breaking news
Nagalapur University
-
కుంభకోణాల ఊబిలో ఎస్కేయూ
యూనివర్సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిధులను స్వాహా కుంభకోణంలో కళ్లు బైర్లు కమ్మేలా విషయాలు వెల్లడవుతున్నాయి. అవినీతి సొమ్ము రూ.5.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సీనియర్ ప్రొఫెసర్ల విచారణ కమిటీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందనే విషయాన్ని ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్య అధికారికంగా వెల్లడించలేదు. ఆర్థిక నేరం తీవ్రతనుబట్టి కేసును సీబీసీఐడీకి అప్పగిస్తారా, లేదా ఏసీబీకి అప్పగిస్తారా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు: ఎస్కేయూలోని ఫైనాన్స్ విభాగంలో విధులు నిర్వహించి ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉదయభాస్కర్రెడ్డి, శేషయ్యల మీద కేసులు నమోదు చేశారు. 406,409,468,471,477,420 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.వీరిని అరెస్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఇటుకలపల్లి ఎస్సై శివగంగాధర్ రెడ్డి తెలిపారు. కాగా గత ఏడాది నుంచి ఈ ఏడాది నవంబర్ 11 వరకు జరిపిన విచారణలో శేషయ్య రూ.70 లక్షలు, ఉదయభాస్కర్ రెడ్డి తన ఖాతాలో రూ. 25 లక్షలు, తన భార్య ఖాతాలో రూ. 25 లక్షలు, కుటుంబ సభ్యులఖాతాలో రూ.20, రూ.33 లక్షల చొప్పున జమా చేసినట్లు సమాచారం, ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.1.5 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఆన్లైన్ విధానం అమలులోనే ఒంటెత్తు పోకడలు: నేరుగా జీతాలు చెల్లింపు విధానం నుంచి ఆన్లైన్లో జీతాల జమ చేసిన విధానంలోనే అప్పటి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ ఒంటెత్తు పోకడలను అవలంబించారు. 2011 అక్టోబర్ నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేశారు. వర్సిటీలో నూతన విధానాన్ని అమలు చేసేటపుడు ఓ కమిటీని ఏర్పాటు చేసి వాటిలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. అనంతరం సూచించిన సిపార్సుల ఆధారంగానే అమలు చేయాలి. హార్డ్కాపీలో వివరాలను నమోదు చేయకుండా కేవలం పెన్డ్రైవ్ ద్వారా మాత్రమే బ్యాంకు వారికి వివరాలు అందించడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సింది రిజిస్ట్రార్లు, ఫైనాన్స్ ఆపీసర్లే. ప్రతి బిల్లు పైన జూనియర్ అసిస్టెంట్ ,సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సంతకాలు చేస్తారు. అయితే ఇద్దరు అధికారులు మాత్రమే అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదు చేశారు. బాధ్యతారాహిత్యం : 2011 నవంబర్ 11 న ఎస్కేయూ వీసీగా రామకృష్ణా రెడ్డి భాద్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఈ అవినీతి తంతు పురివిప్పింది. ఉద్యోగులు లంచం తీసుకుంటూ దొరికినప్పటికీ ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోట్లాది రూపాయలు వర్సిటీ జనరల్ ఖాతా నుంచి మళ్లిం చారంటే ఆయన హయాంలో అవినీతి ఎంత జరిగిందో అర్థం చేసుకోవచ్చు. బోధన, బోధనేతర ఉద్యోగుల్లో ఆందోళన : ఎస్కేయూ బోధన, బోధనేతర ఉద్యోగులు వారి ఆర్థిక సామర్థ్యం మేర జనరల్ ప్రావిడెండ్ ఫండ్లో జమ చేస్తారు. అయితే ఈ ప్రావిడెండ్ ఫండ్ నిధులను మళ్లించి స్వాహా చేశారనే ఆందోళనలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి. రిటైర్డ్ బెనిఫిట్స్ కింద రూ.5 కోట్లన జమ చేశారు. వీటి నుంచి ఎంత మళ్లించారనే అనుమానాలు మొదలయ్యాయి. దూరవిద్య ఆదాయం కూడా కలిసొచ్చింది : ఎస్కేయూకు బోధన,బోధనేతర ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్గ్రాంట్స్ సాధారణ బడ్జెట్ నుంచి విడుదల చేస్తుంది. కేటాయించిన బ్లాక్గ్రాంట్స్ నిధులు చాలకపోతే అంతర్గత వనరుల నుంచి జీతాలను చెల్లిస్తారు. దూర విద్య ఆదాయం గత ఏడాది రూ.18 కోట్లు, ఈ సంవత్సరం రూ.22 కోట్లు వచ్చింది.వీటిని నేరుగా వర్సిటీ ఖాతాలో జమ చేశారు. జీతాల చెల్లింపుకు బ్లాక్గ్రాంట్స్ కొరత రావడంతో దూరవిద్య ఆదాయం ద్వారా జీతాలను చెల్లించారు. దీంతో అందినకాడికి నిధులను దారి మళ్లించారు. -
దిమ్మ తిరిగింది!
యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిధుల మళ్లింపు భాగోతం రోజుకో మలుపు తిరుగుతోంది. వర్సిటీ ఉద్యోగుల జీతాలకు అవసరమైన మొత్తం కంటే ప్రతి నెలా అధికంగా డ్రా చేసినా ఏళ్లతరబడి పట్టించుకున్న నాథుడేలేడు. తొలుత రూ.50 లక్షల అవినీతి చోటుచేసుకుందని భావించినా, ఆ మొత్తం ఇపుడు పదింతలైంది. మరింత పెరిగే అవకాశం ఉందని విచారణలో వెలుగుచూస్తోంది. ఈ కుంభకోణంపై విచారిస్తున్న ప్రొఫెసర్ల కమిటీ నిర్ఘాంతపోతోంది. వర్సిటీలోని ఫైనాన్స్ విభాగంలో విధులు నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్గా విధులు నిర్వహించే ఉదయభాస్కర్రెడ్డి, శేషయ్యలు స్వాహా చేసిన అవినీతి సొమ్ము ఎంత అనేది అంతుచిక్కడం లేదు. శనివారం విచారణ చేపట్టిన సీనియర్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ బినామీ ఖాతాలన్ని పరిశీలించి రూ.5.50 కోట్లు దాకా స్వాహా చేసినట్లు నిర్ధారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మెత్తం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉదయభాస్కర్రెడ్డి పేరుతో 10 నుంచి 15 బినామీ ఖాతాల్లో రూ.1.30 కోట్లు మళ్లించారు. తన భార్య రమాదేవి పేరుతో ఏకంగా నెలకు రూ.2.4 లక్షల జీతాన్ని చెల్లించేశాడు. ఈ నెల 7న చెల్లించిన భోదన సిబ్బంది జీతాల అరియర్స్ నుంచే తన భార్య ఖాతాలోకి రూ.15 లక్షలు బదిలీ చేశాడు. శేషయ్యకు బినామీ ఖాతాలు 10 వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. తన భార్య భాగ్యలక్ష్మి పేరుతో రూ.12 లక్షలు బదిలీ చేశాడు. ఇది కేవలం కొన్ని నెలల నుండి అక్రమంగా బదిలీ చేసిన మొత్తాలే. ఆన్లైన్ ద్వారా 2011 నుంచి జీతాలను జమ చేస్తుండడంతో అప్పటి నుంచి ఎంత మొత్తంలో అవినీతి జరిగిందనేది విచారించాల్సి ఉంది. గవర్నర్ సీరియస్! ఎస్కేయూలో జీతాల చెల్లింపుల్లో జరిగిన అతి పెద్ద కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, ఛాన్సలర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఉన్న త విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని వెంటనే ఎస్కేయూకు ఉత్తర్వులు జారీ చేశారు. జీతాల చెల్లింపు కుంభకోణం ఎలా జరిగింది.. జరగడానికి గల కారణాలు, నిగ్గు తేల్చడానికి చేపట్టిన చర్యలను సూచిస్తూ నివేదిక అందజేయాలని ఆదేశించారు. సొమ్మును డ్రా చేసేందుకు విఫలయత్నం అక్రమంగా స్వాహా చేసిన సొమ్మును ఉదయభాస్కర్రెడ్డి భార్య రమాదేవి ఖాతాలోని సొమ్ము రూ.26 లక్షలను డ్రా చేసేందుకు విఫలయత్నం చేసింది. అనంతపురంలోని నీలిమ థియేటర్కు ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకులో శనివారం ఆమె తన పిక్స్డ్ డిపాజిట్ను వెనక్కి తీసుకుంటున్నానని బ్యాంకు అధికారులకు తెలపగా వారు ఎస్కేయూ రిజిస్ట్రార్కు సమాచారం అందించారు. ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయగా అ ప్రయత్నాలను అడ్డుకొన్నారు. అధికారికంగా క్రిమినల్ కేసులు పెడితేనే వర్సిటీయేతర ఉద్యోగుల ఖాతాలను ఫ్రీజ్ చేసే అవకాశం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాల్సి వచ్చింది. బినామీ పేర్లతో ఉన్న అన్ని లాకర్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఆడిటింగ్లో పారదర్శకత లేమి జీతాల చెల్లింపుల్లో ఆడిటింగ్ నిర్వహించలేదు. వర్సిటీ జనరల్ ఖాతా నుండి ఎంత మొత్తంలో జీతాలను ప్రతి నెలా జమ చేసింది ఆడిటింగ్ లోపాలను ఎత్తి చూపుతోంది. సంవత్సరానికి నాలుగు సార్లు ఆడిటింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కోట్ల రూపాయల స్కాం వ్యవహారంపై ఎందుకు మౌనం వహించారనే సందేహాలు ఉన్నాయి. వర్సిటీలోని ఉద్యోగులందరికీ జీతాలు కచ్చితంగా వస్తున్నప్పటికీ వర్సిటీ జనరల్ ఖాతాకు కన్నం వేసినప్పటికీ ఎందుకు ఎత్తి చూపలేదనే అనుమానాలు బహిర్గతమవుతున్నాయి. వర్సిటీలోని వసతి గ ృ హాల మెస్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇంత వరకు ఆడిటింగ్ నిర్వహించిన దాఖలాలు లేవన్నది స్పష్టమైంది. అయ్యవార్లతో కమిటీనా? ఇదివరకు వర్సిటీలో జరిగిన తంతుకు, ప్రస్తుతం జరిగిన అసాధారణమైన విషయానికి పొంతన పెట్టి ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమించడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎక్కడా లేని విధంగా ఎస్కేయూలో ఖాతాల నిర్వహణ దారితప్పింది. ఇలాంటి అంశాలు నిగ్గు తేలాలంటే కేసును అనుభవం గల ఛార్టెర్డ్ అకౌంటెంట్లతో కూడిన కమిటీని నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కుంభకోణాల విషయంలో ప్రొఫెసర్లు బెదిరింపులకు భయపడి సరైన విధంగా స్పందించలేదనే విమర్శలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల గుట్టు రట్టు చేయడానికి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సర్వత్రా కోరుతున్నారు. తెరవెనుక ఉన్న వారి సంగతేంటో? అవినీతిలో ప్రత్యక్ష పాత్ర పోషించిన పాత్రధారుల సంగతి మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇంత ఘనకార్యానికి ఒడిగట్టడానికి సహకరించిన సూత్రధారులు ఎవరు.. ఆర్థిక పరమైన విషయాల్లో ఈ ఇద్దరే కీలకంగా ఎందుకు వ్యవహరించారు.. ఇంకా ఉద్యోగుల పేర్లతో ఉన్న బినామీ ఖాతాలెన్నీ.. అనే అంశాలను కూలంకషంగా విచారణ చేపట్టాల్సి ఉంది. గతంలో దూర విద్య కేంద్రానికి ప్రత్యేకంగా ఖాతా ఉండేది. అక్కడ కూడా ఈ విధంగా జరిగిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. దూరవిద్య ఉద్యోగుల ఖాతాల్లోకి అధ్యయన కేంద్రాల వారు మామూళ్లను జమ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కుంభకోణంలో బయటపడిన ఉదయభాస్కర్రెడ్డి గతంలో దూరవిద్య విభాగంలో విధులు నిర్వహించాడు. అక్కడ నుండే ఈ దందా మొదలైనట్లు తెలుస్తోంది. బదిలీ వద్దు.. ఇక్కడే ముద్దు.. వర్సిటీలో ఏ ఉద్యోగి మూడేళ్లకు మించి అదే విభాగంలో విధులు నిర్వహించకూడదు. ఇందుకు తద్భిన్నంగా ఏళ్ల తరబడి బదిలీలు లేకుండా పైరవీలు చేయించుకోవడం సర్వసాధారణం. యూజీ పరీక్షలు(అండర్ గ్రాడ్యుయేట్),పీజీ (పోస్ట్గ్రాడ్యుయేట్), దూరవిద్య విభాగాల్లో ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేస్తున్నారు. యూజీలో సీనియర్ అసిస్టెంట్లు 9 మంది, జూనియర్ అసిస్టెంట్లు 14 మంది, దూరవిద్య విభాగంలో ముగ్గురు మూడేళ్లకు మించి ఏళ్లు గడిచినప్పటికి బదిలీ కాలేదు. ఒకే చోట ఎక్కువ కాలం విధులు నిర్వహించడం చేత అక్కడి లొసుగులు తెలుసుకొని భారీ అవినీతికి