breaking news
mv ramanareddy
-
లోగిలి -14
టూకీగా ప్రపంచ చరిత్ర ఒక మొగుడు, ఒక పెళ్ళాం మాత్రమే కలిసుండే కుటుంబ వ్యవస్థ వీటిది. ఒకటి రెండు పిల్లలు కూడా కలిసుంటాయి. కొడుకుకైనా కూతురుకైనా యుక్తవయసు రాగానే కుటుంబం నుండి తరిమేస్తాయి. సీనోజోయిక్ యుగం మూడుకోట్ల సంవత్సరాలు గడచిన తరువాత భూగోళం ఉపరితలం చూడముచ్చటైన దృశ్యంగా మారిపోయింది. చెట్లల్లో రకాలు పెరిగి కొండలూ కోనలూ ఆక్రమించాయి. అనుకూలమైన తావుల్లో కీకారణ్యాలు ఏర్పడ్డాయి. పర్వతశిఖరాలకు మంచుకిరీటాల సొబగు చేకూరింది. కాయలూ పండ్లూ కొదువలేకుండా దొరకడంతో పక్షుల సంతానం జాతులూ విచ్చలవిడిగా విస్తరించాయి. పిట్టల కూతలూ, జంతువుల అరుపులతో ప్రపంచం కోలాహలంగా మారింది. అదివరకున్న మీసోజోయిక్ యుగం ఒక నిశ్శబ్దయుగం. శబ్దమంటూవుంటే, ఆ యుగం ముగిసేముందు ఆవిర్భవించిన ‘సర్ప’జాతి బుసలు మాత్రమే. మిగతా ఏ జంతువుకూ గొంతు లేదు. వినేందుకు శబ్దాలు లేనందున ఆనాటి జంతువుకు చెవులతో అవసరమే కలుగలేదు. సీనోజోయిక్ జంతువుల్లోనూ సంతానం పెరిగింది. పెరగడంతోపాటు వేరువేరు జాతులూ, ఉపజాతులూ, తెగలూ, వర్గాలూ, కులాలూ కొల్లలుగా తయారయ్యాయి. కుక్కలూ, పిల్లులూ, ఎలుగుబంట్లూ, ఏనుగులూ, గుర్రాలూ, ఒంటెలూ తదితర జంతువులు ఇంచుమించు ఇప్పుడు కనిపించే ఆకారానికి చేరుకున్నాయి. పులులూ, సింహాలూ ఇంకా రంగప్రవేశం చేయలేదు. కోరలు ఖడ్గంలాగా వంగివుండే ‘సేబర్ టీత్ టైగర్’ మాత్రం ఉండేది అప్పట్లో. స్తన్యజంతువుల ఆకారంలో చోటుచేసుకున్న మార్పుల్లో ముఖ్యంగా గమనించదగ్గవి కాళ్ళూ, వేళ్ళూ. జీవికి కాళ్ళూ వేళ్ళూ గోర్లూ ఉభయచరం దశలోనే ఏర్పడ్డాయి. నీటిని వదిలివచ్చిన జీవికి నేలమీద దన్ను దొరకాలంటే తప్పనిసరిగా అవి ఉండాలి. కాళ్ళను కోల్పోయి, పొట్టమీద పాకే జంతువులను మినహాయిస్తే, మిగతా సరీసృపాలన్నిటికీ ఆ నిర్మాణం ఇంచుమించు అదేరీతిలో కొనసాగింది. ఈ నిర్మాణం సీనోజోయిక్ స్తన్యజంతువుల్లో వేరువేరు రూపాలకు మార్పుచెందడం మొదలెట్టింది. ఈ యుగంలో మొదటిఘట్టం మధ్యకాలానికి చేరుకునే సమయానికి, నేలమీద తిరిగే శాకాహార జంతువులకు, ఏనుగువంటి ఏదోవొకదానికి తప్ప మిగతా జంతువులన్నిటికి, వ్రేళ్ళు అంతర్ధానమై గిట్టలు ఏర్పడ్డాయి. ఏనుగుకు కూడా