breaking news
offices are houses
-
హైబ్రిడ్ మంచేనా? ముంచేనా?
ఉదయాన్నే ఆఫీస్ క్యాబ్ కోసం ఎదురుచూడక్కర్లేదు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి టైమ్ వేస్ట్ చేయక్కర్లేదు. ఇంట్లో హాయిగా కాఫీ తాగుతూ లాప్టాప్ ఆన్ చేస్తే చాలు... ఆఫీస్లో అడుగుపెట్టినట్లే... అటెండెన్స్ పడినట్లే... ప్రపంచాన్ని చుట్టేసిన ‘కరోనా’ కార్పొరేట్ రంగానికి నేర్పిన అతిపెద్ద పాఠం ‘‘హైబ్రిడ్ వర్క్ కల్చర్’’ వారంలో మూడు రోజులు డెస్క్ వర్క్, రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్... వారాంతాల్లో సరదాలు... అసలు ఈ సరికొత్త సంస్కృతి ఉద్యోగుల జీవితాలను, కంపెనీల భవిష్యత్తును ఎలా మార్చింది? మారుస్తోంది? ఒక ప్రత్యేక కథనం.ఎక్కడ పనిచేస్తున్నారనేది కాదు... ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు... ఔట్పుట్ ఎంత వచ్చిందనేదే ముఖ్యం అంటున్నాయి నేటి గ్లోబల్ కంపెనీలు. నాలుగు గోడల మధ్య మూస ధోరణిలో ఆఫీసులో పనిచేయడం... లేదా వర్క్ ఫ్రమ్ హోమ్తో విసిగి పోవడం వంటిæరోజులు ముగిశాయి. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ట్రెండ్గా మారింది. సంస్థల ఉత్పాదకత, ఉద్యోగుల సౌకర్యంతో పాటు లైఫ్ను సమన్వయం చేస్తూ ఈ నూతన పని సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.ఫలితమే ఫైనల్!ఉద్యోగులు తమ పనిదినాలను ఇల్లు, ఆఫీసు మధ్య పంచుకునే వెసులుబాటే హైబ్రిడ్ వర్క్. ఈ విధానంలో ఉద్యోగులు తమ సౌకర్యాన్ని బట్టి ఆఫీసు నుంచి, ఇంటి నుంచి లేదా వారికి నచ్చిన ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకునే వీలును కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఏ ప్రాంతం, ఏ దేశం అనే వాటితో సంబంధం లేకుండా కేవలం ప్రతిభను ఆధారంగా చేసుకుని ఉద్యోగులను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పని ఎక్కడి నుంచి చేసినా ఫలితమే ఫైనల్ అనేది ఈ ఆధునిక విధానంలోని ముఖ్య ఉద్దేశం. డిజిటల్ టూల్స్ సహాయంతో సాధించిన విజయాలను చూసిన కంపెనీలు ఇప్పుడు దీనిని శాశ్వత మోడల్గా మారుస్తున్నాయి.కాఫీషాప్ ఆఫీసైతే!ఒకప్పుడు ఆఫీస్ అంటే నాలుగు గోడల మధ్య అమర్చిన డెస్క్లు, వరుసగా కూర్చునే ఉద్యోగులు. నిర్దిష్టమైన పని వేళలు. కానీ ఇప్పుడది పాత పద్ధతయ్యింది. ఇంటి లివింగ్ రూమ్, నచ్చిన కాఫీ షాప్, పల్లెలోని ప్రశాంతమైన వాతావరణం... ప్రదేశం ఏదయినా లాప్టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రతి చోటూ ఒక వర్క్స్పేస్గా మారిపోతోంది.రెండు పడవలపై ప్రయాణం!సోమవారం పొద్దున్నే సగం తెరిచిన కళ్లతో అలారం సైలెంట్ చేయడం... ఉదయం 8:15 గంటలకు బంపర్–టు–బంపర్ ట్రాఫిక్, హారన్ల గోల మధ్య ప్రెజెంటేషన్ డెక్ గురించి ఆలోచించడం.అదే బుధవారం ఉదయం... హాయిగా ఉదయం 8:30 గంటలకు లేచి, చేతిలో కాఫీ కప్పుతో లాప్టాప్ ఆన్ చేస్తూనే, పక్కన ‘నాన్నా.. నా బార్బీ బొమ్మ కనిపించడం లేదు!’ అని అరిచే నాలుగేళ్ల చిన్నారిని శాంతింపజేయడం.ఒకే మనిషి... ఒకే ఉద్యోగం... కానీ రెండు వేర్వేరు ప్రపంచాలు! ఐటీ ఉద్యోగి జీవితంలో ‘హైబ్రిడ్ వర్క్’ తెచ్చిన తిప్పలివి. ఆఫీస్ రోజున అస్తవ్యస్తమైన ట్రాఫిక్లో గమ్యం చేరుకోవడం ఒక యుద్ధమైతే... ఇంటి నుంచి పనిచేసే రోజున ‘హోమ్’కి, ‘వర్క్’కి మధ్య గోడలు కూలిపోయి, పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఆందోళన, ఒకవేళ పూర్తయినా ‘ఆఫీస్ ముగిసింది’ అనే మానసిక భావన రాదు. వీకెండ్లో కూడా మెయిల్స్, స్లాక్ మెసేజ్లు చూడాలనే మానసిక తాపత్రయం వీడదు. అంటే హైబ్రిడ్ ఉద్యోగులు రెండు పడవలపై ప్రయాణం చేస్తూ నరకయాతన పడుతున్నారు.నెగ్గుకొచ్చేదెలా?హైబ్రిడ్ కల్చర్లో సమయం కలసిరావడం, ప్రయాణ భారం తగ్గడం లాంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు పరోక్షంగా కొన్ని మానసిక, వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ⇒ ఈ విధానంలో ప్రధానమైన సమస్య వర్క్: లైఫ్ బ్యాలెన్స్ లోపించడం. ఇంటి నుంచి పనిచేసే రోజుల్లో ‘పని వేళలు’ ముగిసినా లాప్టాప్ ముందే గడపాల్సి వస్తోంది. ఇది తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. అందువల్ల ఆఫీస్ టైమింగ్స్ పూర్తికాగానే లాప్టాప్ క్లోజ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.⇒ ఒంటరితనం: రోజూ సహచరులను కలవకపోవడం వల్ల టీమ్తో సంబంధాలు తగ్గుతాయి. ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి పొరపాట్లూ జరుగుతుంటాయి. ఇంట్లో ఒక్కరే పనిచేసుకుంటూ ఉంటే, చుట్టుపక్కల మాట్లాడే మనిషి లేక ఒంటరితనం ఆవరిస్తుంది.⇒ వర్క్ బర్నౌట్: ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యవంతమైన కుర్చీలు, టేబుళ్లు లేకపోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి సమస్యలు వెంటాడుతున్నాయి. నిరంతరం స్క్రీన్ ముందే ఉండటంతో వర్క్ బర్నౌట్ పెరుగుతోంది. అందువల్ల ప్రతి 45 నిమిషాలకోసారి చిన్న బ్రేక్ తీసుకుని స్ట్రెచింగ్ చేయాలి. అంతేకాకుండా టీమ్ సభ్యులతో కేవలం వర్క్ గురించే కాకుండా వారానికి ఒకసారి వర్చువల్ భేటీ లేదా క్యాజువల్ కాల్స్ ద్వారా నెట్వర్క్ పెంచుకోవాలి.⇒ ఎదుగుదలకూ ఆటంకం: ఆఫీసుకు క్రమం తప్పకుండా వచ్చేవారికే మేనేజర్లు, హెచ్ఆర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని, ఇంటి నుంచి పనిచేసే వారి కష్టం సరిగ్గా గుర్తింపు పొందదనే ఆందోళన ఉద్యోగుల్లో ఉంటోంది. అందువల్ల మేనేజర్లతో నిరంతరం మీ వర్క్ ప్రోగ్రెస్ పంచుకోవాలి.నిజంగా వరమేనా?