breaking news
nuclear reactors
-
Independence Day 2025: దుస్సాహసానికి దిగారో ఖబడ్దార్!
ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా. ..: మోదీ :..న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు. ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు. సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.బలగాలు సత్తా చాటాయి ‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర దేశ భద్రతకు ఛత్రం పదేళ్లలో అందుబాటులోకి దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.‘సింధూ’ ఇక భారత సొత్తే! ‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర! హై పవర్ మిషన్తో అడ్డుకట్ట అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నారీ శక్తికి సలాం ‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి యువతకు మోదీ సవాలు వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం. శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు. తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్యాన్కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు. అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా ‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’. యువత కోసం... రూ.లక్ష కోట్లు ‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్మంత్రీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’. కీలక ఖనిజాలపై దృష్టి ‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం. ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.పదింతలకు ‘అణు’ పాటవం ‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’. -
రోల్స్రాయిస్కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్
బ్రిటన్ జలాంతర్గాములకు ఎనర్జీ అందించే అణు రియాక్టర్ల రూపకల్పన, వాటి నిర్వహణ కాంట్రాక్ట్ను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. 11 బిలియన్ డాలర్ల(సుమారు రూ.90,200 కోట్లు) ఈ ‘యూనిటీ’ కాంట్రాక్టు ఎనిమిదేళ్లపాటు చెల్లుబాటు అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం బ్రిటన్ రాయల్ నేవీ సామర్థ్యాన్ని పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ యూనిటీ ఒప్పందం గతంలో చేసుకున్న ఒప్పందాలను క్రమబద్ధీకరిస్తుందని అధికారులు తెలిపారు. కంపెనీ అందుకున్న కాంట్రాక్టు వల్ల లండన్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు బ్రిటిష్ వ్యాపారం, ఉద్యోగాలు, జాతీయ భద్రతకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని అందిస్తాయని రక్షణ మంత్రి జాన్ హీలీ నొక్కి చెప్పారు. ఈ ఒప్పందం వల్ల కనీసం 1,000 నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అవకాశాలు వస్తాయని, 4,000 మందికి పరోక్షంగా రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంగ్లాండ్లో డెర్బీలో రోల్స్ రాయిస్ న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి హీలీ సందర్శించారు.ఇదీ చదవండి: కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్కు ఊరటయూకే, యూఎస్, ఆస్ట్రేలియా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు రోల్స్ రాయిస్ పేర్కొంది. -
ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు అవసరమయ్యే ఎనర్జీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో సంస్థ అవసరాలు తీర్చడానికి వీలుగా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్-తక్కువ పరిమాణం, అధిక భద్రత కలిగే రియాక్టర్లు) నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలోనే ఒక కార్పొరేట్ సంస్థ ఈమేరకు వివిధ ఎస్ఎంఆర్ల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఇది మొదటిసారి కావడం గమనార్హం.గూగుల్ సంస్థ కైరోస్ పవర్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 2030 నాటికి కైరోస్ పవర్కు చెందిన ఎస్ఎంఆర్ ద్వారా విద్యుత్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. 2035 నాటికి మరిన్ని రియాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందంలోని అంశాల అమలు తుదిదశ చేరేనాటికి ఆరు నుంచి ఏడు రియాక్టర్ల ద్వారా మొత్తం 500 మెగావాట్ల విద్యుత్ను గూగుల్ కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు, ఏ ప్రాంతంలోని రియాక్టర్ల నుంచి కొనుగోలు చేయబోతున్నారో మాత్రం తెలియజేయలేదు.ఏఐ టెక్నాలజీలో నిత్యం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి వాడుతున్న పరికరాలు, డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. సంప్రదాయ విద్యుత్ తయారీకి బదులుగా గ్లోబల్ కంపెనీలు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ కంపెనీ అణు రియాక్టర్ల ద్వారా వచ్చే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ టాలెన్ ఎనర్జీ నుంచి న్యూక్లియర్ పవర్డ్ డేటా సెంటర్ను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ పెన్సిల్వేనియాలోని త్రీ మైల్ ఐలాండ్లో రియాక్టర్ను పునరుద్ధరించడంలో కాన్స్టెలేషన్ ఎనర్జీకి సాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2023-2030 మధ్య యూఎస్ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం మూడు రెట్లు పెరుగుతుందని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. దీనికి దాదాపు 47 గిగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
పాక్ కు ఆ శక్తి ఇచ్చింది చైనానే..
