breaking news
NID
-
ఎన్ఐడీకి నిధులు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) నిర్మాణానికి రూ.100.38 కోట్ల బడ్జెట్ ఆమోదించగా.. సర్వే, సరిహద్దు గోడ నిర్మాణం వంటివాటికి రూ.0.70 కోట్లు వెచ్చించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ తెలిపారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీ అయిన నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి రూ.93.18 కోట్లు, యంత్రాలు, పరికరాలు, లైబ్రరీ పుస్తకాలకోసం ఎన్ఐడీ అహ్మదాబాద్కు రూ.6.50 కోట్లు విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, రెడ్డప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఏపీలో 66 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి నిధులు ఉరవకొండ, ధర్మవరంలోని పుట్లమ్మ, మదనపల్లిలోని శ్రీ వివేకానంద సహా ఆంధ్రప్రదేశ్లోని 66 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి 201516 నుంచి 202122 మధ్య రూ.53.59 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. సమర్థ్ పథకం కింద యాడికికి చెందిన 40 మంది చేనేత కార్మికులకు స్కిల్ అప్గ్రేడేషన్ శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పీఎంకేకేకేవైకి రూ.421.02 కోట్లు ఖర్చు ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన (పీఎంకేకేకేవై) కింద ఏపీలోని గనుల ప్రభావిత ప్రాంతాల్లో గతేడాది డిసెంబర్ వరకు కోవిడ్19 పనులతో కలిపి చేపట్టిన 16,149 ప్రాజెక్టులకు రూ.1,282.79 కోట్లు కేటాయించగా రూ.421.02 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు గురుమూర్తి, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబుగా కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అదనపు రైల్వే శిక్షణ సంస్థ యోచన లేదు ఆంధ్రప్రదేశ్లో అదనపు రైల్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ఆలోచనలేదని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. లిథియం లభ్యతపై సర్వే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కడప జిల్లాల్లోని పర్నపల్లెలోపతనుతుల ప్రాంతంలో లిథియం సంభావ్యతను అంచనా వేయడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 202122 ఫీల్డ్ సీజన్లో ఒక జీ4 స్టేజ్ అన్వేషణ ప్రాజెక్ట్ను చేపట్టిందని కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం లోక్సభలో తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. మట్టి, ప్రవాహ అవక్షేపం, రాతిశిలల నమూనాల సేకరణతోపాటు స్కేల్ మ్యాపింగ్ చేపట్టనున్నట్లు చెప్పారు. జూట్ పరిశ్రమను ఆదుకోండి పర్యావరణ హితమైన జూట్ పరిశ్రమను ఆదుకోవాలని కేంద్రానికి వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దశల వారీగా తొలగిస్తామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని ఈ దశలో జూట్ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆచరణ సాధ్యంకాని పాలసీల వల్ల ఏలూరులోని వందేళ్లనాటి జూట్ మిల్లు మూత పడిందని తెలిపారు. జనపనారపై ఆధారపడిన లక్షలమందికి మద్దతిస్తారా లేదా అని ప్రశ్నించారు. రైల్వేలైను ఖర్చు కేంద్రమే భరించాలి : మార్గాని భరత్రామ్ కోటిపల్లి నరసాపురం రైల్వేపనులకు సంబంధించి వందశాతం నిధులు కేంద్రమే భరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ భరత్రామ్ డిమాండ్ చేశారు. కోటిపల్లి నరసాపురం రైల్వేలైనుకు సంబంధించి ఆయన అనుబంధ ప్రశ్న అడుగుతూ.. రాష్ట్రానికి రెవెన్యూ లోటు కూడా పూడ్చని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైల్వేలైను నిధులు భరించాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి టీడీపీ ఎంపీలు తమతో కలిసి రావాలని కోరారు. దీనిపై కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రావ్సాబ్ ధాన్వే సమాధానమిస్తూ.. రాష్ట్ర విభజన అనంతరం ఏ రాష్ట్ర పరిధిలోని లైన్లు ఆ రాష్ట్రమే రాష్ట్ర వాటా భరించాలని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని పలు విధాలుగా కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్పై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిపై ప్రధాని రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వాలని ప్రధానికి, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి సహకరించాలని కోరారు. చంద్రబాబు వల్లే విభజన జరిగిందని, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి బతికి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు ఈబీసీ మహిళలకు కూడా ఆర్థికభరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, పారిశుధ్య కార్మికులకు నిధులు పెంచడంతోపాటు సక్రమంగా ఖర్చుచేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లు పెంచాలని, తద్వారా విద్యార్థుల ఆన్లైన్ తరగతులకు ఇబ్బందులు రావని పేర్కొన్నారు. మేడిపండు బడ్జెట్ : గోరంట్ల మాధవ్ కేంద్ర బడ్జెట్ మేడిపండు చూడ.. అన్న సామెత మాదిరిగా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడుతూ సంతలో గొర్రెను అమ్మేసినట్లు చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేశారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలను ఆర్థికమంత్రి బడ్జెట్లో విస్మరించారని చెప్పారు. పదేళ్లలోగా రాష్ట్రంలో విద్యాసంస్థలు నెలకొల్పాల్సి ఉన్నా కేంద్రమే ఆ బాధ్యతకు దూరంగా ఉంటోందని విమర్శించారు. కేంద్రీయ వర్సిటీ, పెట్రోలియం వర్సిటీలకు కేటాయింపులు సరిపోవన్నారు. నదుల అనుసంధానాన్ని రాష్ట్రం స్వాగతిస్తోందని చెప్పారు. కానీ అంతర్రాష్ట్ర జలవివాదాల విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా అంశాన్ని ఇప్పటికైనా కేంద్రం నెరవేర్చాలని కోరారు. -
విజయవాడలో ఎన్ఐడీ
-
విజయవాడలో ఎన్ఐడీ
కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం రూ. 108 కోట్లతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఏర్పాటు సీమాంధ్రకు మేలు చేయాలన్న లక్ష్యంలో ఇదొకటి: జైరాం రమేష్ తెలంగాణలో 7, సీమాంధ్రలో 3 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు హెచ్ఎంటీ బలోపేతానికి రూ. 134 కోట్లు ప్రణాళికేతర రుణం టీ-బిల్లు చట్టరూపం దాల్చకముందే ‘పోలవరం’పై ఆర్డినెన్స్ తేలేం సీమాంధ్ర ‘ప్రత్యేక హోదా’కు కేబినెట్, ఎన్డీసీ ఆమోదం అక్కర్లేదు ప్రణాళికా సంఘం చైర్మన్ హోదాలో ప్రధానే స్వయంగా ప్రకటించారు ‘ప్రత్యేక హోదా’ బీజేపీ కోరలేదు.. కాంగ్రెస్సే చర్చించి నిర్ణయించింది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒక రోజు ఉండొచ్చు.. వారం ఉండొచ్చు.. 24 వారాలు మించకుండా ఎన్ని రోజులైనా ఉండొచ్చు కేబినెట్ భేటీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్రమంత్రి జైరాం సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ (ఎన్ఐడీ) సంస్థను విజయవాడలో ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అస్సాంలోని జోరాట్, మధ్యప్రదేశ్లోని భోపాల్, హర్యానాలోని కురుక్షేత్రలతో పాటు.. సీమాంధ్రలోని విజయవాడలో ఎన్ఐడీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం మొత్తం రూ. 434 కోట్లు మంజూరు చేసింది. అంటే.. విజయవాడలో దాదాపు రూ. 