breaking news
poor people problems
-
కరోనా : 40 రోజుల బతుకు లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్.. రెక్కాడితే డొక్కాడని నిరుపేద, పేదల బతుకులను ఛిద్రం చేసింది. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలు సమీప భవిష్యత్తులో కోలుకోలేనంతగా చావు దెబ్బకొట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. కరోనా వైరస్ నియంత్రణకు విధించిన జనతా కర్ఫ్యూతో కలిపి లాక్డౌన్ అమల్లోకి వచ్చి గురువారానికి 40 రోజులు పూర్తవుతోంది. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ మూతబడి ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రాష్ట్రం స్తంభించింది. దీంతో సంపాదన లేక ప్రజల బతుకు బండి భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగింపు లేదా ముగింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయం కోసం ప్రజలు, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. మే 3న దేశంలో, 7న రాష్ట్రంలో లాక్డౌన్ గడువు ముగియనుంది. కరోనా నియంత్రణలో పురోగతి ఆధారంగా ఆ తర్వాత లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనున్నాయి. మే 5న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై లాక్డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఆ రోజు సీఎం చేసే ప్రకటన కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సహాయం కోసం ఆర్తనాదాలు.. తెల్లరేషన్కార్డు కలిగిన పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.1,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం ద్వారా కొంత వరకు ఉపశమనం కలిగించింది. అయితే, రాష్ట్రంలో లక్షల పేద కుటుంబాలకు రేషన్కార్డులు లేవు. పిల్లాజెల్లాతో పాటు తమ ఆకలి తీర్చుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఇలాంటి నిర్భాగ్యులు ఏ పూటకు ఆ పూట దయార్థ హృదయులైన దాతల రాక కోసం నిరీక్షిస్తున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తే కడుపు నింపుకొంటున్నారు. లేకుంటే పస్తులు తప్పడంలేదు. ఇక దిగువ మధ్యతరగతి, చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలూ తీవ్రంగా కుంగిపోయాయి. దాదాపు 40 రోజులుగా ఎలాంటి సంపాదన లేకుండా ఇంట్లో కూర్చొని తినడంతో కష్టకాలంలో ఉపయోగపడతాయనుకుని దాచిపెట్టుకున్న డబ్బులు సైతం ఖర్చయి పోయాయి. నగరంలో ప్రైవేటు ఉద్యోగాలు, చిన్నచిన్న వ్యాపాలు చేసే మధ్యతరగతి కుటుంబాల వ్యక్తులు.. తమ ఇళ్లల్లో కిరాణా సామగ్రి అయిపోయిందని, డబ్బులు లేవని, ఎవరైనా ఆదుకోకపోతే తమ కుటుంబాలకు ఆకలి చావులు తప్పవని పేర్కొంటూ ట్వీటర్లో అర్థిస్తున్నారు. లాక్డౌన్తో సంపాదన లేక తమ కుటుంబాలను పోషించడానికి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తుల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో మంత్రి కె.తారకరామారావుకు ట్వీటర్లో విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించి వీరికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. చదవండి: దమ్ముంటే పాతబస్తీకి వెళ్లి చూడాలి సర్కారుకు దినదిన గండం కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో పాటు రోజువారీ పరిపాలన వ్యవహారాలను కొనసాగించడానికి అవసరమైన ఖర్చులకు నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలుకు సైతం ప్రభుత్వం తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఒక విధంగా ప్రభుత్వం దినదిన గండాన్ని ఎదుర్కొంటోందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. లాక్డౌన్ వల్ల పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతబడటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దాదాపు సున్నాకు చేరింది. జీఎస్టీ, వ్యాట్ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి రోజూ రూ.350 నుంచి 400 కోట్లు చొప్పున నెలకు దాదాపు రూ.10వేల కోట్ల నుంచి 12వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. ప్రధానంగా మద్యంపై విధించే జీఎస్టీ, వ్యాట్ రూపంలోనే ప్రతి నెలా రూ.3వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మొత్తమ్మీద జీఎస్టీ, వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి గడిచిన 40 రోజుల్లో సుమారు రూ.16 వేల కోట్లు రావాల్సి ఉండగా, రూ.500 కోట్లు మాత్రమే వచ్చాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు చెల్లించడానికి రూ.2,500 కోట్లు, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్ల పంపిణీకి రూ.4 వేల కోట్లు, 87.54 లక్షల పేద కుటుంబాలకు రేషన్ బియ్యం పంపిణీకి రూ.550 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం నుంచి 50 వరకు కోత పెట్టి (చెల్లింపును వాయిదా వేసి), నిరుపేదలైన ఆసరా లబ్ధిదారులు, తెల్లరేషన్ కార్డుదారుల ఆకలి తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఎవరూ ఆకలికి బాధపడొద్దని ప్రభుత్వం పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు గత నెల రూ.1,110 కోట్లు ఖర్చు చేసింది. తెల్లకార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి రూ.1,500 చొప్పున 87.54 లక్షల కుటుంబాలకు ఈ నెలలో మొత్తం రూ.1,300 కోట్లను పంపిణీ చేసింది. వచ్చే మే నెలలో సైతం పేదలకు ఇలానే బియ్యం, నగదు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అప్పులు దొరికితేనే రాష్ట్రం కడుపు నిండేది.. లాక్డౌన్ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శక్తి పూర్తిగా క్షీణించింది. ఒకవైపు