గ్యాలప్ జాతీయ సర్వే (8,090 మంది ఉద్యోగులు) ప్రకారం... హైబ్రిడ్ విధానం ఉద్యోగుల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చినట్లు తేలింది. కుటుంబానికి తగిన సమయం దొరికి ప్రశాంతత పెరగడంతో పాటు రోజుకు రెండు నుంచి మూడు గంటలపాటు ప్రయాణ భారం తగ్గుతోంది. అలాగే పనిలో ఏకాగ్రత పెరిగి వేగంగా సాగుతూ ఉత్పాదకత పెరుగుతోంది. వారంలో మూడు రోజులు ఆఫీసులో, మరో రెండు రోజులు ఇంట్లో పనిచేయడం అనే ఫ్లెక్సిబిలిటీ వల్ల మహిళా ఉద్యోగుల రాజీనామాలు తగ్గినట్లు తేలింది.ఏది బెటర్?వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు నిరంతరం ఇంటి నుంచి పనిచేస్తారు. కానీ హైబ్రిడ్ వర్క్లో ఉద్యోగులకు ఇల్లు, ఆఫీస్ రెండింటిలో ఏది కావాలనుకుంటే అది తమ వీలును బట్టి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల వారు ఒంటరితనానికి దూరంగా ఉంటారు. పరిశోధనల ప్రకారం 49% మంది రిమోట్ వర్కర్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు.సవాళ్లతో సవారీకంపెనీ యాజమాన్యాలు కూడా ఈ మార్పును సానుకూలంగానే చూస్తున్నాయి. పెరిగిన రియల్ ఎస్టేట్ ఖర్చులు, ఆఫీస్ మెయింటెనెన్స్ బిల్లులు తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గంగా మారింది. అంతేకాకుండా, గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించడానికి కంపెనీలు హైబ్రిడ్/ రిమోట్ ఆప్షన్లను ఒక ఆకర్షణీయమైన ఆఫర్గా చూపుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ఊహించని సవాళ్లు కూడా ఇందులో ఉన్నాయి.లివ్ ఎనీవేర్.. వర్క్ ఎనీవేర్!కరోనా విజృంభించిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉద్యోగాల నిర్వహణలో సరికొత్త సంస్కృతికి నాంది పలికింది. అయితే ఐదేళ్ల తర్వాత కొన్ని సంస్థలు మాత్రం ఆఫీస్కి వచ్చి పనిచేయాల్సిందేనంటూ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ, మార్పు తప్పనిసరైంది. ఇల్లు, ఆఫీసు అని రెండింటినీ సమన్వయం చేస్తూ హైబ్రిడ్ వర్క్కి శ్రీకారం చుట్టాయి. వాటిల్లో గూగుల్, మెటా, ఎయిర్బీఎన్బీ, సిస్కో సిస్టమ్స్, సిటీ గ్రూప్, గ్రామర్లీ, హబ్ స్పాట్, స్పాటిఫై వంటి ఎన్నో ప్రసిద్ధ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ‘లివ్ ఎనీవేర్ అండ్ వర్క్ ఎనీవేర్’ (ఎక్కడైనా నివసించండి... ఎక్కడి నుంచైనా పనిచేయండి) అంటూ పనిలో స్వేచ్ఛా విధానాన్ని ప్రకటించాయి.సైన్స్ రూట్స్ నుంచి..ఐటీ, కార్పొరేట్ డిక్షనరీలో ఒక సర్వసాధారణమైన పదం ‘హైబ్రిడ్ వర్క్’. నిజానికి హైబ్రిడ్ అనే పదం బయాలజీ రంగానికి చెందిన పదం. బయాలజీ పరిభాషలో హైబ్రిడ్ అంటే రెండు వేర్వేరు జాతులకు చెందిన విత్తనాలు, లేదా జీవులను కలిపి ఒక కొత్త రకాన్ని తయారుచేస్తే దాన్ని ‘హైబ్రిడ్’ అంటారు. ఇక ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్, బ్యాటరీ రెండింటి ద్వారా నడిచే వాహనాలను ‘హైబ్రిడ్ కార్లు’ అంటారు. మరి ఈ పదం ఆఫీస్ కల్చర్ మారింది కొన్ని దశాబ్దాలే కిందటే. 1970లో ‘టెలి కమ్యూటింగ్’ పేరుతో ఇంటినుంచి పనిచేసే విధానం వచ్చినప్పటికీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. 