108 కోట్ల వ్యయంతో ఎన్ఐడీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ ఈ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ.. కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చ అనంతరం దీన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తాయి. ‘‘ఇది జాతీయ స్థాయి విద్యాసంస్థ. సీమాంధ్రకు మేలు చేయాలన్న కేంద్ర లక్ష్యంలో ఇదొకటి’’ అని కేంద్రమంత్రి జైరాంరమేష్ కేబినెట్ భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. అలాగే.. దేశవ్యాప్తంగా మొత్తం 54 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 10 విద్యాలయాలు ఏర్పాటుకాబోతున్నాయని ఆయన చెప్పారు. ఇందులో తెలంగాణకు 7, సీమాంధ్రలో 3 ఏర్పాటవుతాయని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించాలని నిర్ణయించటం జరిగిందని వెల్లడించారు. ఒక్కో కేంద్రీయ విద్యాలయానికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తారని.. వీటిని కేంద్రమే నిర్వహిస్తుందని తెలిపారు. ఇక హెచ్ఎంటీ (హిందుస్థాన్ మిషన్ టూల్స్) లిమిటెడ్ అభివృద్ధి పథంలో సాగేందుకు గాను దాదాపు రూ. 134 కోట్లను ప్రణాళికేతర రుణ రూపంలో ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ సంస్థకు హైదరాబాద్లో కూడా ఒక ఉత్పత్తి కేంద్రం ఉంది. శుక్రవారం నాటి కేబినెట్ భేటీకి.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు కేబినెట్ మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ హాజరయ్యారు. మరో కేంద్రమంత్రి జైపాల్రెడ్డి హాజరుకాలేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్రమంత్రి చిరంజీవి సైతం పర్యాటక శాఖకు చెందిన అంశాల కోసం ఈ భేటీకి హాజరయ్యారు. టీ-బిల్లు చట్టమయ్యాకే ‘పోలవరం’పై ఆర్డినెన్స్... ‘‘పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు ఆర్డినెన్స్ తేవాలంటే ముందుగా పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014 రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపం దాల్చాలి. చట్టరూపం దాల్చితేనే దానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తేవొచ్చు’’ అని జైరాం తెలిపారు. ఇక సీమాంధ్రకు ప్రత్యేక హోదా గురించి చెప్తూ ‘‘దానికి ప్రత్యేకంగా కేబినెట్ ఆమోదం అవసరం లేదు. ప్రణాళిక సంఘం చైర్మన్ హోదాలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రకటించారు. అది అమలై తీరుతుంది. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) ఆమోదం కూడా అవసరం లేదు. 2002లో ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఎన్డీసీ ఆమోదం ఏమీ తీసుకోలేదు. అప్పుడు కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు మాత్రం నేరుగా ప్రణాళిక సంఘం చైర్మన్ హోదాలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రకటన చేశారు.. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా, పదేళ్ల పాటు ఆర్థిక రాయితీలు, పన్ను మినహాయింపులు కొనసాగుతాయి..’’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన రోజు కావచ్చు..వారం కావచ్చు... ‘‘రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫారసు చేసింది. అలాగే అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా సిఫారసు చేసింది. అసెంబ్లీ గడువు జూన్ 2 వరకు ఉంటుంది.. అంటే రాష్ట్రపతి పాలన ఒక రోజు ఉండొచ్చు.. ఒక వారం ఉండొచ్చు.. లేదా 24 వారాలకు మించకుండా ఎప్పటివరకైనా ఉండొచ్చు...’’ అని జైరాం వివరించారు. ‘‘అసలు బీజేపీ ‘ప్రత్యేక హోదా’ అడగనేలేదు. కానీ వారే అడిగినట్టు చెప్పుకొంటున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్గాంధీతో భేటీ అయ్యాక తగిన అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయమిది’’ అని పేర్కొన్నారు. ‘‘సీమాంధ్ర రాజధాని విషయమై.. నోటిఫికేషన్ రోజున నిపుణుల కమిటీ ఏర్పాటవుతుంది. రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై ఆరు నెలల్లోగా నివేదిక ఇస్తుంది. కర్నూలు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు కావాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే ఈ కమిటీ అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తుంది..’’ అని తెలిపారు.