breaking news
Qutubuddin Ansari
-
మారిన మనిషి ఇస్తున్న హామీ!
గుజరాత్ అల్లర్ల సంద ర్భంగా రెండు ఫొటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మొదటిది – అశోక్ పర్మార్ది. కుడి చేతిలో ఇనపరాడ్డు పట్టు కుని, తలకు కాషాయపు గుడ్ద చుట్టుకుని అతను వీరావేశంతో కనిపిస్తాడు. ఆ ఫొటో ద్వారా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అయితే గుజరాత్ అల్లర్లకు కిరీట ధారులు, సూత్రధారులు, అమలుకర్తలు వేరేగా ఉన్నారు. ఆ అల్లర్ల నిర్వాహకులు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని పెద్ద ఎత్తున సమీకరించి విశాలమైన కాల్బలాన్ని నిర్మించారు. అశోక్ పర్మార్ వంటి వారిది అందులో కాల్బలం పాత్ర.1970ల నాటి గుజరాత్లో బనియా, పటేల్, బ్రాహ్మణ సామాజిక వర్గాలు రాజకీయ రంగాన్ని శాసించేవి. దానికి విరుగుడుగా ఒక కొత్త సామా జిక కూర్పును కాంగ్రెస్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకీ రూపొందించారు. క్షత్రియులు, హరిజ నులు, ఆదివాసులు, ముస్లింలను ఇందులో సమీకరించారు. దానికి అనుగుణంగా ఈ సమీ కరణను ‘ఖామ్’ (కేహెచ్ఏఎమ్) అని పేరు పెట్టారు. ఇది గుజరాత్ రాజకీయాల్లో ఒక దశలో బాగా పనిచేసింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 56 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 142 స్థానాలు దక్కాయి. అలా దెబ్బతిన్న పటేల్ సామాజిక వర్గం హిందూ సమూహాల ఐక్యతకు పూనుకున్నాయి. అప్పటి ‘బీసీ రిజర్వేషన్’ వ్యతిరేక ఉద్యమం వాళ్లకు కలిసి వచ్చింది. దానితో, ‘ఖామ్’ బలహీనపడింది.హిందూ సమాజంలో అణగారిన సామాజిక వర్గాలు కాంగ్రెస్కు దూరం అయ్యాయి. బీజేపీకి దగ్గరయ్యాయి. గుజరాత్ అల్లర్లలో ఈ సమూహాలు రిజర్వుడు సైన్యంగా రంగంలోనికి దిగి చెలరేగి పోయాయి. అలాంటి ఒక అణగారిన వర్గానికిచెందిన వ్యక్తి అశోక్ పర్మార్. అల్లర్ల కిరీటధారులు, సూత్రధారులు, అమలు కర్తలు అలాంటి వారికి సామాజిక అణిచివేత నుండి ఇలా విముక్తిని ప్రసాదించారు. ముస్లింలను ఊచకోత కోయడానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు.ఆ అల్లర్లలో ఒక మూకకు చిక్కి ప్రాణభిక్ష పెట్టమంటూ దయనీయంగా వేడుకున్న వేలాది మందిలో కుతుబుద్దీన్ అన్సారీ ఒకరు. నిస్సహాయ స్థితిలో చేతులు జోడించి వేడుకుంటున్న అన్సారీ ఫొటో కూడా అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ అల్లర్లు జరిగిన చాలాకాలం వరకు అన్సారీ మామూలు మనిషి కాలేదు. మనుషుల్ని చూస్తే చాలుభయంతో వణికిపోయేవాడు. అప్పట్లో చాలామంది గుజరాత్ ముస్లింల పరిస్థితి ఇదే. మానవ జాతి మీదే నమ్మకాన్ని కోల్పోయే అమానవీయ వాతావరణం అది.చేయి చేయి కలిపిన సందర్భంమరోవైపు, అశోక్ పర్మార్కు వాస్తవ సాంఘిక జీవితం గొప్ప పాఠాన్ని నేర్పింది. అల్లర్ల నిర్వ హణలో తనది కాల్బలం పాత్ర మాత్రమేనని అత నికి తెలిసివచ్చింది. అంతకు మించిన సాంస్కృతిక స్థానాన్ని కోరుకుంటే తమ సామాజిక వర్గం మీద కూడా అల్లర్లు జరుగుతాయని కొంచెం ఆలస్యంగా అర్థమయ్యింది. తను చాలా తప్పు చేశానని పశ్చా త్తాపపడ్డాడు. ఇనుప రాడ్డును పడేశాడు. నెత్తిన కట్టుకున్న కాషాయ గుడ్దను విసిరి కొట్టాడు. తన కులవృత్తి అయిన చెప్పులు కుట్టుకోవడం మొదలెట్టాడు. కుతుబుద్దీన్ అన్సారీని వెతికి పట్టుకున్నాడు. తన చెప్పుల బడ్డీ కొట్టును ఆవిష్కరించడానికి ఒప్పించాడు. అలా ఒక విషాదం ఒక పరిష్కారంగాముగిసింది. అశోక్ పర్మార్ , కుతుబుద్దీన్ అన్సారీఇవ్వాళ్టి కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్... అప్రతిహత శక్తిగా కనిపిస్తున్న మాట నిజమే. దాన్ని ఎవరూ ఏమీ చేయ లేరని చాలామంది అనుకుంటున్న మాట కూడా నిజమే. పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీల దగ్గర కార్యక్రమం లేదు. ‘ఇండియా బ్లాక్’ సమష్టిగా లేదు. రాహుల్ గాంధీ ఉండాల్సినంత చొరవగా లేరు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు. ఎన్నికల ప్రక్రియ హైజాక్ అయిపోతున్నా దాన్ని సరిదిద్దే మార్గాలు కనిపించడం లేదు.