తెరలేపుతున్నారు. ఫైనాన్స్ విభాగంలోని ఉదయ భాస్కర్రెడ్డి ,శేషయ్యలు ఎనిమిదేళ్ల నుండి అక్కడే విధులు నిర్వహించడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది. కాగా, ఈ వ్యవహారాలకు కారణమైన ఇద్దరు ఉద్యోగులపై కేసులు పెట్టాలని పోలీసు విభాగాన్ని ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్య కోరారు. క్రిమినల్ కేసులు కట్టాలా? లేక కేసును ఏసీబీకి బదలాయించాలా అనే అంశంపై ఆదివారం డీఎస్పీ ధ్రువీకరిస్తారని ఇటుకలపల్లి ఎస్ఐ .ఎస్ శివగంగాధర్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఎస్ కేయూలో అవినీతి బాగోతం
అనంతపురం:శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అవినీతి బాగోతం బయటబడింది. ఫైనాన్స్ విభాగం అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి రూ. కోటి మళ్లించారు. యూనివర్శిటీలోని అకౌంట్స్ ఉద్యోగులు ఉదయ భాస్కర్, శేషయ్యలు ఈ అవినీతికి పాల్పడ్డారు. వీరిని యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య దశరథరామయ్య సస్పండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. 2006 నుంచి వర్సిటీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరియర్స్ నుంచి ఆదాయపు పన్నును మినహాయించి వారి జీతం నుంచి తగ్గించిన మొత్తాలను నేరుగా బినామీ ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధనా సిబ్బంది ప్రొఫెషనల్ ట్యాక్స్, పీహెచ్డీ ఇంక్రిమెంట్లు చెల్లింపులను అక్రమంగా తమ ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. వర్సిటీలోని ఫైనాన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని రిజిస్ట్రార్ దశరథరామయ్య ధ్రువీకరించారు. -
అరకోటి స్వాహా
ఎస్కేయూలో అధికారుల మాయాజాలం బినామీ పేర్లతో బొక్కేసిన వైనం యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫైనాన్స్ విభాగం అధికారులు తమ చేతివాటం ప్రదర్శించారు. బినామీ పేర్లతో ఖాతాలు సృష్టించి రూ.50 లక్షల వరకు స్వాహా చేశారు. గురువారం బ్యాంక్ అధికారుల సమాచారంతో రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్య హుటాహుటిన ఫైనాన్స్ కార్యాలయాన్ని సీజ్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీ ఆచార్య కే.లాల్కిశోర్కు సమాచారం అందించారు. 2006 నుంచి వర్సిటీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరియర్స్ నుంచి ఆదాయపు పన్నును మినహాయించి వారి జీతం నుంచి తగ్గించిన మొత్తాలను నేరుగా బినామీ ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధనా సిబ్బంది ప్రొఫెషనల్ ట్యాక్స్, పీహెచ్డీ ఇంక్రిమెంట్లు చెల్లింపులను అక్రమంగా తమ ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈనెల 7న బోధనా సిబ్బందికి అరియర్స్ను రూ.కోటి 88 లక్షలను చెల్లించారు. ఈ చెల్లింపుల్లోనే రూ.15 లక్షలు స్వాహా చేశారని ఓ అధికారి వెల్లడించారు. ఒక్కో విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్లనే అక్రమాలకు తెర తీస్తున్నట్లు సమాచారం. కాగా, వర్సిటీలోని ఫైనాన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని రిజిస్ట్రార్ దశరథరామయ్య ధ్రువీకరించారు.