breaking news
Rajiv Gandhi Technical University of science
-
ట్రిపుల్ఐటీ పిలుస్తోంది
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు ట్రిపుల్ ఐటీ సువర్ణావకాశం. మధ్య తరగతి విద్యార్థులు ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో చేరే అవకాశం ఇక్కడ లభిస్తుంది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ సోమవారం ప్రారంభమైంది. ఎంపికైన విద్యార్థులకు జూన్, జూలై నెలల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో రెండు దశల్లో ఈ కౌన్సెలింగ్ ఉంటుంది. సత్తెనపల్లి: జిల్లాలో ఈ ఏడాది 59,478 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 56,345 మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 579 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి పదికి పది జీపీఏ సాధించారు. వీరితో పాటుగా ప్రతిభావంతులైన మిగిలిన గ్రేడ్లు సాధించిన విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని ప్రవేశానికి విద్యార్థుల అర్హతను బట్టి ఆన్లైన్ ద్వారా జూన్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎవరు అర్హులంటే.. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అన్ని పాఠశాలల విద్యార్థులు అర్హులే. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పది చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏ అదనంగా కలిపి కౌన్సెలింగ్లో ప్రతిభ నిర్ధారిస్తారు. పదో తరగతి తత్సమానమైన పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన వారే అర్హులు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 18 ఏళ్ల దాటని విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయో పరిమితిలో 21 ఏళ్ల వరకు సడలింపు ఉంది. దరఖాస్తు చేయడమిలా.. ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాలంటే ఓసీ, బీసీలు రూ. 150, ఎస్సీ, ఎస్టీలు రూ. 100 చెల్లించి ఏపీ ఆన్లైన్ ద్వారా మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి హాల్ టికెట్ నంబరు, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్హత, నివాసం, కులం, పదో తరగతి ఉత్తీర్ణత, ఇతర కోటాలకు సంబంధించిన ఆయా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. ఎంపిక విధానం పదో తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్ల వారీగా ఎంపిక ఉంటుంది. ఒక వేళ ఎక్కువ మంది విద్యార్థులు ఒకే గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించి పోటీ పడితే సబ్జెక్టుల వారీగా సాధించిన గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుంటారు. అయినా పోటీ అనివార్యమైతే పుట్టిన తేదీ ప్రకారం వయసులో పెద్ద వారిని ఎంపిక చేస్తారు. నూజివీడు, ఇడుపులపాయ, ట్రిపుల్ ఐటీ సంస్థల్లో వెయ్యేసి చొప్పున సీట్లు ఉన్నాయి. వాటి ఆధారంగా వికలాంగులకు మూడు శాతం, సైనిక విభాగంలో రెండు శాతం, ఎన్సీసీ విభాగంలో ఒక శాతం, క్రీడా కోటాలో 0.5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. మిగిలిన వాటిల్లో ఓపెన్ కేటగిరీ ద్వారా ప్రాంతాల వారీగా సీటిస్తారు. రుసుము చెల్లింపులు ఇలా రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేలు ఫీజు చెల్లించాలి. విద్యార్థులు రీయింబర్స్మెంట్కు అర్హులైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల పిల్లలు, రీయింబర్స్మెంట్కు అర్హత లేని విద్యార్థులు తప్పనిసరిగా రుసుము చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. 500 చెల్లించాలి. డిపాజిట్ కింద రూ. 2 వేలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వసతి సౌకర్యం ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు వసతి, భోజన సదుపాయం, పుస్తకాలు, లాప్ట్యాప్, రెండు జతల యూనిఫాం, బూట్లు ఇస్తారు. ప్రభుత్వ రాయితీలను అనుసరించి ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. -
ఇడుపులపాయలో ఆర్జీకేయూటీ ఆఫీస్
హైదరాబాద్లో ఏపీ విద్యార్థులకు ఎంసెట్ సెంటర్ అక్కడే వైఎస్సార్ జిల్లాలో ఉర్దూ వర్సిటీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్ వేంపల్లె: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీకేయూటీ) ప్రధాన కార్యాలయాన్ని వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసే అవకాశముందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందు పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, త్వరలో ఇక్కడికి తరలించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో శనివారం ఆయన అభియంత్ టెక్ ఫెస్టివల్-15ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మే 8న ఎంసెట్ ఉంటుందని, ఇంజనీరింగ్కు 7,630, మెడిసిన్కు 5,880 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వచ్చే నెల 6తో గడువు ముగుస్తుందని, అయితే పరీక్షకు ఒక రోజు ముందు రూ.10 వేల ఫైన్ చెల్లించి ఎంసెట్ రాయవచ్చని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు 85 శాతం ఏపీ విద్యార్థులకు, మిగతా 15 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించినట్టు చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏపీ విద్యార్థులకు 15 శాతం సీట్లు ఉంటాయన్నారు. హైదరాబాద్లో చదివే ఏపీ విద్యార్థులకు(సుమారు 10 వేల మంది) ఎంసెట్ పరీక్ష కేంద్రాలను 99 శాతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన జాయిం ట్ సెక్రటరీకి లేఖ రాశామన్నారు. అనుమతి రాకపోతే కర్నూలులో ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పీజీ అడ్మిషన్లు 16 నుంచి మొదలవుతాయని, విభజన వల్ల విద్యకు ఆటంకం కలి గిందన్నారు. జూన్లో 2 వేల అధ్యాపకుల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో 11 విద్యా సంస్థలు నెలకొల్పాలన్నారు. వీటిలో తొమ్మిదింటికి నిధులు కేటాయించారన్నారు. వైఎస్సార్ జిల్లాలో టూరిజం పార్కు, ఉర్దూ వర్సిటీ, ఫుడ్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్ వేణుగోపాల్రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్వో కె.ఎల్.ఎన్.రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి జి.వి.రావు పాల్గొన్నారు.