2010 తరువాత ఇదే ఫ్లెక్సిబుల్ వర్క్గా మారింది. హైబ్రిడ్ వర్క్కి 2020 ఒక టర్నింగ్ పాయింట్. కరోనా విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా ఇంటి వద్ద నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కలిగించాయి. ఆ తరువాత సంస్థలకి, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా సైన్స్ రంగంలో ఉన్న ‘హైబ్రిడ్’ పదాన్ని వర్క్స్పేస్కి వర్తింపజేశారు. 2021 నాటికి టైమ్స్, ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వంటి అంతర్జాతీయ పత్రికలు ఈ పదాన్ని విరివిగా ఉపయోగించడంతో ఇది కార్పొరేట్ భాషలోకి చేరింది. ఆ తరవాత ప్రపంచమూ ఈ పదానికి ఆమోదం తెలిపింది.ఫార్మల్ వర్సెస్ క్యాజువల్⇒ మల్లెట్ డ్రెస్ కోడ్: సగం ఫార్మల్, సగం క్యాజువల్ దుస్తులు ధరించడమే మల్లెట్ డ్రెస్ కోడ్. హైబ్రిడ్ ఉద్యోగుల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది పై భాగాన ఫార్మల్ షర్ట్, సూట్ వేసుకుని కింద మాత్రం షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్తో మీటింగ్స్ కానిచ్చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ⇒ థర్డ్ పీక్ అవర్: సాధారణంగా ఉద్యోగుల్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్ సమయాల్లో వర్క్ పీక్లో ఉంటుంది. కానీ హైబ్రిడ్ విధానం వచ్చాక థర్డ్ పీక్ అవర్ తయారైంది. అదే రాత్రి 8 నుంచి 10 గంటల సమయం. డిన్నర్, ఫ్యామిలీ టైమ్ పూర్తయ్యాక ప్రశాంతంగా మిగిలిన పని చేసుకునేందుకు లాగిన్ అవుతున్నారు. ⇒ రోజుకి 4 స్నాక్ బ్రేక్స్: ఇంటి నుంచే పనిచేసే సమయంలో రోజుకి కనీసం నాలుగుసార్లు స్నాక్స్, టీలు తీసుకుంటున్నట్లు 48 శాతం మంది ఒప్పుకున్నారు. ఇది వారికి బాగా నచ్చిన విషయం కూడా. ⇒ పెట్ కొలీగ్స్: ఇంట్లో పనిచేస్తుంటే ఉద్యోగుల పెంపుడు కుక్కలు, పిల్లులు హఠాత్తుగా కెమెరా ముందుకు రావడం, కీబోర్డ్ పైకి ఎక్కి గందరగోళం చేయడం సర్వసాధారణమైపోయింది.⇒ తగ్గిన ఫార్మల్స్: హైబ్రిడ్ కల్చర్ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా టైలు, బ్లేజర్లు, సూట్లు, ఫార్మల్ షూస్ అమ్మకాలు 20% పైగా తగ్గిపోయాయి. వీటి స్థానంలో కంఫర్ట్ వేర్, క్యాజువల్ దుస్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి.⇒ ఓన్లీ 30 మినిట్స్!: హైబ్రిడ్ మోడల్ వచ్చాక గతంలో గంటల కొద్దీ సాగే మీటింగ్లు కేవలం 30 నిమిషాలకు కుదించుకుపోయాయి. అయితే, చిన్న చిన్న ఆన్ లైన్ చెక్–ఇన్ మీటింగ్ల సంఖ్య ఏకంగా 60% పెరిగింది!