న్యూఢిల్లీ: అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్ పీటీ) నిబంధనలను చైనా ఉల్లఘించింది. ఎన్ పీటీలో సభ్యత్వం లేని దేశాలకు న్యూక్లియర్ ఆయుధాలు సరఫరా చేయకూడదని 2010లో ఎన్ పీటీ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పాకిస్తాన్ కు చైనా న్యూక్లియర్ రియాక్టర్లను సరఫరా చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి గ్రూప్ ను పర్యవేక్షించే ఆర్మ్స్ కంట్రోట్ అసోసియేషన్(ఏసీఏ) తన తాజా రిపోర్టుల్లో ఈ విషయాన్ని గుర్తించింది. న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా ఎన్ పీటీలోని ఈ నిబంధనను పావుగా వాడుకుని అడ్డుగా నిలిచింది. చైనా-పాకిస్తాన్ ల మధ్య 2013లో జరిగిన ఒప్పందం ప్రకారం చస్మా-3 న్యూక్లియర్ రియాక్టర్లను పాకిస్తాన్ కు ఇచ్చింది. దాంతో 2010 అంతర్జాతీయ స్థాయిలో ఎన్ పీటీ చేసిన నిబంధనలను తుంగలో తొక్కింది. చస్మా-3 రియాక్టర్లను అందుకోవడానికి తమకు అర్హత లేదని తెలిసినా పాకిస్తాన్ వెనకడుగు వేయలేదు. 2004 లో చైనా ఎన్ఎస్ జీలో సభ్యత్వాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఎన్ఎస్ జీలో సభ్యత్వానికి ముందే పాకిస్తాన్ కు రియాక్టర్లను ఇచ్చినట్లు చైనా వాదిస్తోంది. అధికారిక రిపోర్టులలో చైనా నిబంధనలను ఉల్లఘించిందని తేలినా.. తానే తప్పు చేయలేదని బుకాయిస్తోంది. పాకిస్తాన్ లోని చస్మా న్యూక్లియర్ పవర్ కాంప్లక్స్ కు మొత్తం 6 రియాక్టర్లను చైనా అందించింది. వీటిలో రెండు రియాక్లర్లు మాత్రమే 2003లో పాకిస్తాన్ కు అందించింది. ఎన్ఎస్ జీలో సభ్యత్వం కలిగిన దానిగా 4 రియాక్టర్లను అందించింది. ఎగుమతులను క్రమంగా పర్యవేక్షిస్తూ వస్తున్న చైనా.. ఎన్ఎస్ జీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాకిస్తాన్ కు రియాక్టర్లను సరఫరా చేస్తూ వస్తోంది. న్యూక్లియర్ ఆయుధాలకు సంబంధించి ఎటువంటి సాయాన్ని వేరే దేశాలకు అందించకుండా ఉంటేనే ఎమ్ టీసీఆర్ లో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది.2000లో మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్(ఎమ్ టీసీఆర్) నిబంధనలకు ఒప్పుకున్న చైనా అందులో సభ్యత్వం తీసుకుంది. చైనాపై నాలుగేళ్ల నిరంతర పర్యవేక్షణ అనంతరం 2004లో చైనా ఎన్ఎస్ జీ సభ్యత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రస్తుతం ఎమ్ టీసీఆర్ లో సభ్యత్వం కలిగిన భారత్ ఎన్ఎస్ జీ ఆప్లికేషన్ ను చైనా ఆమోదించకుండా, తిరస్కరించకుండా నిలిపివేసింది. నిబంధనల ఉల్లంఘనను ఎమ్ టీసీఆర్ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే, ఎమ్ టీసీఆర్ నిబంధనలను చైనా స్వచ్ఛందంగా పాటిస్తోంది. 2016లో చైనాలో ఓ ప్రభుత్వ సంస్థ చేసిన సర్వేలో చైనా తనకు కావలసిన దేశాలకు న్యూక్లియర్ టెక్నాలజీని అందిస్తున్నట్లు తేలింది. -
అణు రియాక్టర్లతో ఏపీని ప్రమాదంలో పడేస్తారా?
ఢిల్లీ: గుజరాత్ను సేఫ్గా ఉంచి అణు రియాక్టర్లతో ఆంధ్రప్రదేశ్ని ప్రమాదం పడేస్తారా? అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గుజరాత్లోని అణురియాక్టర్లను కొవ్వాడకు మార్చడంలో కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. గుజరాత్లో ఉన్న అణురియాక్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చడంలో ఆంతర్యమేమిటి అని సూటిగా ప్రశ్నించారు. అన్ని న్యూక్లియర్ రియాక్టర్లను ఒకే చోట పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అమెరికా ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారత్ను పావుగా మారుస్తున్నారని విమర్శించారు. ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదని సీతారాం ఏచూరి తెలిపారు. -
రియాక్టర్లకు రూ.1,500 కోట్ల రిస్క్ కవర్!