పాదం ఆకృతి దిమ్మెలా మారి, వ్రేళ్ళు నామావశిష్టంగా మిగిలాయి. వేటాడే జంతువుల వేళ్ళు కురచబారి, వాటికింద చప్పుడు కాకుండా అడుగేసేందుకు అనుకూలంగా మెత్తటి బొజ్జలు పెరిగాయి. గోర్లు వాడిగా, పటిష్టంగా తయారయ్యాయి. చెట్టుకొమ్మల మీద తిరిగే ఉడుతలవంటి జంతువులకు పొడవైన వ్రేళ్ళూ, ములుకుల్లా కొసదేరిన గోర్లూ ఎప్పటిలాగే మిగిలి, సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా పరిణమించాయి. అదే శకంలోనో మరికాస్తా ముందో, శాఖాచర జంతువుల్లో కొత్త శ్రేణికి చెందిన జంతుజాతులు ఉదయించాయి. ఆ శ్రేణి పేరు ‘ప్రేమేట్స్’- అంటే ‘ప్రథమశ్రేణి జీవులు’ అని. వీటిల్లో అధమజాతులకు చెందిన ‘ట్రీష్రూ’ వంటి జంతువులు ఉడుతల్లాగే ఉంటాయి. ‘కాదు, అవి కోతులు’ అంటే నమ్మలేం గూడా. అయితే, ఏవి వానరజాతులో, ఏవి కావో నిర్ణయించేందుకు కొన్ని ప్రమాణాలున్నాయి. వానరాలకు ముందుకాళ్ళ కొసలు అరచేతులుగానూ, వెనకకాళ్ళ కొసలు పాదాలుగానూ వేరుపడి ఉంటాయి. గోర్ల ముందరి కొసలు మడిగి వంకర తిరిగినా, పాదు వద్ద మాత్రం వెడల్పుగా ఉంటాయి. బొటనవేలు మిగతా వేళ్ళకు ఎదురుగా వస్తుంది. అంటే, వాటి చేతికి వస్తువును పట్టుకునే వసతి ఏర్పడింది. రొమ్మునూ గూడనూ కలుపుతూ బోటెముక (కాలర్ బోన్) ఒక్క వానరాలకు మాత్రమే ఉంటుంది. ఇతర జంతువుల కళ్ళల్లో ఒకటి తలకు కుడివైపు. మరొకటి ఎడమవైపు ఉండి, దేనిపాటికది వేరు వేరు దృశ్యాలను చూస్తుంది. వానరం కళ్ళు ముఖం మీదికి జరిగి, రెండు కళ్ళూ ఒకే దృశ్యాన్ని చూస్తాయి. దానివల్ల చూపుకు పదును పెరుగుతుంది. చివరిగా చెప్పుకోవలసింది పెద్దమెదడు సైజు. ఇందులో ఇతర ఏ జంతువు వానరానికి సాటిరాదు. ఇందుకు చిన్న ఉదాహరణ చూపించాలంటే - మందలో ఒక శాల్తీ తరిగిందో పెరిగిందో గ్రహించే జ్ఞానం మిగతా జంతువుల్లో కనిపించదు; ఆ లోటుపాట్లను గమనించే జ్ఞానం కేవలం వానరంతోనే మొదలౌతుంది. ఈ ఎదుగుదలలో వానరం పోగొట్టుకున్న అంగాలు కూడా కొన్ని ఉన్నాయి. స్తనాల సంఖ్య తగ్గి, రెండు మాత్రమే చంకలదగ్గర మిగిలాయి. వాసన గ్రహించే శక్తిహీనమైన స్థాయికి పడిపోయింది. కపాలంలో వాసన గ్రంథులను నలగదొక్కుకుంటూ పెద్దమెదడు విస్తరించింది. ఈ శ్రేణికి రెండు ఉపశ్రేణులు ఉన్నాయి. వాటిల్లో రెండవదైన ‘యాంత్రొపాయిడీ’ ఉపశ్రేణిలోని జంతువులు మూడు విభాగాల కింద ఉంటాయి. ఒకటి, రెండు విభాగాలు తోకలుండే కోతులు. ‘హోమినాయిడీ’ అనే మూడవ విభాగం తోకలేని కోతులది. ఇందులో తిరిగి రెండు జాతులు. వీటిల్లో మొదటిది ‘పాంజిడీ’. ఇందులోని జీవాలను ‘ఏప్స్’- అంటే ‘వాలిడులు’ అంటాం. వాలిడుల్లో తిరిగి ఐదు తెగలు. అవి- 1. గిబ్బన్లు, 2. సయామాంగులు, 3. ఒరాంగుటాన్లు, 4. గొరిల్లాలు, 5. చింపాంజీలు గిబ్బన్లూ, సయామాంగులూ చిన్నపాటి జంతువులు. మూడూ మూడున్నర అడుగులకు మించి పెరగవు. వీటి కాళ్ళకంటే చేతుల పొడవు చాలా ఎక్కువ. చెట్టు నుండి చెట్టుకు చేతులతో ఊగుతూ దాటుకుంటాయి. అవసరమైతే నేలమీదికి దిగి రెండుకాళ్ళ మీద నాలుగడుగులు వేస్తాయి. ఒక మొగుడు, ఒక పెళ్ళాం మాత్రమే కలిసుండే కుటుంబ వ్యవస్థ వీటిది. ఒకటి రెండు పిల్లలు కూడా కలిసుంటాయి. కొడుకుకైనా కూతురుకైనా యుక్తవయసు రాగానే కుటుంబం నుండి తరిమేస్తాయి. ఒరాంగుటాన్ శరీరం పెద్దది. ఐదడుగుల ఎత్తుకు పెరుగుతుంది. ఇవి చిన్నచిన్న కుటుంబాలుగా జీవిస్తాయి. సంపూర్ణంగా సాధుజంతువులు. చూసేందుకు ఏదో దిగులుతో వున్నట్టు కనిపిస్తాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి -
ఎండమావుల్లో తేలిన ‘పీకే’ దర్శకుడు
విశ్లేషణ ‘ముస్లిం’ అంటేనే మోసగాడుగా జమకట్టడం పొరపాటనే ఇతివృత్తంతో నిర్మించిన హిందీ చిత్రం ‘పీకే’ ఈ చిన్న వాస్తవాన్ని నిరూపించడానికి కథా రచయితకు, దర్శకునికి మనిషిలాంటి గ్రహాంతరవాసి (ఏలియన్) అవసరం కావడం చూసి జాలిపడాల్సిందే. ఈ ఏలియన్ చక్కగా హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లిష్లో ‘ఐ లవ్ యూ’ అని రాయగలడు. ఇట్టే ఓ ముసలాయన భార్య ఆసుపత్రిలో ఎలా ఉందో చెప్పేయగలడు. హీరోయిన్ ప్రేమించిన ముస్లిం యువకుని వివరాలు పసిగట్టేయనూ గలడు. కానీ తనను సొంత గ్రహానికి తీసుకెళ్లగల రిమోట్ యంత్రాన్ని లాక్కెళ్లిన దొంగను మాత్రం కనిపెట్టలేడు. అదే తెలుసుకోగలిగి ఉంటే ఈ సినిమాయే లేదు. మత పక్షపాతం లేదని నిరూపించు కునే ప్రయాసలో దర్శకుడు అన్ని మత విశ్వాసాల మీదా, మత గురువుల మీదా గురిలేని బాణాలను కురిపించాడు. ప్రజలను మూర్ఖులను చేసి డబ్బును రాల్చుకోవడంలో సినిమా రంగానికి ఎవరూ సాటిరారని నిరూపించాడు. రంగం