ప్రీతి జింటా వివాదంలో సాక్షిగా క్రికెటర్ కొడుకు!
మాజీ ప్రేమికులు, కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ భాగస్వాములు ప్రీతి జింటా, నెస్ వాడియాల వివాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతితో నెస్ వాడియా గొడవపడినప్పడు అక్కడే ఓ లెజండరీ క్రికెటర్ కొడుకు ఉన్నట్టు విచారణలో తేలింది. ఆ సమయంలో రికార్డయిన సీసీటీవీ క్లిప్లను రెండింటిని సేకరించారు. మైనర్ అయిన ఆ అబ్బాయిని ఈ కేసులో సాక్షిగా చేర్చాలా వద్దా అన్న విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
మాజీ ప్రియుడు నెస్ వాడియా దూషించడంతో పాటు తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాడియాకు సమన్లు జారీ చేసే ముందు పోలీసులు ప్రీతిని విచారించనున్నారు. ఈ సంఘటన జరిగినపుడు అక్కడే ఉన్న క్రికెటర్ కొడుకు జోక్యం చేసుకుని వాడియను వారించినట్టు పోలీసులు చెప్పారు. అయితే వాడియా ఆ అబ్బాయిపై కూడా చిందులేసినట్టు తెలిపారు. అయితే ఏ క్రికెటర్ కొడుకు, అతని పేరు ఏంటి అన్న వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే కేసులో అతన్ని సాక్షిగా చేర్చితే పేరు వెల్లడించనున్నారు.