భవిష్యత్తేంటి? రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ఆప్షన్ మాత్రమే కాదు, ఉద్యోగ ప్రపంచంలో ఒక ప్రధాన భాగంగా మారిపోతుంది. ఉద్యోగం చేయడం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లడం అనేది పాతదైపోతుంది, ఎక్కడి నుంచైనా సమర్థంగా పనిని పూర్తి చేయడం మాత్రమే ఉంటుంది! నియమిత పనివేళల కంటే, సాధించే ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అర్ధరాత్రి పనిచేస్తారో, తెల్లవారుజామున పూర్తి చేస్తారో అది పూర్తిగా ఎంప్లాయీకే వదిలేస్తారు. నగరాల్లోనే ఉండాల్సిన అవసరం ఉండదు. సొంత ఊరిలో కూర్చునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేయవచ్చు. సాంకేతికత పెరిగేకొద్దీ ఇంట్లోనే ఉన్నా ఆఫీస్లో ఉన్నట్లే సహజమైన అనుభూతిని పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఉద్యోగం అనేది ఒక ప్రదేశానికి పరిమితమైన పని కాదు, అదొక ఉత్పాదకత పెంచే పని మాత్రమే!ఇదివరకు ఉద్యోగం అంటే నాలుగు గోడల మధ్య బందీ కావడం... ఇప్పుడు ఉద్యోగం అంటే స్వేచ్ఛగా ఆలోచనలను పంచుకోవడం! హైబ్రిడ్ సాంప్రదాయం అనేది కేవలం పని చేసే పద్ధతిని మాత్రమే మార్చలేదు, మనుషుల జీవన శైలినే కొత్తగా నిర్వచించింది. ప్రదేశం ఏదైనా, సమయం ఏదైనా... ఉద్యోగికి–సంస్థకు మధ్య ఉండాల్సిన నమ్మకం, బాధ్యత అనే పునాదులే ఈ విధానాన్ని నడిపిస్తాయి. కాలంతో పాటు మారుతున్న ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాదు, దాన్ని స్వీకరించడమే మన ముందున్న అసలైన భవిష్యత్తు! హైబ్రిడ్ వర్క్ ఒక ప్రయోగం కాదు, అదొక సానుకూలమైన మార్పు.∙ రమా జంబుల -
ఆఫీసులే ఇండ్లు.. చెరువులే కార్యాలయాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశమంతా తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయవైపే చూస్తోందనీ, ఇందులో భాగంగా 45 వేల చెరువులను పునరుద్ధరించి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో సమానంగా 265 టీఎంసీల నీటిని అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులంతా ‘ఆఫీసులే ఇండ్లు-చెరువులే కార్యాల యాలు’గా మార్చుకుని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని గురువారం హరీశ్రావు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మిషన్ కాకతీయ సదస్సులో హరీష్రావు మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ నాలుగు నెలల్లోనే పూర్తి చేయడంతోపాటు వెంటనే నీరందించవచ్చన్నారు. త్వరలోనే గోదావరి నది డిజైన్ కార్యాలయాన్ని కరీంనగర్లో, కృష్ణా నది డిజైన్ కార్యాలయాన్ని నల్లగొండలో ఏర్పా టు చేయనున్నట్టు హరీశ్రావు తెలిపారు. కాగా, ప్రాణహిత-చేవెళ్ల ఎత్తు తగ్గించబోతున్నామంటూ సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి చేసిన ఆరోపణలను హరీశ్ రావు కొట్టిపారేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం బంగారు తెలంగాణ కోసం ఉద్యమకమిట్మెంట్తోనే ముందుకు వెళు తోందన్నారు. తెలంగాణ సాధించాలనే తపన తోపాటు చట్టసభల్లో కాలుపెట్టాలనే తన కోరిక నెరవేరిందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు.