ఏదైనా మోసగాణ్ణి మోసగాడని నిందించేకంటే, మోసపోయినవాళ్ల మూర్ఖ త్వాన్ని బయటపెడితే కాసింత ఉపకారి కావచ్చనేదే నా ఆవేదన. కుహనా మతగురువులను, కుహనా మతవిశ్వాసా లను ఎండగడుతూ సినిమాలు తీయని, కథలు రాయని భాష లేదు. ఇదే అంశంపై ‘పీకే’ కంటే బలంగా ప్రేక్షక హృదయాలపై బలమైన ముద్ర వేయగలిగిన ఎన్నో సిని మాలు మన దేశంలోనే వచ్చాయి. కానీ, ఒక బాబా మోసగాడని తెలియగానే మరో బాబానూ, ఒక గురువు నీచుడని తేలితే మరో గురువునూ వెదుక్కునే బేల తనాన్ని అడ్డుకోవడం ఏ దేశంలోనూ, ఏ చిత్రానికి సాధ్యం కాలేదు. మన దేశంలో ఆ వెర్రి మరింత పెరిగిం ది కూడా. కాబట్టి ఈ దిశగా ‘పీకే’తో దర్శకుడు సాధిం చగలిగిన పరమార్థం ఎండమావే. యూరోపియన్ దేశం బెల్జియంలో బ్లాకులో సిని మా టికెట్లను అమ్మడం వంటి అసంబద్ధతలను పక్కకు నెట్టేస్తే, ఈ సినిమా ధ్యేయం హిందూ-ముస్లిం ప్రేమా యణం, మత సౌహార్ద్రతలే. మతాంతర ప్రేమలూ, వాటి పర్యవసానాల గురించి ‘ఛెమ్మీన్’ అనే మలయాళ చిత్రం మొదలు చాలా సినిమాలే చూశాను, వందలాది కథలు చదివాను. వాటికి మించిన సామాజిక జీవితం గానీ, కొత్తదనంగానీ ‘పీకే’లో లేవు. ఇక హిందూ- ముస్లిం సౌహార్ద్రత విషయంలో వాస్తవ దూరమైన సాం ఘిక జీవితపు కృత్రిమ ఉత్పత్తి అయిన ఈ చిత్రాన్ని, జీవ నసారం వడబిండిన కళాఖండాల సరసన నిలపనూ లేము, వాటితో పోల్చనూ లేము. అయినా సినీ అభిమా నుల జ్ఞాపకాలను తట్టి లేపడానికి రెండే రెండు ఉదా హరణలను ప్రస్తావించడం దేశ ఆరోగ్యానికి మంచిదని పిస్తోంది. ఒకటి, గోవింద నిహ్లానీ టీవీ సీరియల్ ‘తమస్’ దేశ విభజన నేపథ్యంలో నిర్మించినది. మత విద్వేషాలు తీవ్ర స్థాయిలో పెల్లుబికిన సమయంలోనూ మానవత్వం ఏదో ఒక మూల బ్రతికి ఉండటం మానలే దని దర్శకుడు గొప్పగా నిరూపించాడు. ‘ముస్లిం’ అని తెలిస్తే హిందువులు, ‘హిందువు’ అని తెలిస్తే ముస్లింలు హతమార్చే మారణహోమంలో తీవ్రవాదులైన భర్త, కుమారుల కంట పడకుండా ఒక ముస్లిం యువతి తనను ఆశ్రయించిన హిందూ వృద్ధ దంపతులను కాపాడి, ఊరి బయటికి సాగనంపుతుంది. ‘ధన్యవా దాలు భేటీ, ఈ ముసలివాళ్ల ప్రాణాలు కాపాడావు’ అం టున్న వృద్ధులతో ఆ యువతి ‘‘బ్రతికిస్తున్నానో, చావ డానికే పంపిస్తున్నానో నాకే తెలియడం లేదు’’ అంటుం ది. ఆ సన్నివేశం