మరోవైపు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి భిన్నంగా సాయుధ పోరాటం సాగిస్తామన్న మావో యిస్టులు సహితం భవిష్యత్తు మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ను ఓడించగలమనే ఊహ కూడా దుస్సాహసం అనేలా ఉంది. కానీ కార్పొ రేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ కాల్బలం దానిది కాదుఅని అశోక్ పర్మార్ కథ చెబుతోంది. ఈ రోజు కాక పోయినా రేపయినా దాడి మూకల నుండి అశోక్ పర్మార్లు బయటికి వస్తారు. మరో కోరేగావ్ యుద్ధం జరగవచ్చు. అప్పుడు కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ వ్యవస్థ పూర్తిగా బీటలు వారుతుంది. -వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు-డానీ -
'ప్లీజ్.. నన్ను వాడుకోవడం ఆపేయండి'
అహ్మదాబాద్: కొన్ని ముఖాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఒక వేళ మర్చిపోయే పరిస్థితి వచ్చినా కొన్ని సందర్భాలు తిరిగి గత పరిచయాన్ని కళ్ల ముందుకు తెస్తాయి. ప్రస్తుతానికి కుతుబుద్దీన్ అన్సారీ పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పటికే అతడు భారతదేశం అంతటా దాదాపు అందరికీ పరిచయం అయ్యాడు. పార్టీల నిర్వాహకంతో అతడు ప్రతిసారి అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్నాడు. అయితే, ప్రత్యక్షంగా కాదు.. ఫొటో రూపంలో.. ఎవరు ఈ కుతుబుద్దీన్ ? అది 2002లో గోద్రా అల్లర్లు జరుగుతున్న సందర్భం. గుజరాత్లో జరిగిన ఈ ఘోర కాండకు వెయ్యిమందికి పైగా మృత్యువాతపడ్డారు. హిందువులకు, ముస్లింలకు మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తిన సందర్భం అది. ఈ ఘటనను ప్రస్తుతానికి ఆ రాష్ట్రం, దేశం మరిచిపోయినా కుతుబుద్దీన్ను మాత్రం వెంటాడుతోంది. ఎందుకంటే గోద్రా అల్లర్లు జరుగుతున్న సమయంలో ఓ హిందువుల గుంపు అతడి ఇంటిపై దాడికి దిగింది. ఆ సమయంలో తన ఇంట్లోని ఫస్ట్ఫ్లోర్లో నిల్చున్న కుతుబుద్దీన్ హృదయం ధ్రవించేలా ఏడుస్తూ రెండు చేతులు జోడించి తనను, తన కుటుంబాన్ని రక్షించండి అంటూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు విన్నవిస్తూ కనిపించాడు. ఆ సందర్భంలో అతడి ఫోటోను ఓ మీడియా వ్యక్తి ఫొటో తీశాడు. నాటి దాడి ఘటనకు ఈ ఫొటో అద్దం పడుతోంది. అయితే ఈ ఫొటోతోనే వచ్చింది అతడికి అసలు చిక్కు. చేదు గతాన్ని గుర్తుచేస్తున్న పార్టీలు తన ప్రయత్నం లేకుండానే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీజేపీపై విమర్శలు గుప్పించేందుకు ఏదో ఒక పార్టీ కుతుబుద్దీన్ ఫొటోను ఉపయోగిస్తూ, ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తూ బీజేపీ వ్యతిరేక ఓట్లకోసం పార్టీలు ప్రయత్నించడం ప్రారంభించాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అదే ఫొటోను అసోం, బెంగాల్ ఎన్నికల్లో ఉపయోగించడం ప్రారంభించింది. ఆ ఫొటోపై ఇదేనా మోదీ అభివృద్ధి అంటే? అసోంను మరో గుజరాత్లాగా కావాలని కోరుకుంటున్నారా? నిర్ణయం మీదే.. అసోంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని అందులో ఉంది. 'దయచేసి నన్ను వాడుకోకండి' గోద్రా అల్లర్లు జరిగినప్పుడు తనకు 29 సంవత్సరాలని ఆ ఘటన తన కళ్లముందు ఇప్పటికీ కదలాడుతోందని కుతుబుద్దీన్ చెప్పారు. ఆ రోజే తాను ఒక రకంగా చనిపోయానని, కానీ, ఇప్పుడు తన పిల్లలు వేసే ప్రశ్నల కారణంగా రోజూ చస్తున్నానని చెప్పాడు. 'నాన్న ప్రతిసారి ఆ ఫొటోలో ఎందుకు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నావని అడుగుతుంటే నా ప్రాణం పోయినట్లుగా ఉంటుందని, దయచేసి ఏ పార్టీ కూడా తన ఫొటో ఉపయోగించుకొని తనను బాధపెట్టవద్దని అంటున్నారు. తనకు ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటున్నానని, తన మానాన తనను వదిలేయాలని పార్టీలను వేడుకుంటున్నాడు.