ఆదాయం పూర్తిగా బంద్ కాగా, అప్పులు చేసి రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకా>రం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) విలువలో ఏడాదికి 3.5 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన వచ్చే డిసెంబర్ నాటికి ప్రభుత్వం రూ.15,051 కోట్ల అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉండగా, లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆదాయ లోటును అధిగమించేందుకు ప్రస్తుత ఏప్రిల్ నెలలోనే బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.4 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. వచ్చే డిసెంబర్ నాటికి మరో రూ.11,051 కోట్ల రుణాలను మాత్రమే ప్రభుత్వం సమీకరించుకోవడానికి వీలుంది. సమీప భవిష్యత్తులో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసినా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టనుంది. అప్పటివరకు ప్రభుత్వ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం అదనపు అప్పులు చేయక తప్పదని చర్చ జరుగుతోంది. అందుకే ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.5 శాతం నుంచి 5 లేదా 6 శాతానికి పెంచాలని సీం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. రూ.63వేల కోట్ల నష్టం లాక్డౌన్తో గత 40 రోజుల్లో రాష్ట్రంలోని పరిశ్రమలు, వ్యాపార, వ్యాణిజ్య రంగాలకు రూ.63వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర సామాజిక ఆర్థిక గణన నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.6,63,258 కోట్లు (స్థిర ధరల వద్ద).. అంటే ఆ ఏడాది రాష్ట్రంలో ఆ మేరకు విలువ చేసే వస్తువులు, సేవల ఉత్పత్తి జరిగిందని అర్థం. గతేడాది తరహాలోనే 2020–21లో సైతం రాష్ట్రం 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని భావించినా, మొత్తం రూ.7,16,318 కోట్ల జీఎస్డీపీ సాధించాల్సి ఉంది. అంటే గడిచిన 40 రోజుల లాక్డౌన్లో రాష్ట్రంలో ఉత్పత్తి కావాల్సిన వస్తు, సేవల విలువ రూ.79,590 కోట్లు కానుంది. ఇందులో దాదాపు 20 శాతం వాటా వ్యవసాయ, అనుబంధ రంగాలదే. లాక్డౌన్లో వ్యవసాయ, అనుబంధ రంగాలు యథాతథంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాలను మినహాయిస్తే లాక్డౌన్ వల్ల గత 40 రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.63,672 కోట్ల నష్టం జరిగిందని చెప్పొచ్చు. మైనింగ్, తయారీ, నిర్మాణ రంగం, వాణిజ్యం, రిపేర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, రైల్వేలు, విమానయానం, ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి తదితర రంగాలకు ఈ మేరకు నష్టం జరిగింది. 2020–21కి సంబంధించిన జీఎస్డీపీ వృద్ధి రేటు భారీగా పతనం కావడానికి ఇది కారణం కానుంది. ఈ నేపథ్యంలో మే 7 తర్వాత రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని పారిశ్రామిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఉద్యోగాలు ఉంటాయా? లాక్డౌన్తో పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడటంతో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తమ తాత్కాలిక ఉద్యోగులను పనిలో నుంచి తీసేశాయి. రెగ్యులర్ ఉద్యోగులకు సైతం చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు జీతాలు చెల్లించట్లేదు. రాష్ట్రంలోని 1500 ఐటీ, అనుబంధ రంగ సంస్థల్లో 5.40 లక్షల మంది పని చేస్తున్నారు. 1,63,302 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో 9,80,520 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చదవండి: గుడుంబాపై ఉక్కుపాదం మోపండి 2,493 భారీ పరిశ్రమల్లో మరో 9,65,050 మంది ఉద్యోగులున్నారు. లాక్డౌన్తో ఇవన్నీ మూతపడడంతో వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఐటీ రంగ కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయని వార్తలు వస్తుండడంతో ఆయా ఉద్యోగుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలో లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం పారిశ్రామిక, వ్యాపార వర్గాలతో పాటు శ్రామిక, ఉద్యోగ లోకం ఆతృతతో ఎదురుచూస్తోంది. -
ఓటు అడగలేదని పోలింగ్ బహిష్కరణ
మదనపల్లె : పేదలు నివసించే ప్రాంతమని వివక్ష చూపుతూ, కనీసం ఓటు అడిగేందుకు రాకపోవడంతో మూకుమ్మడిగా అందరూ కలిసి ఓట్లు వేసేందుకు వెళ్లమని పోలింగ్ను బహిష్కరించిన సంఘటన పట్టణంలోని విజయనగర్ కాలనీలో జరిగింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్థానిక విజయనగర్ కాలనీ సిమెంట్ రోడ్డు ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మహిళలు ఓటు వేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2, 3 వార్డుల పరిధిలో తమ కాలనీ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు అడిగేందుకు తమ వార్డులకు రాలేదన్నారు. నాయకులు వస్తే వారికి తమ సమస్యలను చెప్పి, గెలిచిన తర్వాత పరిష్కరించమని అడుగుదామనుకుంటే ఎవరూ అటువైపు చూడకపోవడంతో మా ఓట్లు వారికి అవసరం లేదనుకున్నారేమోనని ఓటుకు వెళ్లడం మానుకున్నామని చెప్పారు. -
బతుకులపై కూర‘గాయాలు’
కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యుడి జీవితాలపై ‘ధరా’ఘాతంగా మారాయి. ఈ క్రమంలో నిరుపేదలు వాటిని కొనుగోలు చేయాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. శనివారం పాతూరు మార్కెట్ వద్ద కొందరు ఇదిగో ఇలా కుళ్లిపోయి.. పాడైన కూరగాయలను సంచుల్లో తీసుకెళ్లారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్!