బీమా సంస్థల విజ్ఞప్తికి ఐఆర్డీఏ సానుకూల స్పందన న్యూఢిల్లీ: అణు రియాక్టర్లకు రిస్క్ కవరేజ్ కల్పించడానికి సంబంధించి రూ.1,500 కోట్ల మూలనిధి (లైబిలిటీ పూల్) ఏర్పాటుకు బీమా రంగ రెగ్యులేటర్- ఐఆర్డీఏ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. చైర్మన్ టీఎస్ విజయన్ ఇక్కడ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ‘రియాక్టర్ల కవరింగ్కు డిమాండ్ ఉంది. భారత్ పరిధిలో ఇందుకు సంబంధించి రూ.1,500 కోట్ల ప్రత్యేక మూల నిధిని ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. బీమా కంపెనీలు ఈ మూలనిధి ఏర్పాటుకు మా ఆమోదం కోరాయి. అయితే ఈ నిధులు ఎలా సమీకరిస్తారన్న విషయాన్ని మాత్రం అవి ఇంకా వెల్లడించలేదు.ఆయా అంశాలను మా ముందు ఉంచితే- సానుకూల రీతిలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తాం’ అని విజయన్ అన్నారు. భారత్ బీమా బ్రోకర్ల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఈ వివరాలను తెలియజేశారు. రూ.1,500 కోట్ల నిధి ఏర్పాటుకు రీ-ఇన్సూరర్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు కూడా ఆయా వర్గాలు తెలిపాయి. కస్టమర్లలో చైతన్యం పెంచాలి... కాగా కస్టమర్లలో చైతన్యాన్ని పెంపొందించడంలో బీమా బ్రోకర్లు సంబంధిత వర్గాలదే కీలకపాత్ర అని విజయన్ పేర్కొన్నారు. బహిరంగ నోటీసులు, వెబ్సైట్లు, వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా పాలసీ హోల్డర్లు ఎటువంటి మోసాలకూ గురికాకుండా ఐఆర్డీఏ కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా విజయన్ వివరించారు. బీమా బిల్లుపై ఆర్డినెన్స్ను ఆపేయాలి హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: ఎన్డీఏ ప్రభుత్వం బీమా బిల్లుపై ఆర్డినెన్స్ను తీసుకురావడాన్ని నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడాన్ని, ఈ నాలుగు సాధారణ బీమా కంపెనీల వాటాలను అమ్మడాన్ని వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా యూనియన్లు డిమాండ్ చేశాయి. -
పిసరంత పొలోనియం.. ప్రాణాలు తీస్తుంది
సాక్షి, హైదరాబాద్: అత్యంత అరుదైన రేడియోధార్మిక మూలకమిది. భూమి లోపలి పొరల్లో అతికొద్ది మోతాదుల్లో సహజసిద్ధంగా ఏర్పడే ఈ పదార్థాన్ని 1898లో మేరీ, పియరీ క్యూరీ దంపతులు కనుగొన్నారు. అణు రియాక్టర్లలోనూ దీన్ని కృత్రిమంగా తయారు చేయవచ్చు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ(ప్లాస్టిక్ కాగితాన్ని నలిపినప్పుడు దాని ఉపరితలంపై ఏర్పడే విద్యుత్తు లాంటిది)ని తొలగించే పరికరాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. దుష్ర్పభావం ఇలా... పొలోనియం-210 అతిచిన్న మోతా దుల్లో కూడా అత్యంత ప్రమాదకరం. గ్రాము కంటే తక్కువ మోతాదుతోనూ మనిషి ప్రాణాలు తీయవచ్చు. ఇది ఒకసారి రక్తంలోకి చేరితే దాని ప్రభావాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. అందులోని ఆల్ఫా కణాలు కాలేయంతోపాటు కిడ్నీ, ఎముక మజ్జలపై దాడి చేసి పనిచేయకుండా చేస్తాయి. ఫలితంగా కొద్ది రోజుల్లో లేదంటే వారాల్లోపు మరణం సంభవిస్తుంది. రేడియోధార్మిక కణాలు శరీరంలోకి చేరినప్పుడు అవి చర్మం ద్వారా బయటకొచ్చే అవకాశముంది. కానీ పొలోనియం-210లోని ఆల్ఫా కణాలు పెద్దవిగా ఉండటం వల్ల లోపలే ఉండిపోతాయి. గాజు పరికరాల్లో ఉంచితే రేడియోధార్మిక డిటెక్టర్లు కూడా గుర్తుపట్టలేవు. శరీరంలోకి చేరిన విషంలో 50 నుంచి 90 శాతం మలమూత్రాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మిగిలిన కొద్ది మోతాదులో సగం ముందుగా రక్తంలోకి ఆ తర్వాత ప్లీహం, మూత్రపిండాలు, కాలేయాల్లోకి చేరుతుంది. పది శాతం పొలోనియం ఎముక మజ్జలో పేరుకుపోతుంది. రక్తంలోకి చేరిన పొలోనియం శరీరం మొత్తం ప్రయాణిస్తూ ఎర్రరక్త కణాలను చంపేయడం మొదలుపెడుతుంది. రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. ఆయా అవయవాలు విఫలం కావడంతోపాటు వికారం, తలనొప్పి, విరేచనాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రభావం కేన్సర్ చివరి దశను పోలి ఉంటుంది. దీనితో ఎవరైనా మరణించారా? 2006లో రష్యా గూఢచారి అలెగ్జాండర్ లెథ్వింకో మరణంతో పొలోనియం విష ప్రయోగంపై విసృ్తత చర్చ మొదలైంది. అంతకుముందు 1956లో ఇరేన్ జోలియట్ క్యూరీ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త (1935 నోబెల్ అవార్డు గ్రహీత) కూడా ఈ విష ప్రభావంతో మరణించినట్లు ఆధారాలున్నాయి. నాలుగేళ్ల క్రితం పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ మరణానికి కూడా ఇదే కారణమన్న ఆరోపణలు వచ్చాయి.