా ఆర్డరు ఇచ్చిన నెలరోజుల్లోనే వారికి దుస్తులను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కంపెనీ విక్రయిస్తున్న రెడీమేడ్స్ ధర రూ.599–2,499 మధ్య ఉందన్నారు. పర్యావరణ అనుకూల డిజైన్లపై ఫోకస్ చేస్తున్నామని డిజైన్ మేనేజర్ తిరునవక్కరసు తెలిపారు. సస్టేనబుల్ డెనిమ్ పేరుతో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, కాటన్ మిశ్రమంతో జీన్స్ ప్యాంట్స్ అందుబాటులోకి తెచ్చాం. వెదురు నుంచి తీసిన నారతో షర్ట్స్ రూపొందించాం అని వివరించారు. -
రెడీమేడ్ గార్మెంట్స్ పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేయాలి
విజయవాడ: రెడీమేడ్ గార్మెంట్స్పై ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. విజయవాడ రెడీమేడ్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేశారు. రెడీమేడ్ రంగాన్ని రక్షించండి, రెడీమేడ్ దుస్తులపై ఎక్సైజ్ డ్యూటీ వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పలువురు వ్యాపారులు హెచ్చరించారు.