► కార్డుదారులకు డీలర్ బెదిరింపు ► ఇంటింటికీ తిరిగి రసీదుల అప్పగింత ► సరుకులకు వచ్చేటప్పుడు రూ.100 అదనంగా తేవాలని హెచ్చరిక ► లేదంటే సరుకులు ఇచ్చేది లేదని స్పష్టీకరణ ► బెంబేలెత్తుతున్న నిరుపేదలు కర్నూలు : టీడీపీ సభ్యత్వ నమోదు టార్గెట్ చేరుకోవడానికి నేతలు పేదలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నారు. గత నెలలో పలుచోట్ల సభ్యత్వం కోసం వృద్ధులు, వికలాంగుల పింఛన్ లోంచి బలవంతంగా రూ.100 లాక్కున్న విషయం మరువక ముందే తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్ సరుకులు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని 5వ చౌక దుకాణం డీలర్ నారాయణరావు ఇల్లిల్లూ తిరిగి పార్టీ సభ్యత్వ రసీదు ఇచ్చి వెళుతున్నారు. సరుకులు తీసుకోవడానికి వచ్చేటప్పుడు రూ.100 అదనంగా తేవాలని, లేదంటే సరుకులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారు. రేషన్ సరుకుల కోసం డబ్బు సముకూర్చుకోవడమే గగనమైన పేద ప్రజలు టీడీపీ నేత అయిన డీలర్ తీరుతో బెంబేలెత్తుతున్నారు. డీలర్ నారాయణరావు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. తన పరిధిలోని కార్డుదారుల జాబితా ఆధారంగా పార్టీ సభ్యత్వ రసీదులు పూరించి ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నాడు. ఆ సమయంలో ‘టీడీపీ సభ్యత్వం తీసుకుంటే మూడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుంది. ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. రేషన్ సరుకులకు వచ్చేటప్పుడు ఓటర్ కార్డు, రూ.100 తీసుకుని రావాలి. పార్టీ సభ్యత్వం తీసుకోకపోతే సరుకులు వేసేది లేదు’ అని తేల్చి చెబుతున్నాడు. ఈ విషయమై కొందరు కార్డుదారులు రసీదులతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డుదారులను బెదిరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుండటం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరుకులకే డబ్బులు కష్టంగా ఉంది టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నా. నెల నెలా సరుకులు తెచ్చుకోవడానికి డబ్బులు పోగేసుకోవడం ఇబ్బందిగా ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి డబ్బులు కట్టమంటే మా లాంటి నిరుపేదలకు సాధ్యమయ్యే పనికాదు. సరుకులు తెచ్చుకునేందుకు రేషన్ దుకాణానికి వచ్చేటప్పుడు అదనంగా రూ.100 తీసుకురావాలని డీలర్ నారాయణ చెప్పారు. లేదంటే సరుకులు ఇవ్వరట. – హాషం, కార్డుదారుడు, కోడుమూరు సభ్యత్వం తీసుకోవడం ఇష్టం లేదు వ్యాపారం చేసుకుంటూ రోడ్డుమీద బతికేటోళ్లం. పార్టీల ముద్ర వేసుకుంటే మార్కెట్లో వ్యాపారాలు చేసుకోలేం. డీలర్ నారాయణ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని రసీదు రాసిచ్చాడు. సరుకులు తీసుకునేందుకు వచ్చేటప్పుడు రూ.100, ఓటర్ కార్డు తీసుకుని రమ్మన్నాడు. మాకైతే సభ్యత్వం తీసుకోవడం ఇష్టం లేదు. – సలీంబాషా, కార్డుదారుడు, కోడుమూరు