చూసి నేనైతే మొహం కప్పుకుని ఏడుస్తూ ఎంతసేపో కూచున్నాను. ఇక రెండో కళాఖండం కేతన్ మెహ్రా ‘మిర్చ్ మసా లా’ (కారంపొడి). చలన చిత్రాభిమానులు పదివేలకు ఒకరు కూడా ఆ సినిమా చూసి ఉండరు. బ్రిటిష్ హయాంలో సామాన్యులపై విచ్చలవిడిగా సాగిన అమా నుష పీడన నేపథ్యంగా రూపొందిన జీవన చిత్రమది. తెల్ల దొరలను మించి నల్లదొరలు చేసే దాష్టీకమే గుం డెలు పిండేది. వాటిని చిత్రించడానికి దర్శకుడు ఒక సుగాలీ గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఎలిపైరు ఆధారంగా జీవించే ఆ గ్రామంలో జొన్న, మిరప ప్రధాన పంటలు. పన్ను వసూళ్లకు ఆ గ్రామానికి పటాలంతో వచ్చిన సుబేదారు గుడారంలో విడిది చేస్తాడు. ఉద్యోగం కోసం భర్త ఊరు విడిచివెళ్లిన ఒక వివాహిత స్త్రీపై అతగాడి కన్ను పడుతుంది. మానరక్షణ కోసం ఆమె కారంపొడి తయారీ కార్ఖానాలో దూరుతుంది. దాని చౌకీదారు, చూపు మందగించిన ముదుసలి ముస్లిం. ఒక హిందూ ఆడపడుచు మానరక్షణ కోసం అతడు తన యజమాని దర్వాజా తెరవమని ఆజ్ఞాపించినా నిరాకరిస్తాడు. సుబే దార్ బెదిరింపులకు గ్రామంలోని పురుషులంతా లొంగి పోతారు. గ్రామపెద్ద ‘ముఖియా’ నాయకత్వంలో కార్ఖా నాకు వస్తారు. ‘‘అబూమియా, ఇది గ్రామం సమస్య. నువ్వు దర్వాజా తెరిచి తీరాలి’’ అంటాడు ముఖియా. ‘‘ఊరు మొత్తం మీద ఈ ఆడపడుచుకు తోడొచ్చే మగా డు ఒక్కడైనా మిగల్లేదా?’’ అని అబూమియా అడుగు తాడు. చెడుగా ప్రవర్తించేవాళ్లను ‘‘సైతాన్ కా ఔలాద్’’ అనడం ఉర్దూ నానుడి. ముఖియా వచ్చింది చెడు పనికి కాదు, నీచమైన పనికి, ఊరి ఆడపడుచును తార్చడానికి వచ్చాడు. ఆ పతనాన్ని సూచిస్తూ - ‘‘సైతాన్ కే సాలే బన్కర్ ఆయాహో, ఔర్ షరంబీ నహీ ఆతీ’’ (దయ్యా నికి బావమరిదిగా వస్తున్నావ్, అయినా నీకు సిగ్గనిపిం చడం లేదా?) అంటాడు అబూమియా. ఒక హిందూ స్త్రీ మానరక్షణ కోసం అబూమియా బ్రిటిష్ తుపాకులకు బలైపోతాడు. తన గొప్ప మనసును మాత్రం తాకట్టు పెట్టుకోడు. ఈ సినిమాలు రెండింటినీ పైసా ఖర్చు లేకుండా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసి, ప్రతి అంగుళాన్ని ఆస్వాదించగల మనసులకు చిత్రపరిశ్రమ రుణపడిపోతుంది. (వ్యాసకర్త రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకులు, మొబైల్ నం: 9440280655)