breaking news
polymer note
-
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు!
దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.10, రూ.20 విలువల పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక చర్యలు ప్రారంభించింది. అయితే పైలట్ ప్రాజెక్టు తేదీలు లేదా నోట్ల డినామినేషన్లపై ఆర్బీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం గ్లోబల్ టెండర్ ప్రక్రియ ప్రారంభించడం ద్వారా సన్నాహాలు వేగవంతం చేసింది.ఆర్బీఐకి చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) కోరింది. ఇందులో బయాక్సియల్ ఓరియెంటెడ్ పాలీప్రొపైలిన్ (BOPP) ఆధారిత పాలిమర్ సబ్స్ట్రేట్ను సరఫరా చేయాలని పేర్కొంది. మొత్తం 68,000 రీముల పాలిమర్ షీట్లు అవసరమని, వాటిలో రెండు డినామినేషన్లకు చెరో 34,000 రీములు కేటాయించినట్లు టెండర్లో వెల్లడించింది.ఈ పాలిమర్ షీట్లలో పారదర్శక విండో, మెటాలిక్ న్యూమరల్, మాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడిసెంట్ ప్యాటర్న్ వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉండాలని ఆర్బీఐ నిర్దేశించింది. ఇవి నకిలీ నోట్ల తయారీని మరింత కష్టతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.టెండర్ నిబంధనల ప్రకారం, దరఖాస్తు చేసుకునే సంస్థలకు సెంట్రల్ బ్యాంకులు లేదా బ్యాంక్నోట్ ప్రింటింగ్ సంస్థలకు కనీసం మూడేళ్ల పాటు పాలిమర్ సబ్స్ట్రేట్ సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అంతేకాదు, చైనా లేదా పాకిస్తాన్కు సంబంధించిన కార్యకలాపాలు భారత ప్రాజెక్టుతో సంబంధం లేకుండా పూర్తిగా వేరుగా ఉండాలని, అక్కడి నుంచి ముడి పదార్థాలను సేకరించకూడదని కూడా కఠిన నిబంధనలు విధించింది. బిడ్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 18గా నిర్ణయించింది.ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు?జూన్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, పాలిమర్ నోట్ల ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని, వాటి ప్రయోజనాలు, వ్యయభారం, అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందువల్ల 2027లో పూర్తి స్థాయి అమలు జరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ, దీనిపై ఆర్బీఐ నుంచి అధికారిక ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు.పాలిమర్ నోట్ల ప్రత్యేకత ఏమిటంటే..1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ బ్యాంకు నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కిపైగా దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నుతాయి. నీరు, తేమ, మురికి ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు నకిలీ చేయడం కూడా కష్టమవుతుంది. దీర్ఘకాలంలో ముద్రణ వ్యయం తగ్గడం, పాడైన నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించే అవసరం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
టీ బ్యాగ్లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..) -
బ్రిటన్లో నాన్వెజ్ కరెన్సీ!
కరెన్సీ అంటే ప్రపంచమంతటికీ క్రేజ్. కొత్త నోట్లు చేతికి వస్తే వాటిని మురిపెంగా చూసుకుని నలగనివ్వకుండా భద్రంగా పర్సులో పెట్టుకుంటారు. కానీ బ్రిటన్లో అలా జరగలేదు. ఈ కొత్త నోట్లు మాకొద్దంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ నోట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తెర మీదకొచ్చింది. ఇంతకీ సంగతేమిటంటే... పేపర్ కరెన్సీ స్థానంలో ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు పాలిమర్ నోట్లను ప్రవేశపెడుతున్నాయి. ఆ క్రమంలో బ్రిటన్ కూడా కొత్త ఐదు పౌండ్ల పాలిమర్ నోటును విడుదల చేసింది. అయితే ఆ నోటును తాకడానికి, పర్సులో పెట్టుకోవడానికి విముఖంగా ఉన్నారు ఇంగ్లండ్లోని ‘హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్’ (హెచ్ఎఫ్బి) సభ్యులు. హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్ సభ్యుడు, అక్కడి ఇస్కాన్ ఆలయం డైరెక్టర్ అయిన గౌరీదాస్ ఈ నోట్లను ఉపసంహరించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వానికి, బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బు ఎందుకు వద్దు? కొత్త ఐదు పౌండ్ల నోటు తయారీలో జంతువుల కొవ్వు వాడినందున శాకాహారులు, వేగాన్ (కాయలు, పప్పు దినుసులు తప్ప పాల ఉత్పత్తులను కూడా తీసుకోరు)లు ఆ నోట్లను తాకడానికి ఇష్టపడడం లేదని హెచ్ఎఫ్బి ప్రతినిధులు చెప్తున్నారు. కరెన్సీ నోటు ‘సంపద దేవత’ అనీ, ఆ నోటుకు జంతువుల కొవ్వు రాయడం అపరాధం అని అంటున్నారు. నోట్ల తయారీ కోసం జంతువులకు హాని కలిగించడం దేవుడు మెచ్చని పని అని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేయడానికి ‘రిమూవ్ టాలో (కొవ్వు) ఫ్రమ్ బ్యాంక్ నోట్స్’ పేరుతో ఒక పిటిషన్ తయారు చేశారు. ఇందుకు సానుకూలంగా ట్విటర్లో లక్షా ఇరవై ఆరు వేల మంది స్పందించారు. ఈ పిటిషన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్కు చేరే నాటికి ఆ సంఖ్య లక్షా యాభై వేలకు చేరింది. కేంబ్రిడ్జిలోని రెయిన్బో వెజిటేరియన్ కేఫ్ నిర్వాహకుడు షరోన్ మీజ్ల్యాండ్ ఈ క్యాంపెయిన్కు స్పందించి ఆ నోట్లను స్వీకరించబోమని బోర్డు కూడా పెట్టేశాడు. ఈ పిటిషన్ను పరిశీలించిన బ్యాంకు అధికారులు కూడా అనుకూలంగా స్పందించారు. ‘‘మేము వారి (హెచ్ఎఫ్బి) మనోభావాలను గౌరవిస్తాం, దీనిని అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా పరిగణించి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాం’’ అని బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టడానికి కారణమైన ప్రొఫెసర్ డేవిడ్ శాలమన్ ఇది సరైన ఆలోచన కాదని అంటున్నారు. ‘‘ఐదు పౌండ్ల నోటు తయారీలో ఉపయోగించే జంతువుల కొవ్వు అత్యంత స్వల్పం. అది ఒక సబ్బు తయారీలో వాడే యానిమల్ ఫ్యాట్ కంటే తక్కువే. పేపర్ నోట్ల తయారీకైతే చెట్లను నరకాలి. అది పర్యావరణ పరిరక్షణకు విఘాతం. పాలిమర్ నోట్తో ఆ ఇబ్బంది ఉండదు. పైగా ఇది పేపర్ నోటు కంటే చాలా శుభ్రంగా ఉంటుంది. దీర్ఘకాలం కూడా మన్నుతుంది’’ అని ఆయన వాదన.


