breaking news
as planned
-
షెడ్యూల్ ప్రకారమే బందీలను విడుదల చేస్తాం
కైరో: ఇజ్రాయెల్ బందీల విడుదల విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని హమాస్ తేల్చిచెప్పింది. మందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారమే బందీలకు విముక్తి కల్పిస్తామని స్పష్టంచేసింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులు తమతో చెప్పారని వెల్లడించింది. ఈ మేరకు హమాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం చూస్తే మరో ముగ్గురు బందీలు శనివారం విడుదల కాబోతున్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుందని హమాస్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. గాజాలో షెల్టర్లు నిర్మించుకొనేందుకు, విదేశాల నుంచి మానవతా సాయం సరఫరాకు అనుమతి ఇవ్వకపోతే బందీల విడుదలను ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం బందీలను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గాజాపై మళ్లీ దాడులు ప్రారంభమవుతాయని హమాస్ను హెచ్చరించారు. దీంతో హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హమాస్ ఇప్పటిదాకా 21 మంది బందీలను విడిచిపెట్టింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం 730 మంది పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసింది. -
ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి
కలెక్టరేట్, న్యూస్లైన్: మున్సిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పర్చాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా చెత్త సేకరించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల మంజూరుపై చూపిన శ్రద్ధ పారిశుద్ధ్యంపై చూపకపోవడం సరికాదని అధికారులకు హితవు పలికారు. డంపింగ్ యార్డులు లేనిచోట తహసీల్దార్లను సం ప్రదించి స్థలాలు సేకరించాలని సూచిం చారు. ఒకప్పుడు ఆదర్శ మున్సిపాలిటీగా ఉన్న సూర్యాపేటలో నేడు పారి శుద్ధ్యం కొరవడిందని అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల గొట్టాలపై దోమల బెడద నివారించేందుకు నెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మూడు నెలలైనా చర్యలు తీసుకోకపోవడంపై కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదని వా రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా విషయాలపై వెంటనే మున్సిపల్ కమిషనర్లకు మెమోలు జారీ చేయాలని మెప్మా పీడీని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులన్నింటిపై విధిగా మూడో బృందంతో విచారణ చేయించాలని సూ చించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న బాలకార్మికులను రెసిడెన్షియల్, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు, బ్రిడ్జి కోర్సులలో చేర్పించాలని సూచిం చారు. ఆస్తి పన్ను, నీటి పన్నులను మార్చి నెలాఖరులోగా నూరుశాతం వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులు మొక్కుబడిగా సమావేశానికి హాజరైతే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ ఆమోస్, నల్లగొండ ఆర్డీఓ జహీర్, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, జిల్లాఆడిట్ అధికారి సీహెచ్.వేణుగోపాల్రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అశ్విని, కమిషనర్లు పాల్గొన్నారు.