breaking news
Public urination
-
గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది
లండన్: బహిరంగ మూత్ర విసర్జన ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న దురలవాటు. దీని కారణంగా పరిసరాలు దుర్గంధంతో నిండి అందరూ ఇబ్బందులు పడుతున్నారు. లండన్ యంత్రాంగం దీనికి ఓ విరుగుడును కనిపెట్టింది. గోడలపై పోసే మూత్రం చింది తిరిగి వారిపైనే పడితే..? ఆ పాడు పనిని మానుకుంటారేమో. పారదర్శక వాటర్ రిపెల్లెంట్ రసాయనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని గోడలపై స్ప్రే చేస్తే పోసిన వ్యక్తి పైకే మూత్రం చింది పడుతుంది. దుస్తులు తడిచిపోతాయి. వారికి ఇదే తగిన శిక్ష అవుతుంది. లండన్లోని వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ ఇందుకోసం సోహో ప్రాంతాన్ని ఎంచుకుంది. సోహోలో 24 గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వినోద ప్రాంతాలతోపాటు నివాస ప్రాంతాలూ ఉన్నాయి. సుమారు 0.6 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలోని సోహోలో 400కు పైగా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. పబ్లిక్ టాయిలెట్లు చాలినన్ని లేకపోవడంతో జనం రోడ్డు పక్కన గోడలపైనే మూత్రం పోసేస్తున్నారు. వీధులు దుర్గంధంతో నిండిపోతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో వీధులను శుభ్రంగా ఉంచేందుకు లండన్ యంత్రాంగం ఏటా రూ.10.26 కోట్లు వెచ్చిస్తోంది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా కొత్త ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చింది. ముందుగా సమస్య తీవ్రంగా ఉన్న 12 ప్రాంతాల్లోని గోడలపై ఈ ద్రావకాన్ని స్ప్రే చేయించింది. ఆయా ప్రాంతాల్లో ఇది మూత్రం పోసే గోడ కాదు (దిస్ వాల్ ఈజ్ నాట్ ఫర్ యూరినల్) అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇదే ప్రయోగాన్ని మరో ప్రాంతంతోపాటు జర్మనీలోనూ ప్రయోగాత్మకంగా చేసి, మంచి ఫలితం సాధించారు. ఆరునెలల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని స్థానిక అధికారి ఒకరు చెప్పారు. -
ఆ పని చేస్తే సత్కారం తప్పదు..
రాంగోపాల్పేట్ (హైదరాబాద్) : బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్న ప్రబుద్ధులకు సత్కారం చేయనున్నారు! బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారిలో మార్పు తెచ్చేందుకు 'స్వచ్ఛ భారత్' లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టేషన్ చుట్టుపక్కల ఆరు బయట మూత్ర విసర్జన చేస్తున్నవారి దగ్గరకు వెళ్లి వారికి దండ వేసి సత్కరించి ఒక గులాబి పువ్వు ఇచ్చి మరోసారి ఇలాంటిది చేయవద్దని హితవు పలుకనున్నారు. ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పరిశుభ్రమైన నగరాల కోసం కృషి చేస్తుంటే ఇలా రోడ్లన్నీ అపరిశుభ్రం చేయడం మంచిది కాదని సూచిస్తారు. ఉత్తర మండలంలోని మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గురువారం ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ రామస్వామి తెలిపారు.